
బస్టాండ్ సెంటర్లో రిక్షావాలాపై దాడి చేస్తున్న ఆవు. (ఇన్ సెట్లో) గత నెల్లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన లేగదూడ
సాక్షి, మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇటీవల జరిగిన సంఘటన జంతువుల్లో పేగుబంధం ఎంత బలమైందో చాటిచెబుతోంది. లక్ష్మీటాకీస్ సెంటర్లో గత నెల 29న గుర్తుతెలియని వాహనం ఢీకొని లేగ దూడ చనిపోయింది. తల్లి ఆవు రోజంతా బిడ్డ వద్దే పడుకుంది. చనిపోయిన ఆ దూడను మున్సిపల్ సిబ్బంది ఆదేశాలతో ఓ రిక్షా కార్మికుడు తీసుకెళ్లి ఖననం చేశాడు. అయితే ఇప్పుడు ఆవు ఆ రిక్షా కార్మికుడిపై పగబట్టింది. బిడ్డను తనకు కాకుండా తీసుకెళ్లిపోయాడని అనుకుందో ఏమో ఆ కార్మికుడు ఎక్కడ కనిపించినా కొమ్ములతో పొడిచేస్తోంది. గురువారం రాత్రి బస్టాండ్ సెంటర్లో కన్పించిన ఆ రిక్షావాలాపై దాడి చేసి కిందపడేసింది. స్థానికులు వచ్చి రక్షించడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆ ఆవు బారి నుంచి ఎలా బయటపడాలా? అని రిక్షా కార్మికుడు తలపట్టుకుంటున్నారు.