నిరసనలు..నిలదీతలు!
- జన్మభూమి సభలు రసాభాస
- సమస్యలు పరిష్కారం కాకపోవడంపై ప్రజల మండిపాటు
- గత అర్జీలకు దిక్కులేదంటూ ధ్వజం
కర్నూలు(అగ్రికల్చర్): నిరసనలు.. నిలదీతలు..అసంతృప్తులు..వాగ్వాదాలతో జన్మభూమి సభలు రసాభాసగా మారాయి. సోమవారం నాల్గో విడత జన్మభూమి కార్యక్రమం ప్రారంభమైంది. కల్లూరు మండలం తడకనపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి రోజు 96 గ్రామ పంచాయతీలు, 28 వార్డుల్లో మొత్తంగా 124 జన్మభూమి సభలు జరిగాయి. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో మొదటి రోజు ప్రజాప్రతినిధులు పాల్గొనలేదు. పలు మండలాల్లో గ్రామసభలు జనాలు లేక వెలవెలబోయి. కొన్ని చోట్ల మొక్కుబడిగా జరిగాయి. మూడు విడతల్లో వినతి పత్రాలు ఇచ్చినా.. పరిష్కారం కాకపోవడంతో ప్రజలు నోడల్ అధికారులు, ఎంపీడీఓ, తహసీల్దార్లను నిలదీశారు. పింఛన్లు, రేషన్ కార్డులు, పక్కా ఇళ్లు, నీటి సమస్యలపై వినతులు వెల్లువెత్తాయి. గత జన్మభూమి కార్యక్రమాల్లో ఇచ్చిన వినతులకు పరిష్కారం లేకపోవడంతోనే ఈ జన్మభూమి గ్రామ సభల్లో వినతులు భారీగా వచ్చినట్లు స్పష్టం అవుతోంది. అయితే జన్మభూమి గ్రామ కమిటీ సభ్యులు గ్రామ సభల్లో అంతా తమదే అన్నట్లుగా వ్యవహరించారు. ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసే కార్యక్రమంగా జన్మభూమి గ్రామ సభలు జరిగాయి. ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ పూర్తిగా పార్టీ కార్యకర్తలే ఎక్కువగా కనిపించారు.
మొదటి రోజు ఇలా..
-
హొళగుంద మండలం మార్లమడికి మజరా గ్రామమైన వన్నూరు క్యాంపులకు రోడ్డు, బస్సు సదుపాయం లేదు. బస్సు వసతి కల్పించాలని గత జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. అధికారులు కూడా హామీ ఇచ్చారు. కాని ఇప్పటికి సౌకర్యం లభించలేదు. నాలుగో విడత జన్మభూమి సభలో ప్రజలు మూకమ్మడిగా అధికారులను నిలదీశారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపని జన్మభూమి కార్యక్రమాలు ఎందుకు... దండగా అంటూ ప్రజలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
-
కర్నూలు మండలం ఇ.తాండ్రపాడు గ్రామంలో ఫించన్లు, రేషన్ కార్డులు రాలేదని ప్రజలు నిరసన తెలిపారు. గత జన్మభూమి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక్కరికి మంజూరు కాలేదని మండిపడ్డారు.
-
మద్దికెర మండలం పెరవలి గ్రామంలో వైఎస్ఆర్సీపీకి చెందిన వారనే ఉద్దేశంతో పింఛన్లు ఇవ్వడం లేదని గ్రామస్తులు అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు కేవలం తెలుగుదేశం వారికేనా అంటూ నిలదీశారు.
-
ఆత్మకూరు మండలం బాపునంతపురం గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లకు బిల్లులు ఇవ్వకపోవడంపై ప్రజలు.. అధికారులను నిలదీశారు. బిల్లులు ఇవ్వనపుడు..మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఎందుకు చెప్పాలి అంటూ ప్రశ్నించారు.
-
ఆళ్లగడ్డ, అవుకు, ఆలూరు, కోడుమూరు, బనగానపల్లె, ప్యాపిలి, బేతంచెర్ల తదితర మండలాల్లో జనాలు లేక జన్మభూమి సభలు వెలవెలబోయాయి.