
మిర్చిని ఎందుకు కొనడం లేదు?: చాడ
సాక్షి, హైదరాబాద్: పత్తి పంట వేయొద్దు, మిర్చి పంట వేయాలని చెప్పిన సీఎం కేసీఆర్, అందుకు అనుగుణంగా మిర్చిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొన్ని మిర్చి రకాలు క్వింటాల్ రూ. 2 వేలు కూడా ధర లేకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. వరంగల్ ఎనుమాముల మిర్చి మార్కెట్ను పోలీసులతో నింపేసి రైతులను భయభ్రాంతులకు గురి చేయడం శోచనీయమన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిర్చి రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం మార్కెట్లో రౌడీలు, గూండాలు దాడి చేశారని మంత్రులు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
సీఎం అపాయింట్మెంట్ కోసం చాడ లేఖ...
భూపాలపల్లి జిల్లా పరిధిలోని తాడిచెర్ల బ్లాక్ 1, బ్లాక్ 2 బొగ్గుగనుల ప్రైవేటీకరణ విషయంపై వివిధ రాజకీయపార్టీల ఆధ్వర్యంలో కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్కు చాడ వెంకటరెడ్డి విజ్ఞఫ్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు.