
బాబును కలిసిన రఘురామ కృష్ణంరాజు
ఏలూరు : బీజేపీతో టీడీపీ పొత్తు దాదాపు కటీఫ్ అయినట్లే కనిపిస్తోంది. గత అర్థరాత్రి నుంచి బీజేపీ అగ్రనేతలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంతనాలు జరుపుతున్నారు. ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుందామంటూ బీజేపీ అధినేతలకు చంద్రబాబు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. తాజా పరిణామాలపై మాగంట బాబు నివాసంలో పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో బాబు ఎడతెగని చర్చలు జరుపుతున్నారు.
మరోవైపు ప్రస్తుతం బీజేపీలో ఉన్న రఘురామ కృష్ణంరాజు గురువారం చంద్రబాబు నాయుడుని కలిశారు. ఆయనతో పాటు కొట్టు సత్యనారాయణతో పాటు ఈలి నాని కూడా బాబును కలిసినవారిలో ఉన్నారు. టీడీపీ తరపున వారిని అభ్యర్థులుగా నిలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో బీజేపీ-టీడీపీ పొత్తులపై ఈరోజు సాయంత్రానికి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు వైఖరిపై బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. దాంతో పార్టీ అధిష్టానంతో బాబు మోసపూరిత వైఖరిపై రాష్ట్ర బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు.