Cotton crop
-
ధరలేక దిగాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం రైతు దగా పడుతున్నట్లుగానే పత్తి రైతు కూడా చిత్తవుతున్నాడు. మద్దతు ధర కల్పనకు తేమ శాతం సాకుతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మోకాలడ్డుతుంటే అంతర్జాతీయ మార్కెట్ను సాకుగా చూపి వ్యాపారులు సిండికేట్గా మారిపోయారు. ఫలితంగా గతంలో ఎన్నడూలేని విధంగా పత్తి ధర పతనమైందని.. సర్కారు తీరువల్ల పెట్టుబడి కూడా దక్కడంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.91 లక్షల ఎకరాలు. గతేడాది 15 లక్షల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది 9.82 లక్షల ఎకరాల్లో సాగైంది. వరదలు, వర్షాలకు తోడు గులాబీ తెగులు ప్రభావంతో ఎకరాకు 4–6 క్వింటాళ్లకు మించి దిగుబడి రావడంలేదంటున్నారు. ఈ ఏడాది కనీస మద్దతు ధరగా మధ్యస్థ రకానికి క్వింటా రూ.7,121, పొడవు రకానికి రూ.7,521గా కేంద్రం నిర్ణయించింది. కానీ, ఈ ఏడాది తొలితీత ప్రారంభానికి ముందే మార్కెట్లో ధరల పతనం మొదలైంది. గతేడాది క్వింటా రూ.10వేలకు పైగా పలికిన పత్తి ప్రస్తుతం మార్కెట్లో గ్రేడ్ను బట్టి క్వింటా రూ.4వేల నుంచి రూ.5,800 మించి పలకడంలేదు. మరోవైపు.. ఏటా అక్టోబరు మూడోవారంలో ప్రారంభం కావాల్సిన సీసీఐ కేంద్రాలు ఈ ఏడాది నవంబరు 11నాటికి కానీ ప్రారంభం కాలేదు. పైగా.. 33 ఏఎంసీల పరిధిలో 61 జిన్నింగ్ మిల్లులు ఏర్పాటుచేయాలని సంకలి్పంచగా, 45 జిన్నింగ్ మిల్లుల్లో మాత్రమే కొనుగోళ్లు మొదలయ్యాయి. సుదూర ప్రాంతాల్లో కేంద్రాలు.. ఇక కొనుగోలు కేంద్రాలను మారుమూలనున్న మిల్లుల వద్ద ఏర్పాటుచేయడంతో రవాణా, లోడింగ్ చార్జీలు రైతులకు తడిసిమోపెడవుతున్నాయి. ఉదా.. వైఎస్సార్ జిల్లాలో ఒక్క కేంద్రం ఏర్పాటుచేయలేదు. ఈ జిల్లాకు చెందిన రైతులు నంద్యాలకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగే, గుంటూరు జిల్లా తాడికొండ రైతులు కూడా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రత్తిపాడు మండలంలోని కోయపాలెం మిల్లుకు వెళ్లాల్సి వస్తోంది. పోనీ ధర పెరిగే వరకు నిల్వచేసుకుందామనుకుంటే క్వింటాకు రూ.400–500 వరకు అద్దెలు చెల్లించాల్సి రావడంతో చేసేదిలేక అయినకాడకి అమ్ముకుంటున్నారు. తేమ శాతం పేరిట కొర్రీలు..కేంద్ర నిబంధనల మేరకు 8 శాతం తేమతోనే పత్తిని కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత 12 శాతం వరకు ఒక్కో శాతం చొప్పున ఎమ్మెస్పీ ధరలో కోత విధిస్తారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో పత్తి పిందె, పూతకొచ్చే దశలో కురిసిన అధిక వర్షాల కారణంగా తేమ శాతం 15–30 శాతం చొప్పున నమోదవుతుండగా, ప్రస్తుతం కురుస్తున్న మంచు ప్రభావంతో పెరుగుతున్న తేమశాతం రైతులకు ఇబ్బందికరంగా మారింది. కేంద్రాల్లో ఏర్పాటుచేసిన రెండు రకాల యంత్రాల్లో ఒక్కోదాంట్లో ఒక్కో రీతిలో తేమ శాతం నమోదవడంతో రైతులు నష్టపోతున్నారు. జిన్నింగ్ పరిశ్రమల యాజమాన్యాలతో సీసీఐ అధికారులు కుమ్మక్కై సర్వర్ నెమ్మదిగా ఉందని, తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకులు చెబుతూ మద్దతు ధర దక్కనీయకుండా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తేమ శాతం అధికంగా ఉన్న పత్తిని నిల్వచేస్తే రంగు మారుతుండగా, నాణ్యమైన దిగుబడులొచి్చన చోట కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లలేక రైతులు అయినకాడకి అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడింది.ఒక్క కేంద్రం కూడా ఏర్పాటుచేయలేదు.. మా జిల్లాలో ఒక్క కేంద్రం కూడా ఏర్పాటుచేయలేదు. ఫలితంగా నంద్యాల జిల్లాలోని కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడి నుంచి వేలకు వేలు ఖర్చుపెట్టి లారీల్లో పత్తిని తీసుకుకెళ్తే అక్కడ నిమ్ము ఎక్కువగా ఉందని నాణ్యతలేదని రేటు తగ్గించేస్తున్నారు. మా జిల్లా నుంచి ఎవరు వెళ్లడంలేదు. ఇక్కడే అమ్ముకుంటున్నారు. గతేడాది మద్దతు ధరకు మించి పలికింది. ఈ ఏడాది రూ.6 వేలకు మించి పలకడంలేదు. దీంతో పాతది, ఇప్పటిదీ కలిపి దాదాపు 400 క్వింటాళ్ల పత్తిని ఇంట్లోనే ఉంచుకున్నాను. – నంద్యాల భాస్కర్రెడ్డి, రాజుపాలెం, వైఎస్సార్ జిల్లా ఎకరాకు రూ.5వేల నష్టం.. గతేడాది నవంబరులోనే గుంటూరు, ఒడిశా, రాయగడ, గుణుపూర్ ప్రాంతాలకు చెందిన వర్తకులు క్వింటా రూ.7వేలకు పైగా కొనుగోలు చేశారు. కానీ, ఈ ఏడాది రూ.6వేలకు మించి కొనడంలేదు. ఇలా అయితే ఎకరాకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ ఒక్కరికీ లభించడంలేదు. – పెద్దకోట జగన్నాథం, కర్లెం, కొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా -
కృత్రిమ మేధతో.. ‘గులాబీ’కి స్మార్ట్ వల!
దేశవ్యాప్తంగా పత్తి పంటకు పెనునష్టం కలిగిస్తున్న గులాబీ పురుగును సమర్థంగా అరికట్టే కృషిలో నాగపూర్లోని కేంద్రీయ పత్తి పరిశో«దనా సంస్థ (ఐసిఎఆర్–సిఐసిఆర్) పెద్ద ముందడుగు వేసింది. కృత్రిమ మేధ (ఎఐ)తో నడిచే హైటెక్ ఫెరమోన్ ట్రాప్లను పంజాబ్ రైతులకు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. పంటలపై పురుగుల నియంత్రణలో కృత్రిమ మేధ సాంకేతికతను దేశంలోనే మొట్టమొదటి సారిగా వాడిన ఘనతను సిఐసిఆర్ దక్కించుకుంది.సంప్రదాయ లింగాకర్షక బుట్టలతోపోల్చితే ఈ అత్యాధునిక సాంకేతికతతో కూడిన ట్రాప్లు చాలా మెరుగైన ఫలితాలను అందిస్తున్నాయని పంజాబ్ పత్తి రైతులు సంతోషిస్తున్నారు. పురుగుల తీవ్రతపై ప్రతి గంటకు రైతుల మొబైల్కు, కంప్యూటర్కు సమాచారం అందించటం ఈ ఎఐ ఫెరమోన్ ట్రాప్ ప్రత్యేకత. దీని ప్రకారం వ్యవసాయ విస్తరణాధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు వెంటనే నియంత్రణ చర్యలు సూచిస్తున్నారు.అదే రోజు ఆ చర్యలను రైతులు అమలు చేస్తుండటం వల్ల గులాబీ పురుగు వల్ల నష్టం జరగకుండా కాపాడుకోగలుగుతున్నానని పంజాబ్ రైతు జగదేవ్సింగ్ చె΄్పారు. 2021 నుంచి వరుసగా మూడేళ్లుగా ఉగ్రరూపం దాల్చిన గులాబీ పురుగు బారిన పడి పంటను తీవ్రంగా నష్ట΄ోయిన రైతుల్లో ఈయన ఒకరు. ఎకరంన్నరలో బీజీ2 పత్తి సాగు చేస్తున్నారు. మూడు జిల్లాల్లో మరో 17 మంది రైతులు సిఐసిఆర్ పైలట్ ప్రాజెక్టు వల్ల ఈ ఏడాది పత్తి పంటపై దిగులు లేకుండా గడుపుతున్నారు.పత్తి పంటలో గులాబీ పురుగు తీవ్రతను గుర్తించడానికి హెక్టారుకు 5 చొప్పున లింగాకర్షక బుట్టలు పొలంలో వేలాడగడతారు. గాసిప్లూర్ అనే రసాయనిక ల్యూర్ను ఈ బుట్టలో పెడతారు. అది అడ పురుగుల వాసనగా పొరపడి ఆకర్షితులై వచ్చే మగ పురుగులు ఆ బుట్టలో చిక్కుకుంటాయి. వీటి సంఖ్యను బట్టి గులాబీ పురుగు తీవ్రతను అంచనా వేసి, క్రిమిసంహారకాలు చల్లుతారు. స్మార్ట్ ట్రాప్ ఎలా పనిచేస్తుంది?డిజిటలీకరించిన ఈ స్మార్ట్ ట్రాప్ సోలార్ విద్యుత్తో నడుస్తుంది. ఈ స్మార్ట్ ట్రాప్ వ్యవస్థలో సింగిల్ బోర్డ్ కంప్యూటర్, కెమెరా మోడ్యూల్, వాతావరణ సెన్సార్, సోలార్తో నడిచే జిఎస్ఎం ట్రాన్స్మిటర్, రీచార్జిబుల్ బ్యాటరీ ఉంటాయి. ట్రాప్లోకి వచ్చి అతుక్కు΄ోయిన పురుగులను నిరంతరం ఈ కెమెరా ఫొటోలు తీసి, క్లౌడ్లోని రిమోట్ సర్వర్కు ఎప్పటికప్పుడు పంపుతుంది. ఆ ఫొటోలను మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ను ఉపయోగించి ఏయే రకాల పురుగులన్న విశ్లేషణ జరుగుతుంది. గులాబీ పురుగునకు చెందిన రెక్కల పురుగులు ఎన్ని అనే విషయం ఇలా నిర్థారణ అవుతుంది. ఈ సమాచారంతో పాటు వాతావరణ వివరాలు స్మార్ట్ ట్రాప్కు అనుసంధానించిన మొబైల్/కంప్యూటర్లకు సంక్షిప్త సందేశాల రూపంలో చేరుకుంటాయి. ఈ విధంగా రైతులు సకాలంలో పురుగు తీవ్రతను గుర్తించి, క్రిమిసంహారాలు వాడి పత్తిని గులాబీ పురుగు నుంచి రక్షించుకుంటున్నారు.‘గతంలో సాధారణ లింగార్షక బుట్టలను పత్తి పొలంలో పెట్టి, ప్రతి 3 రోజులకోసారి స్వయంగా పొలానికి వెళ్లి చూసేవాడిని. నేను వెళ్లి చూసినప్పుడు పురుగులు పెద్దగా లేక΄ోవచ్చు. కానీ, తర్వాత రెండు రోజులు అటు వెళ్లను. ఆ తర్వాత రోజు వెళ్లేటప్పటికే పురుగు ఉధృతితో పంటకు తీవ్ర నష్టం జరిగి΄ోతూ ఉండేది. ఏ రోజు, ఏయే వేళలో పురుగు ఎక్కువ పంటను ఆశించిందీ మాకు తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు ఆ సమస్యల్లేవు. ప్రతి గంటకు మెసేజ్ వస్తుంది. అవసరమనిపిస్తే వెంటనే స్పందించి పిచికారీలు చేసి పంటను కాపాడుకుంటున్నాం..’ అన్నారు రైతు జగదేవ్సింగ్. సకాలంలో గులాబీ పురుగుకు చెక్..పత్తి పొలంలోని లింగాకర్షక బుట్టల్లో వరుసగా 3 రోజులు రోజుకు 8 చొప్పున గులాబీ రెక్కల పురుగులు కనిపిస్తే.. పంట దిగుబడిని భారీగా నష్టపరిచే స్థాయిలో పురుగు ఉందని అర్థం. అయితే, సాధారణ లింగాకర్షక బుట్టలను రైతులు పొలంలో పెట్టుకున్నప్పటికీ.. వాటిలో ఎన్ని పురుగులు పడుతున్నాయో గమనించే రైతులను మేం గతంలో చాలా అరుదుగా చూశాం. ఎందుకంటే, ఆ పని చేయటానికి వారికి చాలా సమయం అవసరం పడుతుంది. రైతు లు పత్తితో పాటు ఇతర పంటల పనులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది కదా.ఈ కొత్త వ్యవస్థ వారి సమస్యలను అధిగమించేందుకు దోహదపడుతుంది. ఫోన్లోకి వచ్చే సమాచారంతో పత్తి రైతులు గులాబీ పురుగు ఉనికిని సకాలంలో గుర్తించగలుగుతారు. తగిన సమయంలో క్రిమిసంహారకాలను చల్లి, పంట నష్టాన్ని సమర్థవంతంగా తగ్గించుకుంటున్నారు. కృత్రిమ మేధతో రూపొందించిన ఈ స్మార్ట్ ఫెరమోన్ ట్రాప్ తక్కువ ఖర్చుతోనే గులాబీ పురుగును సమర్థవంతంగా అరికడుతోంది. ఇవి రైతులు స్వయంగా పొలాల్లో ఏర్పాటు చేసుకోవటానికి ఉద్దేశించి రూపొందించినవి కాదు. తహసిల్ స్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులు పురుగు తీవ్రతను సకాలంలో గుర్తించి, రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వటానికి డిజిటల్ సాధనాలుగా వాడుకోవడానికి స్మార్ట్ ట్రాప్స్ ఉపయోగపడుతాయి. తక్కువ సాంద్ర గ్రిడ్ పద్ధతిలో రైతుల పొలాల్లో ప్రభుత్వం ఈ స్మార్ట్ ట్రాప్లను ఏర్పాటు చేయవచ్చు.– డా. వై.జి. ప్రసాద్, డైరెక్టర్, కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ, నాగపూర్ -
పత్తికి ‘పచ్చ’ తెగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పత్తి పంటకు ‘పచ్చ’ తెగులు పట్టింది. వాస్తవాలను మరుగున పరిచి ఈనాడు రామోజీరావు విషం కక్కారు. వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 56 నెలల్లో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటే, పత్తి రైతులకు అన్యాయం జరిగి పోయిందంటూ ‘వి‘పత్తి’పై.. నిర్లక్ష్యపు కత్తి’ అంటూ ఓ అబద్ధాల కథనాన్ని అచ్చేశారు. ఈ కథనంలో వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.. ఆరోపణ: సగానికి తగ్గిన సాగు, దిగుబడులు వాస్తవం: పత్తి సాధారణ విస్తీర్ణం 15.26 లక్షల ఎకరాలు కాగా, ఖరీఫ్ – 2023లో 10.35 లక్షల ఎకరాల్లో సాగయింది. 12 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అంతర్జాతీయంగా పత్తి ధరలు తగ్గడం వల్ల పత్తి రైతులు మిరప, మొక్కజొన్న, ఆముదం, సోయాబీన్, జామ, డ్రాగన్ ఫ్రూట్, ఆయిల్ పామ్ వంటి పంటలకు మళ్లారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు, కోత దశలో మిచాంగ్ తుపాను ప్రభావం ఖరీఫ్–2023 సీజన్పై పడింది. పత్తి రైతులు ఇతర పంటలవైపు మళ్లడంతో మిరప 3.90 లక్షల ఎకరాల నుంచి 6.54 లక్షల ఎకరాలకు, మొక్కజొన్న 6.57 లక్షల ఎకరాల నుంచి 8.05 లక్షల ఎకరాలకు, ఆముదం 90 వేల ఎకరాల నుంచి 1.63 లక్షల ఎకరాలకు, సోయాబీన్ 2 వేల ఎకరాల నుంచి 22 వేల ఎకరాలకు పెరిగింది. పోనీ చంద్రబాబు హయాంలో ఏమైనా పెరిగిందా అంటే అదీ లేదు. 2014–15 లో 20.37 లక్షల ఎకరాల్లో సాగవగా, 27.51 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అదే 2018–19కి వచ్చేసరికి సాగు విస్తీర్ణం 15లక్షల ఎకరాలకు పడిపోయింది. దిగుబడులు 14.91 లక్షల టన్నులకు దిగజారిపోయాయి. ఆరోపణ: క్వింటాకు రూ.1,000 కంటే తక్కువకే అమ్మకాలు వాస్తవం: చంద్రబాబు హయాంలో ఏనాడూ పత్తి క్వింటాకు రూ.6,400 మించి పలకలేదు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో దాదాపు అన్ని సీజన్లలో ఎమ్మెస్పీకి మించి ధర పలికింది. గతేడాది రికార్డు స్థాయిలో రూ.13 వేలు పలికింది. అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ లేకపోయినప్పటికీ, రాష్ట్రంలో క్వింటా పొడుగు పత్తి గింజ ఎమ్మెస్పీ రూ.7020 కాగా, ఆదోని మార్కెట్లో బుధవారం రూ.7029 పలికింది. మధ్యస్థ గింజ ఎమ్మెస్పీ రూ.6,800 కాగా, రూ.6,620 పలికింది. మరొక వైపు ధరలు పతనమైన ప్రతిసారీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ద్వారా పత్తిని కొంటోంది. ఇలా 4.5 ఏళ్లలో 83,413 మంది రైతుల నుంచి రూ.1,789 కోట్ల విలువైన 3.21 లక్షల టన్నుల పత్తి కొనుగోలు చేసింది. ఆరోపణ: నకిలీ విత్తనాలతో దోపిడీ వాస్తవం: నాసిరకం విత్తన తయారీ, విక్రయదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. 351 నాసిరకం విత్తనాల ఉత్పత్తిదారులపై చర్యలు తీసుకుంది. మరో 168 నాసిరకం విత్తన ఉత్పత్తిదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. 2,702 డీలర్షాపులను తనిఖీ చేసి రూ.40.97లక్షల విలువైన 34.20 లక్షల క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకొంది. రూ.12.84 లక్షల విలువైన 2,255 క్వింటాళ్ల విత్తనాల విక్రయాలను నిలిపివేసింది. బాధ్యులైన 16 మంది డీలర్లపై 6ఏ కేసులు, నలుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. అగ్రి టెస్టింగ్ ల్యాబ్్సలో పరీక్షించి, సర్టిఫై చేసిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తోంది. ఇలా 2022–23లో 108.44 క్వింటాళ్లు, 2023–24లో 18 క్వింటాళ్ల సర్టిఫైడ్ పత్తి విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా సరఫరా చేసింది. ఆరోపణ: తెగుళ్లు, చీడపీడల నియంత్రణ చర్యలేవీ? వాస్తవం: గులాబీ రంగు పురుగు ఉ«ధృతికి అడ్డుకట్ట వేసేందుకు శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించింది. 6,820 హెక్టార్లలో 682 క్షేత్ర స్థాయి ప్రదర్శనలు నిర్వహించి, గులాబీ పురుగు నివారణకు అవసరమైన వనరులను 50 శాతం సబ్సిడీపై ఇచ్చింది. ఫలితంగా 2023–24 సీజన్లో ఈ పురుగు ఉధృతి గణనీయంగా తగ్గింది. నాణ్యమైన దిగుబడులు లక్ష్యంగా 3,895 పొలంబడుల ద్వారా 1.17లక్షల మంది రైతులకు శిక్షణనిచ్చింది. ఇలా అడుగడుగునా పత్తి రైతుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తుంటే వాస్తవాలకు ముసుగేసి విష ప్రచారం చేయడం ఈనాడుకు తగదని రైతులు హితవు పలుకుతున్నారు. ఆరోపణ: ప్రభుత్వ ప్రోత్సాహమేది? వాస్తవం: ప్రభుత్వ ప్రోత్సాహం లేదనడమే అసంబద్ధం. వైఎస్ జగన్ ప్రభుత్వం అడగడుగునా రైతులకు అండగా ఉంది. అన్ని రకాలుగా ప్రోత్సాహాన్నిస్తోంది. రైతులపై పైసా భారం పడకుండా పత్తి పంటకు పంటల బీమా వర్తింపజేసింది. గత 4.5 ఏళ్లలో 8,33,989 మందికి రూ.1,045.40 కోట్ల బీమా పరిహారం చెల్లించింది. వాతావరణ ఆధారిత పథకం కింద అన్ని జిల్లాల్లో ఒకే రీతిలో బీమా వర్తింపజేస్తోంది. ఈ 4.5 ఏళ్లలో వైపరీత్యాల వల్ల నష్టపోయిన 1.28 లక్షల మందికి రూ.123.56 కోట్లు పంట నష్ట పరిహారం(ఇన్పుట్ సబ్సిడీ) అందించింది. ఖరీఫ్–2023లో వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన 2.23 లక్షల మందికి రూ.337.17 కోట్లు, మిచాంగ్ తుపాన్ వల్ల దెబ్బతిన్న 2,513 మంది రైతులకు రూ.2.32కోట్ల ఇన్పుట్ సబ్సిడీని త్వరలో జమ చేయనుంది. చంద్రబాబు హయాంలో ఒక్క రైతుకు కూడా బీమా పరిహారం ఇవ్వలేదు. -
పంటకు ఢోకాలేని వ్యవసాయ పద్ధతి మీకు తెలుసా?
పత్తి అయినా, మరో పంటైనా.. వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా పంటకు ఢోకాలేని వ్యవసాయ పద్ధతి మీకు తెలుసా? వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా, వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజుల వ్యవధి వచ్చినా.. పత్తి, కూరగాయలు, సోయా, వేరుశనగ.. పంట ఏదైనా సరే.. నల్ల రేగడైనా, ఎర్ర నేలైనా, బంక మట్టి అయినా సరే.. ఎత్తు మడులు(రెయిజ్డ్ బెడ్స్) చేసి లేదా బోదెలు తోలి పంటలు విత్తుకోవటం మంచిదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆదిలాబాద్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త డా. ప్రవీణ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా ఎత్తుమడులపై పత్తిని సాగు చేయటంపై ప్రయోగాలు చేస్తూ చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు. దుక్కి చేసిన పొలంలో ట్రాక్టర్ ద్వారా ఇలా ఎత్తు మడులు/బోదెలు తోలుకోవాలి దుక్కి దున్ని, ట్రాక్టర్కు అమర్చిన బెడ్ మేకర్ ద్వారా బోదెలు తోలాలి. తగుమాత్రంగా వర్షం పడిన తర్వాత ఆ బెడ్పై ఒకే వరుసలో విత్తుకోవాలి. చదునుగా ఉండే పొలంలో సాగు చేసిన పత్తి పంట కంటే బోదెలు తోలి సాగు చేసిన పత్తి పంట మంచి దిగుబడినిచ్చింది. వర్షం పడిన తర్వాత ఒక వరుసలో పత్తి విత్తనం వేసుకోవాలి వర్షాలకు అధిక నీరు పొలంలో నిల్వ ఉండకుండా బయటకు వెళ్లిపోవటం వల్ల పత్తి పంట ఉరకెత్త లేదు. గాలి, వెలుతురు మొక్కల మొదళ్లకు బాగా తగలటం వల్ల, ఎత్తు మడిలో మట్టి గుల్లగా ఉండటంతో వేరు వ్యవస్థ బాగా విస్తరించటం వల్ల పంట ఆరోగ్యంగా ఎదిగింది. ఎత్తు మడులపై ఆరోగ్యంగా పెరుగుతున్న పత్తి పైరు ఫ్లాట్ బెడ్పై విత్తనాలు నాటిన దానితో పోల్చితే అధిక పత్తి దిగుబడులు రావటానికి ఎత్తు మడుల పద్ధతి బాగు ఉపయోగపడిందని డా. ప్రవీణ్ కుమార్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఒక వేళ వర్షాలు తక్కువ పడితే, వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజులు గ్యాప్ వచ్చినా కూడా ఎత్తుమడిపై ఉన్న పంట వేరు వ్యవస్థలో తేమ త్వరగా ఆరిపోదు. అందువల్ల బెట్టను తట్టుకునే శక్తి కూడా బోదెలపై నాటిన పంటకు చేకూరుతుంది. ఎత్తు మడులు / బోదెలపై పత్తి పంటను విత్తుకోవటం గురించి తాజా వీడియోను ‘కేవీకే ఆదిలాబాద్’ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. రైతులు ఆ వీడియోను చూసి అవగాహన పెంచుకోవచ్చు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: జీవన ఎరువుల ప్రయోగశాల) -
Telangana: రైతులకు వి‘పత్తి’!
సాక్షి, వరంగల్/ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా చాలామంది రైతుల ఇళ్లు ఇరుగ్గా మారిపోయాయి.. ఇంటి ఆవరణలు, పశువుల కొట్టాల్లో కూడా జాగా లేకుండా పోయింది.. ఉన్నట్టుండి ఇలా అయిపోవడానికి కారణం ‘పత్తి’ తెచ్చిన తంటాలే. అసలే అడ్డగోలు పెట్టుబడులు, పైగా తగ్గిన దిగుబడితో ఆందోళనలో ఉన్న రైతులకు పత్తి ధరలు తగ్గిపోవడం అశనిపాతంగా మారింది. తక్కువ ధరకు అమ్ముకుని అప్పులు మిగుల్చుకోలేక.. ఎక్కువ ధర ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ.. పత్తిని ఇళ్ల వద్ద, కొట్టాల్లో నిల్వ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ సమయానికల్లా వానాకాలం పత్తి అమ్మేసుకుని, యాసంగి పంటపై దృష్టిపెట్టే రైతులు.. ఈసారి ఇంకా పంటను విక్రయించకుండా ఎదురుచూస్తున్నారు. దీనితో కాటన్, జిన్నింగ్ మిల్లులు బోసిపోయి కనిపిస్తున్నాయి. అమ్మింది 3.17 లక్షల టన్నులే.. మార్కెట్లో గత ఏడాది పత్తికి గరిష్టంగా క్వింటాల్కు రూ.13 వేలకుపైగా ధర పలికింది. ఈ క్రమంలో వరిసాగు తగ్గించి, పత్తి పెంచాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. అయితే సీజన్ ప్రారంభంలో భారీ వర్షాలు పడటంతో పలుచోట్ల మొదట వేసిన పత్తి విత్తనాలు కుళ్లిపోయాయి. దాంతో రైతులు మళ్లీ విత్తనాలు వేశారు. మరోవైపు అధిక వర్షాలు కొనసాగడంతో పత్తి దిగుబడి కూడా తగ్గింది. ఎకరాకు 10 క్వింటాళ్లకుపైగా దిగుబడి రావాల్సి ఉన్నా.. ఐదారు క్వింటాళ్లే వచి్చందని రైతులు చెప్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా.. 26 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో జనవరి మూడో తేదీ నాటికి మార్కెట్కు కేవలం 3.17 లక్షల టన్నులే వచి్చందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు చెప్తున్నారు. మిగతా పత్తినంతా రైతులు నిల్వ చేసుకున్నట్టు వివరిస్తున్నారు. బోసిపోయిన మిల్లులు రాష్ట్రవ్యాప్తంగా 350 మిల్లుల్లో రోజూ పత్తిని జిన్నింగ్ చేయాలంటే.. కనీసం 4 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్లకు రావాలి. ప్రస్తుతం అందులో సగం కూడా రావడం లేదని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు చెప్తున్నాయి. దీనితో మార్కెట్ యార్డులు, కాటన్, జిన్నింగ్ మిల్లులు వెలవెలబోయి కనిపిస్తున్నాయి. తగ్గిన ధర.. మళ్లీ పెరుగుతుందనే ఆశలు గత ఏడాది పత్తి ధర రూ.13 వేలు కూడా దాటింది. 6 నెలల కిందటి వరకు కూడా క్వింటాల్కు రూ.10 వేలు పైన పలికినా.. తర్వాత తగ్గిపోయింది. ప్రస్తు తం రకాన్ని బట్టి క్వింటాల్ రూ.6,200 నుంచి రూ.8,300 మధ్య కొనుగోలు చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో కొన్నిచోట్ల వ్యాపారులు రూ.6 వేల వరకే చెల్లించారు. దీనితో ఆందోళనలో పడ్డ రైతులు భవిష్యత్తులో మంచి ధర వస్తుందన్న ఆశ తో నిల్వ చేసుకున్నారు. ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో మాత్రం కొంతమేర పత్తి మార్కెట్కు వస్తోంది. గత శుక్రవారం వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పత్తి ధర గరిష్టంగా క్వింటాల్కు రూ.8,170గా నమోదైంది. ఆదిలాబాద్ మార్కెట్లో రూ.8,150, ఖమ్మం, జమ్మికుంట మార్కెట్లలో రూ.8,300 పలికింది. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత క్వింటాల్కు ధర రూ.10 వేలు దాటుందని రైతులు ఆశిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఒక క్యాండీ (గింజలు తీసిన 3.56 క్వింటాళ్ల పత్తి) ధర రికవరీ అవుతోంది. గతేడాది జూన్, జూలై వరకు రూ.1,10,000గా ఉన్న క్యాండీ ధర తర్వాత రూ.52 వేలకు పడిపోయింది. ప్రస్తుతం రూ.62 వేలు దాటింది. త్వరలో ఇది రూ.90 వేలకు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పత్తి గింజల ధర కూడా పెరుగుతోందని.. ఈ లెక్కన పత్తి ధర పెరుగుతుందని అంటున్నాయి. కౌలుకు తీసుకుని సాగు చేసి.. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన తుమ్మ రాజారెడ్డి తన పదెకరాలతోపాటు మరో పదెకరాలను కౌలు తీసుకొని పత్తిసాగు చేశాడు. రూ.15 లక్షల వరకు పెట్టుబడి అయింది. ఇప్పటికే కూలీలను పెట్టి 120 క్వింటాళ్ల పత్తి ఏరారు. కానీ గిట్టుబాటు ధర రాక విక్రయించకుండా నిల్వ చేశారు. చేనులో ఇంకా పత్తి ఉన్నా చేతిలో డబ్బుల్లేక అలాగే వదిలేశాడు. ఇంటి బయట ఎండా వానకు.. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన బీడ చిన్న లచ్చయ్య ఎనిమిది ఎకరాల్లో పత్తి వేశాడు. మార్కెట్లో ధర లేదని పత్తిని ఇలా ఇంటి బయట, వరండాలో ప్లాస్టిక్ కవర్లు కప్పి నిల్వ చేశాడు. ఎప్పుడు ధర పెరుగుతుందో, ఎప్పుడు అమ్ముతానో అని ఆవేదన చెందుతున్నాడు. సంగారెడ్డి జిల్లా జరాసంఘం మండలం బొప్పన్పల్లికి చెందిన రైతు రాములు ఇంట్లో పరిస్థితి ఇది. దిగుబడి వచి్చన పత్తిని అమ్ముకుందామంటే సరైన ధర రాక ఇంట్లోనే నిల్వచేసుకున్నాడు. ఉన్న రెండు గదుల్లోనూ పత్తి నిండిపోవడంతో.. దానికి ఓ పక్కన స్టవ్ పెట్టుకుని వంట చేసుకుంటున్నారు. ఆ కొంత స్థలంలోనే కుటుంబమంతా నిద్రపోతున్నారు. -
'ఆ పురుగు మనిషిని తాకితే 5 నిమిషాల్లో చనిపోతారు'.. శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..
అనంతపురం అగ్రికల్చర్: రెండు మూడు రోజులుగా వాట్రాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఫొటోలు, సందేశాలు నిరాధారమైనవని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి, రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.మల్లీశ్వరి తెలిపారు. “పత్తి పంటలో ఒక పురుగు ఉంది. ఆ పురుగు మనిషిని తాకితే 5 నిమిషాల్లో చనిపోతున్నారు... జాగ్రత్తగా ఉండండి’ అంటూ అందరూ ఆందోళనకు గురయ్యేలా పురుగు ఫొటోలు, చనిపోయిన మనుషుల ఫొటోలు, ఆడియో సందేశాలు పంపిస్తున్నారని తెలిపారు. ఇవన్నీ పూర్తీగా అవాస్తవమని పేర్కొన్నారు. అలాంటి పురుగు పత్తి పంటకు అసలు ఆశించదని, అది ఎక్కువగా చెరకు, పండ్ల తోటల్లో కనిపిస్తుందన్నారు. లద్దె పురుగు ఆకారంలో శరీరంపై వెంట్రుకలు కలిగి ఉంటుందన్నారు. వెంట్రుకల చివరి భాగంలో స్వల్ప విషపూరిత పదార్థం ఉంటుందన్నారు. ఒకవేళ ఆ పురుగు మనిషి శరీరాన్ని తాకినా కేవలం తగిలిన చోట దురద , లేదంటే చిన్నగా వాపు వస్తుందని, ఒకట్రెండు రోజుల్లో తగ్గిపోతుందని స్పష్టం చేశారు. రైతులు, ప్రజలు ఆ విషయాన్ని గమనించాలని సూచించారు. చదవండి: (AP: విద్యాశాఖలో మరో కీలక సంస్కరణ) -
పత్తి ధర ఆల్టైమ్ రికార్డ్: 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
సాక్షి, వరంగల్ రూరల్, స్టేషన్ఘన్పూర్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా మంగళవారం క్వింటా పత్తి ధర రూ.14 వేలు పలికింది. మార్కెట్కు ఒకే రోజు 1,500 బస్తాలు, 750 క్వింటాళ్ల పత్తి వచ్చింది. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన రైతు యాట ప్రభాకర్ 20 బస్తాల పత్తిని విక్రయానికి తీసుకురాగా.. రూ.14 వేలు పలికి ఆల్టైం రికార్డుగా నమోదైంది. పత్తి క్వింటాల్కు రూ.14 వేలు ఇస్తామని చెప్పడంతో షాక్కు గురైనట్లు, ఈధరతో ఎంతో సంతోషంగా ఉన్నానని రైతు హర్షం వ్యక్తం చేశాడు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్లో మంగళవారం క్వింటా పత్తి ధర రూ.13,500 పలికింది. కనిష్టంగా రూ.10,500 ధర పలికింది. జఫర్గఢ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతు 4 క్వింటాళ్ల పత్తి మార్కెట్కు తీసుకురాగా.. రికార్డు స్థాయిలో ధర పలకడంతో ఆనందం వ్యక్తం చేశాడు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి బివి రాహుల్ మాట్లాడుతూ.. పత్తి పంట సీజన్ అక్టోబర్లో ప్రారంభమై మే నెలలో కొనుగోళ్లకు చివరి నెల అని తెలిపారు.. అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ కారణంగా పత్తి ధర రికార్డు స్థాయికి చేరుకుందని అన్నారు. గోడౌన్లలో పత్తి నిల్వలు ఉంచిన రైతులు అధిక డిమాండ్ను ఉపయోగించుకుని తమ పంటను విక్రయించాలని సూచించారు. -
ఎత్తు మడులపై పత్తి అంతరపంటగా కంది!
పత్తి సాగులో సమస్యలను అధిగమించడానికి బెడ్స్ (ఎత్తు మడులు) పద్ధతిని అనుసరించడం మేలని నిపుణులు చెబుతున్నారు. ట్రాక్టర్తో బెడ్స్ ఏర్పాటు చేసుకొని ఒక సాలు పత్తి, పక్కనే మరో సాలు కందిని మనుషులతో విత్తుకోవటం మేలని సూచిస్తున్నారు. వర్షం ఎక్కువైనా, తక్కువైనా.. కండగల నల్లరేగడి నేలలైనా, తేలికపాటి ఎర్రనేలలైనా.. బెడ్స్పై పత్తిలో కందిని అంతర పంటగా విత్తుకోవటం రైతులకు ఎన్నో విధాలుగా ఉపయోగకరమని చెబుతున్నారు. పత్తి పంటను ఎత్తుమడుల (బెడ్స్)పై విత్తుకోవటమే మేలని, అందులో కందిని అంతర పంటగా 1:1 నిష్పత్తిలో వేకోవటం వల్ల రైతులకు అనేక ప్రయోజనాలున్నాయని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా. ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రయోగాత్మక సాగులో తొలి అనుభవాలు తెలియజేస్తున్నాయి. బెడ్స్పై పత్తి, కంది మిశ్రమ సాగుపై రెండేళ్లుగా అనేక విధాలుగా ప్రయోగాలు చేస్తున్న డా. ప్రవీణ్ మూడేళ్ల తర్వాత పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని అన్నారు. అయితే, ఇప్పటికి గ్రహించిన దాన్ని బట్టి పత్తిలో కంది పంటను బెడ్స్పై 1:1 నిష్పత్తిలో విత్తుకోవటం మేలని భావిస్తున్నారు. కందిని 1:1 నిష్పత్తిలోనే విత్తుకోవాలనేం లేదని, 4:1 నిష్పత్తిలో (4 సాళ్లు పత్తి, 1 సాలు కంది) కూడా విత్తుకోవచ్చని ఆయన సూచిస్తున్నారు. కండగల నల్లరేగడి నేలల్లో అయినా, తేలికపాటి ఎర్ర నేలల్లో అయినా బెడ్స్ పద్ధతిలో పత్తిలో కందిని అంతరపంటగా విత్తుకుంటే వర్షం ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు. గత ఏడాది నల్ల రేగడి నేలలో బెడ్స్పై పత్తిలో కంది పంటను 1:1 నిష్పత్తిలో విత్తి మంచి ఫలితాలు సాధించారు. బెడ్ వెడల్పు అడుగు. రెండు బెడ్స్ మధ్య దూరం 5 అడుగులు. ట్రాక్టర్ సహాయంతో బెడ్స్ ఏర్పాటు చేయించారు. మొక్కల మధ్య అడుగు దూరం పాటించారు. మనుషులతో బెడ్స్పై విత్తనం నాటించారు. గత ఏడాది సాధారణం కన్నా అధిక వర్షాలు కురిసినప్పటికీ.. బెడ్స్ పద్ధతి వల్ల పొలంలో నీరు నిలబడలేదు. దీని వల్ల పంట పెరుగుదలకు ఎటువంటి ఆటంకం కలగలేదు. బెడ్స్పై సాగు వల్ల ఉపయోగాలేమిటి? బెడ్స్ మీద విత్తిన విత్తనం సాధారణ పొలంలో కన్నా ఒకటి, రెండు రోజులు ముందే మొలిచింది. అంతేకాదు, 90% వరకు మొలక వచ్చింది. వర్షపు నీరు ఒక్క రోజు కూడా పొలంలో నిలవకుండా కాలువల ద్వారా బయటకు వెళ్లిపోయింది. దీని వల్ల తొలి దశలో మొక్క పెరుగుదల ఒక్క రోజు కూడా కుంటుపడలేదు. బెడ్స్ లేకపోతే ఎక్కువ వర్షం పడినప్పుడు ఉరకెత్తే సమస్య ముఖ్యంగా నల్లరేగడి పొలాల్లో సాధారణం. బెడ్స్ వల్ల ఈ సమస్య లేకుండా పోయింది. అంతేకాదు, కాయకుళ్లు సమస్య కూడా తీరిపోయిందని డా. ప్రవీణ్కుమార్ తెలిపారు. బెడ్స్ లేకుండా సాగు చేసే పొలాల్లో పత్తి మొక్కలకు కింది కొమ్మలకు మొదట్లో వచ్చే 5–10 కాయలు కుళ్లిపోతూ ఉంటాయి. బెడ్స్ మీద వేయటం వల్ల గాలి, వెలుతురు బాగా తగిలి, తేమ తగుమాత్రంగా ఉండటం వల్ల కాయ కుళ్లు లేదన్నారు. పత్తి, కంది.. 11 క్వింటాళ్ల దిగుబడి బెడ్స్ పద్ధతిలో విత్తిన పొలాల్లో కూడా గులాబీ రంగు పురుగు ఉధృతి మామూలుగానే ఉంది. గులాబీ పురుగు ఉధృతి ఎక్కువయ్యే కాలానికి, అంటే నవంబర్ ఆఖరు నాటికే పత్తి మొక్కలను తీసేశాం. అయినా ఎకరానికి 5.5 క్వింటాళ్ల మేరకు పత్తి దిగుబడి వచ్చిందని డా. ప్రవీణ్కుమార్ అన్నారు. గులాబీ పురుగును సమర్థవంతంగా అదుపు చేయగలిగితే మరో 3–4 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదన్నారు. నవంబర్ ఆఖరులో పత్తి తీసేసినా.. కంది పంట జనవరి వరకు ఉంచారు. ఎకరానికి 5.5 క్వింటాళ్ల కందుల దిగుబడి కూడా వచ్చింది. అంటే, ఒక ఎకరంలో రెండు పంటలూ కలిపి 11 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఒకవేళ పత్తి పంట ఏ కారణంగానైనా దెబ్బతింటే.. కంది పంటయినా రైతును ఆదుకుంటుందని.. అందుకని పత్తితో పాటు కందిని కూడా వేసుకోవటం మేలని డా. ప్రవీణ్ కుమార్ రైతులకు సూచిస్తున్నారు. బెడ్స్పై కాకుండా మామూలుగా నల్లరేడగడి పొలంలో పత్తి మాత్రమే విత్తుకున్న రైతులు కూడా చాలా మంది ఐదారు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి తీయగలిగారన్నారు. అధిక వర్షాల వల్ల పంట పెరుగుదల లోపించటం, గులాబీ పురుగు ఉధృతిని అదుపు చేయలేకపోవటం వల్ల దిగుబడి తగ్గిందన్నారు. తేలికపాటి ఎర్ర నేలల్లో అయినా పత్తితోపాటు కందిని బెడ్స్పై విత్తుకుంటే వర్షం ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బంది ఉండదన్నారు. తేమ త్వరగా ఆరిపోకుండా ఉండటానికి బెడ్స్ ఉపయోగపడతాయన్నారు. ఈ ఏడాది కూడా సాధారణం కన్నా అధికంగానే వర్షాలు పడతాయని భావిస్తున్న నేపథ్యంలో బెడ్స్ పద్ధతిని రైతులు అనుసరించడం మేలు. బెడ్స్ పద్ధతిలో సాగుపై ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం యూట్యూబ్ చానల్ ఓఠిజు అఛీజీ ్చb్చఛీ లో వీడియోలు ఉన్నాయి. ఆసక్తి గల రైతులు చూడవచ్చు. ఆ తర్వాత కూడా సందేహాలుంటే డా. ప్రవీణ్ కుమార్ (99896 23829)ను సంప్రదించవచ్చు. -
పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపించిన వర్షాలు
-
పంటలకు వరద పోటు..
సాక్షి, నెట్వర్క్: భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. ప్రధానంగా పత్తి పంట దెబ్బ తినగా, నాట్లు వేసిన వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. కొన్ని చోట్ల నీటి ప్రవాహానికి మొక్కలు కొట్టుకుపోయాయి. మంచిర్యాల జిల్లాలో ఏటా ప్రాణహిత తీరంలో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుండగా.. గత రెండు రోజులుగా కురిసిన వానలతో వేలాది ఎకరాల్లో భారీగా వరద నీరు చేరింది. పత్తి చేనుల్లో నీటి చేరికతో పాటు ఇసుక మేటలు వేయడంతో పత్తి మొలక, ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా వరి నాట్లు వేస్తుండగా, ఈ వర్షాలతో నారు ఎదగకుండా దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 6,864 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 5, 099 ఎకరాల్లో పత్తి, 1,447 ఎకరాల్లో వరి, 312 ఎకరాల్లో మిరప, 6 ఎకరాల్లో కంది నీట మునిగింది. పత్తికే ఎక్కువ నష్టం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వానాకాలం సీజన్లో సుమారు 6 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా వేయగా, ఇప్పటివరకు సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. అలాగే సుమారు లక్ష న్నర ఎకరాల్లో పత్తి పంట వేశారు. భారీ వర్షాలతో చాలాచోట్ల ఇప్పటికే వేసిన వరి నాట్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల వర్షపు నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం తో పొలాలు మునిగిపోయాయి. పల్లపు ప్రాంతాల్లో పంటల మునక ఖమ్మం జిల్లాలో పత్తి సాధారణ విస్తీర్ణం 2,70,000 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు 1,82,068 ఎకరాల్లో పంట వేశారు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 2,52,500 ఎకరాలు కాగా.. ఇప్పటికి 49,233 ఎకరాల్లో నాట్లు వేశారు. జిల్లాలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో పల్లపు ప్రాంతాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 2.86 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. అలాగే పత్తి 2,363 ఎకరాల్లో సాగైంది. -
రైతుల కోసం 'క్రాప్ దర్పణ్'!
హైదరాబాద్: పంటలకు సంబంధించి రైతుల సమస్యలు తీర్చేందుకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రత్యేక యాప్ రూపొందించింది. పత్తి పంటకు సోకే వ్యాధుల నిర్ధారణలో రైతులకు సాయం చేసేందుకు 'క్రాప్ దర్పణ్' పేరిట యాప్ తయారు చేశారు. భారత్-జపాన్ జాయింట్ రీసెర్చ్ లేబొరేటరీ ప్రాజెక్టు కింద దీన్ని రూపొందించారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐటీ హైదరాబాద్, బాంబే ఐఐటీ సహకారంతో ట్రిపుల్ ఐటీ ఈ యాప్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది.(చదవండి: కాళేశ్వరంలో పడవ ప్రయాణం) తొలుత పత్తి పంటపై మాత్రమే రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. తదుపరి దశల్లో ఇతర పంటలపై కూడా దృష్టి పేట్టి యాప్ల రూపకల్పన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్ ప్రొఫెసర్ పి.కృష్ణారెడ్డి పర్యవేక్షణలో అరవింద గాడమశెట్టి, రేవంత్ పర్వతనేని, సాయిదీప్ చెన్నుపాటి, శ్రీనివాస్ అన్నపల్లి కలసి ఈ యాప్ రూపొందించారు. గతంలో కూడా వ్యవసాయ సలహా వ్యవస్థను, గ్రామ స్థాయిలో ఈ-సాగును ట్రిపుల్ ఐటీ అభివృద్ధి చేసింది. చీడపీడలపై రైతులకు అవగాహన పత్తి పంట పెరుగుదలను ప్రభావితం చేసే సమస్యలు, తెగుళ్లు, బ్యాక్టీరియా, శిలీంద్ర వ్యాధులు, పోషక లోపాలకు సంబందించిన అంశాలు ఈ యాప్లో పాందుపర్పారు. చీడపీడలపై రైతులపై మార్గనిర్దేశం చేయడమే కాకుండా అవగాహన కల్పిస్తుంది. https://www.cropdarpan.in/cropdarpan/ పోర్టల్లో లింకు ద్వారా ఈ యాప్ను స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం పత్తి పంటపై మాత్రమే తెలుగు, ఇంగ్లిష్ భాషలలో రూపొందించారు. త్వరలో హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యాప్లోని ప్రశ్నలను ఎంపిక చేసుకుంటే వాటికి సమాధానాలు, తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. విత్తనాలు ఎప్పుడు వేయాలో, పోషకాలు ఎలా అందించాలో ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. -
బుల్లెట్పై వెళ్లి పత్తి ఏరిన కలెక్టర్..
భూపాలపల్లి రూరల్ : పల్లె ప్రగతి పనుల చివరి రోజు సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదివారం పలు గ్రామాలను సందర్శించారు. ఆముదాలపల్లికి బుల్లెట్ వాహనంపై వెళ్లారు. మార్గమధ్యలో పత్తి చేలల్లో కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూలీలతో కలసి పత్తి ఏరుతూ వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి పత్తి ఏరుతున్న ఇంటర్ విద్యార్థిని ఝాన్సీతో కాసేపు మాట్లాడారు. వ్యవసాయ పనుల్లో కుటుంబానికి ఆసరాగా నిలిచిన ఝాన్సీని అభినందించిన కలెక్టర్, బాగా చదువుకోవాలని అన్నారు. -
పత్తి రైతులకు పొంచి ఉన్న విపత్తు
భూమిలో విత్తనాలు నాటిన నాటినుండి మొదలైన రైతు కష్టాలు పంటచేతికి వచ్చి మార్కెట్లో పంటలను అమ్ముకునేవరకు నిత్యకృత్యంగా మారాయి. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోతుంటే పాలకులు, అధికారులు మాత్రం ‘‘నిమ్మకు నీరెత్తనట్లుగా’’ వ్యవహరిస్తున్నారు. పత్తివిత్తనాల్లో కల్తీ, వాటి ధరలను పెంచుకుపోతున్న దోపిడీకి పాలకులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పత్తిరైతులకు నష్టాలు విత్తనాల విక్రయంలో అధిక ధరలు నకిలీల బెడద నుండి మొదలై మార్కెట్లో మద్దతు ధర ఇచ్చే వరకు అన్ని స్థాయిల్లోనూ దోపిడీకి గురవుతున్నారు. చరిత్రలోనే అత్యధికంగా తెలంగాణలో 46.92 లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగు చేశారు. ఈ పంటకు మద్దతు ధర ఇప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అన్నదాతలకు చేరడం లేదు. ఈ ఏడాది పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ. 5,550గా కేంద్రం నిర్ణయించింది. కొత్త పత్తిపంటను రైతులు మార్కెట్టుకు తేవడం మొదలైంది. తీరా తొలిపంట ఉత్పత్తికి మార్కెట్లో మద్దతు ధరను వ్యాపారులు చెల్లించిన దాఖలాలు లేవు. ఇప్పుడిప్పుడే వస్తున్న కొత్తపత్తికి మద్దతు ధర లేకపోవడాన్ని బట్టిచూస్తే పంటల దిగుబడి పూర్తిస్థాయిలోకి వచ్చాక రైతులకు మద్దతు ధర లభించడం ఎండమావుల్లో నీటిని వెతుక్కున్నట్లే అనిపిస్తుంది. మార్కెట్లో కనిష్టంగా క్వింటాలుకు రూ. 4,221 నుంచి గరిష్టంగా రూ. 5,211 వరకు అతికష్టంమీద చెల్లిస్తున్నారు. దూదిలో తేమ సాకుతో ధరను వ్యాపారులు బాగా తగ్గిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం తరపున ‘భారత పత్తి సంస్థ’ (సీసీఐ) మద్దతు ధరకు పత్తిని కొంటుంది. అలాకొనే కేంద్రాలను 340 వరకు ఏర్పాటు చేయాలని కోరింది. అందులో వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేసినవి 34 మాత్రమే సుమా ! మిగిలిన 306 కేంద్రాలను జిన్నింగ్ మిల్లులో పెట్టాలని నిర్ణయించారు. మిల్లు యాజమాన్యాలు మద్దతు ధర ఇస్తారనేది అందని ద్రాక్షేనని రైతులు భావిస్తున్నారు. కొత్తపత్తికే మద్దతు ధర అందడం లేదు. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా మార్కెట్లకు పత్తిపంట వస్తే, పత్తిపంట అంతటికి మద్దతు ధర ఇస్తారనడం రైతులు నమ్మలేకపోతున్నారు. ప్రభుత్వం ప్రతిరైతుకు మద్దతు ధర చెల్లించి పత్తి కొనుగోలు చేసేలా వెంటనే జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఇలా వుంటే ? అందరికీ మద్దతు ధర ఇచ్చినా క్వింటాలుకు రైతు పెట్టిన వ్యయాన్ని ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 9,502. కేంద్రం ఇస్తున్న మద్దతు ధర రూ. 5,550. ఈ లెక్కన చూసినా క్వింటాలుకు రూ. 4,000 నష్టాన్ని రైతులు పెట్టుబడిలోనే భరిస్తున్నారు. ఇలా ఇట్టి వ్యయాన్ని లెక్కించినపుడు నష్టాల బారిన రైతాంగం పడక తప్పదు. రైతులు పండించే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరను కల్పించాల్సి ఉంది. రాయితీలు మాత్రమే కాదు? మార్కెట్ల మాయాజాలం, కల్తీ విత్తనాలు, పురుగు మందులు ఇలా అన్ని స్థాయిల్లో దోపిడీని నివారించినప్పుడే రైతులు వ్యవసాయం చేయగలుగుతారు. ఈ సంవత్సరం భారీగా పత్తి ఉత్పత్తి రాబోతున్న వేళ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకోకపోతే చాలా విపత్కర పరిస్థితికి కారకులవుతారని గమనించండి. రైతుల పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు పెట్టుబడికి కనీసం 150 శాతం వచ్చేలా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించాలి. ఆ ధరకు మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేయని ఎడల ఎలాంటి షరతులు పెట్టకుండా రైతుల వద్ద నుండి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి. రైతు పెట్టుబడికి మద్దతు ధరకు మధ్య క్వింటాలుకు రూ. 4,000 వరకు నష్టపోతున్నందువల్లనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అన్ని ఉత్పత్తులకు అండగా ఉంటున్న పాలకులు రైతు ఉత్పత్తులకు ఎందుకు అండగా ఉండరు? రైతుకు భిక్షం వేసినట్టు కేంద్రం మద్దతు ధర రూ. 100, రూ. 200 పెంచుతూ పోవడం భావ్యం కాదు. మట్టిని నమ్ముకున్న రైతు నోట మట్టికొట్టే విధానాలు మారనంత కాలం రైతు కుటుంబాల్లో వెలుగులు రావు. పత్తి రైతుల మద్దతు ధరకు ఉత్పత్తి వ్యయానికి మధ్య అగాధాన్ని పూడ్చాలి. వ్యవసాయాన్ని లాభాలబాట పట్టించాలి. రైతు ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులదే. మేకిరి దామోదర్ వ్యాసకర్త రచయిత, ఉపాధ్యాయుడు మొబైల్ : 95736 66650 -
పత్తి ఏరుతుండగా పిడుగుపడటంతో..
