సాక్షి, యాదాద్రి : ‘భువనగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఇందుకోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన, ఓటరు చైతన్య నిర్వహిస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధంలాంటిది. మే13న జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి’ అని అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే కోరారు. పోలింగ్ శాతం పెంపునకు తీసుకుంటున్న చర్యలపై ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెల్ల డించిన విషయాలు ఆయన మాటల్లోనే..
విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి 39వేల
సంకల్ప్ పత్రాలు
ఓటర్లు ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇందుకోసం పాఠశాలల్లో చదవే విద్యార్థుల తల్లిదండ్రులు 39 వేల మంది నుంచి సంకల్ప్ పత్రాలు తీసుకున్నాం. దీని ద్వారా వారంతా తప్పనిసరిగా ఓటు వేస్తారని ఎన్నికల కమిషన్ భావిస్తోంది.
లక్ష మంది కూలీలకు అవగాహన
ఓటింగ్ శాతం పెంచడానికి చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఉపాధిహామీ పనులు జరిగే ప్రదేశాలకు అధికారులు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. సుమారు లక్ష మంది కూలీలను కలిసి అవగాహన కల్పించాం. దీంతో పాటు గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు స్వయం సహాయక బృందాల సభ్యులు ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యపరుస్తున్నాం. సుమారు 33వేల మందికి అవగాహన కల్పించాం.
దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓటు వేసిన అనంతరం తిరిగి ఇళ్లకు చేర్చడానికి వాహనాలు ఏర్పాటు చేస్తాం అలాగే పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్లు ఏర్పాటు చేస్తున్నాం. వీల్చైర్లను అందుబాటులో ఉంచనున్నాం. వారికి సహాయకులుగా వలంటీర్లను నియమిస్తున్నాం. దివ్యాంగులు, 85 ఏళ్ల వయస్సు పైబడిన వృద్ధులకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. ఈనెల 3 నుంచి హోం ఓటింగ్ మొదలైంది.
ఇంటి వద్దకే పోల్ చిట్టీలు
బూత్ లెవల్ అధికారులు ఇంటంటికీ వెళ్లి నేరుగా ఓటర్లకు పోల్ చిట్టీలు పంపిణీ చేస్తున్నారు. వీటితో పాటు ఓటు ఆవశ్యకతను తెలియపరుస్తూ కరపత్రాలు కూడా పంపిణీ చేస్తున్నాం.
ఓటర్లకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు
పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పిస్తున్నాం. నీడ, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నాం. ఓఆర్ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచుతున్నాం.వైద్య సిబ్బందిని నియమిస్తున్నాం.
ఓటింగ్ శాతం పెంచేందుకు విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు
ఉపాధి పనుల ప్రదేశాలకు వెళ్లి కూలీలకు అవగాహన
విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి
సంకల్ప్ పత్రాల స్వీకరణ
స్వయం సహాయక బృందాల్లో
చైతన్యం తీసుకువచ్చేందుకు సదస్సులు
జన సమ్మర్థ ప్రాంతాల్లో
కళాకారులతో ప్రదర్శనలు
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్
హనుమంతు కే. జెండగే
పోలింగ్ సమయం పెంపు
వేసవి దృష్ట్యా కేంద్రం ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని పెంచింది. ఉదయం 7నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి.