
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట సర్వే నంబర్ 239, 240లో అత్యంత విలువైన 11 ఎకరాల భూమిని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి రాష్ట్ర ప్రభుత్వం ఎలా కేటాయిస్తుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్జీవో) కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
‘ప్రజా నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్’ ఏర్పాటు చేస్తామని.. దీని కోసం 11 ఎకరాలను కేటాయించాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ రెండు నెలల క్రితం నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.50 కోట్లు ఎకరం మార్కెట్ విలువైన స్థలాన్ని.. కేవలం ఎకరం రూ.3,41,25,000కే ముట్టజెప్పేందుకు అంగీకరించింది.
అధికారంలో మనమే ఉన్నాం కదా.. అని తమ పారీ్టకి ఇష్టారాజ్యంగా భూమి కేటాయించి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. పూర్తి కేటాయింపు జరిగే వరకు మీడియాకు, ఇతరులకు తెలియకుండా గోప్యంగా వ్యవహరించింది. మే 12న ప్రతిపాదన.. మే 16న కలెక్టర్ అనుమతి... మే 17న సీసీఎల్ఏ అనుకూల నివేదిక.. ఈ తర్వాత ఒకరోజులో తెలంగాణ రాష్ట్ర ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ(టీఎస్ఎల్ఎంఏ) మిగతా తతంగాన్ని పూర్తి చేసింది.
అనంతరం కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతిపాదన నుంచి కేటాయింపు వరకు సాధారణంగా నాలుగైదు నెలలు పట్టే తతంగమంతా కేవలం 5 రోజుల్లో ముగించారు’ అని పిటిషన్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మిని్రస్టేషన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్పై త్వరలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment