ఇది హర్యానా కార్యకర్తల విజయం: ప్రధాని మోదీ | PM Modi speech party workers after victory in Haryana Assembly polls | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పరాన్నజీవి పార్టీగా మారిపోయింది: ప్రధాని మోదీ

Published Tue, Oct 8 2024 8:35 PM | Last Updated on Tue, Oct 8 2024 9:12 PM

PM Modi speech party workers after victory in Haryana Assembly polls

ఢిల్లీ: నవరాత్రి సమయంలో  హర్యానాలో​ బీజేపీ మూడోసారి విజయం సాధించటం శుభసూచకమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.  హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ఢిల్లీ బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన విజయోత్సవ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 

‘‘హర్యానా విజయం భరత ప్రజాస్వామ్య విజయం.  జమ్ము కశ్మీర్‌లో కాంగ్రెస్‌-ఎన్సీ కూటమికి అధిక సీట్లు ఇచ్చారు. జమ్ము కశ్మీర్‌లో గతంతో పోల్చితే బీజేపీకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. కాంగ్రెస్-ఎన్సీ కూటమికి నా అభినందనలు. హర్యానాలో ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రతీ ఐదేళ్లకోసారిఓటరు ప్రభుత్వాన్ని మారుస్తారు. కానీ, ఈసారి  హర్యానా ప్రజలు బీజేపీ మూడో సారి విజయాన్ని కట్టబెట్టారు.  

.. హర్యానాలో కమలం మూడోసారి వికసించింది. కార్యకర్తల కృషితోనే హర్యానాలో విజయం సాధించాం. బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడిన చోట ప్రజలు మనకే మద్దతుగా నిలుస్తున్నారు.  హర్యానాలో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. అభివృద్ధిని చూసి ప్రజలు హ్యాట్రిక్‌ విజయం ఇచ్చారు. బలహీన వర్గాలను కాంగ్రెస్‌ ఓటు  బ్యాంక్‌గా చూస్తోంది. అధికారం తన జ‍న్మహక్కు అని కాంగ్రెస్‌ అనుకుంటోంది.

.. దేశ వ్యతిరేక రాజకీయాలు సహించబోమని  హర్యానా  ప్రజలు తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ కుట్రలను హర్యానా ప్రజలు కనిపట్టారు. కాంగ్రెస్‌ దేశంలో ప్రమాదకరమైన ఆటను మొదలుపెట్టింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌ భగ్గుమంటుందని అంతా అన్నారు. కానీ, మేము జమ్ము కశ్మీర్‌లో రాజ్యాంగ స్ఫూర్తిని ప్రదర్శించాం. జమ్ము కశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. 

..కాంగ్రెస్‌ పరాన్నజీవి పార్టీగా మారిపోయింది. పరాన్నజీవి అయిన కాంగ్రెస్‌ తన మిత్రపార్టీలనే నిర్వీర్యం చేస్తుంది. పలువర్గాల ప్రజలను రెచ్చగొట్టింది. కులం పేరుతో విషాన్ని చిమ్ముతోంది. ప్రజలను కాంగ్రెస్‌ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఈసీ పారదర్శకతనే ప్రశ్నిస్తోంది. మన వ్యవస్థల పారదర్శకతను వేలెత్తి చూపుతోంది. హర్యానాలో క్రీడల అభివృద్ధికి రోడ్‌ మ్యాప్‌ రూపొందిస్తాం’’ అని  అన్నారు.

ప్రధాన మోదీ ప్రసంగం కంటే ముందు కేంద్రమంత్రి జేపీ నడ్డా  మాట్లాడారు. ‘‘ ప్రధాని మోదీ నేతృత్వంలో హర్యానాలో ఘన విజయం సాధించాం. జమ్ము కశ్మీర్‌లో గణనీయమైన ఓట్లు సాధించాం. హర్యానా ప్రజలంతా బీజేపీ వెంటే ఉన్నారు. కాంగ్రెస్‌ అబద్దాలు ప్రచారం చేసింది. హర్యానా ప్రజలు బీజేపీకి హ్యాట్రిక్‌ విజయాన్ని కట్టబెట్టారు. ఈ విజయంలో పార్టీ కార్యకర్తలదే కీలక పాత్ర. కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారు. జమ్ము కశ్మీర్‌లో విజ​యం సాధించిన ఎన్సీ కూటమికి అభినందనలు’’ అని అన్నారు. ఈ సభలో ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా పాల్గొన్నారు.

చదవండి: తీర్పును అంగీకరించడం లేదు: హర్యానా ఫలితాలపై కాంగ్రెస్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement