కొండపి (సింగరాయకొండ): వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక పాలన చేశారని..పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించారని.. మంత్రి, కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం మండలంలోని నేతివారిపాలెంలో రోడ్షో నిర్వహించారు. ముందుగా గ్రామ నాయకుడు దివి శ్రీనివాసులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సువర్ణ పాలనను గుర్తించి మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత జగన్కే దక్కిందన్నారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను చూసి మరోసారి మోసపోవద్దని కోరారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆయనకు ప్రజలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. ఆయన కథ ఏంటో 2014 లోనే ప్రజలకు తెలిసొచ్చిందన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. రైతులు, పొదుపు మహిళల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి వారిని మోసం చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మరోసారి ఆయన మాటలకు మోసపోవద్దని సూచించారు. 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఆరికట్ల కోటిలింగయ్య, జేసీఎస్ కన్వీనర్ గొట్టిపాటి మురళి, గ్రామ నాయకులు దివి శ్రీనివాసరావు, నన్నూరి శ్రీను, కొండయ్య, బొక్కిసం సుబ్బారావు, మారెడ్డి వెంకటాద్రి రెడ్డి, వేముల రమేష్, చింతల వెంకటేశ్వర్లు, సురేష్, సుధాకర్, ఎస్సీ సెల్ కన్వీనర్ గర్నిపూడి రమేష్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.