'అప్పా' అధికారిణిపై రైల్లో దాడి | decoity attacks APPA officer in simhapuri express | Sakshi
Sakshi News home page

'అప్పా' అధికారిణిపై రైల్లో దాడి

Published Sat, Sep 12 2015 2:01 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

'అప్పా' అధికారిణిపై రైల్లో దాడి

గూడూరు: ఓ ఐపీఎస్ అధికారిణిపై సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ఓ దుండగుడు దాడి చేసి కొట్టడంతోపాటు ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని పరారయ్యాడు. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని అప్పాలో పనిచేసే తమిళనాడు రాష్ట్రానికి చెందిన నాన్ కేడర్ ఐపీఎస్ అధికారిణి ఎస్.ఎం రత్న చెన్నై వెళ్లేందుకు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో సింహపురి ఎక్స్‌ప్రెస్ ఎక్కారు.  ఆమె వికలాంగుల బోగీలో ఎక్కి కూర్చున్నారు. గూడురులో రైలు మారి చెన్నైకు మరో రైలులో వెళ్లాల్సి ఉంది. అయితే, రైలు శనివారం ఉదయం నెల్లూరు స్టేషన్‌కు రాగానే వికలాంగుల బోగీలో ఉన్న అందరూ దిగిపోయారు.

బోగీలో రత్న ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి అదే బోగీలోకి ఎక్కాడు. రైలు స్టేషన్ దాటిన తర్వాత  ఆమెపై దాడి చేసి కొట్టాడు. రత్నా వద్ద ఉన్న రెండు బంగారు ఉంగరాలు, గాజులు, గొలుసు, రూ.2 వేల నగదు, ఐడీ కార్డు తీసుకుని గూడురులో దిగి పరారయ్యాడు. దుండగుడి దాడిలో అధికారిణి ముఖంపై గట్టి దెబ్బలు తగిలాయి. తీవ్రంగా గాయపడిన ఆమె  గూడురు రైల్వే స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement