త్వరలో విద్యాకమిషన్‌ ఏర్పాటు | Telangana CM directs officials to explore changes in elementary and secondary education system | Sakshi
Sakshi News home page

త్వరలో విద్యాకమిషన్‌ ఏర్పాటు

Published Sat, Jul 20 2024 5:42 AM | Last Updated on Sat, Jul 20 2024 5:42 AM

Telangana CM directs officials to explore changes in elementary and secondary education system

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి 

ప్రీ స్కూల్స్‌గా అంగన్‌వాడీలు... నాలుగు నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్, 

రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళిక సచివాలయంలో విద్యావేత్తలతో భేటీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యావ్యవస్థను మెరుగుపర్చడానికి త్వరలోనే విద్యాకమిషన్‌ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు యూనివర్సిటీల వరకు నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధికల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ బలోపేతంపై చర్చించేందుకు విద్యావేత్తలతో సచివాలయంలో సీఎం శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు.

ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని..విద్యావేత్తలు ఇచ్చే సూచనలు స్వీకరిస్తామన్నారు. భేటీలో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, పీఎల్‌.విశ్వేశ్వరరావు, శాంతాసిన్హా, ఆల్దాస్‌ జానయ్య, పద్మజాషా, లక్ష్మీనారాయణ, మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి పాల్గొన్నారు. నియమాకాలు, నిధులు, మౌలిక సదుపాయాలు, పర్యవేక్షణలోపంతో పాఠశాలవిద్యలో తెలంగాణ 35వ స్థానంలో ఉందని వారు సీఎంకు వివరించారు. పాఠశాలలకు గ్రేడింగ్‌ ఇవ్వాలని.. తద్వారా విద్యార్థులు చేరడానికి ఆసక్తి కనపరుస్తారని సూచించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని వివరించారు.

అంగన్‌వాడీల్లోనే మూడో తరగతి వరకు ప్రీసూ్కల్‌లో బోధన అందేలా చూసి, నాలుగు నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు సీఎం తెలిపారు. పదేళ్లుగా యూనివర్సిటీల్లో బోధన సిబ్బంది నియామకం జరగలేదని, వీసీలు లేరని ప్రొఫెసర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీసీల నియామకానికి ఇప్పటికే సెర్చ్‌ కమిటీలు వేశామన్నారు. యూనివర్సిటీలకు డెవలప్‌మెంట్‌ గ్రాంట్స్‌ ఇవ్వాలని, అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయా లని ఆల్దాస్‌ జానయ్య సీఎంను కోరారు. తాము చదువుకున్న ఉస్మానియాలో ప్రస్తుతం విద్యాప్రమాణాలు పడిపోయాయని  హరగోపాల్, శాంతాసిన్హా ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యావ్యవస్థలో మార్పులపై విధానపత్రం రూపొందిస్తే.. దానిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రపంచ బ్యాంకు, ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు అతి తక్కువ వడ్డీకి, దీర్ఘకాలిక రుణాలు ఇస్తాయని ప్రొఫెసర్‌ ఆల్దాస్‌ జానయ్య చెప్పగా, ఆ అంశాన్ని పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 11 శాతంగా ఉన్న విద్యాశాఖ బడ్జెట్‌ తెలంగాణ ఏర్పడిన తర్వాత 6.4 శాతానికి పడిపోయిందని, తాను, భట్టి విక్రమార్క ఇద్దరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నామని, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి బడ్జెట్‌ పెంచుతామని సీఎం హామీ ఇచ్చారు.  

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ‘తెలంగాణ స్కిల్స్‌ యూనివర్సిటీ’బిల్లు! 
తెలంగాణ స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లును ఈ బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్కిల్స్‌ యూనివర్సిటీపై శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా వర్సిటీలో నిర్వహించే కోర్సులు, వాటి వ్యవధి, నిర్వహణకు అవసరమయ్యే మౌలిక వసతులు, నిధులు, వివిధ కంపెనీల భాగస్వామ్యంపై పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కొత్త యూనివర్సిటీకి ‘తెలంగాణ స్కిల్స్‌ యూనివర్సిటీ’అని పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ  స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల విభాగం ముసాయిదా రూపొందించిందని చెప్పారు.  

అందరికీ హైదరాబాద్‌లోనే శిక్షణ 
హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ప్రధాన క్యాంపస్‌తోపాటు జిల్లా కేంద్రాల్లో ప్రాంతీయ ప్రాంగణాలు (శాటిలైట్‌ క్యాంపస్‌లు) ఏర్పాటు చేసే విషయం సమావేశంలో చర్చకొచి్చంది. అయితే అందరూ హైదరాబాద్‌ క్యాంపస్‌లో చేరేందుకు పోటీ పడతారని సీఎం అన్నారు. హైదరాబాద్‌లోనే అందరికీ శిక్షణ అందించేలా ఏర్పాట్లు చేయాలని, ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా (ఈఎస్‌సీఐ)తో పాటు న్యాక్‌ క్యాంపస్‌ను ఉపయోగించుకోవాలని, అవసరమైన మౌలిక వసతి సదుపాయాలున్న ప్రాంగణాలను గుర్తించాలని సూచించారు.   

పీపీపీ మోడల్‌లో స్కిల్స్‌ వర్సిటీ 
ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యం (పీపీపీ)తో స్కిల్స్‌ యూనివర్సిటీ నెలకొల్పనున్నారు. మూడు, నాలుగేళ్ల కాల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సరి్టఫికెట్‌ కోర్సులు ఇందులో నిర్వహిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement