
సాక్షి, వికారాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సురభి వాణి దేవిని అభ్యర్థిగా ప్రకటించటంతోటే తమ గెలుపు ఖాయమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల అభ్యర్థులే పోటీ.. చిన్నాచితక పార్టీలు తమకు పోటీ కావని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ వికారాబాద్లో బీజేపీ వాళ్లు ఎక్కువ, తక్కువ మాట్లాడితే.. బీజేపి అధికారంలో ఉన్న కర్ణాటకలోని చించోళి చౌరస్తాలో చర్చపెట్టాలే. తెలంగాణ పథకాలు కేంద్ర మంత్రులు బాగున్నయంటే.. గల్లీ లీడర్లు బాలేవంటరు. కేవలం గ్లోబల్ ప్రచారం, బోగస్ ప్రచారం చేసి లబ్ధిపొందాలని చూస్తున్నరు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు పీకేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి రిజర్వేషన్లు తీసేయాలని చూస్తుంది. ప్రశ్నించే గొంతుక అంటుంటారు.. ఎవరిని ప్రశ్నిస్తారు? గ్యాస్, పెట్రోల్,డీజీల్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి.
తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా?.. చూపించి మాట్లాడాలే. పార్టీ కన్నతల్లి లాంటిది... నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే తల్లికి ద్రోహం చేసినట్లే. ఎంతో మంది గ్లాడియేటర్లను తయారు చేసిన ఘనత మన అభ్యర్థి వాణీ దేవిది. ఆమె దేశ ప్రధాని కూతురైనా సాధాసిదాగా జీవితం గడిపింది. వికారాబాద్ జిల్లా ఏర్పడడానికి కారణం కేసీఆర్. ఒకటో...రెండో సీట్లు ఓడిపోతే ఏదేదో మాట్లాడుతుండ్రు, పనైపోయిందంటుండ్రు.. మా పనైపోలే. కాంగ్రెస్ వాళ్లు ఉన్నప్పుడే ఏమీ చేయలే.. గిప్పుడేమి చేస్తారు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment