![ఊర కుక్కల దాడిలో 48 జీవాలు మృతి](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/14/13gjw43a-350084_mr.jpg.webp?itok=EI_ZLP4c)
వర్గల్(గజ్వేల్): ఊరకుక్కల దాడిలో 48 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన సోమవారం ఉదయం వర్గల్ మండలం అంబర్పేటలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. వర్గల్ మండలం అంబర్పేటకు చెందిన గొర్రెల పెంపకందారు బండ సత్యనారాయణకు 150 దాకా గొర్రెలు ఉన్నాయి. వాటిని గ్రామ సమీపంలోని గొర్రెల కొట్టంలోకి పంపి వంతుల వారీగా కుటుంబసభ్యులు కాపలా ఉంటారు. ఆదివారం సాయంత్రం జీవాలను కొట్టంలోకి పంపి భోజనం చేసేందుకు ఇంటికెళ్లాడు. భోజనం చేసిన తర్వాత గాలి, వాన రావడంతో సత్యనారాయణ ఇంటి వద్దే ఉండిపోయాడు. అదే రాత్రి కొట్టంపై ఊరకుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 48 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. అనేక గొర్రెలు గాయాలపాలయ్యాయి. సోమవారం ఉదయం కొట్టం వద్దకు వెళ్లిన సత్యనారాయణ గొర్రెలు మృత్యువాత పడినట్లు గుర్తించాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు. మృతిచెందిన గొర్రెలను వర్గల్ జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్ పరిశీలించి బాధితుడిని ఓదార్చి ఆర్థికసాయం అందజేశారు.