అన్నానగర్: తేని సమీపంలో ఆదివారం కుటుంబ కలహాలతో భార్య, మామను కత్తితో పొడిచి హత్య చేసిన కార్మికుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. మదురై జిల్లా ఉసిలంపట్టి సమీపంలోని ఎరుమార్ పట్టికి చెందిన మాయి(55)కి భార్య శశికళ, కుమార్తె పవిత్ర (25) ఉన్నారు. పవిత్ర ఉసిలంపట్టి సమీపంలోని సురైకపట్టికి చెందిన కూలీ భువేంద్రన్ (27) కొన్నేళ్ల క్రితం ప్రేమించి, పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. పవిత్ర, భువేంద్రన్ మధ్య తరచూ గొడవలు జరుగు తున్నట్లు తెలిసింది. దీంతో పవిత్ర అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈక్రమంలో భువేంద్రన్ ఆదివారం మధ్యాహ్నం భార్య ఇంటికి వెళ్లి పవిత్ర, తన మామ మాయిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరూ ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. వెంటనే భువేంద్రన్ అక్కడి నుంచి తన బైక్లో పరారయ్యాడు. ఇద్దరి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుడు భువేంద్రన్ కోసం గాలిస్తున్నారు.