
(ఫైల్ ఫోటో)
సాక్షి, విజయవాడ: జంతువులు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర అటవీశాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి(పీసీసీఎఫ్) ప్రతీప్ కుమార్ సూచించారు. ఈమేరకు అన్ని జూలలోని జంతువుల్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా అమెరికాలో ఓ పులికి మనిషి ద్వారా కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం, కేంద్ర అటవీశాఖ.. జూల సంరక్షణకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రతీప్ కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తిపై వన్యప్రాణుల విషయంలోనూ ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు.
సెంట్రల్ జూ అథారిటీ సూచన మేరకు రాష్ట్రంలోని అన్ని జంతు ప్రదర్శన శాలల వద్ద ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని జూలలో ఉండే వన్యప్రాణుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జంతువులకు పౌష్టికాహారం అందిస్తున్నామని, సీసీ కెమెరాల ద్వారా ఇరవై నాలుగు గంటలు వాటి కదలికలు పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. జంతువులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వాటి రక్త నమూనాలను సేకరించి, యానిమల్ హెల్త్ ఇస్టిట్యూట్కు పంపి.. వచ్చిన రిపోర్ట్ ఆధారంగా చికిత్స అందిస్తామని అధికారి తెలిపారు. (కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్)