డిసెంబర్ కల్లా అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి యనమల ఆదేశించారు.
ఈ ఏడాది డిసెంబర్ చివరి కల్లా అసెంబ్లీ, శాసనమండలి భవన నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. గురువారం ఆయన సీఆర్డీఏ కమిషనర్, అడిషనల్ కమిషనర్, అసెంబ్లీ, శాసనమండలి భవనాల ప్లానింగ్ అధికారులతో వెలగపూడిలోని సచివాలయంలోని తన చాంబర్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, స్పీకర్,మంత్రులు, అధికారుల చాంబర్లలలో సౌకర్యాలు, భద్రతపై చర్చించారు. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో డిసెంబరు ఆఖరుకు భవనాల నిర్మాణం పనులు పూర్తి చేయాలని కోరారు. ఈనెల 19వ తేదీన మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణతో కలసి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.