
రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రవీంద్ర జడేజాతో జతకట్టిన రోహిత్ శర్మ నాలుగో వికెట్కు అజేయమైన 191 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం హిట్మ్యాన్ 124, రవీంద్ర జడేజా 78 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. యశస్వి జైస్వాల్ (10), శుభ్మన్ గిల్ (0), రజత్ పాటిదార్ (5) నిరాశపరిచారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 224/3గా ఉంది.
ఈ మ్యాచ్లో 157 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి రోహిత్ పలు రికార్డులు నమోదు చేశాడు. హిట్మ్యాన్కు టెస్ట్ల్లో ఇది 11వ సెంచరీ కాగా.. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 47వది. కెప్టెన్గా అతనికి ఇది 10వ సెంచరీ కాగా.. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో రోహిత్ మూడో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో విరాట్ (80), రెండో స్థానంలో డేవిడ్ వార్నర్ (49) ఉన్నాడు.
ఇక రికార్డుల విషయానికొస్తే.. రోహిత్ ఈ సెంచరీతో భారత్ తరఫున సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడైన సారధిగా నిలిచాడు. హిట్మ్యాన్ 36 ఏళ్ల 291 రోజుల వయసులో భారత కెప్టెన్గా సెంచరీ బాదాడు. ఇంత లేటు వయసులో ఏ భారత కెప్టెన్ సెంచరీ చేయలేదు.
ఈ మ్యాచ్లో రెండు సిక్సర్లు బాదిన రోహిత్.. ఇన్నింగ్స్ల పరంగా టెస్ట్ల్లో భారత్ తరఫున సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో రోహిత్.. ధోనిని అధిగమించాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ టాప్లో ఉన్నాడు.
- సెహ్వాగ్- 91 సిక్సర్లు (178 ఇన్నింగ్స్లు)
- రోహిత్ శర్మ- 79 సిక్సర్లు (97 ఇన్నింగ్స్ల్లో)
- ధోని- 78 సిక్సర్లు (144 ఇన్నింగ్స్లు)
రోహిత్ స్వదేశంలో 370 రోజుల తర్వాత చేసిన టెస్ట్ సెంచరీ ఇదే. స్వదేశంలో హిట్మ్యాన్ టెస్ట్ల్లో సెంచరీ చేసి ఏడాదిపైనే అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment