వనపర్తి: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 11న వనపర్తికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారని జెడ్పీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ మంగళవారం వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సభా ప్రాంగణం ఏర్పాట్లను వారు పరిశీలించి మాట్లాడారు. సభ విజయవంతానికి పార్టీ శ్రేణులను భారీగా సమీకరించనున్నట్లు వెల్లడించారు. వారి వెంట నాగర్కర్నూల్ పార్లమెంట్ ప్రభారి ఎడ్ల అశోక్రెడ్డి, మాజీ శాసనమండలి సభ్యుడు కాటేపల్లి జనార్దన్రెడ్డి, రాష్ట్ర నాయకులు అయ్యగారి ప్రభాకర్రెడ్డి, నాగర్కర్నూల్ పార్లమెంట్ కన్వీనర్ రాగి రామకృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, నాయకులు పురుషోత్తంరెడ్డి, రామన్గౌడ్, పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర బలగాల కవాతు
అమరచింత: పార్లమెంట్ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎస్పీ రక్షిత కె.మూర్తి ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహిస్తున్నామని ఆత్మకూర్ సీఐ శివకుమార్ అన్నారు. మంగళవారం కేంద్ర బలగాలు పట్టణంలోని ప్రధాన రహదారులపై కవాతు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అల్లర్లు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ.సురేష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.