చంద్రబాబు, పవన్‌లే ఏపీకి పట్టిన మహమ్మారి: పేర్ని నాని | Perni Nani Comments On Lokesh And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, పవన్‌లే ఏపీకి పట్టిన మహమ్మారి: పేర్ని నాని

Oct 6 2023 6:37 PM | Updated on Oct 6 2023 7:14 PM

Perni Nani Comments On Lokesh And Pawan Kalyan - Sakshi

 ఉత్తర కుమారుడు లోకేష్‌ ఏదేదో మాట్లాడుతున్నాడు. చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్ట్‌ చేశామని చెబుతున్నాడంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.

సాక్షి, అమరావతి: ఉత్తర కుమారుడు లోకేష్‌ ఏదేదో మాట్లాడుతున్నాడు. చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్ట్‌ చేశామని చెబుతున్నాడంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘చంద్రబాబు ఫ్యామిలీ అంతా  కలిసి సెంటిమెంట్‌ ప్లే చేసేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత లోకేశ్‌ ఎక్కడున్నాడు? లాయర్లంతా బెజవాడ రోడ్లపై తిరుగుతుంటే లోకేశ్‌ ఎక్కడున్నాడు?. ఎవరిని మేనేజ్‌ చేద్దామని ఢిల్లీ వెళ్లారు?. మేనేజ్‌ చేయడం మీకు బాగా తెలిసిన విద్య’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.

వీరప్పన్‌ కూడా అలానే చెప్పాడు..
‘‘25 రోజుల నుంచి ఢిల్లీలో ఎందుకు తిరుగుతున్నావు?. ఎవరి కాళ్లు,  చేతులు పట్టుకోవడానికి ఢిల్లీ వెళ్లారు?. స్కామ్‌లో రూ.27 కోట్లు మీ పార్టీ అకౌంట్‌లో వేసుకున్నారు. ఢిల్లీ వేషాలు ఇక్కడ వేయొద్దు. సీమెన్స్‌ ఇస్తామన్న డబ్బులు ఎక్కడ?. దొరకనంత మాత్రాన దొంగ కాకుండా పోరు. లోకేశ్‌.. మీ నాన్నారు ఇప్పుడు దొరికారు. అప్పుడు వీరప్పన్‌ చెప్పిన కబుర్లే ఇప్పుడు మీరు చెబుతున్నారు. దొరకనంత వరకే అందరూ దొరలే. వీరప్పన్‌ దొరికినప్పుడు కూడా తాను దొంగను కాదనే చెప్పాడు. వీరప్పన్‌ కూడా అడవికి న్యాయం చేస్తున్నానని చెప్పాడు. 40 ఏళ్లలో చంద్రబాబు ఇప్పుడే దొరికాడు. అంతా నిజాయితీ పరులైతే మీ ఆస్తులపై కోర్టు మానిటర్డ్‌ విచారణకు సిద్ధమా?’’ అంటూ పేర్ని నాని సవాల్‌ విసిరారు.

పవన్‌ ఆటవిడుపు యాత్ర..
‘‘పవన్‌ ఐదు రోజులు కృష్ణా జిల్లా ఆటవిడుపు యాత్ర చేశారు. పవన్‌ మాటలు జనసేన పార్టీ  కార్యకర్తలకు కూడా నచ్చడం లేదు. జగన్‌కు దమ్ముంది కాబట్టే ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేస్తారు. వైఎస్‌జగన్‌ పవన్‌లా రోజుకో పార్టీ మార్చరు. వైఎస్సార్‌పై నువ్వు ఎప్పుడు పోరాటం చేశావు పవన్‌?. సీఎం జగన్‌పై అవాకులు,చవాకులు మాట్లాడితే సహించం. బీజేపీ కంటే చంద్రబాబే తనకు ముఖ్యమని పవన్‌ తేల్చేశారు. కోలేరుపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదు’’ అని మాజి మంత్రి పేర్ని హితవు పలికారు.

ఏపీలో పవన్‌కు ఆధార్‌ కార్డుందా? ఇల్లుందా?
‘‘పవన్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఏపీలో పవన్‌కు ఆధార్‌ కార్డుందా? ఇల్లుందా?. అవనిగడ్డలో ఎన్డీఏ నుంచి బయటకొచ్చినట్టు చెప్పావు. ముదినేపల్లిలో మళ్లీ ఎన్డీఏలో ఉన్నానని చెబుతావు. తెలంగాణలో 32 సీట్లలో పోటీ చేస్తానని ప్రకటించావు. చంద్రబాబు, పవన్‌లే ఏపీకి పట్టిన మహమ్మారి. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ఒక్క పథకం చెప్పు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కొల్లేరుకు ఏం చేశారు?’’ అంటూ మాజీ మంత్రి పేర్ని దుయ్యబట్టారు. 
చదవండి: ఒకరిది ఓర్పు.. పిరికితనం మరొకరిది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement