
కార్పొరేట్ సంస్థ తలుచుకుంటే ప్రభుత్వ వ్యవస్థ గులాంగిరి
కొద్ది రోజులు ఆగండి..
జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్ వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) పెట్రోలియం పైపులైన్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పైప్లైన్ కావలి మండలంలోని ఆనెమడుగు, సర్వాయపాళెం పంట పొలాల మీదుగా వెళ్లాల్సి ఉంది. ఆ భూముల్లో పంట చివరి దశలో ఉంది. బీపీసీఎల్ పైప్లైన్ నిర్మాణ సంస్థ దౌర్జన్యంగా పైప్లైన్ వేసేందుకు ముందుకు వచ్చింది. ఆ సమయంలో అడ్డుకున్న రైతులు కొద్ది రోజుల పాటు ఆగండి.. పంట పూర్తవుతుంది.. మీరు పైప్లైన్ వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ కావలి ఆర్డీఓ ఎం.సన్ని వంశీకృష్ణతో మొరపెట్టుకున్నారు. అక్కడే ఉన్న బీపీసీఎల్ ప్రతినిధులు మాత్రం తాము పైప్లైన్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, పంట నష్టం జరిగితే పరిహారం ఇస్తామంటూ నిర్లక్ష్యంగా చెప్పారు. చివరకు ఆర్డీఓ సైతం బీపీసీఎల్ ప్రతినిధుల మాటనే చెప్పడంతో రైతులు ఆవేదనతో బయటకు వచ్చేశారు. బీపీసీఎల్ సంస్థ గ్రామాల్లోకి వచ్చి భయోత్పాతం సృష్టించి, సన్నకారు రైతులు భూముల్లో నడి మధ్యన పైప్ లైన్ వేసి పొలాలను ధ్వంసం చేస్తామంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పంటను ధ్వంసం చేస్తూ..
కార్పొరేట్ సంస్థ అనుకున్న విధంగానే పంటను ధ్వంసం చేస్తూ మండలంలోని సర్వాయపాళెం, ఆనెమడుగు పంచాయతీ పరిధిలో ఉన్న సర్వాయపాళెం, అల్లిగుంటపాళెం, మాతినివారిపాళెం, కోనేటివారిపాళెం పొలాల్లో యంత్రాలు పెట్టి బీపీసీఎల్ పైప్లైన్ నిర్మాణ పనులు మొదలు పెట్టింది. పంటలు ధ్వంసం చేసి అయినా.. పైప్లైన్ వేసి తీరతామన్న కార్పొరేట్ సంస్థ పంతం నెగ్గించుకుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంట పొలాలను పొక్లయిన్తో తొక్కుకుంటూ సర్వ నాశనం చేస్తుంటే అన్నదాతలు గుండెలు బాదుకుంటూ కన్నీటి పర్యంతంగా చూస్తూ నిలబడిపోయారు.
బతుకు వేదనలో రైతులు
● బిల్లుల ఆరాటంలో బీపీసీఎల్
పైప్లైన్ నిర్మాణ కాంట్రాక్ట్ సంస్థ
కావలి: గ్రామ రెవెన్యూ నుంచి జిల్లా స్థాయి వరకు అధికార యంత్రాంగం అడుగడుగునా అమ్ముడుపోయింది. ఆరుగాలం రెక్కల కష్టంతో శ్రమించి చేతికి వచ్చే దశలో ఉన్న పంటను కాపాడమని నెల రోజులుగా రైతులు అధికారులకు మొరపెట్టుకున్నారు. మరో పది రోజుల్లో పంట కోతలు పూర్తయ్యాక పనులు చేసుకోమని అధికారుల కాళ్లా వేళ్లా పడ్డారు. బీపీసీఎల్ పైప్లైన్ నిర్మాణ కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. రోడ్డెక్కి ఆందోళనల బాట పట్టారు. అయినా అధికారులు కరుణించలేదు. కార్పొరేట్ సంస్థ కనికరించలేదు. మరో పది రోజుల తర్వాత ఎవరికీ అభ్యంతరం లేకపోయినా.. అంత కాలం ఆగలేకపోయారు. కార్పొరేట్ సంస్థ ఇనుప యంత్రాలు కింద పండిన పంట ధ్వంసం అయింది. కార్పొరేట్ విసిరిన పంజా కింద కావలి మండలం సర్వాయపాళెం, ఆనెమడుగు రైతులు విలవిలలాడిపోతున్నారు.
బిల్లుల కోసమే ఈ దాష్టీకం
పైప్లైన్ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థ ఈ పనులు కోసం భారీగానే పెట్టుబడులు పెట్టింది. పనులు సకాలంలో పూర్తయితేనే కాంట్రాక్ట్ సంస్థకు బీపీసీఎల్ సంస్థ బిల్లులు చెల్లింపులు చేస్తుంది. పైప్లైన్ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో కాంట్రాక్ట్ సంస్థకు బీపీసీఎల్ బిల్లులు చెల్లించడంలేదు. దీంతో ఎలాగైనా పైప్లైన్ నిర్మాణం పూర్తి చేసి బిల్లులు తీసుకోవాలనే లక్ష్యంతోనే కాంట్రాక్ట్ సంస్థ దాష్టీకాన్ని ప్రదర్శిస్తోంది. అధికార యంత్రాంగాన్ని సైతం నోట్ల కట్టలతో నోర్లు మూయించిందని రైతులు ఆరోపిస్తున్నారు. వరి కోతలు పూర్తయిన అల్లిగుంటపాళెంలో ఉన్న పొలాల్లో పైప్ లైన్ నిర్మాణ పనులు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆ కాంట్రాక్ట్ నిర్మాణ సంస్థ వరి కోతలు పూర్తి కాని పొలాలను ధ్వంసం చేసి మరీ పైప్లైన్ నిర్మించే మొండితనాన్ని ప్రదర్శిస్తున్న తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పొలాల మీదుగానే పైప్ లైన్ నిర్మాణం
మార్చి 6వ తేదీ
ఏప్రిల్ 5వ తేదీ
వ్యవసాయాన్ని మట్టుపెట్టే కుట్ర
ఆరుగాలం కష్టపడిన అన్నదాతల పంట ప్రకృతి విపత్తులతో నష్టపోతే ఆదుకోవాల్సిన ప్రభుత్వం యంత్రాంగమే ఒక కార్పొరేట్ సంస్థ స్వార్థానికి పంటను ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఉండిపోవడం దారుణం. ఇది వ్యవసాయాన్ని మట్టుపెట్టే కుట్రగా అనిపిస్తోంది. ఈ దుస్సాహసం క్షమార్హం కానిది. బీపీసీఎల్ పైప్లైన్ నిర్మాణం చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థకు రైతుల పొలాలను ధ్వంసం చేసే అధికారం ఎవరిచ్చారు. అసలు ఆ సంస్థకు అంత ధైర్యం ఎలా వచ్చింది. ఈ విషయంలో అధికారులు నోరు విప్పక పోవడం వెనుక ఏ శక్తులు పని చేస్తున్నాయి. అంతిమంగా రైతుల కంట కన్నీరు కార్చే చర్యలకు పాల్పడటం మరింత విషాదకరం.
– తాళ్లూరు మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు, కావలి

కార్పొరేట్ సంస్థ తలుచుకుంటే ప్రభుత్వ వ్యవస్థ గులాంగిరి

కార్పొరేట్ సంస్థ తలుచుకుంటే ప్రభుత్వ వ్యవస్థ గులాంగిరి

కార్పొరేట్ సంస్థ తలుచుకుంటే ప్రభుత్వ వ్యవస్థ గులాంగిరి

కార్పొరేట్ సంస్థ తలుచుకుంటే ప్రభుత్వ వ్యవస్థ గులాంగిరి

కార్పొరేట్ సంస్థ తలుచుకుంటే ప్రభుత్వ వ్యవస్థ గులాంగిరి

కార్పొరేట్ సంస్థ తలుచుకుంటే ప్రభుత్వ వ్యవస్థ గులాంగిరి