
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలలకు రూపం ఈ అంబేద్కర్ విగ్రహమని అన్నారు ఎంపీ కేశినేని నాని. అంబేద్కర్ విగ్రహంపై రాజకీయం చేయడం టీడీపీకి సమంజసం కాదు. నేను చంద్రబాబు చిట్టా విప్పితే తట్టుకోలేరంటూ నాని వార్నింగ్ ఇచ్చారు.
కాగా, కేశినేని నాని గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సీఎం జగన్ ఆలోచనలకు స్ఫూర్తి అంబేద్కర్. వివక్ష లేని సమాజం కావాలని అంబేద్కర్ ఆశించారు. సీఎం జగన్ ఇప్పుడు వివక్ష లేని పాలన అందిస్తున్నారు. అంటరానితనం, కుల వివక్షపైన అంబేద్కర్ పోరాటం చేశారు. పేదలను ఉన్నత స్థాయితో ఉంచాలని ఆశించే నాయకుడు సీఎం జగన్.
ఆరోజు అంబేద్కర్ పోరాడిన వర్గాల కోసం నేడు సీఎం జగన్ పోరాడుతున్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని గతంలో అందరూ ఊరు చివర పెట్టేవారు. సీఎం జగన్ మాత్రం రాష్ట్రం నడి బొడ్డున ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టారు. ఆ ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. అంబేద్కర్ విగ్రహంపై రాజకీయాలు చేయడం టీడీపీకి సమంజసం కాదు. నేను చంద్రబాబు చిట్టా విప్పితే మీరు తట్టుకోలేరు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇదే సమయంలో కేశినేని చిన్ని వ్యాఖ్యలపై నాని స్పందించారు. ఈ సందర్బంగా ఉత్తర కుమారుడి ప్రగల్బాలు పట్టించుకోవాల్సిన అవసరంలేదని సెటైరికల్ పంచ్ విసిరారు. అలాగే, రేపు ఎన్నికల బాక్స్లు తెరిచాక 80 శాతం ఏ పార్టీ ఖాళీ అవుతుందో తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.