గోపాలపట్నం: గతంలో బొబ్బిలి, విజయనగరంలో ఎంపీ గెలిచి మెట్టినింట సేవ చేశా..ఇప్పుడు పుట్టినింట సేవ చేసే అవకాశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించారని వైఎస్సార్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. ఆదివారం గోపాలపట్నం కుమారి కల్యాణమండంలో కాపు, బలిజ,తెలగ సామాజిక సంఘాలు, కళింగ వైశ్య సంఘాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్కుమార్తో కలిసి బొత్స ఝాన్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బొబ్బిలి, విజయనగరం ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్లో విశాఖ సమస్యలపై తన గళం వినిపించానని, ఎక్కడ ఉన్నా పుట్టినిల్లు రుణం తీర్చుకుంటూనే ఉన్నానని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోనే తాను పుట్టానని ..ఇక్కడే చదువుకున్నానని, చిన్నప్పటి నుంచి ఇక్కడ సమస్యలు, వాతావరణం పూర్తిగా తెలుసునన్నారు. విశాఖలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్కుమార్ మాట్లాడుతూ పదేళ్లుగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గణబాబు నియోజకవర్గానికి ఏంచేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వ నిధులతో చేపట్టిన అండర్ పాస్వేలను తానే అభివృద్ధి చేసినట్టు బిల్డప్ ఇవ్వడం మినహా ఆయన చేసిందేమీ లేదన్నారు. గెలిచి ఇంట్లో కూర్చున్న గణబాబును ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. బెహరా భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, ఎన్నికల పరిశీలకురాలు పీలా ఉమారాణి, పేడాడ రమణి కుమారి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గుణిశెట్టి శ్రీనివాసరావు, 92వార్డు అధ్యక్షుడు అప్పలస్వామి నాయుడు, జేసీఎస్ కన్వీనర్ గేదెల మురళీకృష్ణ, కాపు,కలింగ వైశ్య సంఘం సభ్యుల పాల్గొన్నారు.
ఇక్కడే పుట్టా .. ఇక్కడే చదువుకున్నా..
నగరానికి సేవ చేసే అవకాశం కల్పించిన జగనన్నకు కృతజ్ఞతలు
వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి
బొత్స ఝాన్సీ