కూ.. చుక్‌.. చెక్‌.. | Surveillance with AI cameras to prevent train accidents | Sakshi
Sakshi News home page

కూ.. చుక్‌.. చెక్‌..

Published Mon, Sep 16 2024 4:38 AM | Last Updated on Mon, Sep 16 2024 4:38 AM

Surveillance with AI cameras to prevent train accidents

రైలు ప్రమాదాల నివారణకు ఏఐ కెమెరాలతో నిఘా

భద్రత విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం  తీసుకుంది. దేశవ్యాప్తంగా రైళ్లలో ఆర్టిఫిషియల్‌  ఇంటెలిజెన్స్‌ (ఏఐ) నిఘా కెమెరాలను ఏర్పాటు  చేయనుంది. పట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను దూరం నుంచే గుర్తించి లోకో పైలెట్లను అప్రమత్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 

రైళ్లు పట్టాలు తప్పడాన్ని నివారించడంతోపాటు ఉగ్రవాద,  అసాంఘిక శక్తుల కుట్రలను తిప్పికొట్టే లక్ష్యంతో రైల్వేశాఖ వీటిని ఏర్పాటుచేయనుంది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో సీసీటీవీ  కెమెరాల నిఘా కొనసాగుతుండగా.. నడుస్తున్న రైళ్లను మాత్రం ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

కానీ, నడిచే రైళ్లు ప్రమాదాలకు గురికాకుండా ముందుగానే అప్రమత్తంచేసే వ్యవస్థ ఇప్పటివరకు అందుబాటులో లేదు.  –సాక్షి, అమరావతి


దూరం నుంచే గుర్తించి అప్రమత్తం..
ఇక ఏఐ పరిజ్ఞానంతో పనిచేసే ఈ ‘టూ ఫ్రంటల్‌ హై రిజల్యూషన్‌ కెమెరాలు’ రైలు పట్టాలపై అనుమానాస్పద వస్తువులను చాలాదూరం నుంచే గుర్తించి లోకో పైలెట్‌ను అప్రమత్తం చేస్తాయి.

వస్తువు ఫొటో తీసి వెంటనే ప్రాసెస్‌ చేసి అది ఎలాంటిదో సమాచారం ఇస్తాయి. అంటే.. అది ప్రమాదకరమైన వస్తువా.. అసహజమైన వస్తువా..కదులుతున్న వస్తువా.. మనుషులా.. జంతువులా అనేది కూడా గుర్తిస్తాయి.

లోకో పైలెట్లు వెంటనే అప్రమత్తమై అత్యవసర బ్రేక్‌ వేసి ఆ వస్తువుకు కనీసం కి.మీ. ముందుగానే రైలును నిలిపివేస్తారు.

గుర్తించిన అభ్యంతరకర వస్తువుల పైకి లేజర్‌ కిరణాలను ప్రసరింపజేసి ఆ వస్తువు ఎంత దూరంలో ఉందో లోకో పైలెట్‌ 
గుర్తించే పరిజ్ఞానాన్ని కూడా అందుబాటులోకి తేనున్నారు.

అత్యవసర బ్రేక్‌ను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించి అసాధారణ పరిస్థితుల్లో లోకో పైలట్‌తో నిమిత్తం లేకుండానే
రైలు ఆటోమేటిగ్గా ఆగిపోయేట్లుగా చేసే పరిజ్ఞానంపై కూడా రైల్వేశాఖ పరిశోధనలు నిర్వహిస్తోంది.

మూడేళ్లలో 97 ప్రమాదాలు..
ఇటీవలి కాలంలో దేశంలో రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురవుతున్న దుర్ఘటనలు గణనీయంగా పెరిగాయి. 2021 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ ప్రమాదాలు 97 సంభవించాయి. 

కొన్నిచోట్ల విద్రోహశక్తులు రైలుపట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను ఉంచి కుట్రలు పన్నిన ఉదంతాలూ ఉన్నాయి. దీంతో రైలు పట్టాలపై ఈ తరహా వస్తువులను ముందుగానే గుర్తించి ప్రమాదాలు నివారించేందుకు రైళ్లలో ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

రూ.15 వేల కోట్లతో  75,000ఏఐ కెమెరాలు..
ఈ నేపథ్యంలో.. రూ.15 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో 75 వేల ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 40 వేల బోగీలు, 14 వేల లోకోమోటివ్‌లు (ఇంజిన్‌లు), 6 వేల ఈఎంయూలలో ఈ కెమెరాలను ఏర్పాటుచేస్తారు. 

ప్రతి బోగీకి ఆరు కెమెరాలు,  ప్రతి లోకోమోటివ్‌కు నాలుగు కెమెరాలను అమరుస్తారు. అక్టోబరు నుంచి ఏడాదిలోగా దశలవారీగా అన్ని రైళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటు పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పలు కంపెనీలకు టెండర్లు అప్పగిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement