గీసుకొండ : జిల్లాలో మత్స్య సంపద ఈ ఏడాది కూడా ఆశాజనకంగానే ఉంది. వరుసగా నాలుగేళ్ల నుంచి చేపల దిగుబడి వస్తోంది. ఈసారి మరింత అదనపు దిగుబడి వస్తోందని తెలుస్తోంది. ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసింది. గత సంవత్సరం చేపల పంపిణీ ఆలస్యమైంది. దీంతో కొన్ని మత్స్య సంఘాల వారు కాకినాడ, రాజమండ్రి (బిక్కూరు)తోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి చేపపిల్లలను సొంత ఖర్చుతో కొనుగోలు చేసి చెరువుల్లో పోశారు. ప్రస్తుత వేసవికాలంలో జలాశయాల్లో నీరు తగ్గుతోంది. దీంతో గతంలో ఉన్న పాత తెల్ల చేపలు సుమారు 5 నుంచి 10 కిలోల సైజ్లో పెరిగాయని మత్స్యకారులు చెబుతున్నారు.
జిల్లాలో జలాశయాలు ఇలా..
జిల్లాలో 702 చెరువులు ఉన్నాయి. వాటిలో ఎల్గూరురంగంపేట, మాదన్నపేట, నల్లబెల్లి, దమ్మన్నపేట, వర్ధన్నపేటలో కోనారెడ్డి చెరువులు పెద్దవి. ఇవే కాకుండా రాయపర్తి మండలంలోని మైలారం రిజర్వాయర్ ఉంది. పాకాల చెరువు మత్య్సశాఖ పరిధిలోకి రాకుండా అటవీశాఖ ఆధీనంలో ఉంది.
నాలుగేళ్ల నుంచి పెరుగుతున్న దిగుబడి..
గడిచిన నాలుగేళ్ల నుంచి జిల్లాలో మత్స్యసంపద దిగుబడి గణనీయంగా పెరుగుతోంది. 2021–22లో చేపలు 8,500 టన్నులు, రొయ్యలు 301 టన్నులు.. రెండు కలిపి మొత్తం 8,801 టన్నుల దిగుబడి వచ్చిందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే 2022–23లో చేపలు 8,950 టన్నులు, రొయ్యలు 320 టన్నులు.. మొత్తం కలిపి 9270 టన్నులు, ఈ ఏడాది(2023–24)లో చేపలు 9,500 టన్నులు, రొయ్యలు 350 టన్నులు.. మొత్తం కలిపి 9,850 టన్నుల చేపల దిగుబడి వచ్చినట్లు చెబుతున్నారు. అలాగే ప్రస్తుత మే, జూన్ మాసాలు ముగిసేసరికి మరో 800 టన్నుల దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు.
చేపల వైపే ప్రజల మొగ్గు..
ప్రస్తుతం చేపలకు గిరాకీ బాగానే పెరిగింది. మార్కెట్లో మాంసం, చికెన్ ధరలు పెరగడంతో మాంసాహారులు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యానికి మేలు చేసే చేపల వైపు మొగ్గుతున్నారు. గతంలో కిలోకు రూ.100 నుంచి రూ. 120 వరకు విక్రయిస్తుండగా.. ప్రస్తుత సీజన్లో రూ.150 వరకు తెల్ల చేపలను విక్రయిస్తున్నారు. బొమ్మె రకం చేపలు కిలోకు రూ.400 వరకు ధర పలుకుతోంది. గతంలో కోస్తా ఆంధ్ర ప్రాంతం నుంచి చేపలు ఇక్కడికి దిగుమతి అయ్యేవి. జిల్లాలో మత్స్య సంపద గణీయంగా పెరగడంతో ఇక్కడి చేపలు రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు పశ్చిమబెంగాల్లోని కోల్కతా, మహారాష్ట్రలోని చంద్రాపూర్, నాగ్పూర్కు భారీగానే ఎగుమతి అవుతున్నాయి.
ఆశాజనకంగా చేపల దిగుబడి
జిల్లాలో గతంలో ఎల్గూరురంగంపేట, మాదన్నపేట, మైలారం రిజర్వాయర్లలో నీలకంఠ రొయ్య పిల్లలను పోశారు. ఇవి నాలుగు నెలల్లోనే పెరిగి చేతికివస్తాయి. మత్స్యకారులకు లాభదాయకంగా ఉంటాయి. ఈ ఏడాది తెల్ల చేపల దిగుబడి ఆశాజనకంగా ఉంది. దీంతో మత్స్యకారులకు ఉపాధి మెరుగుపడింది.
– నరేశ్కుమార్ నాయుడు,
జిల్లా మత్స్యశాఖ అధికారి
జిల్లాలో చెరువులు, మత్స్యసంఘాల వివరాలు..
గత ఏడాదితో పోలిస్తే ఈసారి 800 టన్నుల అధిక దిగుబడి వచ్చే అవకాశం
మన చేపలు పశ్చిమబెంగాల్, మహారాష్ట్రకు ఎగుమతి
నీలకంఠ రొయ్యలకు భలే గిరాకీ
జిల్లాలో 702 చెరువులు..
184 మత్స్య సంఘాలు
చెరువులు 702
చెరువుల నీటి విస్తీర్ణం 12,910 హెక్టార్లు
పోసిన చేపపిల్లలు 1,93,63,000
మత్స్య సంఘాలు 184
మొత్తం సభ్యులు 15,741