ఢిల్లీలో విజయానికి బీజేపీ ప్రణాళిక ఏమిటి? | Sakshi
Sakshi News home page

Delhi: ఢిల్లీలో విజయానికి బీజేపీ ప్రణాళిక ఏమిటి?

Published Sat, Apr 13 2024 11:20 AM

Which Issues Does BJP Want to Win Delhi - Sakshi

దేశ రాజధాని ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలనూ కైవసం చేసుకోవాలనే ప్రణాళికతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉంది. ఆ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు.. బీజేపీకి  కొత్త ఇబ్బందులను సృష్టించింది. అయినప్పటికీ బీజేపీ ఢిల్లీలోని అన్ని లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన తర్వాత అక్కడి ప్రభుత్వ పనితీరులో  ఆటంకాలు ఏ‍ర్పడుతున్నాయి.  అయితే ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ మరింత క్రియాశీలకంగా మారింది.  అయితే ఇంతలో బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆప్ పార్టీకి చెందిన మరొకరిని సీఎం చేయాలని సలహా ఇచ్చారు. 

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఆదరణపై బీజేపీ పూర్తి నమ్మకంతో ఉంది. అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతున్న సమయంలోనూ ఢిల్లీ ప్రజలు 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాల్లో బీజేపీని గెలిపించారని బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా పేర్కొన్నారు. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినా, అది ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపదని, ఎందుకంటే గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 57 శాతం ఓట్లు వచ్చాయని, అదే తీరు ఇప్పటికీ కొనసాగుతుందని బీజేపీ నేతలు నమ్మకంతో ఉన్నారు. 

ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు మే 25న ఓటింగ్ జరగనుంది. ఈసారి  బీజేపీ మనోజ్ తివారీకి చెందిన ఢిల్లీ లోక్‌ సభ స్థానం మినహా మిగిలిన ఆరు స్థానాల్లో  కొత్త అభ్యర్థులను నిలబెట్టింది. న్యూఢిల్లీ నుంచి కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్, చాందినీ చౌక్ నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, దక్షిణ ఢిల్లీ నుంచి రామ్‌వీర్ సింగ్ బిధూరి, పశ్చిమ ఢిల్లీ నుంచి కమల్‌జిత్ సెహ్రావత్, తూర్పు ఢిల్లీ నుంచి హర్ష్ మల్హోత్రా, వాయువ్య ఢిల్లీ నుంచి యోగేంద్ర చందోలియా బీజేపీ తరపున బరిలోకి దిగారు. 

Advertisement
Advertisement