'ఓటరు లిస్ట్ లో పేరుంటే చాలు ఓటు వేయొచ్చు'
హైదరాబాద్: ఓటరు లిస్ట్లో పేరుంటే చాలు 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఓకటి చూపించి ఓటు వేయొచ్చు అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రేపటి పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని భన్వర్ లాల్ తెలిపారు.
ఎన్నికలు సజావుగా జరిగేందుకు, భద్రత కోసం లక్ష మంది పోలీసులను నియమించామని భన్వర్ లాల్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుందని.. 6 గంటలకు లైన్లో ఉన్న చివరి వ్యక్తి వరకు ఓటు వేసేందుకు అనుమతిస్తామని భన్వర్లాల్ తెలిపారు.
ప్రైవేట్, ప్రభుత్వ యాజమాన్యాలు కచ్చితంగా ఓటు కోసం సిబ్బందికి సెలవు ఇవ్వాల్సిందేనని ఆయన తెలిపారు. పోలింగ్ సిబ్బంది, ఉద్యోగ సంఘాలు ఎట్టి పరిస్థితుల్లో పక్షపాతానికి పాల్పడవద్దని భన్వర్లాల్ హెచ్చరించారు.
ఉద్యమాల సందర్భంగా మీరు ఏ వైపు ఉన్నా ఇప్పుడు మాత్రం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ రాత్రి నిఘాను రెండింతలు చేస్తామని, ఏమైనా ఫిర్యాదులుంటే 1950కి ఫోన్ చేయండి లేదా 8790499899కి ఎస్ఎమ్మెఎస్ చేయొచ్చని భన్వర్లాల్ తెలిపారు.