సాక్షి, మరిపెడ రూరల్ : పొలంలో పత్తి ఏరుతుండగా ఒక్కసారిగా పడిన పిడుగు తండ్రీ కొడుకుల ప్రాణాలను బలితీసుకుంది. మరొకరు ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల శివారు వాల్యాతండా గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన తేజావత్ కిషన్ (48), భార్య తారతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో పత్తి ఏరడానికి వెళ్లారు. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ పత్తి ఏరుతుండగా కొడుకు తేజావత్ సంతోష్ (14) మధ్యాహ్న భోజనం తీసుకెళ్లాడు.భోజన విరామం అనంతరం అమ్మానాన్నలతో కలిసి తాను సైతం పత్తి ఏరుతుండగా.. ఆ సమయంలో ఉరుములు మెరుపులతో వాన మొదలైంది. అంతలోనే వారికి అతి సమీపంలో పిడుగు పడటంతో తండ్రీ కొడుకులు కిషన్, సంతోష్ అక్కడికక్కడే మృతి చెందగా.. తార స్వల్ప గాయాలతో బయటపడ్డారు. -
గద్వాల నుంచి జిల్లాలోకి..
కర్నూలు(అగ్రికల్చర్) : రాష్ట్రంలో పత్తి సాగయ్యే జిల్లాల్లో కర్నూలు ప్రధానమైంది. జిల్లాలో దాదాపు 3 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగవుతుంది. కొద్ది నెలలుగా పత్తి ధరలు ఆశాజనకంగా ఉండటం, జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటంతో పత్తి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్లో గ్రామాలను నకిలీ బీటీ పత్తి విత్తనాలు ముంచెత్తుతున్నాయి. ఈ ఖరీఫ్లో రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్లకు పైగా నకిలీ విత్తన వ్యాపారం ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ వ్యవసాయ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఎమ్మిగనూరు, ఆస్పరి, దేవనకొండ, కర్నూలు, సి.బెళగల్, కోసిగి, మంత్రాలయం, హొళగుంద, హాలహర్వి, పెద్దకడబూరు, గోనెగండ్ల, మద్దికెర, తుగ్గలి, ఓర్వకల్ తదితర మండలాల్లో నకిలీ బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. గద్వాల నుంచి.. బీటీలో నకిలీ విత్తనాలకు కర్నూలు జిల్లా పెట్టింది పేరు. చాలా ఏళ్లుగా ఈ పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సరఫరా అవుతున్నాయి. ఇక ఆశ్చర్యం కల్గించే అంశం ఏమిటంటే.. తెలంగాణలోని గద్వాల జిల్లా నుంచి ఇక్కడికి నకిలీ విత్తనాలు వస్తుండడం. కర్నూలు సబ్ డివిజన్లోని వివిధ మండలాల రైతులు గద్వాల విత్తనాలను కొనుగోలు చేస్తూ నష్టపోతున్నారు. బీటీ నకిలీ పత్తి విత్తనాలను ఏప్రిల్, మే నెలల్లోనే గ్రామాలకు చేర్చినట్లు సమాచారం. గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పరచుకొని అమ్మకాలు సాగిస్తున్నారు. ప్యాకెట్ రూ.500 నుంచి రూ.600 ప్రకారం విక్రయిస్తుండడంతో ఎక్కువ శాతం మంది రైతులు వాటినే కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు గ్రామాల్లో లూజు విత్తనాల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. కంపెనీ విత్తనమైతే ఇలా ఉండాలి... కంపెనీ బీటీ విత్తన ప్యాకెట్లను సులభంగా గుర్తించవచ్చు. ప్యాకెట్పై కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్కు ఫోన్ చేస్తే రింగ్ వస్తుంది. ఒకవేళ రింగ్ కాకపోతే నకిలీ విత్తనంగా అనుమానం పడొచ్చు. అలాగే కంపెనీ పేరు, అడ్రెస్, వెరైటీ తదితర వివరాలన్నీ ఉండాలి. ఇటీవల పట్టుబడిన నకిలీ విత్తనాల ప్యాకెట్లను పరిశీలిస్తే కస్టమర్ కేర్ నెంబర్లు లేవు. బ్రాండెడ్ కంపెనీల పేరుతోనే నకిలీ విత్తనాల ప్యాకెట్లు లభిస్తుండటం గమనార్హం. వీటి విక్రయిస్తున్న వారిని అక్కడక్కడ అరెస్టు చేస్తున్నా.. సూత్రధారులెవరనే విషయాన్ని మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ఈ విషయంపై వ్యవసాయ శాఖ జేడీ ఠాగూర్ నాయక్ను వివరణ కోరగా..నకిలీ విత్తనాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక బృందాల ద్వారా ట్రాన్స్పోర్టు కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లను తనిఖీ చేయించామన్నారు. రైతులు సహకరిస్తేనే నకిలీ విత్తనాల నియంత్రణ సాధ్యమని స్పష్టం చేశారు. -
పత్తి.. పండలే..
ఖమ్మం వ్యవసాయం: పత్తి దిగుబడి జిల్లాలో గణనీయంగా తగ్గిపోయింది. సాగు విస్తీర్ణం ఎక్కువగానే ఉన్నా.. పంట ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. జిల్లావ్యాప్తంగా ఉన్న పంట భూమిలో దాదాపు 40 శాతం పత్తి పంట సాగు చేశారు. వర్షాధారంగా, నీటిపారుదల కింద పండే పంట కావడంతో ఇక్కడి రైతులు పత్తి పంటకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 2017–18లో 5,81,767.5 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణం కాగా.. 5,31,822.5 ఎకరాల్లో వివిధ రకాల పంటలను ఖరీఫ్లో సాగు చేశారు. మొత్తం విస్తీర్ణంలో అధికంగా 2,41,752.5 ఎకరాల్లో రైతులు పత్తి పంట వేశారు. ప్రతి ఏటా దాదాపు ఇంతే విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. సాగు ఆరంభంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. పూత, కాత దశలో వాతావరణ ప్రభావంతో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. జూన్లో కురిసిన వర్షాలకు పంట విస్తారంగా సాగు చేశారు. జూలైలో వర్షం అనుకూలించలేదు. దీంతో పైరు ఆశాజనకంగా లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో పైరుకు గులాబీ రంగు పురుగు ఆశించింది. ఇక ఆగస్టులో సాధారణానికి మించి కురిసిన వర్షాలు పంటను బాగా దెబ్బతీశాయి. వర్షాలకు పూత రాలిపోగా.. కాయ విచ్చుకునే దశలో నీరు లోనకు చేరి పనికి రాకుండా పోయింది. అరకొరగా చేతికొచ్చిన పంట కూడా నాణ్యతగా లేని పరిస్థితి. సెప్టెంబర్ చివరి నుంచి పంట తొలితీతను రైతులు ప్రారంభించారు. అక్టోబర్లో తొలితీత తీసిన తర్వాత రైతుల్లో పంటపై ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. సహజంగా పైరు నుంచి రెండు, మూడో తీతలు ఆశాజనకంగా ఉంటాయి. కానీ.. ఆగస్టు వర్షాలతో అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురయ్యాయి. దిగుబడులు లేకపోవడంతో విక్రయాలు లేక జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో గల యార్డులు వెలవెలబోతున్నాయి. పత్తి పంటకు ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకోవడంతో రైతులు ఆ పంటను తొలగించి.. దాని స్థానంలో మొక్కజొన్న వేశారు. జిల్లాలో పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. సాగు విస్తీర్ణం గణం.. దిగుబడి దారుణం జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా ఉన్నా.. పంట దిగుబడి మాత్రం దారుణంగా పడిపోయింది. దాదాపు 2.41 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. నీటిపారుదల కింద ఎకరాకు 15 క్వింటాళ్లు, వర్షాధారంగా 10 క్వింటాళ్ల మేర దిగుబడులు వస్తాయి. ఈ లెక్కన జిల్లాలో సుమారు 25 లక్షల క్వింటాళ్ల మేర ఉత్పత్తి రావాల్సి ఉండగా.. కేవలం 5.5 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి మాత్రమే వచ్చింది. అంటే దాదాపు ఐదోవంతు పంట మాత్రమే పండింది. ఇంత దారుణమైన దిగుబడి ఇటీవల కాలంలో ఎప్పుడూ లేదని రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు 2.50 క్వింటాళ్లకు మించలే.. ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల కారణంగా పత్తి ఎకరాకు సగటున 2.50 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. తొలితీత ఎకరాకు క్వింటా, రెండో తీతలో క్వింటాన్నరకు మించి దిగుబడి రాలేదు. నీటిపారుదల, వర్షాధారంగా కూడా ఇవే రకమైన దిగుబడులు వచ్చాయి. ముంచిన తెగుళ్లు, వర్షాలు ఈ ఏడాది పంట దిగుబడులు తగ్గేందుకు ప్రధాన కారణం వర్షాలు. దీనికి తోడు తెగుళ్లు. ఆగస్టులో కురిసిన అధిక వర్షాల ప్రభావం పంట దిగుబడులపై తీవ్రంగా ఉంది. ఆగస్టు రెండు, మూడు వారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో గాలి, నేలలో తేమశాతం విపరీతంగా పెరిగి పైరుకు ప్రతికూలంగా మారి.. పైరు పండుబారిపోయింది. తెగుళ్లు కూడా ఆశించాయి. ప్రధానంగా గులాబీ రంగు పురుగు ఆశించి నష్టం కలిగించింది. పల్లపు ప్రాంతంలో వేసిన పంట కనీసం పనికి రాలేదు. ఆ తర్వాత అరకొరగా ఉన్న పంటపై డిసెంబర్లో ‘పెథాయ్’ తుపాను మరోసారి నష్టం కలిగించింది. ఇక అరకొరగా పండిన పంట కూడా వర్షాల వల్ల రంగుమారి నాణ్యత లేకుండా పోయింది. వెలవెలబోయిన మార్కెట్లు జిల్లాలో వ్యవసాయ మార్కెట్లకు విక్రయానికి వచ్చే పత్తి పంట దిగుబడులు లేకపోవడంతో ఆయా మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఖమ్మం, ఏన్కూరు, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు జరుగుతుంటాయి. సీజన్లో ఖమ్మం మార్కెట్లో నిత్యం సగటున 25వేల బస్తాలు విక్రయానికి వస్తుంటాయి. ఈ ఏడాది 5వేల నుంచి 6వేలకు మించి పత్తి బస్తాలు విక్రయానికి రాలేదు. దీంతో వ్యవసాయ మార్కెట్లు కళ తప్పాయి. అంతేకాక మార్కెట్లకు వచ్చే ఆదాయం కూడా తగ్గుతోంది. వ్యాపారులు కూడా పంట విక్రయాలకు రాకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నారు. పత్తి స్థానంలో మొక్కజొన్న ఖరీఫ్లో సాగు చేసిన పత్తిని రైతులు తొలగించి.. నీటి వనరులున్న ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు చేశారు. కొందరు రైతులు పత్తి పంటను వదిలేశారు. పత్తి స్థానంలో వేసిన మొక్కజొన్న పంట కూడా ఆశాజనకంగా లేదు. ఈ పంటకు కత్తెర పురుగు ఆశించింది. దీంతో ఈ పంట కూడా రైతులకు నిరాశ కలిగిస్తోంది. నాలుగెకరాల్లో 8 క్వింటాళ్లు.. నాలుగెకరాల్లో పత్తి పంట సాగు చేశా. తొలితీతలో ఎకరానికి క్వింటా చొప్పున 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రెండో తీతలో 4 క్వింటాళ్లు వచ్చింది. మొత్తం 8 క్వింటాళ్లు వచ్చింది. గత ఏడాది ఎకరాకు 7 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చింది. – బొల్లి కృష్ణయ్య, రైతు, విశ్వనాథపల్లి, సింగరేణి మండలం ఆశించిన దిగుబడి రాలేదు.. ఈ ఏడాది పత్తి కనీస ఉత్పత్తి లేదు. వ్యవసాయ మార్కెట్లకు కనీసంగా కూడా పంట విక్రయానికి రావడం లేదు. నిత్యం సీజన్లో 30వేల నుంచి 40వేల బస్తాల పత్తి విక్రయానికి వచ్చేది. ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కేవలం 10వేల నుంచి 15వేల బస్తాల పత్తి కూడా విక్రయానికి రావడం లేదు. మార్కెటింగ్ శాఖ ఆదాయంపై కూడా ప్రభావం పడింది. – రత్నం సంతోష్కుమార్, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి -
వైద్యం కోసం ఎన్ని పాట్లో..!
నార్నూర్: ఆత్మహత్యకు యత్నించిన భార్యను కాపాడుకునేందుకు ఆమె భర్త చేసిన ప్రయత్నం విఫలమైంది. భుజంపై ఎత్తుకుని వాగు దాటి ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు కాపాడుకోలేకపోయాడు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రీలో సోమవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రాథోడ్ రాము, పుష్ప దంపతులు ఐదెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశారు. ఇటీవల వర్షానికి పత్తి పంట దెబ్బ తినడంతో ఆందోళనకు గురైంది. పంట అంతంత మాత్రంగానే ఉండటంతో చేసిన అప్పులు ఎలా తీర్చా లో తెలియక మనస్తాపం చెందింది. సోమవారం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. పుష్పను ఆమె భర్త గ్రామంలోని ఓ వ్యక్తి సహాయంతో వాగు వరకు 2 కిలోమీటర్ల దూరం బైక్పై తీసుకొచ్చాడు. మండల కేంద్రం నార్నూర్లోని ఆస్పత్రికి తరలించాలంటే గ్రామ సమీపంలోని వాగు దాటాల్సిందే. మోకాళ్లలోతు నీళ్లు ఉండటంతో గత్యంతరం లేక తన భుజంపై ఎత్తుకుని వాగు దాటించాడు. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని నార్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలో తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఉట్నూర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. వైద్యం అందకుండానే మార్గమధ్యంలోనే పుష్ప మృతిచెందింది. -
గులాబీ పురుగును బుట్టలో వేయరా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పత్తి పంటను గులాబీ రంగు పురుగు పట్టి పీడిస్తున్నా వ్యవసాయశాఖ పట్టించుకోవడం లేదు. నియంత్రణ చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. గులాబీ పురుగును గుర్తించి నియంత్రించడానికి లింగాకర్షక బుట్టలను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు లింగాకర్షక బుట్టలను రైతులకు సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో గులాబీ రంగు పురుగు పత్తి చేలలో విజృంభిస్తోంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఈసారి అంచనాలకు మించి 44.30 లక్షల (105%) ఎకరాల్లో సాగైంది. గత నెలలోనే దాడి ప్రారంభం.. గత నెల్లోనే పత్తిపై గులాబీ పురుగు దాడి ప్రారంభమైందని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, నల్లగొండ, నిర్మల్, ఆసిఫాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పెద్ద ఎత్తున పత్తిని పీడిస్తున్నట్లు అంచనా వేశాయి. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ దీని జాడలున్నట్లు గుర్తిం చాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఏడెనిమిది లక్షల ఎకరాల్లో గులాబీ రంగు పురుగు విస్తరించి ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి. అయితే దాన్ని నియంత్రించడంలో మాత్రం నామ మాత్రపు చర్యలకే పరిమితమయ్యాయి. 25 వేల ఎకరాలకే బుట్టలు.. గులాబీ రంగు పురుగును గుర్తించడానికి లింగాకర్షక బుట్టలను వాడాల్సి ఉంటుంది. అయితే వీటిని కేవలం తొమ్మిది జిల్లాల్లో 25 వేల ఎకరాలకే సరఫరా చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. అందుకు ప్రతిపాదనలు సైతం తయారుచేసింది. దాదాపు ఏడెనిమిది లక్షల ఎకరాల వరకు పురుగు సోకిందని అంచనా వేసినా అధికారులు కేవలం 25 వేల ఎకరాలకే లింగాకర్షక బుట్టలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. వాస్తవంగా ఒక్కో ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను వాడాలి. ఆ ప్రకారం 25 వేల ఎకరాలకు 2 లక్షల లింగాకర్షక బుట్టలను మాత్రమే వ్యవసాయశాఖ ఆర్డర్ చేసింది. ఇదిలాఉంటే మరో వైపు గులాబీ పురుగు ఇంతింతై విస్తరిస్తోంది. ఇప్పటికే బుట్టలు అమర్చాల్సి ఉన్నా వ్యవసాయశాఖ ఆర్డర్లకే పరిమితమైంది. అవెప్పుడు అందుబాటులోకి వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. రైతుల్లో ఆందోళన.. కొన్ని చోట్ల గులాబీ పురుగు కారణంగా రైతులు పత్తి మొక్కలను పీకేస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఏడాదికేడాదికి గులాబీ పురుగు ఉధృతి పెరుగుతోంది. వ్యవసాయశాఖ దీన్ని ప్రాధాన్య అంశంగా గుర్తించి గులాబీ పురుగుపై యుద్ధం చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కానీ వ్యవసాయశాఖ ఆ మేరకు ఏర్పాట్లు చేయడం లేదు. గతేడాది గులాబీ పురుగు కారణంగా పెద్ద ఎత్తున దిగుబడులు తగ్గిపోయాయి. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 5–6 క్వింటాళ్ల మేర తగ్గింది. గతేడాది 3.30 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయగా, 2 కోట్ల క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. సాగు ఎంత పెరిగినా గులాబీ పురుగు నుంచి రక్షణ కల్పించకుంటే తమ శ్రమంతా వృథాయేనని రైతులు వాపోతున్నారు. లాభాలు దేవుడెరుగు నష్టాలతో అప్పులే మిగులుతాయని ఆందోళన చెందుతున్నారు. -
‘కత్తెర’ కాటు
సాక్షి, హైదరాబాద్:‘గులాబీ’గుబులు రేపుతోంది. ‘కత్తెర’కాటు వేస్తోంది. పురుగులు చేల వైపు పరుగులు తీస్తున్నాయి. పంటలపై దాడి చేస్తున్నాయి. పత్తిని గులాబీరంగు పురుగు, మొక్కజొన్నను కత్తెర పురుగు పీల్చి పిప్పి చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఆ రెండు పంటల పరిస్థితి దయనీయంగా మారింది. మెదక్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పూత దశలో ఉన్న పత్తి పంటకు గులాబీ పురుగు సోకినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లోనూ దాని ఛాయలు కనిపిస్తున్నాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 42.99 లక్షల(102%) ఎకరాల్లో సాగైంది. అందులో దాదాపు 15 శాతం వరకు గులాబీ రంగు పురుగు సోకినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పలు జిల్లాల్లో మొక్కజొన్న పంటను తీవ్రంగా నష్టపరుస్తున్న కత్తెర పురుగు ఉధృతిని కేంద్రం అత్యవసర పరిస్థితిగా గుర్తించిందని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రానికి చెందిన మొక్కల సంరక్షణ అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇటీవల సిద్దిపేట జిల్లా గజ్వేల్, వర్గల్ మండలాల్లో మొక్కజొన్న చేలను పరిశీలించారు. ఎక్కడ చూసినా కత్తెర పురుగు ధాటికి తీవ్రంగా ధ్వంసమైన పంటలే కనిపించాయి. వాటిలో మొక్కలకు ఆశించిన పురుగులను, వాటి గుడ్లను, లార్వాను పరిశీలించారు. విదేశాల నుంచి వచ్చిన ఈ కత్తెర పురుగు(ఫాల్ ఆర్మీ వామ్)పై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లాల్లో 50 శాతం మేర మొక్కజొన్నకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. దీనిపై కేంద్రానికి ఆ బృందం నివేదిక సమర్పించనుంది. తెలంగాణ మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.40 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 10.88 లక్షల ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలో ఏ స్థాయిలో కత్తెర పురుగు సోకిందోనన్న ఆందోళన రైతులను పట్టి పీడిస్తోంది. ఆసియాలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే ఈ పురుగు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో వరినాట్లు పుంజుకున్నాయి. 17.52 లక్షల (74%) నాట్లు పడినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. 12 జిల్లాల్లో లోటు వర్షపాతమే... రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా ఇప్పటికీ 13 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డు అయింది. విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి శుక్రవారం ఉదయానికి నైరుతి మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలతోపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. అనేకచోట్ల భారీవర్షాల కారణంగా పెద్ద ఎత్తున పంటలు మునిగిపోయాయి. దాదాపు 50 వేల ఎకరాల్లో పంటలు మునిగినట్లు అంచనా వేస్తున్నారు. పంటలు మునుగుతుంటే పట్టించుకునే నాథుడే లేకుండా పోయారన్న విమర్శలున్నాయి. -
పత్తి పైనే ఆసక్తి
జిల్లాలో రైతులు ఈసారి కూడా పత్తిసాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయశాఖ అంచనా మేరకు ఈ ఖరీఫ్లో 1,13,839 హెక్టార్ల సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 72,123 హెక్టార్ల (63 శాతం)లో వివిధ పంటలు వేశారు. అయితే.. కేవలం 13,005 హెక్టార్లలో వరి సాగు కాగా, 50,499 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. మిగిలిన 8,619 హెక్టార్లలో 7,415లలో మొక్కజొన్న, మిగతా ముతకధాన్యాలు తదితర పంటలు వేశారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: రైతులు ఈ ఖరీఫ్లోనూ పత్తిసాగుపైనే మొగ్గు చూపుతున్నారు. రెండేళ్ల క్రితం వరకు తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడగా.. అత్యధికంగా పత్తి సాగైంది. గతేడాది, ఈసారి అనుకూలంగా వర్షాలు పడుతున్నా.. రైతులు పత్తిసాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు సాగైన పంటల వివరాలను పరిశీలిస్తే అత్యధికంగా పత్తిసాగే కనిపిస్తోంది. వర్షాకాలం ఆరంభమై రెండు నెలలు కావస్తున్నా ప్రాజెక్టులు, చెరువులకు నీరు రాకపోవడం కూడా వరిసాగుకు ప్రతికూలంగా మారిందని, అందుకే ఆరుతడి పంటలవైపు మొగ్గు చూపుతున్నారని అధికారులు చెప్తున్నారు. జిల్లాలో మొత్తం 16 మండలాలకు గాను ఇంకా 5 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు పత్తి, ఆ తర్వాత మొక్కజొన్న, ఆరుతడి పంటలు వేశారని అంటున్నారు. వ్యవసాయశాఖ అంచనా ఇదీ.. ఇప్పటికి సాగు 63 శాతమే.. గత ఖరీఫ్ సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు 2017 ఖరీఫ్ యాక్షన్ప్లాన్ రూపొందించారు. ఈ మేరకు జిల్లాలో 1,13,839 హెక్టార్ల సాగు లక్ష్యంగా పేర్కొన్నారు. ఇప్పటివరకు 72,123 హెక్టార్లలో వివిధ పంటలు వేశారు. అయితే.. 36,347 హెక్టార్లకు కేవలం 13,005 హెక్టార్లలో వరి సాగు కాగా, 47,523 హెక్టార్లలో పత్తి సాగు లక్ష్యానికి ఇప్పటికే 50,499 హెక్టార్ల (106 శాతం)లో పత్తి పంట వేశారు. మిగిలిన 8,619 హెక్టార్లలో 7,415లలో మొక్కజొన్న వేయగా, మిగతా 1,204 హెక్టార్లలో ముతకధాన్యాలు తదితర పంటలు వేశారు. జిల్లాలో ఏడాది సగటు వర్షపాతం 898.3 మిల్లీమీటర్లు కాగా, గతేడాది జూలై 31 వరకు 347.90 మిల్లీమీటర్లు నమోదైతే, ఈసారి 252 మి.మీటర్లుగా ఉంది. ఫలితంగా ఖరీఫ్ ఆరంభమై రెండు నెలలు కావస్తుండగా ఇప్పటికీ జిల్లాల్లో సగటు సాగు 63 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే జిల్లా ఆయకట్టుకు జీవనాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, ఎల్ఎండీలకు గతేడాదితో పోలిస్తే ఈసారి ఆశించిన నీరు చేరలేదు. దీంతో వరి రైతులు పొలాలు, నారుమళ్లు, వరినారు సిద్ధం చేసుకున్నా.. వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. రబీలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఆచీతూచీ సేద్యం వైపు కదులుతున్నారు. ఈ ఖరీఫ్లో తొలకరి జల్లులు కొన్ని మండలాల్లో ఆశాజనకంగానే ఉన్నా.. ఇప్పటికీ ప్రాజెక్టులు, చెరువుల్లోకి నీరు చేరలేదు. గతేడాదితో పోలిస్తే జిల్లాలో వర్షపాతం పూర్తిగా తగ్గిపోయింది. సాధారణ వర్షపాతం, గత రెండేళ్లలో నమోదైన వర్షపాతంతో పోల్చిచూస్తే వర్షాలు పడుతున్నా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్లో వరి తదితర పంటలకు స్వస్థి చెప్పి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారని, వరిసాగుపై వేచిచూసే ధోరణితో ఉన్నారని అధికారులు చెప్తున్నారు. -
‘గులాబీ’ విలయం
సాక్షి, హైదరాబాద్: ‘గులాబీ రంగు పురుగు ప్రళయం ముంచుకొస్తోంది’.. ఈ మాటలన్నది స్వయానా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త. గులాబీ పురుగు వల్ల పత్తి పంటకు ఈసారి భారీ నష్టం జరగనుందని ఆయన ఆవేదన. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో గులాబీ రంగు పురుగు కనిపిస్తోందని, వర్షాలతో మున్ముందు దాని విస్తరణ మరింత వేగం కానుందని ఆ శాస్త్రవేత్త హెచ్చరించారు. సాధారణంగా కాయ దశలో కనిపించాల్సిన ఆ పురుగు.. మొక్క దశలోనే దాడి చేయడంపై అన్నదాతల ఆందోళనలో పాలు పంచుకుంటున్నారు. దీన్ని నియంత్రించేందుకు పరిశోధనలు విస్తృతం చేయాలని, పురుగుపై యుద్ధం చేయాలని సూచిస్తున్నారు. ఒకచోట గులాబీరంగు పురుగుంటే ఆ చుట్టుపక్కల 30–40 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఆదిలాబాద్లో అనేకచోట్ల గులాబీ పురుగును గుర్తించినట్లు వ్యవసాయాధికారుల నుంచి వర్సిటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో గతేడాది రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు గులాబీ పురుగు సోకిందని.. ఈసారి రెండు వారాల్లోనే దాని ఉధృతి కనిపించిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది గుజరాత్ రైతులను అతలాకుతలం చేసిన ఆ పురుగు.. జాగ్రత్తలు తీసుకోకుంటే ఈసారి తెలంగాణ రైతులను తీవ్రంగా నష్టపరిచే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఐదు లక్షల ఎకరాల్లో? రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. ఇప్పటివరకు 52.72 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వాటిలో అధిక భాగం పత్తి పంటదే. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 30.30 లక్షల ఎకరాల్లో సాగైంది. విస్తీర్ణం ఇంకా పెరగనుంది. ఇప్పుడు సాగైన 30 లక్షల ఎకరాల్లో దాదాపు 5 లక్షల ఎకరాల పత్తిలో గులాబీ పురుగు ఉండే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వారం రెండు వారాల్లో ఉధృతి పెరిగితే అడ్డుకోవడం కష్టమైన వ్యవహారమంటున్నారు. గులాబీ పురుగు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య పత్తి మొక్కపైకి వస్తుంది. ఆ సమయంలో చూడలేం. కాబట్టి లింగాకర్షక బుట్టలు వీలైనన్ని వేస్తే అందులో వచ్చి పడతాయి. అలా పురుగును గుర్తించవచ్చు. ఒక బుట్టలో 4 పురుగులు పడితే తీవ్రత ఎక్కువగా ఉందని అంచనా వేస్తారు. పురుగును గుర్తించాక క్రిమిసంహారక మందులతో అరికట్టవచ్చు. లింగాకర్షక బుట్టలను ఇప్పటికే రైతులకు సరఫరా చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం అందించలేదు సరికదా వాటిని తెప్పించడంలోనూ విఫలమైందని వ్యవసాయ శాస్త్రవేత్తలే విమర్శిస్తున్నారు. 10 రోజుల క్రితమే జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) కింద నిధులు కేటాయించి బుట్టలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని,ఇంకా కొనలేదని విమర్శలున్నాయి. మరోవైపు పత్తి సరఫరా చేసే జిన్నింగ్ మిల్లుల నుంచి కూడా పంట వైపునకు పురుగు వ్యాపిస్తుందని చెబుతున్నారు. బీటీ–2 వైఫల్యమే బీటీ–2 టెక్నాలజీ వైఫల్యం వల్లే పత్తి పంటను గులాబీ రంగు కాయతొలుచు పురుగు పీడిస్తోంది. దాన్ని నివారించేందుకు బీటీ టెక్నాలజీలో ఓ కణాన్ని జొప్పించి 2002లో బీటీ–1 పత్తి విత్తనాన్ని మోన్శాంటో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే 2006 నాటికి బీటీ–1 గులాబీ పురుగును నాశనం చేసే శక్తి కోల్పోయింది. దీంతో రెండు కణాలు జొప్పించి బీటీ–2ను తీసుకొచ్చారు. 2012 నాటికి దీనిలోనూ గులాబీ పురుగును తట్టుకునే శక్తి నశించింది. కానీ దాన్ని రద్దు చేయకుండా 3 కణాలు జొప్పించి బీటీ–3 తీసుకొచ్చారు. దానికితోడు పత్తి కలుపును నాశనం చేసేందుకు గ్లైఫోసెట్ పురుగుమందును తీసుకొచ్చారు. దీని వల్ల జీవ వైవిధ్యానికి నష్టం జరుగుతుందని తెలియడంతో కేంద్రం అనుమతివ్వలేదు. అయినా రహస్యంగా రైతులకు అంటగడుతూనే ఉన్నారు. బీటీ టెక్నాలజీ విఫలమైనా గులాబీ పురుగు పీడిస్తున్నా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలేదని ఆరోపణలున్నాయి. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 10–12 క్వింటాళ్ల వరకు రావాల్సి ఉండగా గులాబీ పురుగు కారణంగా గతేడాది రాష్ట్రంలో అనేకచోట్ల 6–7 క్వింటాళ్లకు మించి రాలేదు. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్న వాదనలున్నాయి. మరోవైపు గులాబీ పురుగుతో పత్తి పంట పోతే రైతుకు బీమా పరిహారం రాదు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం గతేడాది గులాబీ పురుగుతో నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించింది. పత్తి విత్తన కంపెనీల నుంచీ పరిహారం ఇప్పించింది. రాష్ట్రంలో అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. -
వచ్చే ఎన్నికల్లో గులాబీ పీడ విరగడవుతుంది
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలు పరంపరగా కొనసాగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో సర్కారు ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. రాష్ట్రానికి పట్టిన ‘గులాబీ’ పీడ వచ్చే ఎన్నికల్లో విరగడవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. పంట చేతికొచ్చే సమయంలో వరి, పత్తి దిగుబడి తగ్గిపోయిందని, వర్షానికి తడిసి పత్తి రంగు మారిందని, వరికి దోమపోటు, పత్తి పంటకు గులాబీ చీడ పట్టిందన్నారు. ఆయా పంటల వివరాలు తెప్పించుకుని కేంద్రానికి పంపించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రతిపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకోవడాన్ని సర్కార్ నామోషీగా భావిస్తున్నదని అన్నారు. అకాలవర్షాలతో నష్టపోయిన పంటలకు ప్రకృతి వైపరీత్యాల కింద నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో పంటనష్టం వివరాల నివేదిక కేంద్రానికి పంపకపోవడంతో ఇన్పుట్ సబ్సిడీ పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. -
గడపదాటని తెల్ల బంగారం
యర్రగొండపాలెం: ప్రారంభంలోనే పత్తి ధరలు పతనమయ్యాయి. ఖరీఫ్లో వేసిన పత్తి పంట ఆశాజనకంగా ఉన్నప్పటికీ వరుసగా వర్షాలు కురవడంతో పూత, కాయపగిలిన దశలో ఉన్న పత్తి పంట నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కువగా పురుగు సోకడంతో పలు పర్యాయాలు మందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. ఎరువులు పురుగు మందులకే రైతులు పెట్టుబడులు పెట్టలేక అల్లాడిపోయారు. ఎకరా పత్తి పంటకు రైతు స్థోమతను బట్టి రూ.60 వేలు నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. దిగుబడులు కూడా ఎకరాకు 15 క్వింటాళ్లు దాటవచ్చని రైతులు అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుత ధరలను బట్టిచూస్తే పంటపై పెట్టిన పెట్టుబడులు చేతికందే పరిస్థితి కనిపించడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో దాదాపు 1,44,938 ఎకరాల్లో ఈ ఏడాది రైతులు పత్తి సాగు చేశారు. వీటి నుంచి దాదాపు ఏడు లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. గత సంవత్సరం ప్రారంభంలోనే క్వింటా పత్తి రూ.4వేలకు పైబడి ధర పలికింది. ఆ తరువాత క్వింటా రూ.5,650 వరకు రైతులు అమ్ముకోగలిగారు. ఈ ఏడాది కూడా మంచి ధర లభిస్తుందని రైతులు భావించారు. దీనికితోడుగా ఖరీఫ్ ప్రారంభలోనే వర్షాలు కురిశాయి. భూములను దుక్కులు దున్నుకొని పత్తి పంటను సాగుచేశారు. మొదట్లో వేసిన పంట రైతుల ఇళ్లకు చేరుతోంది. వెంటనే దళారులు కూడా గ్రామాల్లో పంటను కొనుగోలు చేస్తున్నారు. వర్షాలు కురవడంతో పత్తి తడిచి ముద్దయిందని క్వింటా రూ.1500కు కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఆ తరువాత రూ.300 పెంచి రూ.1800కు కొనుగోలు చేస్తున్నారని ఆయా ప్రాంతాల రైతులు తెలిపారు. పత్తి తీయటానికి ఒక్కో కూలీకి రూ.200 చెల్లించాల్సి వస్తోందని, ఆ లెక్కన పది మందికి రెండు వేలు ఇవ్వాల్సి వస్తోందని వారు తెలిపారు. మొదటి కోతకు రెండు నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. ధరలేక పోవడంతోనే ఎక్కువ మంది కోసిన పత్తిని ఇళ్లలో నిలువ ఉంచుకుంటున్నారు. ప్రత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి వెంటనే ప్రత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రత్తి రైతులకు రవాణా ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలి. గిట్టుబాటు ధర లభించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. లేకుంటే రైతులు నష్టాలపాలవుతారు. – పుచ్చకాయల సుబ్బారావు, రాష్ట్ర అధ్యక్షుడు, రైతు సంక్షేమ సేవా సంఘం రైతులు అప్పులపాలే.. పత్తి ధరలు ఇదేవిధంగా కొనసాగితే రైతులు అప్పులపాలు అవుతారు. గత నాలుగేళ్లుగా ఇప్పుడిప్పుడే పంట దిగుబడులు చూస్తున్నాం. ధరలు కూడా అదేస్థాయిలో ఉంటే బాగుంటుంది. – గోళ్ల వీరయ్య, పత్తి రైతు, కొలుకుల -
‘పత్తి’ రైతు ఆత్మహత్య
పురుగుల మందు తాగి బలవన్మరణం అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులే కారణం ఐనవోలు(వర్ధన్నపేట) : పత్తి పంట కాటుకు ఓ యువ రైతు బలయ్యాడు. పెట్టుబడికి చేసిన అప్పులు తేర్చే మార్గం కనిపించక తనవాళ్లనొదిలి తనదారిన తాను వెళ్లిపోయాడు. భార్యాపిల్లల్ని కన్నీళ్లసంద్రంలోకి నెట్టివేశాడు. ఈ హృదయ విదారక ఘటన ముల్కలగూడెం గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఐనవోలు ఎస్సై కె.అశోక్కుమార్ కథనం ప్రకారం వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలంలోని ముల్కలగూడెం గ్రామానికి చెందిన యువ రైతు గుండెకారి మల్లాజి(33) ఆదివారం సాయంత్రం ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు మల్లాజి భార్య పద్మకు సమాచారం అందించారు. ఆమె బంధువులు, గ్రామస్తుల సాయంతో వరంగల్ ఎంజీఎంకు తరలించే ప్రయత్నం చేస్తుండగానే అతడు మరణించాడు. పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్కుమార్ తెలి పారు. ఆర్థిక ఇబ్బందులే.. మల్లాజికి మూడెకరాల భూమి ఉంది. అందులో పత్తి పంటను మూడేళ్లుగా సాగు చేస్తున్నాడు. కాలం కలిసి రాక, పంట సరిగా చేతికి రాక మూడేళ్లుగా వ్యవసాయంలో నష్టాలను చవిచూశాడు. తెలిసిన వాళ్ల దగ్గర ఐదు లక్షల రూపాయాలను అప్పుగా తీసుకున్నాడు. అప్పులు తేర్చేందుకు గత సంవత్సరం గ్రామంలో ఓ రైతు వద్ద పాలేరుగా పనికి చేశాడు. మళ్లీ ఈ ఏడాది వ్యవసాయంపై నమ్మకం ఉంచి ఎలాగైనా అప్పులు తీర్చాలన్న పట్టుదలతో తనకున్న మూడెకరాలతో పాటు పక్కనే ఉన్న మరో రెండెకరాలు కౌలుకు తీసుకున్నాడు. కానీ అధిక వర్షంతో పత్తి కాతా,పూత లేకుండా పోయింది. దాంతో పాటు తెగుళ్లు సోకాయి. తీవ్ర ఆందోళనకు గురైన మల్లాజి అప్పులు తీర్చాలో తెలియక ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. మల్లాజి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
95.50 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు
వరి నాట్లు 78 శాతానికే పరిమితం సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ పంటలు 95.50 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 88.34 శాతం విస్తీర్ణంలో సాగైనట్లు వ్యవసాయ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అత్యధికంగా పత్తి పంట సాగుకావడం గమనార్హం. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.9 లక్షల ఎకరాలు కాగా, అంచనాలకు మించి ఏకంగా 46.85 లక్షల (111%) ఎకరాల్లో సాగైంది. పంటల్లో ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 48.70 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 39.97 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. అందులో వరి విస్తీర్ణం మాత్రం గణనీయంగా పడిపోయింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 18.32 లక్షల (78%) ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 9.22 లక్షల (88%) ఎకరాలకే పరిమితమైంది. అందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 6.95 లక్షల ఎకరాలకు గాను 6.25 లక్షల ఎకరాలు సాగైంది. -
టీడీపీ నేతల అరాచకం
► పచ్చని పత్తి పంటను పీకేసిన అధికార పార్టీ నాయకుడు ► కన్నీటి పర్యంతమవుతున్న బాధిత వృద్ధ కౌలు రైతు ► మండిపడుతున్న కోమటినేనివారిపాలెం గ్రామస్తులు టీడీపీ నేతల భూ దురాక్రమణకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. భూమిని ఆక్రమించుకునేందుకు పచ్చదనంపై సైతం ప్రతాపం చూపుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వైఎస్సార్ సీపీకి చెందిన సన్నకారు రైతు సాగు చేస్తున్న దేవాదాయ శాఖకు చెందిన భూమిపై అధికార పార్టీ నేత కన్నుపడింది. ఆ భూమిని బలవంతంగా పొందేందుకు వృద్ధ రైతు సాగు చేస్తున్న 3.62 ఎకరాల పత్తి పంటను పీకివేశారు. మండలంలోని కోమటినేనివారిపాలెం గ్రామంలో ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకుని పంట పొలాన్ని పరిశీలించిన కౌలు రైతు కోమటినేని శ్రీహరిరావు కన్నీటి పర్యంతమయ్యాడు. కోమటినేనివారిపాలెం (చిలకలూరిపేట రూరల్) : మండలంలోని గోవిందపురం గ్రామంలోని శ్రీ భీమేశ్వరస్వామి శ్రీజనార్ధన స్వామి ఆలయానికి కోమటినేనివారిపాలెంలోని సర్వే నెంబర్ 737, 748, 777 లలో 22 ఎకరాల సాగు భూమి ఉంది. దాన్ నికోమటినేనివారిపాలెంలో భూమిలేని 9 మంది నిరుపేద రైతులు 1975 నుంచి కౌలు పద్ధతిలో సాగు చేసుకుంటున్నారు. దేవాదాయ శాఖకు కౌలు సైతం చెల్లిస్తున్నారు. ఈ భూమిపై కన్నేసిన గోవిందపురం ఎంపీటీసీ సభ్యుడు గుత్తా వెంకటేశ్వర్లు తదితరులు దాన్ని స్వాధీనం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. వేసవి కాలంలో కౌలు ధరను ఎకరానికి ఏడాదికి ఉన్న రూ.6,000ను రెట్టింపు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులతో చెప్పించారు. అయినా, రైతులు చెల్లిస్తామని అంగీకరించారు. విత్తనాలు నాటాక కౌలు వేలం.. జూన్ నెలలో కోమటినేనివారిపాలెంకి చెందిన కోమటినేని శ్రీహరిరావు 3.62 ఎకరాల సాగు భూమి దుక్కి దున్ని పత్తి విత్తనాలు నాటేందుకు సిద్ధం చేసుకున్నాడు. వర్షాలు పడటంతో జూలై 12న పత్తి విత్తనాలు నాటాడు. అయితే, దేవాదాయ శాఖ భూములను వేసవిలో గ్రామంలో దండోరా వేయించి బహిరంగ వేలం నిర్వహిస్తారు. ఇందుకు భిన్నంగా భూమి కోమటినేనివారిపాలెంలో ఉంటే అధికారులు గోవిందపురంలోని భీమేశ్వరస్వామి ఆలయంలో జూలై 22న వేలం నిర్వహించారు. దీనిపై ‘దేవాలయ భూముల వేలంలో వింత నాటకం’ శీర్షికన జూలై 23న ‘సాక్షి’లో కథనం వచ్చింది. టీడీపీకి చెందిన వ్యక్తులు కౌలు వేలం పాడినట్లు రికార్డుల్లో అధికారులు నమోదు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న శ్రీహరిరావు విత్తనాలు మొలకలు రావటంతో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో స్టే మంజూరైంది. మానవత్వం లేని టీడీపీ నేతలు... కౌలు రైతు శ్రీహరిరావు భార్య పార్వతి క్యాన్సర్తో బాధ పడుతుండటంతో చికిత్స నిమిత్తం గురువారం హైదరాబాద్ వెళ్ళారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీటీసీ గుత్తా వెంకటేశ్వర్లు మరో 60 మంది టీడీపీ కార్యకర్తలు వచ్చి అర్ధరాత్రి 2.50 ఎకరాల పొలంలోని పత్తి మొక్కలను పీకేశారు. అలాగే, శుక్రవారం తెల్లవారుజామున సైతం మరో ఎకరంన్నర పొలంలోని పత్తి మొక్కలను తొలగించారు. విషయం తెలుసుకున్న శ్రీహరి పీకిన మొక్కలను చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. టీడీపీ నేతల తీరుపై స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రూరల్ పోలీసులకు బాధితుడు సమాచారం అందించాడు. దీంతో రూరల్ ఎస్ఐ ఉదయ్బాబు నేతృత్వంలోని సిబ్బంది వచ్చి పంట పొలాన్ని పరిశీలించారు. పచ్చని పంట నాశనం.. టీడీపీకి చెందిన గోవిందపురం ఎంపీటీసీ సభ్యుడు గుత్తా వెంకటేశ్వర్లు మరికొందరు వ్యక్తులు వచ్చి మా 3.62 ఎకరాల్లో ఉన్న పత్తి మొక్కలను పీకివేశారు. ఈ భూమిపై కన్నేసి కొంతకాలంగా నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు. దశాబ్ధాల కాలం నుంచి సాగు చేస్తున్నాను. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై కేసు నమోదు చేసి శిక్షించాలి. – కోమటినేని శ్రీహరిరావు, బాధిత కౌలు రైతు -
సస్యరక్షణతోనే లాభాలు
- పత్తిపంటలో గులాబీపురుగు నివారణ చాలా ముఖ్యం – ‘నంద్యాల’ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వై.రామారెడ్డి అనంతపురం అగ్రికల్చర్: ప్రమాదకరమైన గులాబీరంగు కాయతొలచు పురుగు (పింక్బౌల్వార్మ్) నివారణతో పత్తి పంట లాభదాయకంగా ఉంటుందని నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం పత్తి పంట ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వై.రామారెడ్డి తెలిపారు. ఈ పురుగు వల్ల 2015లో పత్తి పంట దారుణంగా దెబ్బతినడంతో రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. ఈ క్రమంలో పురుగు ఉనికి ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలతో సమూలంగా నివారించుకోవాలని సూచించారు. కనిపిస్తున్న గులాబీ పురుగు ఈ ఏడాది పత్తి సాగు చేసిన పెద్దవడుగూరు, పామిడి, గుత్తి, గుంతకల్లు తదితర ప్రాంతాల్లో గులాబీ పురుగు ఉనికి కనిపిస్తోంది. అది ఉధృతి కాకుండా రైతులు సామూహిక చర్యలు చేపడితే సమూలంగా దాన్ని నివారించుకోవచ్చు. రైతులందరూ తమ పొలాల్లో ఎకరాకు నాలుగైదు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని ఉనికిని బట్టి సస్యరక్షణ పద్ధతులు చేపట్టాలి. పొలంలో తిరిగి ఎక్కడైనా గుడ్డిపూలు, పురుగులు లేదా కింద రాలిపడిన కాయలను ఏరివేసి నాశనం చేయాలి. ఏ మాత్రం అజాగ్రత్త చేసినా పంటను దారుణంగా దెబ్బతీస్తుంది. మొదట్లోనే నివారించుకుంటే నష్టాన్ని బాగా తగ్గించుకోవచ్చు. తొలిదశలో 5 మి.లీ వేపనూనే లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఆ తర్వాత ఉధృతిని బట్టి 1.5 గ్రాములు థయోడికార్బ్ లేదా 2 మి.లీ క్వినాల్ఫాస్ లేదా 2.5 మి.లీ క్లోరోఫైరిఫాస్ లేదా 2 మి.లీ ప్రొఫినోపాస్ లాంటి మందులు లీటర్ నీటికి కలిపి మార్చి మార్చి రెండు మూడు సార్లు పిచికారీ చేసుకుంటే నివారించుకోవచ్చు. పోషకాలు అవసరం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రత్తి పంట 20 నుంచి 60 రోజుల దశ వరకు ఉంది. అటు ఎర్రనేలలు, ఇటు నల్లరేగడి నేలల్లో పంటను వేశారు. వర్షపాతాన్ని బట్టి ఒక అడుగు నుంచి మూడు అడుగుల ఎత్తులో పైరు ఉంది. ఇటీవల వర్షం పడటంతో అన్ని ప్రాంతాల్లో తగినంత తేమ ఉంది. ఎకరాకు 20 నుంచి 25 కిలోలు యూరియా, 15 నుంచి 20 కిలోలు పొటాష్ ఎరువులు వేసుకుంటే పంట దిగుబడులు పెరుగుతాయి. -
పంటలు ఆగమాగం
► గులాబీ రంగు పురుగు దాడితో పత్తి విలవిల ► వర్షాల్లేక ఎండిపోతున్న వరి, సోయా, మొక్కజొన్న ► వారం పది రోజుల్లో వర్షాలు పడకుంటే పంట చేతికి రావడం కష్టమే ► క్రిడా, వ్యవసాయ శాఖ ఉన్నతస్థాయి సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి పంటపై గులాబీ రంగు పురుగు దాడి చేస్తోందని, దీంతో తెల్లదోమ సోకే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తగు నివారణ చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించింది. రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ (క్రిడా), రాష్ట్ర వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారమిక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో 30 జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. వివరాలను క్రిడా, వ్యవసాయ శాఖలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. పత్తిని గులాబీ రంగు పురుగు పట్టి పీడిస్తోందని సమావేశంలో వివిధ జిల్లాల వ్యవసాయాధికారులు తెలిపారు. ఇది మిగతా ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉందన్నారు. వర్షాభావం వల్ల తెల్లదోమ కూడా ఆశించవచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. రానున్న వారం రోజుల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నందున రైతులకు తగు సూచనలు ఇవ్వాల్సిందిగా శాస్త్రవేత్తలు అధికారులకు సూచించారు. ముఖ్యంగా గులాబీ రంగు పురుగు నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాల్లో పరిస్థితిపై అధికారులు నివేదిక సమర్పించారు. ముందస్తు రబీకి వెళ్లడమే మంచిది! రాష్ట్రంలో పంటలు ఆగమాగంగానే ఉన్నాయని జిల్లా అధికారులు ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయని తమ నివేదికలో పేర్కొన్నారు. పత్తి, సోయా, మొక్కజొన్న, వరి ఎండిపోతున్నాయని వివరించారు. వారం పది రోజుల్లో సరైన వర్షాలు పడకుంటే అవేవీ చేతికి రావని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కొంత ప్రయోజనం కలిగించినా.. అవేవీ సరిపోవని చెప్పినట్లు సమాచారం. గులాబీ రంగు పురుగు, తెల్ల దోమలతో పత్తి అతలాకుతలం అవుతున్నట్లు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ గట్టెక్కకుంటే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని శాస్త్రవేత్తలు సూచించినట్లు తెలిసింది. ఆ మేరకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను తయారుచేసి వ్యవసాయశాఖకు అందజేశారు. ఈ నెలాఖరు వరకు సరైన వర్షాలు రాకుంటే ఖరీఫ్ పంటలు ఎండిపోయిన చోట ఆముదం, కంది పంటలు వేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. నెలాఖరు వరకు కూడా పత్తి పరిస్థితి మెరుగుకాకుంటే ముందస్తు రబీకి వెళ్లడమే మంచిదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఖరీఫ్ పంటలు ఎండిపోతే ముందస్తుగా సెప్టెంబర్ రెండో వారం నుంచే రబీ పంటలు సాగు చేయాలని సూచించారు. ఖరీఫ్ వరినాట్లు ఇంకా 44 శాతానికి మించలేదని, ఈ నెలాఖరు వరకు వేసే పరిస్థితి కూడా లేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అందువల్ల ముందస్తు రబీకి వెళ్లడమే మంచిదని సూచించినట్లు తెలిసింది. కాగా కీలక సమావేశం సుదీర్ఘంగా జరిగినా అందులో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేదని సమాచారం. రైతులకు సమాచారం ఇవ్వాల్సిందిపోయి అత్యంత గోప్యంగా సమావేశాన్ని నిర్వహించి ముగించినట్లు విమర్శలు వచ్చాయి. -
మళ్లీ ‘పత్తి’ బాట
గతేడాది నిరుత్సాహం.. ఈసారి ప్రోత్సాహం - 38.75 లక్షల ఎకరాలకు పత్తి సాగు పెంచాలని సర్కారు నిర్ణయం - ధరలపై అంచనాలు తారుమారవడంతో చర్యలు - కంది, సోయాబీన్ సాగు లక్ష్యాలు తగ్గింపు - 2017–18 వ్యవసాయ ప్రణాళికలో వ్యవసాయ శాఖ స్పష్టత - వరి విస్తీర్ణం మాత్రం పెంచాలని యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తిరిగి పత్తి పంటను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయంగా పత్తికి డిమాం డ్ పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కంది, సోయాబీన్ పంటలను తగ్గించేందుకు సన్నాహాలు చేస్తోంది. వ్యవసాయ శాఖ 2017–18 వ్యవసాయ ప్రణాళికలో ఈ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. వానా కాలం, యాసంగి పంటల సాగు, ఉత్పత్తి లక్ష్యాలను అందులో పేర్కొంది. ఒక్క వరి విస్తీర్ణాన్ని మాత్రం పెంచాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయ పంటలన్నీ ఢమాల్ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ధరలు బాగా పడిపోవడంతో పత్తి పంట వేయవద్దంటూ రైతులను నిరుత్సాహపర్చిన విషయం తెలిసిందే. ‘అంతర్జాతీయంగా పత్తి ధరలు గణనీయంగా పడిపోనున్నాయి. రాష్ట్రంలో రైతులకు పత్తి ధరలు గిట్టుబాటయ్యే పరిస్థితి ఉండదు. అందువల్ల రైతులను ఇతర పంటల వైపు మళ్లించాలి..’అని అప్పట్లో వ్యవసాయ శాఖను ఆదేశించింది. దాంతో వ్యవసాయశాఖ చర్యలు చేపట్టి.. రైతులను పత్తికి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించింది. దాంతో పత్తి సాగు తగ్గి.. సోయా, పప్పు ధాన్యాల సాగుపెరిగింది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42.21 లక్షల ఎకరాలు కాగా.. 2015–16లో 41.71 లక్షల ఎకరాల్లో సాగైంది. ప్రభుత్వం నిరుత్సాహపరచడంతో 2016–17లో 30.52 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. అంటే 11 లక్షల ఎకరాలు తగ్గింది. అదే సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.98 లక్షల ఎకరాలు కాగా.. 2015–16లో 6.27 లక్షల ఎకరాలకు, 2016–17లో 7.36 లక్షల ఎకరాలకు పెరిగింది. కానీ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. పత్తి గరిష్ట ధర క్వింటాలుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు పెరగగా.. ప్రత్యామ్నాయంగా వేసిన పంటల ధరలన్నీ బాగా పడిపోయాయి. సోయాబీన్ ధర అంతకుముందు క్వింటాలుకు రూ. 3,700 వరకు ఉండగా.. ఈసారి రూ.2,800 కు పడిపోయింది. కంది గతంలో క్వింటాలుకు రూ.10 వేల వరకు ఉండగా.. ఈసారి రూ.4 వేలకు పడిపోయింది. దీంతో ప్రభుత్వం గతేడాది వద్దన్న పంటలనే ఈసారి ప్రోత్సహించాలని నిర్ణయించడం గమనార్హం. పత్తి పెంపు.. ప్రత్యామ్నాయం తగ్గింపు! పత్తి సాగు లక్ష్యం 2016–17లో 26.6 లక్షల ఎకరాలుకాగా, 2017–18కుగాను 38.75 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అంటే గతేడాది లక్ష్యంతో పోలిస్తే అదనంగా 12.15 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని భావిస్తోంది. అలాగే 2016–17 ఖరీఫ్, యాసంగిల్లో 21.42 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాల సాగు లక్ష్యం పెట్టుకోగా.. 2017–18లో 6 లక్షల ఎకరాలు తగ్గించి 15.52 లక్షల ఎకరాలకే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇందులో కంది సాగు లక్ష్యం 2016–17లో 12.17 లక్షల ఎకరాలుకాగా.. 2017–18లో 8.02 లక్షల ఎకరాలకు తగ్గించాలని భావిస్తోంది. ఇక 2016–17లో సోయాబీన్ సాగు లక్ష్యం 12.55 లక్షల ఎకరాలు కాగా... 2017–18లో కేవలం 6 లక్షల ఎకరాలకే పరిమితం చేయాలని నిర్ణయించింది. మొత్తంగా ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం 2016–17లో 87.60 లక్షల ఎకరాలుండగా.. ఈసారి 81.25 లక్షల ఎకరాలకు తగ్గించనుంది. ఒక్క వరి విస్తీర్ణాన్నే కాస్త పెంచాలని.. ఈ మేరకు రైతులను సన్నద్ధం చేయాలని నిర్ణయించింది. -
మిర్చిని ఎందుకు కొనడం లేదు?: చాడ
సాక్షి, హైదరాబాద్: పత్తి పంట వేయొద్దు, మిర్చి పంట వేయాలని చెప్పిన సీఎం కేసీఆర్, అందుకు అనుగుణంగా మిర్చిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొన్ని మిర్చి రకాలు క్వింటాల్ రూ. 2 వేలు కూడా ధర లేకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. వరంగల్ ఎనుమాముల మిర్చి మార్కెట్ను పోలీసులతో నింపేసి రైతులను భయభ్రాంతులకు గురి చేయడం శోచనీయమన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిర్చి రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం మార్కెట్లో రౌడీలు, గూండాలు దాడి చేశారని మంత్రులు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సీఎం అపాయింట్మెంట్ కోసం చాడ లేఖ... భూపాలపల్లి జిల్లా పరిధిలోని తాడిచెర్ల బ్లాక్ 1, బ్లాక్ 2 బొగ్గుగనుల ప్రైవేటీకరణ విషయంపై వివిధ రాజకీయపార్టీల ఆధ్వర్యంలో కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్కు చాడ వెంకటరెడ్డి విజ్ఞఫ్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. -
పత్తి రైతుల పరేషాన్
- కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు - నోట్ల రద్దుతో రెట్టింపైన కష్టాలు - పంట విక్రయించినా సకాలంలో చేతికందని డబ్బు - సగానికి పడిపోయిన దిగుబడి రాయికోడ్ : ఆరుగాలం కష్టనష్టాలకు ఓర్చి రైతులు పండించిన పత్తి పంటను అమ్ముకోవడానికి స్థానికంగా విక్రయ కేంద్రాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. వరుస ప్రకృతి వైపరిత్యాలతో సాగు చేస్తున్న పత్తి పంటతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. ఏం చేయాలో పాలుపోక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో మురిపించిన వర్షాలతో మండలంలో 20 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. జూలై, ఆగష్టు మాసాల్లో వర్షాలు లేక పత్తి పంట ఎదుగుదలపై ప్రభావం పడింది. అనంతరం సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పత్తి పూత, కాత దశలో ఉండగా కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో పత్తి పంట దెబ్బతింది. మండలంలోని రాయికోడ్, సింగితం, కర్చల్, ఇందూర్, నాగ్వార్, కుసునూర్, ధర్మాపూర్, యూసుఫ్పూర్, రాయిపల్లి తదితర గ్రామాల్లో పత్తి పంట దెబ్బతింది. గత నెల రోజులుగా మండలంలో పత్తితీత పనులు ప్రారంభమయ్యాయి. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడిని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. వర్షాలతో పంట దెబ్బతిన్న కారణంగా ఎకరాకు 4, 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోందని రైతులు చెబుతున్నారు. వచ్చిన కాస్త దిగుబడి పెట్టుబడులకే సరిపడేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మూడుసార్లు పత్తితీత కొనసాగుతుందని, ఈ ఏడాది ఒక దఫాలోనే పత్తితీత పూర్తవుతోందని వాపోతున్నారు. ఈ ఏడాది కూడా పత్తి దిగుబడి సగానికి పడిపోయిందని పేర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాలు లేక అవస్థలు ఆశించిన దిగుబడి రాక నష్టాల్లో ఉన్న పత్తి రైతులకు స్థానికంగా పత్తి కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు రెట్టింపయ్యాయి. మరోవైపు క్వింటాల్ పత్తి ధర ప్రస్తుతం రూ.4,500 మాత్రమే పలుకుతోంది. ఎకరాకు రూ.20 వేలకు పైగానే పెట్టుబడులు వెచ్చించామని, వచ్చే దిగుబడి, మద్దతు ధర సంతృప్తికరంగా లేదని రైతులు వివరిస్తున్నారు. స్థానికంగా కొనుగోలు లేక సుదూరంలోని కొనుగోలు కేంద్రాలకు పత్తిని తరలిస్తున్నామని, దీంతో ప్రయాణచార్జీలు అధికమై నష్టపోతున్నామని చెబుతున్నారు. మండలంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నాలుగేళ్లుగా కోరుతున్నా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పత్తిని దళారులకు విక్రయించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో విక్రయించిన పత్తికి డబ్బు పొందడం గగనంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు, దళారులు తమకు చెక్కులు ఇవ్వడంతో సకాలంలో డబ్బు చేతి కందడంలేదని అంటున్నారు. మద్దతు ధర లేకపోవడం, పెద్దనోట్ల రద్దు, స్థానికంగా కొనుగోలు కేంద్రం లేకపోవడంతో కొందరు రైతులు ఇళ్లల్లో నిల్వ ఉంచుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్థానికంగా పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. -
పత్తిలో గుడ్డిపూలు నివారించుకోండి
అనంతపురం అగ్రికల్చర్ : పత్తిలో గుడ్డిపూలు గుర్తించి నివారించుకుంటే మంచిదని, ఈ ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా రెండు మూడు దశల్లో 28,885 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తిపంట సాగు చేశారని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్సుధీర్ తెలిపారు. పంట ప్రస్తుతం 30 నుంచి 60 రోజుల వయస్సులో ఉందని, ఈ దశలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ప్రమాదకరమైన గులాబీ రంగు పురుగుతోపాటు మిగతా చీడపీడలు, తెగుళ్లు వ్యాపించకుండా నివారించుకోవచ్చన్నారు. గుడ్డిపూలు గుర్తించడం ఇలా: గతేడాది పత్తిపంటకు నవంబర్లో గులాబీరంగు పురుగు గుర్తించడంతో అప్పటికే పంట బాగా దెబ్బతినడంతో రైతులకు ఎక్కువగా నష్టం జరిగింది. దీంతో ఈ ఏడాది శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ ముందస్తు చర్యలు చేపట్టి రైతులను అప్రమత్తం చేశారు. ఇటీవల శాస్త్రవేత్తల క్షేత్రస్థాయి పంట పొలాల పరిశీలనలో గుత్తి, తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం డివిజన్ల పరిధిలో గులాబీరంగు పురుగు ఉనికికి గుర్తించారన్నారు. పంట పొలాల్లో గుడ్డి పూలు ఉన్నట్లు కనిపించాయి. గుడ్డి పూలను రైతులు గుర్తించేలా అవగాహన ఉంటే తొలిదశలోనే పంట దెబ్బతినకుండా నివారించుకోవచ్చు. గొంగలి పురుగు గుడ్డు నుంచి బయటకు వచ్చి పూత, కాయ లోపలి భాగాల్లోకి చొచ్చుకెళ్లి నష్టాన్ని కలిగిస్తుంది. నివారణ చర్యలు: ఎకరా పొలంలో నాలుగు నుంచి ఎనిమిది చొప్పున లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. వరుసగా మూడు రోజుల పాటు ఒక్కో బుట్టలో ఎనిమిది పురుగులు కనిపించినా, పది పువ్వులో ఒక గుడ్డిపువ్వు ఉన్నట్లు గుర్తించినా, ఇరవై కాయలను కోస్తే అందులో రెండు గొంగలి పురుగులు కనిపించినా గులాబీరంగు పురుగు ఆశించినట్లు తెలుసుకోవాలి. అలాగే కాయ పైభాగంలో పురుగు బయటకు వచ్చే గుండ్రటి చిన్న రంధ్రం కనిపించినా, కాయ తొనల మధ్య గోడలపై గుండ్రంటి రంఘం ఉన్నా, గుత్తి పత్తి, రంగు మారిన పత్తి కనిపించినా పురుగు ఉధృతి ఉన్నట్లే లెక్క. గుడ్డిపూలు, రంగుమారినవి, రంధ్రాలున్న కాయలను ఏరివేసి నాశనం చేయాలి. పూత సమయంలో ఎకరానికి 60 వేల చొప్పున ట్రైకోగామా పరాన్నజీవులను వదలడం వల్ల పురుగు గ్రుడ్లను సమూలంగా నివారించుకోవచ్చు. ఉధృతిని బట్టి శాస్త్రవేత్తలు, అధికారుల సిఫారసు మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. -
రూ. 6 వేలు దాటిన తెల్ల బంగారం
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర పరుగులు పెడుతోంది. నెల రోజుల నుంచి క్రమంగా పెరుగుతూ బుధవారం క్వింటాల్ పత్తికి కు గరిష్టంగా రూ.6,021 పలికింది. జమ్మికుంట మార్కెట్కు కరీంనగర్, వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు 1,210 క్వింటాళ్ల పత్తిని బుధవారం తీసుకురాగా, వ్యాపారులు మోడల్ ధర రూ.5,500, కనిష్ట ధర రూ.4,500 చెల్లించారు. మూడేళ్ల క్రితం పలికిన ధర మళ్లీ ఈ సీజన్ చివరలో పలుకడంతో రైతుల్లో అనందం వెల్ల్లివిరిసింది. రాష్ట్ర స్థాయిలోనే జమ్మికుంట మార్కెట్లో పలికిన ధర ఈ సీజన్లో రికార్డుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో బేళ్లకు, గింజలకు ఉహించని విధంగా డిమాండ్ పలుకుతుండడంతో వ్యాపారులు పోటీ పడి పత్తికి ధరలు చెల్లిస్తున్నారు. ఖరీఫ్లో పత్తి సాగు మొదలవుతున్న సమయంలో పత్తికి ధర పైపైకి పాకుతుండడంతో రైతుల్లో ఉత్సాహన్ని కలిగిస్తోంది. ఇదే మార్కెట్లో 2013 మార్కెట్ సీజన్లో పత్తి ధర రూ.6,000-6,800 వరకు పలికింది. వరంగల్లో 6వేలకు చేరువలో.. వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్వింటా పత్తి రూ.5,915 ధర పలికింది. మూడేళ్లలో ఇదే రికార్డు ధర. హన్మకొండ మండలం ముల్కలగూడెం గ్రామానికి చెందిన ఎల్లగౌడ్ అనే రైతు ఇంతకాలం పత్తి నిల్వ చేసి, ఇప్పుడు ధర ఆశాజనకంగా ఉండడంతో 250 బస్తాల పత్తిని మమత ట్రేడర్స్ వారి వద్దకు అమ్మకానికి తెచ్చాడు. మొదటి వేలం పాటలోనే జమ్మికుంటకు చెందిన నర్సింహ ఇండస్ట్రీస్ వ్యాపారి రూ.5,915 అత్యధిక ధరతో కొనుగోలు చేశాడు. నిల్వ చేసిన పత్తి మొత్తం 108 క్వింటాళ్లు అయిందని, మార్కెట్ ఖర్చులన్నీ పోను రూ.6.40 లక్షల వచ్చాయని ఎల్లగౌడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది తన జీవితంలో మరిచిపోలేని రోజంటూ మిఠాయిలు కొనుగోలు చేసి మార్కెట్లో పంపిణీ చేశాడు. -
వద్దంటే వినరే!
యాచారం : రంగారెడ్డి జిల్లాలో రైతులు పత్తి పంటను వదులుకునేందుకు ఇష్టపడడం లేదు. వారం పదిరోజులుగా గ్రామాల్లో ‘మన తెలంగాణ- మన వ్యవసాయం’ సదస్సులు నిర్వహిస్తున్న వ్యవసాయాధికారులు పత్తి సాగు తగ్గించి సోయాబిన్, ఆముదం, మొక్కజొన్న, జొన్న, కంది తదితర పంటలను సాగుచేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. ఈ ప్రాంత భూముల భూసార పరీక్షల ఆధారంగా పత్తి పంటకు ఏ మాత్రం అనుకూలం కావని, పంట సాగు కోసం రూ.వేలల్లో పెట్టుబడులు అవ్వడం, దిగుబడిలేక అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంటుందని అవగాహన కల్పిస్తున్నారు. 30 వేల హెక్టార్లల్లో పత్తి సాగుకు సిద్ధం పత్తి సాగు వద్దని పదే పదే అధికారులు చెబుతుండడంతో కొద్దిమేర మాత్రమే మార్పు కన్పిస్తోంది. పూర్తిస్థాయిలో మాత్రం మార్పు కనిపించని పరిస్థితి. రంగారెడ్డి జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 44,084 హెక్టార్లు ఉండగా 2013లో 55035 హెక్టార్లు, 2014 లో 49335 హెక్టార్లు, 2015లో 49664 హెక్టార్లలో పత్తిని సాగు చేశారు. పత్తి సాగు విస్తీర్ణాన్ని ఈ ఏడాది 19147 హెక్టార్లకు తగ్గించాలని భావిస్తున్నారు. గత రెండు, మూడేళ్లుగా జిల్లా తూర్పు డివిజన్లోనే యాచారం మండలంలో పత్తి సాగు అత్యధికంగా సాగైంది. అతివృష్టి, అనావృష్టి వల్ల పత్తి సాగులో నష్టాలు వస్తున్నప్పటికీ.. రైతులు మాత్రం మూడేళ్లుగా పత్తి సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది యాచారం మండలంలో 1,378 హెక్టార్లల్లో పత్తి సాగు చేశారు. నక్కర్త మేడిపల్లి, మల్కీజ్గూడ, కొత్తపల్లి, తక్కళ్లపల్లి, నందివనపర్తి, చౌదర్పల్లి, చింతుల్ల, ధర్మన్నగూడెం, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో 90 శాతానికి పైగా రైతులు పత్తి సాగే చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది కేవలం 400 హెక్టార్ల మేర మాత్రమే పత్తి సాగు తగ్గే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోకి ఎగుమతి చేసే పత్తిపై ఇచ్చే రాయితీని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి రద్దు చేసింది. భారతదేశంలో పండించిన పత్తిని అమెరికా, చైనా, యూరోప్ తదితర దేశాల అంతర్జాతీయ మార్కెట్లోకి ఎగుమతి చేసి విక్రయాలు జరుపుతారు. కేంద్ర ప్రభుత్వం రాయితీని రద్దు చేయడం వల్ల మన పత్తిరేటు ఎక్కువగా ఉంటుంది. అంతర్జాయ వ్యాపారులు తక్కువ ధర ఉన్న మార్కెట్లలోనే కొనుగోళ్లకు ఆసక్తి చూపుతారు. దీంతో మనదేశంలో పండిన పత్తికి సరైన ధర, డిమాండ్ ఉండదు. పత్తి పండించిన రైతులకు సరైన ధర రాకపోవడం వల్ల నష్టపోయో అవకాశం ఉంది. దేశంలో అత్యధికంగా రైతులు పత్తి పంటపైనే దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పప్పు దినుసులు, ఇతర ఆహార ధాన్యాల పంటల సాగు గణనీయంగా తగ్గిపోతున్నది. వాటి ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండడం లేదు. పత్తి సాగు విస్తీర్ణం పెరగడం, పప్పు దినుసులు, ఆహార ధాన్యాల పంటలు తగ్గిపోవడం, కేంద్ర ప్రభుత్వం కూడా పత్తి ఎగుమతులపై రాయితీని రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం పత్తి సాగు పెంచకుండా, పప్పు దినుసులు, ఆహార ధాన్యాల పంటల సాగు పెంపుపై రైతుల్లో చైతన్యం కల్పించాలని వ్యవసాయాధికారులకు ఆదేశాలిచ్చింది. వర్షాలు కురిస్తే విత్తడమే..! వారం క్రితం కురిసిన వర్షాలకు రైతులు పలు గ్రామాల్లో దుక్కులను సిద్ధం చేసుకున్నారు. నక్కర్తమేడిపల్లి, చౌదర్పల్లి, తాడిపర్తి, కొత్తపల్లి, మాల్, నల్లవెల్లి, తమ్మలోనిగూడ తదితర గ్రామాల్లో ఎకరాల కొద్ది పొలాల్లో పత్తిని సాగు చేయడం కోసం రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేసి పత్తి విత్తనాలు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది దళారుల వచ్చి విత్తనాలు పెద్ద మొత్తంలో సరఫరా చేయకపోయినా రైతుల ఆసక్తిని బట్టి పంటముడి ఒప్పందం ప్రకారం దొంగ చాటుగా వచ్చి విత్తనాల ప్యాకెట్లు ఇచ్చి వెళ్తున్నారు. మాల్, యాచారంలోని స్థానిక వ్యాపారులు సైతం పెద్ద మొత్తంలోనే పత్తి విత్తనాలు నిల్వ చేసి ఉంచారు. కొన్ని గ్రామాల్లో అనుమతి లేకుండానే విత్తనాలు తెచ్చి ఇళ్ల నుంచి రైతులకు అమ్ముతున్నారు. రెండు, మూడేళ్లుగా పత్తి సాగులో నష్టాలు చవిచూసిన రైతులు ఈ ఏడాది వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని భావిస్తున్నారు. దీంతో పత్తిని సాగు చేసేందుకు ఆసిక్త చూపుతున్నారు. గతేడాది 15 ఎకరాల్లో పత్తి సాగు చేసిన. ఈ ఏడాది పత్తి ధర తక్కువగా ఉంటుందని అధికారులు అంటున్నారు, అందుకే కేవలం ఐదు ఎకరాలు తగ్గించి 10 ఎకరాల్లో పత్తి సాగు ఏర్పాట్లు చేస్తున్నా. రూ.లక్షకు పైగా ఖర్చు చేసి ఎరువులు, విత్తనాలు నిల్వ చేసుకున్నా. 5 ఎకరాల్లో మొక్కజొన్న, సోయాబిన్ పంటలు వేస్తున్నా. - కలకొండ బీరప్ప, నక్కర్తమేడిపల్లి, యాచారం మండలం కొంత మందిలో మార్పు వచ్చింది.. రైతులు గతేడాది కంటే పత్తి సాగుపై దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ఈ ఏడాది సగం వరకు పత్తి సాగు తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ వర్షాలు కురిసి విత్తనాలు విత్తేది ప్రారంభిస్తే కాని విషయం తెలుస్తుంది. సోయాబిన్, మొక్కజొన్న తదితర పంటల వల్ల మంచి ఆదాయం వస్తుందన్న విషయం రైతులు మర్చిపోవద్దు. - సందీప్కుమార్, వ్యవసాయాధికారి, యాచారం -
నురగ కాసిన పత్తి
పత్తి.. ప్రతిక్షణం ఆమె వెన్నంటే ఉంది! కాపురానికి వచ్చిన నాటి నుంచీ... ‘మంచిరోజులు రాకపోతాయా’ అని... కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ ఆమె చూసింది. భర్త కళ్లల్లో అంధత్వమై పూసిన పత్తి పూలను చూసి కుమిలిపోయింది. అప్పు చేసి పత్తి వేస్తే.. పొలం ఎండు పువ్వై ఆమెను ఏడిపించింది. పని చేయలేని భర్త.. పస్తులుంటున్న పిల్లలు.. పీకల దాకా వడ్డీలు.. కలిసిరాని కాలం... కనుచూపు మేరలో కనిపించని పరిష్కారం... ఆమె పురుగుల మందు తాగింది!! అప్పుడు కాసింది పత్తి... విరగ్గాసింది. ఆమె నోట్లో నురగై కాసింది. ఆ తర్వాత కూడా... తల వెనుక దీపమై పత్తి ఆమెను వెంటాడేదే..! అదృష్టం.. అలా జరగలేదు! దురదృష్టం.. ఇప్పుడు జరుగుబాటు లేదు! ఏడవడానికి కన్నీళ్లు కూడా కరువైన ఈ తల్లి కళ్లల్లో ‘ఎందుకు బతికాన్రా దేవుడా’ అన్న బాధే కనిపిస్తోంది. ఆమె పేరు రమ. ఊరు.. శంకరపట్నం మండలం ముత్తారం గ్రామం. నూనె ఐలుమల్లు, లింగమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు. వాళ్లలో పెద్దబిడ్డ రమ. 2000 సంవత్సరంలో ఉన్నకొద్దిపాటి పొలం అమ్మేసి రమ పెళ్లి చేశారు. అట్లా పదహారేళ్లకే వివాహబంధంలో బందీ అయింది రమ. ఆమె భర్త పేరు రవి. చేపలు పట్టే కులవృత్తే వాళ్ల కుటుంబానికి జీవనాధారం. దానితో సరిపడా ఆదాయం రాకపోయినా ఉన్నంతలోనే రవి, రమా సర్దుకుపోయేవారు. కాలం గడుస్తోంది. పిల్లాడు (అంజి) పుట్టాడు. ఆదాయం మాత్రం పెరగట్లేదు. రమ ఆందోళనంతా అదే. పెరిగిన సంసారానికి సరిపడా సంపాదన లేకపోతే ఇల్లు ఎట్లా గడవాలే? పిల్లాడెట్టా పెరగాలే? వాడినెలా చదివించాలె? ఇదే రంది ఆమెకు. ఎట్లయినా చేసి భర్త సంపాదనకు చేదోవాదోడుగా మారాలి. ఈ ఆలోచనతోనే పగలురేయి గడిచిపోతున్నాయి. ఉన్నట్టుండి 2004లో.. రవి.. ఒక కంటి చూపు మందగించడం మొదలైంది. వైద్యం తీసుకుంటూ, చూపు కనిపించినంత మేరా పనిచేసుకుంటూ నెట్టుకొస్తున్నాడు. నాలుగేళ్లు గడిచాయి. 2008లో కూతురు అమూల్య పుట్టింది. ఆ సంతోషంలో ఉండగానే రవి రెండో కంటి చూపూ మందగించసాగింది. రెండు కళ్లూ కనిపించడం లేదు! వైద్యం కోసం కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ల చుట్టూ తిరిగాడు. చూపు మాత్రం రాలేదు కానీ 40 వేల అప్పు మిగిలింది ఆ దంపతులకు. పిప్పి చేసిన పత్తి రవి పూర్తిగా చూపు కోల్పోయి, కాలకృత్యాలకూ రమ మీదే ఆధారపడే పరిస్థితి వచ్చింది. అనివార్యంగా కుటుంబ పోషణభారం ఆమె మీదే పడింది. కష్టాలన్నీ కుమ్మక్కయి ఒక్కసారిగా చుట్టుముట్టే సరికి పోరాడే దారి తెలియలేదు. పిల్లలను సర్కారు బడిలో చేర్పించి అప్పుల ఊబి నుంచి తప్పించుకోవడానికి కూలీగా మారింది. రెక్కలు ముక్కలు చేసుకోసాగింది. కానీ రోజూవారి కూలీతో అప్పులు తీరడం అటుంచి కుటుంబం గడవడమే గగనం అయింది. అప్పుడు ఆమె పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులో సర్కారు ఇచ్చిన 20 గుంటల భూమిని సాగు చేయడం మొదలుపెట్టింది. తొలి రెండేళ్లు రూపాయి కూడా గిట్టుబాటు కాలేదు. ఈ ఇరవై గుంటల భూమి మీదే ఆధారపడితే లాభంలేదనుకొని మరో 20 గుంటల భూమిని కౌలుకి తీసుకుంది. లక్షన్నర అప్పు చేసి మరీ పత్తి వేసింది. ఇక్కడా నిరాశే. పత్తివిత్తనాలు నాటిన నాటినుంచి ఒక్క చినుకూ రాలక పత్తి సాగులో గునుగుపువ్వు పూసింది తప్ప పత్తిపువ్వు విప్పలేదు. కళ్లముందే ఎండి పోయింది. అప్పట్నుంచి రమ మనోవేదనకు గురవసాగింది. చుట్టుముట్టిన కష్టాలన్నీ వికటాట్టహాసం చేస్తున్నట్టనిపించింది. కలిసిరాని కాలాన్ని ఎదిరించలేననుకుంది. కళ్లు లేని భర్తను, పెరిగి పెద్దవుతున్న పిల్లలను పోషించడం భారమని తలచింది. చావొక్కటే మార్గమని భావించింది. ఈనెల 3న మధ్యాహ్నం ఇంట్లోనే భర్త ఎదుటే పురుగుల మందు తాగింది. భర్తకు కళ్లు కన్పించక పోవడంతో ఏం జరుగుతుందో తెలియలేదు. నురుగలు కక్కుతున్న రమను ఇరుగుపొరుగు చూసి హుటాహుటిన జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ దేవుడు రమ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన సర్కార్ వైద్యులు ఆమె బతడం కష్టమని తేల్చేశారు. హుజూరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. రమ, రవి దంపతుల పిల్లలిద్దరు ఆసుపత్రిలో కనిపించిన ప్రతి డాక్టర్ దగ్గరకు వెళ్లి ‘మా అమ్మను బతికించండి’ అంటూ కాళ్లావేళ్లా పడసాగారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన శ్రీ విజయసాయి ఆసుపత్రి డాక్టర్ సురంజన్ ఆమె పరిస్థితిని గమనించారు. తల్లిని బతికించమని బతిమాలుకుంటున్న ఆ ఇద్దరు పిల్లలను చూసి చలించిపోయారు. అంధుడిగా రవి నిస్సహాయతకు కదిలిపోయారు. హుటాహుటిన రమను తన ఆస్పత్రికి తీసుకెళ్లి అత్యవసర వైద్యం మొదలుపెట్టారు. ఇంజక్షన్లు, మందులు, ఆపరేషన్ల కోసం పెద్దమొత్తంలోనే సొంతడబ్బు ఖర్చు చేశారు. గత రెండు వారాలుగా చికిత్స అందిస్తూనే ఉన్నారు. వారంకిందట రమకు గొంతు దగ్గర ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆమె మాట్లాడే పరిస్థితిలో లేనప్పటికీ మృత్యువును మాత్రం జయించింది. ఆరోగ్యం పర్వాలేదు.. కానీ బతుకు దెరువు? చావు గుప్పిట్లోనుంచి రమ బయటపడింది కానీ ఆమె కుటుంబం గడిచేదెట్లా? పిల్లలను పెంచేదెట్లా? అంధుడైన భర్త బాధ్యతను మోసెదెట్లా? పూరిగుడిసె తప్ప ఏ ఆధారమూ లేని తాను చేసిన అప్పులు తీర్చేదెట్లా? అంటూ మథనపడుతోంది రమ. ఏడవడానికి కన్నీళ్లు కూడా కరువైన ఆ తల్లి కళ్లల్లో ‘ఎందుకు బతికాన్రా దేవుడా’ అన్న బాధే కనిపిస్తోంది. - పసునూరు మధు, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ గన్ను శ్రీనివాస్, జమ్మికుంట విలేకరి ఉపాధి చూపిస్తే బతుకుతం మా అదృష్టం బాగుంది. మా పిల్లలను, నన్ను చూసి అ భగవంతుడు పెద్దపెద్దోళ్ల సాయంతో నా భార్యను బతికించిండు. నా భార్య ప్రాణాలు కాపాడిన డాక్టర్కు రెండు చేతుల దండం పెడుతున్నం. రమ బతికినందుకు సంతోషంగా ఉన్నా...రేపటి నుంచి ఎట్ల బతకాలో తలుచుకుంటేనే భయమేస్తుంది. దయగల మారాజులు మమ్ముల్ని ఆదుకోవాలి. సర్కారోళ్లు ఇంటికాడ దుకాణం పెట్టుకునేందుకు సాయం చేస్తే అది నడుపుకుంటూ నన్ను నా పిల్లలను సాదుకుంటది నా భార్య. మీ అందరికి రెండు చేతులా మొక్కుతున్న. దయ చూపించాలే. - రమ భర్త రవి చదువుకోవాలని ఉంది... అన్నం లేక పస్తులుంటున్నం నాకు, చెల్లికి చదువుకోవాలని ఉంది. బడిలో పెట్టిన అన్నం తింటున్నం. బడి బందున్న రోజు పస్తే. చాలాసార్లు రాత్రి అన్నం లేక ఉపవాసాలు ఉంటున్నం. చదువుకోవడానికి పెద్దసార్ల సహాయం కోరుతున్నం. - అంజి కోలుకుంటోంది రమ కుటుంబ పరిస్థితి నన్ను కదిలించింది. దాతల సహకారంతో వైద్యాన్ని అందించా! ఇప్పుడు ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. గొంతు దగ్గర ఆపరేషన్ చేయడంతో ప్రస్తుతం మాట్లాలేక పోతుంది. ఈ రోజు (బుధవారం) మరోసారి గొంతు వద్ద చిన్న ఆపరేషన్ చేసి ట్యూబ్ వేయాలి. ఇప్పటి వరకు రూ. రెండున్నర లక్షల వరకు ఖర్చయింది. మరో రూ.50 వేల వరకుఖర్చవుతుంది. రమ కుటుంబం దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఆ కుటుంబాన్ని ఆదుకోకపోతే భవిష్యత్తులోనూ వారికి ఇబ్బందే. - డాక్టర్ సురంజన్ ఆ తల్లికి, ఆ కుటుంబానికి ఆర్ధికంగా చేయూత ఇవ్వాలనుకుంటే: రమ తండ్రి ఐలమల్లు మొబైల్ నెంబర్: 8008631247 -
ఎండిన పంట చూసి రైతు ఆత్మహత్య
పత్తిపంట ఎండి పోవడంతో ఓ రైతు ప్రాణాలు తీసుకున్నాడు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉప్పరహాల్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. లక్ష్మీకాంత్రెడ్డి నాలుగున్నర ఎకరాల్లో పత్తి పంట వేశాడు. వర్షాల్లేక ఎండిపోవడంతో మనస్తాపం చెందిన అతడు పొలంలో పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విగత జీవిగా మారిన లక్ష్మీకాంత్ రెడ్డిని పోరుగు రైతులు సాయంత్రం గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పుల బాధతాళలేక పండగపూట ఓ రైతు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారు జామున సూర్యాపేట నియోజకవర్గంలోని చిదేముల్లో జరిగింది. చిదేముల్కు చెందిన దారావత్ దేవ్(55)కు ఆరు ఎకరాల పొలం ఉంది. భూమి సాగు కోసం.. పిల్లల పెళ్లిళ్ల కోసం ఆరు లక్షల రూపాయలు అప్పు చేశాడు. అప్పు తీర్చేందుకు ఈ ఏడాది తనకున్న పొలంతో పాటు.. మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తిపంట వేశాడు. సరైన వర్షాలు లేక పంట ఎండిపోయింది. అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి పెరిగింది. దీంతో రెండెకరాల పొలం అమ్మి మూడు లక్షలు అప్పుతీర్చాడు. కానీ.. రుణాల వత్తిడి తగ్గలేదు.. దీంతో మనస్ధాపం చెందిన ధరావత్ బుధవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని కాపాడి. ఆస్పత్రిలో చేర్చారు. తీవ్రగాయాల పాలైన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో పండగపూట ఆ ఇంట విషాదం నెలకొంది. ధరావత్ కు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. వీరిలో ముగ్గురికి పెళ్లి కాగా.. మరో పెళ్లీడుకొచ్చిన ఆమ్మాయి ఉంది. -
యువరైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సానికొమ్ము వెంకట్రెడ్డి(25) తనకున్న రెండెకరాలతో పాటు మరో ఎనిమిదెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి, వరి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది కూడా పంట దిగుబడి రాకపోవడంతో పాటు ఈ ఏడాది పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు రూ. 2.50 లక్షలు ఉండటంతో దానిని తీర్చలేనని గత కొన్ని రోజులుగా మనోవేదనకు గురవుతున్నాడు. ఈ రోజు పంటకు మందు కొట్టడానికి వెళ్లిన వెంకట్రెడ్డి ఎండిన పంటను చూసి దిగుబడి రాదేమోననే భయంతో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో ఆగిన రైతు గుండె
చేసిన అప్పులు తీర్చే మార్గం లేక .. ఓ రైతు గుండె ఆగింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని మక్తాకొత్తగూడెంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మక్తాకొత్తగూడెం గ్రామానికి చెందిన గుండాల దేవలింగం(38)కు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. అందులో దేవలింగం పన్నెండేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. గత రెండేళ్లుగా పంటలు లేక పోవడం.. బోర్లు వేసినా.. నీళ్లు పడక పోవడంతో అప్పుల పాలయ్యాడు. రెండేళ్లుగా వస్తున్న నష్టాలతో పాటు.. ప్రై వేటు వ్యక్తుల వద్ద తెచ్చిన అప్పు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు పెరిగింది. ఈ ఏడాది వేసిన పత్తి వేశాడు.. నీరు లేక పంట ఎండి పోయింది. ఈ క్రమంలో గురువారం ఉదయం చేను వద్దకు వెళ్లివచ్చిన దేవలింగం గ్రామంలో తోటి రైతులతో పంట ఎండి పోయిందని మాట్లాడుతూ.. కుప్పకూలి పోయాడు.. గ్రామస్తులు ఆటోలో సూర్యాపేటకు తరలిస్తుండగానే.. మార్గ మధ్యలో మృతిచెందాడు, సమాచారం తెలుసుకున్న తహశీల్దారు, ఏవో, ఎస్సైలు గ్రామానికి చేరుకుని.. మృతికి గల కారణాలు విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు దేవలింగంకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. తండ్రి మృతిని తట్టుకోలేక పెద్ద కుమార్తె సొమ్మ సిల్లి పోయింది. ఆమెను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేస్తున్నారు. -
పొంగిన మూల వాగు
కోనరావుపేట(కరీంనగర్ జిల్లా): కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలోని మూలవాగు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పొంగిపొర్లింది. బుధవారం నుంచి వాగు పొంగి పొర్లడంతో మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మండలంలోని కనగర్తి గ్రామంలో పత్తి పంట నీట మునిగింది. కాగా, ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయినా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్నే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా బ్రేక్డౌన్ కావడంతోనే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని.. పునరుద్ధరిస్తామని వారు తెలిపారు. -
వత్తిలా కాలిపోతూ..
కళ్లలో వత్తులు వేసుకుని కాపాడుకున్న పత్తిపంట చిత్తవడంతో రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆరుగాలం శ్రమించి పండించే రైతులను.. పురుగు మందు రూపంలో మృత్యువు తన పొత్తిళ్లలోకి లాగేసుకుంటోంది. పంటలు పాడవడంతో అప్పుల బాధ భరించలేక మనస్తాపంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం ఇంతవరకు మైదాన ప్రాంతాల్లో జరిగే విషాద కర సంఘటనలు అనుకుంటే.. ఆ పరిస్థితి ఏజెన్సీ ప్రాంతానికి కూడా వచ్చేసింది. గిరిజన రైతులను సైతం పురుగు మందు రూపంలో మృత్యువు తన ఒడిలో చేర్చు కుంటోంది. పార్వతీపురం: పార్వతీపురం సబ్-ప్లాన్లోని కొమరాడ మండలం గిరిశిఖర గ్రామాలలో సంప్రదాయ పంటలను మాత్రమే పండించే గిరిజనులను సైతం షావుకార్లు పత్తి పంటల సాగుపట్ల ప్రోత్సహిస్తున్నారు. ఇంతవరకు మైదాన ప్రాంతాలకే పరిమితం అయిన పత్తిపంటలు గత మూడేళ్లుగా సబ్-ప్లాన్లోని కొండలెక్కేశాయి. విత్తనాలు మొదలుకొని పంట చివరి దశ వరకు అవసరమైన పురుగుమందుల వరకు షావుకారు వద్ద అప్పులు తీసుకున్న గిరిజనులు ఈ ఏడాది పత్తిని సాగు చేశారు. అయితే మహ మ్మారి హుద్హుద్ తుపాను వారి పంటలపై రాకాసి గద్దలా వాలి నాశనం చేసింది. ఈ కారణంగా పత్తి పంట నాశనం కాగా, సాగు కోసం చేసిన అప్పుల బాధలు వెంటాడుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వం ఆదుకోకపోవడం, మరోవైపు అప్పులు తీరే దాని కానరాక పోవడంతో.. గిరిపుత్రులు ఉసురు తీసుకుంటున్నారు. మొన్న కొరిశిల గిరిజనుడు చంద్ర పాత్రుడు, నిన్న జల గిరిజనుడు కడ్రక వేమన్నలు పత్తి పంట అప్పుల బాధలు వేగలేక పత్తికి వేసే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొమరాడ మండలం జల గ్రామంలో పత్తిపంట పోయి, అప్పుల బాధలు పడలేక శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన కడ్రక వేమన్న(30) కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు మండంగి సోములు, ప్రసాద్, కడ్రక మోహన్ తదితరులు ఆదివారం స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద పోలీసులకు, విలేకరులకు అందించిన వివరాలిలా ఉన్నాయి... పత్తి పంట పోయిందనే ఆత్మహత్య...! జల గ్రామానికి చెందిన కడ్రక వేమన్న (30) పోడు వ్యవసాయంలో భాగంగా నాలుగెకరాలలో పత్తి పంటను సాగు చేశాడు. దీని కోసం తమ గ్రామానికొచ్చి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అరువు ఇచ్చే షావుకారు వద్ద సుమారు రూ.60వేల వరకు అప్పుపడ్డాడు. పంట చేతికొస్తుంది, అప్పు తీర్చేసి, మిగిలిన ఆదాయంతో తన ముగ్గురి కొడుకుల్ని ప్రయోజకుల్ని చేయాలని ఆశపడిన వేమన్న పత్తిపంట మీదికి రాకాసి పిట్ట హుద్హుద్ తుపాను వచ్చి పడింది. దీంతో గ్రామంలో పత్తి పంట సాగు చేస్తున్న సుమారు 20 మంది గిరిజనులతోపాటు వేమన్న పంట కూడా నాశనమయ్యింది. ఈ నేపథ్యంలో పంట చేతికిరాకపోగా, ప్రభుత్వ సర్వేలు గిరిశిఖరాలకు ఎక్కలేకపోవడంతో, షావుకారు అప్పు తీర్చేందుకు వేమన్నకు మార్గం కనిపించలేదు. దీంతో ఒకవైపు అప్పుల ఒత్తిడి, మరోవైపు భార్య చంటమ్మ, ముగ్గురు కొడుకులు పన్నెండేళ్ల సంతోష్, నాలుగేళ్ల రంజిత్, ఏడాది వినీత్ల భారం వేమన్నను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ నేపథ్యంలో వేమన్న మానసిక ఒత్తిడికి గురై మద్యానికి బానిసగా మారాడు. అప్పు తీర్చే సమయం, ఒత్తిడి అధికం కావడంతో ఏం చేయాలో తెలియక గ్రామమంతా శనివారం వారపు సంతకు వెళ్లడంతో అదే అదునుగా పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంతనుంచి ఇంటికి వచ్చి చూసిన కుటుంబీకులు విగతజీవిగా పడి ఉన్న వేమన్న కనిపించాడు. వారు వెంటనే కూనేరు రామభద్రపురం పీహెచ్సీకి తరలించగా అప్పటికే వేమన్న ఊపిరి వదిలినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు కొమరాడ ఎస్సై జె.ధర్మేంద్ర కేసునమోదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి పంట పోయిందనే బాధలో ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేశామన్నారు. వేమన్న చనిపోవడంతో అనాథలైన కుటుంబసభ్యులను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పత్తిలో బోరాన్ లోపం
పర్చూరు : పత్తి పంటలో బోరాన్ లోపం ఎక్కువగా ఉందని ఒంగోలు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త జీ రమేష్ తెలిపారు. పర్చూరు మండలంలోని నూతలపాడు, పర్చూరు, నాగులపాలెం, బోడవాడ, ఉప్పుటూరు గ్రామాల్లో పత్తి, పొగాకు, మిరప పంటలను ఆయన బుధవారం పరిశీలించారు. పంటలను ఆశించిన తెగుళ్లను ఎలా నివారించుకోవాలో శాస్త్రవేత్త రమేష్ రైతులకు వివరించారు. ‘పత్తిలో బోరాన్ లోపాన్ని అధిగమించేందుకు బోరాక్స్ లేదా ఫార్ములా 4 మందును 1.5 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చే యాలి. రసం పీల్చే పురుగులు ఉధృతంగా ఉన్నాయి. వాటి నివారణకు అక్తరా లేదాప్త్రెడ్ 100 మి.లీ మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. మిరపలో ఆకుమచ్చ తెగులు, తెల్లదోమ ఎక్కువగా ఉంది. ఆకు మచ్చతెగులు నివారణకు స్కోర్ 100 మి.లీ లేదా సాఫ్ పావు కిలో మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చే సుకోవాలి. తెల్లదోమ నివారణకు ట్త్రెజోఫాస్ పావు లీటరు+నువాన్ 200 మి.లీ మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. మిరపలో పైముడత నివారణకు ఇమిడా ఒక మి.లీ మందును లీటరు నీటికి, కింది ముడత నివారణకు ఓమైట్ 2 మి.లీ మందును లీటరు నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. మినుములో పల్లాకు తెగులు సోకిన మొక్కలను తొలగించాలి. పల్లాకు తెగులు ఉధృతంగా ఉంటే ట్త్రెజోఫాస్ లేదా నువాన్ను అధికారుల సూచన మేరకు పిచికారీ చేయాలి. పొగాకులో లద్దెపురుగు నివారణకు లార్విన్ లేదా రీమాన్ పావు లీటరు మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. పంటల పరిశీలనలో ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ వరప్రసాద్, పర్చూరు ఏడీఏ కే కన్నయ్య, ఏఓ గౌతమ్ ప్రసన్న, టెక్నికల్ ఏఓ సుమతి పాల్గొన్నారు. -
పత్తిలో మెగ్నీషియం, జింక్ లోపం
మార్కాపురం : జిల్లాలో పత్తి పంట(వేసవి పత్తి+ఖరీఫ్ పత్తి) 77 వేల హెక్టార్లలో సాగవుతోంది. వేసవిలో సాగు చేసిన పత్తి దిగుబడి ప్రారంభమైంది. అయితే కొన్ని ప్రాంతాల్లోని పత్తి ఆకులు కుంకుమ రంగులోకి మారి పొలం మొత్తం ఎర్రగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని మార్కాపురం వ్యవసాయాధికారి డీ బాలాజీనాయక్ దృష్టికి తీసుకెళ్లగా మెగ్నీషియం, జింక్ లోపం వల్లే ఆకులు ఎర్రగా కనిపిస్తున్నాయని వివరించారు. సూక్ష్మ ధాతు లోపాలను నివారించుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చని తెలిపారు. ‘పత్తి పంట 90 నుంచి 120 రోజుల దశల్లో ఉంది. వర్షపాతం ఎక్కువైనా, వర్షం లేకపోయినా పత్తిలో ఈ లోపం కనిపిస్తుంది. ఆకులు కుంకుమ రంగులోకి మారి పత్ర హరితాన్ని కోల్పోతాయి. ఎరుపుగా మారిన ఆకు పచ్చగా మారి రాలిపోతుంది. పక్వానికి రాని కాయలు పగలడం, మొక్క ఎత్తు పెరగకపోవడం, ఉన్న పత్తి బరువు తగ్గిపోవటం జరుగుతుంది. పూత, పిందె రాలిపోతాయి. దీని వల్ల పంట దిగుబడి 60 నుంచి 80 శాతం తగ్గిపోతుంది. మోతాదుకు మించి నత్రజని, భాస్వరం, పొటాష్ వాడటం, సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల జింక్, మెగ్నీషియం లోపం కనిపిస్తుంది. జింక్ లోపం ఉంటే ఆకుల మధ్య భాగం పసుపు పచ్చగా మారి పత్రహరితాన్ని కోల్పోతాయి. మొక్క ఆహారం తయారు చేసుకునే శక్తి కోల్పోతుంది. కొమ్మలు రాలిపోయి తక్కువ పూత వస్తుంది. పిందె పెరుగుదల ఉండదు. నివారణకు ఎకరాకు 20 కిలోల మెగీషియం సల్ఫేట్ భూమిలోగానీ లేదా పైపాటుగా ఎకరాకు 2 కిలోల మెగ్నీషియం సల్ఫేట్, ఈడీటీఏ 12 శాతం జింక్ను 200 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. దీంతో కొత్తగా వచ్చే ఆకుల్లో మెగ్నీషియం లోపం ఉండదు’. -
రైతు చిత్తు!
‘తెల్లబంగారం'గా ముద్దుగా పిలుచుకునే పత్తి పంట ఈ ఏడాది రైతులను నిలువునా ముంచింది. ఎన్నో ఏళ్లుగా ఆర్థిక భరోసానిస్తున్న పంట ఈ సారి కంట నీరు పెట్టిస్తోంది. కొద్ది రోజుల కిందట సంభవించిన హుదూద్ తుపాను ప్రభావంతో పల్నాట కురిసిన వర్షాలు పత్తి పంటకు ఎసరు తెచ్చాయి. ఆ సమయంలో పడిన వర్షాలు ఆమ్ల గుణం కలిగి ఉండడంవల్ల పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నట్టు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పంటలు కూడా పూర్తిగా ఎండిపోయాయని వాపోతున్నారు. కారంపూడి ఈ ఖరీఫ్లో వర్షాలతోపాటు, కాలువలకు సాగర్ జలాలు ఆలస్యంగా రావడంతో ఎక్కువ సంఖ్యలో రైతులు పత్తి సాగు చేపట్టారు. వరికి బదులు మాగాణి భూముల్లో కూడా సాగు చేశారు. ఏపుగా పెరిగిన పైరును చూసి రైతులు ఆనందంగా ఉన్నారు. ఆ సమయంలో హుదూద్ తుపాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసింది. దాని ప్రభావంతో ఇక్కడ కురిసిన వర్షాలకు పత్తి పంట అప్పటివ రకు బాగానే వున్నా క్రమేపి దెబ్బతినడం ప్రారంభించింది. పత్తి మొక్కలు నల్లగా మారి ఆకులు రాలి పోతున్నాయి. చివరకు మొక్కలు మోడు వారుతున్నాయి. మెట్ట భూములతోపాటు నీటి వసతి వున్న నేలల్లో సైతం ఇలా జరుగుతుండడంతో రైతులు సస్య రక్షణ చర్యలు చేపడుతున్నా ఫలితం లేకుండాపోతోంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని రైతాంగం చెపుతోంది. హుదూద్ తుపాను తరువాత పత్తి రైతు పరిస్థితి తలకిందులైంది. పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీరేదారేదంటున్నారు. ఎకరాకు కౌలు కలుపుకుని దాదాపు 43 వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. ఇప్పటి వరకు వచ్చిన దిగుబడి మూడు క్వింటాళ్లు మాత్రమే. మరో మూడు క్వింటాళ్ల వరకు రావచ్చంటున్నారు. ఆరు క్వింటాళ్లు రూ. 3,200 చొప్పున అమ్మినా రూ. 19,200 వస్తాయి. పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. ఈ ఏడాది రెక్కల కష్టానికి తోడు పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయంటున్నారు. పొలం చూడబుద్ధి కావడం లేదు... ఏడెకరాలు వేశా. ఇప్పటికి 8 క్వింటాళ్లు వచ్చింది. తుపాను తరువాత పైరంతా క్రమేణా నల్లగా అయ్యింది. పొలం చూడబుద్ధి కావడం లేదు. ఈ పరిస్థితి ఎప్పుడూ చూడ లేదు. కౌలు ఎకరా 20 వేలు. ఇంక మా పరిస్థితి మీకే అర్థం అవుతుంది. ఇంత కష్టం వున్నా ధర వుందా అంటే అదీ లేదు. పెట్టుబడులు బాగా పెరిగాయి. ధర మాత్రం కొన్నేళ్లుగా అంతే వుంటోంది. - రేళ్ల యల్లారెడ్డి, కౌలురైతు, లక్ష్మీపురం పెట్టుబడులు ఎలా తీర్చాలి ఎకరం 18 వేలు కౌలు. ఐదెకరాలు వేశా. లక్ష దాకా పెట్టుబడి అయ్యింది. ఇప్పటికి ఎకరాకు రెండు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇంకా నాలుగు క్వింటాళ్లు రావచ్చు. ధర చూస్తే రూ.2,950. క్వింటా పత్తి తీసినందుకు కూలీలకు వెయ్యి ఖర్చు. తుపాను తరువాత పైరు రోజు రోజుకు క్షీణించింది. ఆకులు నల్లగా మారి రాలి పోయాయి. పెట్టుబడులు ఎలా తీర్చాలి. - నడికోట చిరంజీవి, కౌలు రైతు, లక్ష్మీపురం సొంత పొలమైనా నష్టమే.. ఈ ఏడాది 13 ఎకరాలు వేశా. నాలుగు లక్షల పెట్టుబడి అయింది. ఇప్పటికి 20 క్వింటాళ్లు వచ్చింది. ఇంకా ఎకరాకు మూడు క్వింటాళ్లు రావచ్చు. గతంలో ఎకరాకు 20 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. తుపాను వర్షం ఏమీ చేయదనుకున్నాం. కాని అప్పుడు కురిసిన వానలో తేడా వుంది. ఇప్పటికీ పంట పరిస్థితిని ప్రభుత్వం కనిపెట్టలేకపోయింది. వ్యవసాయాధికారులు ఇతరులు ఏమి చేస్తున్నట్లు. సొంత పొలమైనా నష్టం ఈ సారి ఎక్కువగా వుంది. ఈ పరిస్థితి ఎప్పుడూ రాలేదు. - గోగిరెడ్డి కృష్ణారెడ్డి, రైతు సరస్వతి భూముల కేసులో మరో 23 మంది కోర్టుకు హాజరు పిడుగురాళ్ల: మాచవరం మండలం చెన్నాయపాలెంలో ఇటీవల జరిగిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల కేసులో శనివారం మరో 23 మందిని పోలీసులు కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసులో శుక్రవారం 13 మందిని కోర్టుకు తీసుకెళ్లగా శ నివారం డీఎస్పీ వెంకటేశ్వరనాయక్ ఆధ్వర్యంలో మరో 23 మందిని నిందితులుగా పేర్కొంటూ స్థానిక జూనియర్ సివిల్ జడ్జికోర్టు జడ్జి ఎస్ సుజాత ముందు హాజరు పరిచారు. నిందితులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో మొత్తం ఈకేసులో 92 మందిని కోర్టుకు హాజరు పరిచినట్లయింది. -
హాలాహలం
రైతన్నకు కన్నీటిని మిగిల్చిన ఖరీఫ్.. అదే దారిలో రబీ జిల్లాలో కరువు కోరలు.. అన్నదాతల ఆకలి కేకలు నిండా ముంచిన చీ‘కట్’లు.. కష్టాల సాగులో చితికిన రైతులు అరకొరగా సర్కారు సాయం.. నిర్వేదంలో బలవన్మరణాలు కోటి ఆశల నవ తెలంగాణ ప్రయాణంలోని తొలి ఖరీఫ్.. హలధారి కంట జలధారను తెప్పించింది. వర్షాభావ పరిస్థితులతో ప్రారంభమైన సీజన్... రైతు స్వేదాన్ని, రక్తాన్ని పీల్చేసింది. నీటివనరులు అందుబాటులో లేని కర్షకుడిని సాగుకు దూరం చేసిం ది. భూములను బీళ్లుగా మార్చి కష్టజీవి నోట్లో మట్టికొట్టింది. మొండి ధైర్యంతో నాగలిపట్టిన రైతును నట్టేటముంచింది. అన్నదాతను అప్పుల ఊబిలోకి దింపి అచేతనావస్థకు చేర్చింది. రైతన్న కళ్లను నీళ్లు లేని ఎడారిగా మార్చింది. తుదకు బలవంతంగా బలిపీఠమెక్కించింది. - వరంగల్ 42 మండలాల్లో వర్షాభావం జిల్లాలోని 51 మండలాలకు గాను 42 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ నుంచి సెప్టెంబరు వరకు సాధారణ వర్షపాతం కంటే అదనంగా ఒకే ఒక్క మండలంలో మాత్రమే అదనంగా వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం 993.6 మి.మీ కాగా ఇప్పటి వరకు జిల్లాలో 589.7 మి.మీ మాత్రమే నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 29 శాతం లోటు. ఒక మండలంలో మైనస్ 60శాతం నుంచి మైనస్ 99 శాతం, 41 మండలాల్లో మైనస్ 20శాతం నుంచి మైనస్ 59శాతం, 8 మండలాల్లో మైనస్ 19శాతం నుంచి అదనంగా 19శాతం, ఒకే మండలంలో అదనంగా 20 శాతం వర్షపాతం నమోదైంది. దెబ్బమీద దెబ్బ వర్షాలు లేక, కరెంటు సక్రమంగా రాక ఇబ్బందులు పడుతున్న రైతులకు తెగుళ్ల రూపంలో మరో కష్టం వచ్చిపడింది. కాస్తోకూస్తో చేతికొస్తుందనుకున్న పంటలు చీడపీడల బారిన పడడంతో రైతన్న మరింత కుంగిపోయాడు. పంట ఎదిగే సమయంలో మిరపకు, గొలుసు పెట్టే సమయంలో వరికి ఈ రోగాలు పట్టి పీడించాయి. పత్తి పంటకు దెబ్బ ఈ సీజన్లో జిల్లాలో 2,29,000 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తిని సాగు చేశారు. ఏపుగా పెరిగిన పత్తికి ఆకుముడత, తెల్లదోమ, పూత, కాత రాలిపోవడం, పచ్చదోమ కాటు, రసం పీల్చే పురుగుల దాడితో పంటలు దెబ్బతింటున్నాయి. ధర్మసాగర్, ఘనపురం, నెల్లికుదురు, చేర్యాల, చిట్యాల, శాయంపేట, నల్లబెల్లి ప్రాంతాల్లో పత్తి, మహబూబాబాద్, కురవి, మరిపెడ మండలాల్లో మిరప పంటకు ఆకు, చిగుళ్ల ముడత తెగులు వ్యాపించాయి. ఆలస్యంగా సాగుచేసిన వరిపంటకు పేనుబంక, దోమకాటు, కాండం తొలుచు పురుగులు వెంటాడుతున్నాయి. అప్పుల పెట్టుబడి.. తగ్గుతున్న దిగుబడి అప్పుల పెట్టుబడితో అన్నదాతలు ఆగమవుతున్నారు. పెరుగుతున్న పెట్టుబడి, తగ్గుతున్న దిగుబడితో అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఈ ఏడాది బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, అడ్తిదారులు, పురుగుమందు వ్యాపారుల నుంచి ఏడాదికి 45శాతానికిపైగా వడ్డీతో అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు. ఒక్కో రైతు రూ.రెండు నుంచి రూ.ఐదు లక్షల వరకు అప్పు చేస్తుండడంతో ఆ ఊబి నుంచి కోలుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో సాధారణ విస్తీర్ణం 5,03,605 హెక్టార్లు కాగా ప్రస్తుతం 4,14,084 హెక్టార్లలో(83శాతం) పంటలు సాగుచేశారు. ఇందులో ఎక్కువగా పత్తి, మొక్కజొన్న, వరి ఉన్నాయి. ఈ ఏడాది దిగుబడులు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. రూ.25వేలు.. 25 క్వింటాళ్లు తొలి వర్షానికి భూమి దున్నడం, ట్రాక్టర్ కూలీ, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీల ఖర్చులు కలిపి తడిసి మోపెడవుతున్నాయి. దీనికి అదనంగా ఇంటిల్లిపాదీ శ్రమ. మధ్యలో అకాల వర్షాలు, చీడపీడలతో పరిస్థితి మరింత దిగజారుతోంది. వరి సాగుకు ఎకరానికి రూ.25వేలు పెట్టుబడి పెడితే సగటున ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రభుత్వ మద్దతు ధర లభిస్తే రూ. 33 వేలు రైతుకు వచ్చే అవకాశం ఉంది. ఇక కౌలు రైతులకు అదనంగా భూమి కౌలు, పెట్టుబడి వడ్డీ కలిపి రూ.10వేల భారం పడే పరిస్థితి నెలకొంది. పత్తి సాగుకు ఎకరానికి రూ. 30వేలు పెట్టుబడి పెడితే దిగుబడి ఆరు క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంది. పత్తి అమ్మకం ద్వారా రూ. 25వేలు వస్తాయని అంచనా. మొక్కజొన్న ఎకరానికి రూ.20 వేలు పెడితే దిగుబడి 30 క్వింటాళ్లు వస్తుంది. మద్దతు ధర లభిస్తే రూ. 34వేలు వస్తుంది. రుణం కోసం అరిగోస రుణం కోసం రైతులు గోసపడుతున్నారు. రుణం అందకుండానే ఖరీఫ్ ముగియడంతో కనీసం రబీలో అయినా అందుతుందో లేదోననే మీమాంశ లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చి న రుణమాఫీ హామీ అమలులో జాప్యం కావడంతో అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. సెప్టెంబర్ నెలాఖరులో రుణమాఫీకి సంబంధించి ఆమోదం తెలియజేస్తూ ప్రభుత్వం 25శాతం నిధులు విడుదల చేసింది. కొత్త రుణాలివ్వాలని బ్యాంకులను ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలుకావడం లేదు. ఆర్బీఐ గైడ్లైన్స్ అందలేదని క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు చెబుతున్నారు. జిల్లాలో రూ.లక్షలోపు రుణమాఫీ కింద రూ.1915 కోట్ల మేరకు ఉన్నాయని, జిల్లాకు రూ. 472 కోట్లు విడుదలయ్యాయని లీడ్బ్యాంక్ అధికారులు తెలిపారు. రుణాల రెన్యువల్కు సంబంధించి కసరత్తు సాగుతున్నట్టు పేర్కొన్నారు. నిజానికి జిల్లాలో నాలుగు లక్షలమంది రైతులు పంట రుణాలపై ఆధారపడి సాగుచేస్తున్నారు. వర్షాభావంతో ఈసారి ఆ సంఖ్య మూడు లక్షలకు తగ్గింది. ఈ ఏడాది పంట రుణాల కింద రూ.2,100 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఖరీఫ్ లక్ష్యం రూ.1,400 కోట్లు ఉండగా ఇప్పటి వరకు రుణాలిచ్చిన జాడలేదు. రబీలో పంట రుణాల లక్ష్యం రూ.700 కోట్లుగా ప్రకటించారు. ఈ మేరకు రైతులకు రుణాలందించి ఆదుకునేందుకు కృషి చేస్తున్నామని అధికారులు ప్రకటిస్తున్నారు. -
బలిపీఠంపై రైతన్నలు
14 మంది రైతుల ఆత్మహత్య నెట్వర్క్: కాడి పట్టుకోవాల్సిన రైతు కాటికి వెళ్తున్నాడు. బ్యాంకు రుణం మాఫీ చేయాలని కలెక్టర్కు, బ్యాంకు అధికారులకు లేఖ రాసుకొని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లాలో నలుగురు, మహబూబ్నగర్ జిల్లాలో ముగ్గురు, నల్లగొండలో ఇద్దరు, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో ఒకరు చొప్పున, కరీంనగర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం శాభాష్పల్లికి చెందిన చంద్రగిరి ఉరఫ్ దార్కార్ రాజయ్య(49) ట్రాక్టర్ లోన్కు సంబంధించి రూ.5.40 లక్షల అప్పు ఉంది. పత్తి సాగుకు పెట్టుబడిగా రూ.లక్ష అప్పు తీసుకువచ్చాడు. అప్పులు తీరే మార్గం కానరాక రాజయ్య మనస్తాపంతో ఉరేసుకున్నాడు. కోనరావుపేట మం డలం పల్లిమక్తకు చెందిన రైతు ఎగంటి దేవయ్య(40) రూ.4 లక్షల అప్పు తీర్చే మార్గం కానరాక మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించాడు. నల్లగొండ జిల్లా మునుగోడుకు చెందిన రైతు కొమ్ము లింగయ్య(48) తనకున్న 8 ఎకరాలకు తోడు మరో ఏడు ఎకరాలు కౌలు తీసుకొని పత్తి సాగు చేశా డు. రూ. మూడు లక్షలు అప్పు చేశాడు. దిగుబడి వచ్చే అవకాశం లేక శుక్ర వారం ఆత్మహత్య చేసుకున్నాడు. చందంపేట మండలం నేరడుగొమ్ము పరిధి చర్ల తండాకు చెందిన రైతు నేనావత్ చందు(40) పత్తి వేసి నష్ట పోవ డంతో గురువారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన రైతు బొజ్జ భీమలింగం (43) ఎనిమిది ఎకరాల్లో సాగు చేశాడు. సాగుకు రూ.లక్ష వరకు, బంగారంపై బ్యాంకులో అప్పు, పంట రుణాలు, మరో రూ.2 లక్షలు ప్రైవేటు అప్పులు ఉన్నాయి. బుధవారంరాత్రి క్రిమిసంహారక మందు తాగి చనిపోయాడు. మహబూబ్నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం పుల్లగిరికి చెందిన రైతు పెద్ద ఆంజనేయులు(60) మొక్కజొన్న, పత్తి పంట చేతికందకపోవడంతో గురువారం క్రిమిసంహారక మందు తాగాడు. వడ్దేపల్లి మండలం రాజోలికి చెందిన గళ్ల మద్దిలేటి(35) పంటలు దెబ్బ తినడంతో గురువారం పురుగుల మందు తాగాడు. తిమ్మాజీపేట మండలం పుల్లగిరికి చెందిన పెద్ద ఆంజనేయులు(60) పంట చేతికి వచ్చే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుమ్మరి గూడకు చెందిన కుమ్మరి సత్తయ్య(38) పత్తి సాగు చేస్తున్నాడు. రూ. 50 వేలు అప్పు చేశాడు. పంట ఎండిపోవడంతో మనస్తాపం చెంది గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. పరిగి మండలం సయ్యద్ పల్లికి చెందిన మల్లిగారి రామ స్వామి(40) ఆరు ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. ఏడీబీ బ్యాంకు నుంచి రూ. 4 లక్షలు, ప్రైవేటుగా రూ. లక్ష అప్పు చేశాడు. గురువారం పురుగుల మందుతా గాడు. వికారాబాద్ మండలం ధన్నారం గ్రామానికి చెందిన ఆలూరి బాలయ్య(40) రెండు ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. రెండేళ్లుగా రూ.1.50 లక్షలు అప్పు చేశాడు. పంటలు పోవడంతో శుక్రవారం ఉరి వేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుసుమామిడికి చెందిన ఎండీ బురాన్(45) తనకున్న మూడెకరాల్లో మొక్కజొన్న, మరో పది ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, క్యారెట్, టమోటా, క్యాబేజీ సాగు చేస్తున్నాడు. పంటలు ఎండుముఖం పట్టడంతో మనోవేదనకు గురైన బురాన్ మంచంపట్టాడు. వికారాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్పేటకు చెందిన రైతు మన్నె నరసింహులు(45), ఖమ్మం జిల్లా పెదబండిరేవు గ్రామ రైతు పాయం సూరయ్య(87) తనకున్న కొద్దిపాటి భూమిలో పత్తి, వరి సాగు చేశా డు. పంట గురువారం ఇంట్లోనే గుళికలు మింగాడు. -
పానమంతా పత్తిమీదే
నిరాశపరిచిన మద్దతు ధర గజ్వేల్: తీవ్ర వర్షాభావం... పంటలన్నీ ఆగమైపోయాయి. ఏం చేయాలో తెలియని మెతుకుసీమ రైతన్న కాస్తాకూస్తో చేతికందనున్న తెల్ల‘బంగారం’పై ఆశలు పెట్టుకున్నాడు. జిల్లాలో ప్రధాన పంటగా ఆవిర్భవించిన పత్తిపంట మరోవారం రోజుల తర్వాత మార్కెట్ బాట పట్టే అవకాశముంది. అయితే మిగతా పంటలన్నీ కోల్పోయి నష్టాల్లో కూరుకుపోయిన రైతన్నను ఆదుకోవాల్సిన అధికార యంత్రాగం గిట్టుబాటు ధర అందించే విషయంలో పిసినారి తనం చూపించింది. గతేడాది ఇబ్బడిముబ్బడిగా నిల్వలున్నా సీసీఐ కేంద్రాలు సక్రమంగా నడవక రైతులు వ్యాపారులను ఆశ్రయించి అతితక్కువ ధరకు తమ ఉత్పత్తులను తెగనమ్ముకున్నారు. ధర రూపేణా కోట్లల్లో నష్టం జరిగింది. ఈసారైనా చేతికందే కొద్దిపాటి దిగుబడులకైనా ‘గిట్టుబాటు’ అందించాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు. ప్రతికూలంలోనూ...పత్తిపై మమకారం మెదక్ జిల్లాలో ఈసారి పత్తి 1.25 లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులు ఈ పంటపై ‘మమకారం’ ప్రదర్శించారు. ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షాలు లేకపోవడంవల్ల ఈ పంట సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక్కోరైతు రెండు నుంచి మూడుసార్లు విత్తనాలు చెడగొట్టి వేసుకోవాల్సి వచ్చింది. విత్తనాలు, ఇతర పెట్టుబడులు రూపంలో అప్పటికే కోట్లల్లో నష్టం జరిగిపోయింది. ఆగస్టు, సెప్టెంబర్, ప్రస్తుత అక్టోబర్లోనూ ఈ పంటకు అనుకూలమైన వర్షాలు కురవలేదు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా పంట దిగుబడులపై విపరీతమైన ప్రభావం చూపింది. చేతికందే కొద్దిపాటి దిగుబడులకైనా ఈసారి ‘గిట్టుబాటు’ దక్కుతుందా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరో వారం రోజుల తర్వాత ఉత్పత్తులు మార్కెట్ బాటపట్టే అవకాశముండగా, అధికార యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో కొనుగోళ్లు చేపడితే తప్ప రైతులకు లాభం జరిగే అవకాశం లేదు. ఈసారి మద్దతు ధరను రైతులు రూ.5 వేల వరకు ఆశిస్తే ప్రభుత్వం గతేడాది ఉన్న మద్దతు ధర రూ.3,700 నుంచి రూ. 4,000 స్వల్పంగా మరో రూ.50 మాత్రమే పెంచింది. ఈ లెక్కన ఈసారి రూ.3,750 నుంచి రూ.4,050 ధర వర్తిస్తుంది. గతేడాది చోటుచేసుకున్న చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి కొనుగోళ్లు జరపడంతో పాటు గిట్టుబాటుధర అందించాలని రైతులు కోరుతున్నారు. గతేడాది ఇలా.. గతేడాది జిల్లాలో 1.20 లక్షల హెక్టార్లకుపైగా పత్తి సాగైంది. అయితే అధికారులు జిల్లాలోని గజ్వేల్, తొగుట, జోగిపేట, జహీరాబాద్, సిద్దిపేట సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.4,000 కూడా రైతులకు ఎక్కడా అందలేదు. సీసీఐ నిర్ణయాన్ని అదునుగా భావించిన వ్యాపారులు ధరను అమాంతం తగ్గించేశారు. సీసీఐ కొనుగోళ్లు ఎప్పుడు జరుగుతాయో, ఎప్పుడు నిలిచిపోతాయో తెలియని పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించారు. రైతుల పరిస్థితిని ఆసరాగా చేసుకొని ట్రేడర్లు అత్యల్పంగా రూ. 3,500 నుంచి రూ.3,800 వరకు మాత్రమే పత్తికి చెల్లించారు. నామమాత్రంగా కొన్ని రోజులు రూ. 4 వేల పైచిలుకు ధరను అందించారు. సీసీఐ కమర్షియల్ పర్చేజ్కు దిగితేనే మేలు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే పత్తికి బహిరంగ మార్కెట్లో అధిక రేటు పలుకుతున్న ప్రస్తుత తరుణంలో, సీసీఐ స్పందించి వ్యాపారులకు ధీటుగా కమర్షియల్ దిగాల్సిన అవసరముంది. 2011 జనవరి, ఫిబ్రవరి నెలల్లో మార్కెట్లో ఇదే రకమైన పరిస్థితులు ఉత్పన్నమైన సమయంలో మద్దతు ధరతో ప్రమేయం లేకుండా సీసీఐ కూడా కమర్షియల్ పర్చేజ్కు దిగింది. సీసీఐ అప్పట్లో క్వింటాలుకు గరిష్ఠంగా రూ.6,900 వరకు రైతులకు చెల్లించింది. ఈసారి కూడా అదే తరహాలో స్పందిస్తే రైతన్నలకు ప్రయోజనం కలిగే అవకాశముంది. -
ఇంత మోసమా..!
►వైఎస్ జగన్ ఎదుట బాబుకు శాపనార్థాలు పెట్టిన డ్వాక్రా మహిళలు ►వేల్పులలో పత్తి పంటను పరిశీలించిన జగన్ ►పండుటాకులకు ఆప్యాయ పలకరింపు ►రేషన్ డీలర్లను అన్యాయంగా తొలగిస్తే ఊరుకోమని హెచ్చరిక ►ప్రతిపక్షనేతతో జిల్లా అధ్యక్షుడు, కడప ఎమ్మెల్యే, మేయర్ చర్చలు ►పులివెందులలో అమ్మవారిని దర్శించుకున్న వైఎస్ జగన్ ►రెండు రోజుల పర్యటన విజయవంతం కడప సాక్షి/పులివెందుల/టౌన్/వేముల : ‘ఎన్నికల ప్రచారంలో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానన్నారు... అధికారంలోకి వచ్చిన తర్వాత వంచిస్తున్నాడు.. బ్యాంకోళ్లేమో వడ్డీకి వడ్డీ రాబడుతున్నారు.. నాలుగు నెలల కంతు ఒకేసారి కడితే మొత్తమంతా వడ్డీకే సరిపోయింది.. అసలుకు ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలో తెలియడం లేదు.. చంద్రబాబు ఇంత మోసగాడని తెలియదు’.. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట డ్వాక్రా మహిళలు అన్న మాటలు ఇవి. హామీలు ఇచ్చి విస్మరించడం కాదు.. ఇచ్చి నెరవేర్చేవాడే నాయకుడు అని జగన్ వారికి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం వేముల మండలంలోని వేల్పుల గ్రామంలో డ్వాక్రా మహిళలను వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ... కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలంతా చంద్రబాబు పాలనను ఎండగడుతూ తమకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని.. అప్పటివరకు ఎవరు రుణాలను చెల్లించవద్దని కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేశారంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. పండుటాకులకు పలకరింపు.. : ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వైఎస్ జగన్ కోసం వందల సంఖ్యలో కూర్చొన్న అవ్వ.. తాతలను వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. వృద్ధులను చూసిన వైఎస్ జగన్ వారి వద్దకు నేరుగా వెళ్లి బుగ్గలు నిమురుతూ అవ్వా అంటూ ఆప్యాయంగా వారిని దగ్గరకు తీసుకున్నారు. వారు కూడా వైఎస్ జగన్తో తమ కష్టనష్టాలను వెల్లబోసుకున్నారు. వైఎస్ఆర్ హయాం నుంచి పింఛన్ వస్తోందని.. అనర్హుల పేరుతో తమ పింఛన్లను తొలగించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. ట్రిపుల్ ఐటీలో ఎలెక్ట్రిషియన్లకు జీతాలు పెంచండి రాష్ట్రంలోని మూడు ట్రిపుల్ ఐటీలలో పనిచేస్తున్న ఎలక్ట్రిషియన్లు, ఫ్లంబర్స్ జీతాలు పెంచాలని వైఎస్ జగన్రెడ్డి ఓఎస్డీని ఆదేశించారు. ఇడుపులపాయలోని ట్రిపుల్ఐటీలో పనిచేస్తున్న కొంతమంది ఎలక్ట్రిషియన్లు, ఫ్లంబర్లు వచ్చి పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు. ట్రిపుల్ ఐటీలో ఆరంభం నుంచి పనిచేస్తున్న తమకు సంబంధించి ఇప్పటివరకు రూ. 7,100లు జీతం ఇస్తున్నారని.. జేఎన్టీయూ, యోగి వేమన యూనివర్శిటీల పరిధిలోని ఇదే సిబ్బందికి రూ. 10,900లు ఇస్తున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన ట్రిపుల్ ఐటీల ఓఎస్డీ నితిన్తో టెలిఫోన్లో చర్చించారు. వైఎస్ జగన్ను కలిసిన విద్యుత్ ఉద్యోగులు ఆర్టీపీపీలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులతోపాటు ఏపీ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ను కలిశారు. క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసిన ఆర్టీపీపీ ఉద్యోగులు వేతన సవరణ వెంటనే చేసేలా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు యాజమాన్యంపై ఒత్తిడి తీసుకరావాలని కోరారు. ఉద్యోగుల వేతన సవరణ చట్టాన్ని తెలంగాణాలో చేపట్టారని.. ఏపీలో ఇంకా చేపట్టలేదని పేర్కొనగా. అసెంబ్లీలో చర్చిస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ను కలిసిన పలువురు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం క్యాంపు కార్యాలయంలో పలువురు నేతలు కలిశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఆయన సోదరుడు ఆకేపాటి మురళీధర్రెడ్డి, జిల్లా మేయర్ సురేష్బాబు, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి తదితరులు కలిసి చర్చించారు. ఈ సందర్భంగా అనేక రాజకీయ అంశాలపై వారు చర్చించుకున్నారు. బెంజిమన్ కుటుంబానికి పరామర్శ : పులివెందులలోని బాకరాపురంలో నివసిస్తున్న బెంజిమన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బెంజిమన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతోపాటు కుటుంబానికి అండగా ఉంటానని భరోసాను ఇచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న వైఎస్ జగన్ పులివెందులలోని అమ్మవారిశాలలో దసరా ఉత్సవాలను పురష్కరించుకుని ప్రతిపక్షనేత వైఎస్ జగన్రెడ్డి తొలిరోజు వాసవీ కన్యకపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. వైఎస్ జగన్ ఆలయం వద్దకు రాగానే పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న వైఎస్ జగన్ సమీపంలోనే మీనాక్షి అలంకారంలో ఉన్న అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువుతోపాటు అద్దాల మండపాన్ని ై సందర్శించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైఎస్ జగన్ను ఆర్యవైశ్యులు శాలువాలతో సన్మానించారు. రెండు రోజుల పర్యటన విజయవంతం ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్రెడ్డి రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండు రోజులు వివిధ కార్యక్రమాలలో బిజీ బిజీగా గడిపిన వైఎస్ జగన్రెడ్డి గురువారం రాత్రి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరి హైదరాబాద్కు వెళ్లారు. పంటలను పరిశీలించిన ప్రతిపక్షనేత వేల్పుల గ్రామ సమీపంలోని భూమయ్యగారిపల్లె క్రాస్ వద్ద రైతు విశ్వనాథరెడ్డి సాగు చేసి వాడు దశలో ఉన్న పత్తి పంటను వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సాయంత్రం పరిశీలించారు. వర్షాభావంతో పంట ఎదుగుదలలేక.. నడుముల ఎత్తు ఉండాల్సిన పత్తి పంట కేవలం జానెడు ఎత్తు మాత్రమే ఉండటం చూసి వైఎస్ జగన్ చలించిపోయారు. అక్కడే అరటి గెల పట్టుకున్న రైతుతోపాటు విశ్వనాథరెడ్డితో కూడా వైఎస్ జగన్ మాట్లాడారు. ఏడీ జమ్మన్న, ఏవో చెన్నారెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డిని అడిగి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేముల మండల పరిశీలకుడు వేల్పుల రాము, ఎంపీపీ ఉషారాణి, సర్పంచ్ పార్వతమ్మ, మాజీ జెడ్పీటీసీ రాజారెడ్డి, వేల్పుల సింగిల్విండో అధ్యక్షుడు శివశంకర్రెడ్డి, బయపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేషన్ డీలర్లను అన్యాయంగా తొలగిస్తే ఊరుకోం వినియోగదారులకు సంబంధించి సక్రమంగా సరుకులు అందజేస్తున్నా.. చిన్న చిన్న కారణాలు చూపి రేషన్ డీలర్లను తొలగించేలా చూస్తే ఊరుకునేది లేదని వైఎస్ జగన్రెడ్డి అధికారులను హెచ్చరించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో చక్రాయపేట మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు వచ్చి వైఎస్ జగన్ను కలిసి సమస్యను విన్నవించారు. దీంతో స్పందించిన వైఎస్ జగన్ పేదలకు రేషన్ను సక్రమంగా అందిస్తున్నా.. కుంటి సాకులతో ఇబ్బం దులు పెట్టాలని చూస్తే.. బాగుండదని హెచ్చరించారు. ఈ విషయంలో న్యాయ పోరాటం చేయడానికి కూడా వెనుకాడమని తేల్చి చెప్పారు. -
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం
మెదక్ రూరల్: పురుగు మందులను కొట్టే సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అస్వస్థతకు గురయ్యే అవకాశంతో పాటు ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్ (8886612480) తెలిపారు. ప్రస్తుతం రైతులు సాగు పత్తి పం టలకు మందు స్ప్రే చేసే సమయం కావున రైతులు ఈ సలహాలను పాటించాలని సూచించారు. తీసుకోవల్సిన జాగ్రత్తలు... పురుగు మందు డబ్బాను నోటితో తీయవద్దు, మందును చేతితో కలపొద్దు. పవర్ స్ప్రేయర్ నాజిల్ను పెద్దగా చేయరాదు. మందు సన ్నగా తుంపరగా పడేలా చూడాలి. ఒకేసారి రెండు, మూడు మందులను కలిపి పిచికారీ చేయొద్దు. నిండుగా దుస్తులు, చేతులకు గ్లౌజులు, కళ్లజోడు, ముఖానికి మాస్క్, తలకు టోపీ లేదా రుమాలు ధరించాలి. ఉదయం, సాయంత్రం వేళలో మాత్రమే మందు స్ప్రే చేయాలి. గాలికి ఎదురుగా పిచికారీ చేయొద్దు. స్ప్రే చేయడం పూర్తయ్యే వరకూ భోజనం చేయడం, పొగతాగడం చేయకూడదు. గాయాలు, పుండ్లు ఉన్న వ్యక్తులు పురుగు మందులు పిచికారీ చేయొద్దు. మందు ప్రభావానికి గురైతే పురుగు మందు ప్రభావానికి గురైన వ్యక్తి నోట్లో వేలు పెట్టి వాంతి చేయించాలి. మూర్చపోయిన సందర్భంలో నాలుక కరుచు కోకుండా రెండు దవడల మధ్య గుడ్డ పెట్టాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు తడిబట్టతో తుడవాలి. ఉష్ణోగ్రత తగ్గితే దుప్పటి కప్పి వెచ్చగా ఉంచాలి. వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించాలి. -
నీటి ఎద్దడిని తట్టుకునే మాఘీ జొన్న
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అరకొరగా కురిసిన వర్షాలు అన్నదాతను నిరాశకు గురిచేశాయి. జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో వేసిన పంటలు చేతికందకుండా పోయాయి. మొత్తం మీద ఖరీఫ్.. కష్టాలను మిగిల్చడంతో రైతులు రబీపైనే ఆశలు పెట్టుకున్నారు. వర్షాలు కురవని కారణంగా జిల్లాలో కంది, పత్తి పంటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో కంది, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా మాఘీజొన్నను సాగు చేసుకోవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ‘మాఘీ జొన్న నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. అంతేగాకుండా మార్కెట్లో ఈ పంటకు మంచి ధర కూడా ఉంటోంది. పశుగ్రాసం కొరత కూడా ఉండద’నిఒంగోలు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త జీ రమేష్ పేర్కొన్నారు. మాఘీ జొన్న సాగు చేసే విధానం, ఎరువుల యాజమాన్యం గురించి ఆయన ‘సాక్షి’కి వివరించారు. విత్తన రకాలు.. సీఎస్వీ-1 : గింజలు తెల్లగా ఉంటాయి. చొప్ప పశువులు తినేందుకు అనుకూలంగా ఉంటుంది. ఎన్-35-1 : నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. ఈ రకం బెట్టను తట్టుకుంటుంది. ఎన్టీజే-1 : 95-110 రోజుల్లో పంట కోతకు వస్తుంది. సీఎస్వీ-216వీ : ఎక్కువ గింజలు, నాణ్యమైన చొప్ప దిగుబడినిచ్చే రకం. గింజలు ముత్యాల మాదిరిగా ఉంటాయి. ఎన్టీజే-2647 : ఇది తెలుపు గింజ రకం. 90-100 రోజుల పంట కాలం. ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వ స్తుంది. యాజమాన్య పద్ధతులు సాధారణంగా జొన్నను లోతైన నల్లరేగడి భూముల్లో సాగు చేస్తారు. ఈ నేలల్లో పోషాకాలు నిల్వ చేసుకునే శక్తి అధికంగా ఉంటుంది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండో వారంలోపు విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తుకుంటే పంట చివరి దశలో బెట్టకు వ స్తుంది. దానివల్ల దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. విత్తన మోతాదు : ఎకరాకు 3-4 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఎకరాకు 72,000 మొక్కలు ఉండేలా విత్తుకోవాలి. అంటే వరసల మధ్య 45 సెం.మీ, మొక్కల మధ్య 15 సెం.మీ దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తే ముందు ఒక కిలో విత్తనాలను 2-5 గ్రాముల ఇమిడాక్లోఫ్రిడ్తో శుద్ధి చేస్తే మొవ్వను చంపే ఈగ బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఎరువుల యాజమాన్యం ఎకరాకు 50 కిలోల డీఏపీ, 20 కిలోల యూరియా, 25 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. విత్తిన 42 గంటల్లోపు ఎకరాకు 400 గ్రాముల అట్రాజిన్ పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. ఇలా చేస్తే 35 రోజుల వరకు కలుపు సమస్య ఉండదు. ఎకరాకు రూ.20 వేల వరకు ఆదాయం పంట రకాలను బట్టి ఎకరాకు 25-35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్లో ప్రస్తుతం క్వింటా రూ.1,500 నుంచి రూ.1,700 వరకు రేటు పలుకుతోంది. అంటే సాగు ఖర్చు, కౌలు ఖర్చు పోను ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం పొందవచ్చు. -
వర్ష బీభత్సం
ఆదిలాబాద్, సాక్షి ప్రతినిధి : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిర్పూర్, కౌటాల, బెజ్జూరు మండలాల్లో రెండు రోజులపాటు రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో పెన్గంగ, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి వార్థ నదిపై ఉన్న ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పెన్గంగా ఉధృతి గంటగంటకు పెరుగుతోంది. అడ వాగు పొంగి ప్రవహిస్తుండటంతో కొమురం భీమ్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదిలారు. అలాగే కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో నాలుగు గేట్లు తెరిచి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. 120 గ్రామాలకు నిలిచిన రాకపోకలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. కౌటాల, బెజ్జూరు, దహెగాం, కాగజ్నగర్ తదితర మండలాల పరిధిలో సుమారు 120 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కేవలం మా రుమూల గ్రామాలే కాదు, బెజ్జూరు మండల కేంద్రానికి కూడా రాకపోకలు నిలిచిపోయాయంటే వర్ష బీభత్సా న్ని అర్థం చేసుకోవచ్చు. ఈ మండలాల్లోని గ్రామాల ప్రజలు ఎడ్లబండ్లపై వాగు దాటి తమ తమ గ్రామాలకు చేరుకుంటున్నారు. వరద ఉధృతి ఇదే విధంగ కొనసాగితే నేడు(మంగళవారం) ఉదయం వరకు ఎడ్లబండ్లతో ప్రయాణించడం కష్టం కానుంది. సిర్పూర్-మహారాష్ట్ర రోడ్డులో వెంకట్రావ్పేట గ్రామ సమీపంలోని పెన్గంగా నదిపై ఉన్న వంతెన పైకప్పునకు సమాన స్థాయిలో వరదనీరు ప్రవహిస్తుంది. వంతెనకు సమీపంలోని మహారాష్ట్రలోని పోడిషా గ్రామ సమీపంలో రోడ్డు పూర్తిగా వరదనీటిలో మునిగిపోవడంతో మహారాష్ట్రకు రాకపోకలు సాగించే ప్రయాణికులు నాటు పడవల ద్వారా ప్రయాణాలు సాగిస్తున్నారు. భారీ నష్టం రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఆదివారం జిల్లాలో ఇద్దరు వ్యక్తులు వాగు దాటుతూ వరద ఉధృతికి గల్లంతు కాగా, ఆస్తి నష్టం కూడా భారీగానే వాటిల్లింది. తిర్యాణి మండలం ఇర్కపల్లికి చెందిన హన్మంతరావు (25) అనే యువకుడు చెలిమెలవాగు దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. లోకేశ్వరం మండలం కిష్టాపూర్కు చెందిన ఎస్.కిషన్ (32) అనే యువకుడు కూడా గల్లంతయ్యాడు. జిల్లా వ్యాప్తంగా 662 ఇళ్లకు నష్టం వాటిల్లింది. ఇందులో 77 నివాసాలు పూర్తిగా కూలిపోవడంతో ఆ కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. పంట నష్టం అధిక వర్షాలకు పంట చేలల్లో నీరు చేరింది. ఇప్పటి వరకు దహెగాం, సిర్పూర్-టి మండలాల్లో పంట నష్టం వివరాలు అందాయి. సుమారు 1160 ఎకరాల్లో సోయా, 985 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే బెజ్జూరు మండలంలో మూడు చెరువులు, నెన్నెల్లో మరో చెరువుకు గండిపడింది. జాతీయ విపత్తు నియంత్రణ బృందాలు అధిక వర్షాల ప్రభావిత మండలాల్లో పరిస్థితులను, తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్ ఎం.జగన్మోహన్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్లు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే రిస్క్యూ ఆపరేషన్లు నిర్వహించేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాతీయ విపత్తు నియంత్రణ బృందాలను సిర్పూర్లో అందుబాటులో ఉంచారు. జిల్లాలో రెండు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌటాల మండలం కన్నేపల్లి గ్రామంలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురికాగా సుమారు 140 మంది గ్రామస్తులను కన్నేపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. ధరంపల్లి గ్రామానికి చెందిన మరో 150 మందిని డబ్బా గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. అప్పుడు అధికం.. ఇప్పుడు అథమం.. బజార్హత్నూర్ 17 సెంటీమీటర్లు, సారంగపూర్ 14.9, నిర్మల్ 12, కుంటాల 11.7, లోకేశ్వరం 11, ఇచ్చోడ 10.4, దిలావర్నూర్ 10.1, జైనూర్ 10.1, భైంసా 9.7, జైనథ్ 9.4, నార్నూర్ 9.6, కడెం పెద్దూర్ 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా సగటున 9 సెంటీమీటర్లు నమోదైంది. సాధారణ వర్షపాతం 897.5 మిటీమీటర్లు కాగా 679.4 మిల్లీమీటర్లు పడింది. 25 శాతం లోటుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 1,269 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. 29 శాతం అధికంగా పడింది. -
అధిక భాస్వరంతో పంటకు అనర్థం
మార్కాపురం : ‘జిల్లాలో పత్తి పంట మొలకెత్తే దశ నుంచి తీత దశలో సాగులో ఉంది. ప్రస్తుతం పంటను కాపాడుకోవడానికి రైతులు అనుసరిస్తున్న పద్ధతులు మారాలి. అధిక దిగుబడి కోసం విచక్షణా రహితంగా ఎరువులు వాడితే మొదటికే మోసం వస్తుంద’ని చెబుతున్నారు మార్కాపురం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కేఐ సుదర్శనరాజు(8886613189). పత్తిలో సస్యరక్షణ, ఎరువుల వాడకం గురించి ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్ర : పత్తిలో ఎరువుల యాజమాన్యం ఎలా? జ : దుక్కిలో 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ వేయాలి. పైపాటుగా నత్రజనిని 12 కిలోల చొప్పున మూడు దఫాలుగా వేసుకోవాలి. 30 రోజుల వ్యవధిలో ఒకసారి, 45 రోజుల వ్యవధిలో రెండోసారి, 60 రోజుల వ్యవధిలో మరోసారి వేసుకోవాలి. 60 రోజుల తర్వాత పొటాష్ 12 కిలోలు వే యాలి. రైతులు భాస్వరంను దుక్కిలో మాత్రమే వేసుకోవాలి. ప్ర : రైతులు పంటల సాగులో పొరపాట్లు చేస్తున్నారా? జ : అవును. అధిక దిగుబడి కోసం తమ ఇష్టమొచ్చిన రీతిలో ఎరువులను వాడుతున్నారు. దీనివల్ల భూసారం దెబ్బతినడంతో పాటు పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. భాస్వరం ఎక్కువగా వాడితే నేలకు చేటు చేస్తుంది. సూక్ష్మ పోషకాలను మొక్కకు అందకుండా నిలిపేస్తుంది. నత్రజని ఎరువును ఎక్కువగా వాడితే మెత్తదనం పెరిగి పురుగులు, తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. రైతులు పొటాష్ను ఎక్కువగా వాడటం లేదు. దీనిని వాడకపోవడం వల్ల మొక్కకు రావాల్సిన గట్టిదనం రాదు. గింజల్లో, దూదిలో నాణ్యత తగ్గుతుంది. ప్ర : పత్తిలో పోషక లోపాలను గుర్తించారా? జ : మార్కాపురం ప్రాంతంలో సాగు చేస్తున్న పత్తిలో మెగ్నీషియం, బోరాన్ లోపం కనిపిస్తోంది. 10 గ్రా. మెగ్నిషీయం సల్ఫేట్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బోరాన్ లోపం నివారణకు 1.25 గ్రా. బోరాక్స్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్ర : పత్తిలో రసం పీల్చే పురుగులను ఎలా నివారించాలి? జ : రసం పీల్చేటువంటి పేనుబంక, పచ్చదోమ, తామర పురుగులను పత్తి మొక్క కాండానికి మందును బొట్టు పెట్టే పద్ధతిలో నివారించవచ్చు. ఈ పద్ధతిలో దశలను బట్టి మోనోక్రోటోఫాస్ మందును 1:4 నిష్పత్తిలో నీటిలో కలుపుకోవాలి. ఇదే మందును పిచికారీ చేస్తే మిత్ర పురుగులు చనిపోయి పైరు దెబ్బతింటుంది. పూతపూసే విధానం వల్ల ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. బ్రష్ను రైతులు ఇంటి వ ద్దే రూ.150 ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. -
వరి.. జాగ్రత్తలివిగో..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో పత్తి, సోయాబిన్ పంటల తర్వాత అధిక విస్తీర్ణంలో సాగయ్యేది వరి. అయితే ఈ ఏడాది వర్షాలు ఆశించినస్థాయిలో కురవలేదు. ఖరీఫ్లో 1.50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేయగా వర్షాభావ పరిస్థితులతో జూన్, జూలై, ఆగస్టు మూడో వారం వరకు సా ధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీం తో వరిసాగు 38వేల ఎకరాలకే పరిమితమైంది. వారం నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువుల్లోకి నీరు చేరడంతో కొందరు రైతు లు ముదిరిన నారును నాటేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరి సాగులో యాజమాన్య పద్ధతులను వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్ రైతులకు వివరించారు. ఎక్కువగా ఆశించే తెగుళ్లు.. జింక్ ధాతు లోపంతో వరి ఇటుక రంగులో, ముదురు ఆకులు ఎరుపు రంగులోకి మారడం, ఆకులు ముడుచుకుపోవడం జరుగుతుంది. అగ్గితెగులు, కాండం తొలుచు పురుగు, తాటాకు తెగులు, పురుగు ఉల్లికోడు, మధ్యస్థాయి నుంచి కోత దశలో తెల్లదోమ వ్యాప్తి చెందుతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. నాట్లు వేసిన 10 నుంచి 15 రోజుల తర్వాత పైరజోసల్ఫ్యుర్ ఎకరానికి 80 గ్రాములు లేదా 20 రోజుల తర్వాత ఇతాక్సిసల్ఫ్యురాన్ ఎకరానికి 50 గ్రాముల చొప్పన 200 లీటర్ల నీటికి కలిపి పొలంలో నీటిని తీసివేసి సమానంగా పిచికారీ చేయడం ద్వారా కలుపును నివారించవచ్చు. నాట్లు వేసిన 30 నుంచి 35 రోజుల్లో గడ్డి జాతి, కలుపు నివారణకు బిస్ పైర్ బాక్ సోడియం ఎకరానికి 100 మిల్లీలీటర్లు 05 మిల్లీ లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చే యాలి. 30 నుంచి 40 రోజుల వ ్యవధిలో కాండం తొలిచే పురుగు, ఉల్లికోడు, తాటాకు తెగులు ఆకుముడుత లాంటి పురుగుల నివారణకు ముందు జాగ్రత్తగా పొలంలో నీటిని తీసివేసి ఎకరానికి కార్బోప్యురాన్ 10 కిలోలు లేదా ఫోరేట్ 5 కిలోల గుళికలు వేయాలి. కాండం తొలుచు పురుగు తర్వాతి దశలో క్లొరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 లేదా కార్టప్ హైడ్రోక్టోరైడ్ 2.0 గ్రాములు లేదా క్లోరాంత్రి నిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంట మధ్య లేదా చివరి దశలో సుడి దోమ రాకుండా ప్రతీ రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల బాటలు విడవాలి. నివారణకు బూప్రోపెజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఇతో ఫెన్ ప్రాక్స్ 2.0 మిల్లీలీటర్లు లీటరు నీటికి లేదా ఇమిడా క్లోప్రిడ్ 4 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొదటి దశలో వచ్చే అగ్గితెగులు నివారణకు ట్రైసైక్ల్జోల్ 6 గ్రాములు లేదా ఐసోప్రోథయోలేన్ 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగమైసిన్ 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కలుపు యాజమాన్య పద్ధతులు వరి నాటిన 3 నుంచి 5 రోజుల్లోగా ఊద మొదలగు ఏక వార్షిక గడ్డిజాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు బ్యూటాక్లోర్ 1 నుంచి 1.5 మిల్లీలీటర్లు లేదా అనిలోపాస్ 500 మిల్లీలీటర్లు లేదా ప్రిటిలాకోర్ 500 మిల్లీలీటర్ల మందును అర లీటరు నీటిలో కలిపి పొలంలో పలుచగా నీరుంచి సమానంగా వెదజల్లాలి. దీంతో గడ్డి, తుంగ, వెడల్పాటి కలుపు మొక్కలను నశింపజేయవచ్చు. ఎరువులు ఇలా వేసుకోవాలి.. జిల్లాలో వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నా యి. ఈ వానలు పంటలకు మేలు చేకూర్చాయి. పొలంలో నీరు నిల్వ లేకుండా చూసుకొని ఎరువులు వేసుకోవాలి. వరి గంట పోసే దశలో ఎకరాకు 30 కిలోల యూరియా, చిరుపొట్ట దశలో 30 కిలోల యూరియా, 13 కిలోల ఎంవోపీని చల్లుకోవాలి. నత్రజని ఎరువును సిఫారసు చేసిన మోతాదులోనే దఫాలుగా వేసుకుంటే అగ్గితెగులు, కాండం తొలుచు పురు గు వంటి చీడపీడలను నివారించవచ్చు. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేయకూడదు. నాటు వేసిన వెంటనే (3-5 రో జులకు) కలుపు నివారణకు పైరజో సల్ఫురాన్ ఇథైల్ మందు 80గ్రాములు ఒక ఎకరానికి ఇసుకలో కలిపి తేలిక పదునులో వెదజల్లుకోవాలి. నాటిన 20-25 రోజుల్లోపు కలుపు నివారణకు బిస్పై రిబాక్ సోడియం 100 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. దుబ్బు చేసే దశలో అధిక నీటి ని ఇవ్వకూడదు. నాటిన 15 రోజులకు కార్బోప్యూరా న్ 3జీ గుళికలు ఎకరానికి 10 కిలోలు వేసుకోవాలి. -
జలమయం
సాక్షి, మంచిర్యాల/ఆదిలాబాద్ అగ్రికల్చర్ : బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో వేమనపల్లి మండలంలో సుమారు 700 ఎకరాల్లో పత్తి పంట నీట మునగగా, 50 ఎకరాల్లో సోయాబీన్ నీటిపాలైంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాణాహిత నిండుగా ప్రవహిస్తోంది. నీటి ఉధృతి పెరుగుతుండటంతో పంటలు నీట మునిగాయి. నీల్వాయి ఉప్పొంగడంతో సుమారు 30 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా పోయాయి. ముల్కలపేట నుంచి రాచర్లకు వెళ్లే ప్రధాన రహదారి, వంతెన నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. వేమనపల్లి నుంచి సుంపుటంకు వెళ్లే ప్రధాన రహదారి మత్తడివాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచాయి. వేమనపల్లి మండలంలో శనివారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచింది. బెల్లంపల్లి పట్టణంలోని అశోక్నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి సగం వరకు వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచాయి. తాండూర్ మండలం చౌటపల్లి, తాండూర్, కొత్తపల్లి గ్రామాలలో సుమారు 80 ఎకరాల వరకు పత్తి పంట నీట మునిగింది. నెన్నెల మండలంలోని కొత్తూర్లో ఏడు ఇళ్లు భారీ వర్షానికి కూలిపోయాయి. మెట్పల్లిలోని చెరువుకు భారీ వర్షం వల్ల గండి పడింది. కాసిపేట మండలంలోని పెద్దనపల్లి, చింతగూడ, గుర్వాపూర్ వాగులు భారీ వర్షం వల్ల ఉప్పొంగాయి. శ్రీరాంపూర్, గోలేటి, కైరిగూడ, డోర్లి ఓపెన్కాస్ట్లో భారీగా వరద నీరు చేరుకోవడంతో దాదపు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘతం కలిగింది. సూమారుగా రూ.3.50 కోట్ల నష్టం వాటిల్లింది. తిర్యాణి మండలం ఇర్కపల్లి సర్పంచ్గూడ గ్రామానికి చెందిన మడావి హన్మంతరావు(35) ఆదివారం మధ్యాహ్నం గ్రామ శివారులోని వాగుదాటుతూ వరద ఉదృతికి వాగులో కొట్టుకు పోయాడు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా సర్వం జలమయం అయ్యాయి. జైనథ్, నిరాల వద్ద రహదారిపై నుంచి వరదనీరు ఉప్పొంగడంతో అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలు నిలిచాయి. జైనథ్, బేల మండలాలతోపాటు మహారాష్ట్రకు రాకపోకలు స్తంభించాయి. బేల మండలం డోప్టాల మణియార్పూర్, గూడ, సాంగిడి, బెదోడ గ్రామాల్లో చేలల్లోకి నీరు చేరింది. ఆదిలాబాద్ మండలంలో అనుకుంట వాగు ఉప్పొంగడంతో సుమారు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. చేలలో భారీగా నీళ్లు చేరాయి. బేల మండలంలో వాగులు పొంగి ప్రవహించడంతో మహారాష్ట్రకు రాకపోకలు స్తంభించాయి. సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్నగర్ పట్టణంలో గల ఆదర్శనగర్, సంఘంబస్తీ, సంజీవయ్యకాలనీల్లో పలువురి ఇళ్లు నేలమట్టమయ్యాయి. కాగజ్నగర్ మండలంలోని పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పెద్దవాగు వద్ద సోమవారం నిర్వహించబోయే గణేష్ నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లు నీటికి కొట్టుకుపోయాయి. దహెగాం మండలంలోని ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వేల ఎకరాల్లో పత్తి, సోయాబిన్ పంటలు నీటమునిగాయి. బ్రాహ్మణ్చిచ్యాలలో ఉపాధిహామీ పథకం క్రింద నిర్మించిన రెండు కుంటలు తెగిపోయాయి. ఐనం రోడ్డుపై పెద్ద చెట్టు విరిగిపడడంతో రాకపోకలకు స్తంభించాయి. చెట్టుదాటికి ఫీడర్ పాడవగా 12 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచింది. బెజ్జూర్ మండలంలోని నాగుల్వాయి, కుశ్నపల్లి కుకుడ, అగర్గూడ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వీటి ప్రభావంతో సుమారు 2 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. లోడ్పల్లి, బెజ్జూర్, బారెగూడ రహదారులు కోతకు గురయ్యాయి. భైంసా నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లో భారీ వర్షంతో పత్తి, సోయా పంటల్లో నీరు నిలిచింది. భైంసాలో 72.4 మిల్లిమీటర్లు, కుంటాలలో 76.4, కుభీర్లో 71.3 మిల్లిమీటర్లు, లోకేశ్వరం 87.2 మిల్లిమీటర్లు నమోదైంది. చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 48 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో చెన్నూర్ మండలంలోని సుద్దాల, కత్తరశాల, నారాయణపూర్, సంకారం గ్రామాల వాగులు ఉప్పొంగడంతో 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చెన్నూర్లోని బతుకమ్మ వాగు ఉప్పొంగడంతో వంతెన ముందు నిర్మించిన సపోర్ట్ రోడ్డు కోతకు గురైంది. ఈ రోడ్డు తెగిపోయినట్లయితే కోటపల్లి, వేమనపల్లి రెండు మండలాలకు రాకపోకలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. జైపూర్ మండలంలో మిట్టపల్లి వాగు ఉప్పొంగడంతో వంతెన కోతకు గురైంది. మందమర్రి పట్టణంలో రెండు ఇల్లు కూలాయి. వరి పంట నీట మునిగింది. మండలంలోని తుర్కపల్లి, మామిడిగట్టు, అదిల్పేట్ లో లేవల్ కాజ్వేలు ఉధృతంగా ప్రవహించడంతో ఆయా గ్రామాలకు ప్రజలుకు రవాణా సౌకర్యం స్తంంభించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోటపల్లి మండలం పంగిడి సోమారం, తున్తుంగ వాగులు ఉప్పొంగాయి. దీంతో 4 గ్రామాలకు రాక పోకలు నిలిచాయి. అధిక వర్షాలతో పంటలకు తెగుళ్లు ప్రస్తుతం పంటలు పత్తి, సోయాబీన్ పూత దశలో ఉన్నయి. ఈ భారీ వర్షాలతో పూత రాలిపోయే ప్రమాదం ఉందని ఏరువాక కోర్డి నేటర్ శాస్త్రవేత్త రాజశేఖర్ తెలిపారు. వర్షాలతో పంటలకు తెగుళ్లు అశించే అవకాశం ఉంది. పూతలో నీరు నిల్వడం వలన పూత మురిగిపోయి రాలి పోయే అవకాశం ఉంది. పంట చేనులో నీరు నిల్వ ఉండ కుండా చూడాలి. మరో రెండు రోజులు వర్షం కోన సాగితే ఎండ, ఆకుమచ్చ తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. అయిన తక్కువనే.. జిల్లా సాధారణ వర్షపాతం ఆదివారం వరకు 889.2 మిల్లీమీటర్లు కాగా 606.9 మిల్లీమీటర్లు కురిసింది. 32 శాతం లోటు వర్షపాతంగా ఉంది. గతేడాది 1,245.8 మిల్లీమీటర్లు కురిసింది. 28 శాతం అధికంగా నమోదు అయ్యింది. శనివారం రాత్రి నుంచి అదివారం ఉదయం వరకు 106.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
పోడు సాగుపై అటవీ శాఖ అధికారుల దాడి
పెనుబల్లి : మండల పరిధిలోని భవన్నపాలెం గ్రామ సమీపంలోని గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూముల్లో పత్తి పంటను అటవీశాఖ అధికారులు గురువారం ధ్వంసం చేశారు. సత్తుపల్లి రేంజ్ పరిధిలోని సుమారు 50 మంది అటవీశాఖ అధికారులు ఉదయం 6 గంటల ప్రాంతంలో గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూమికి చేరుకున్నారు. సుమారు ఆరెకరాల పత్తిపంటను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న గిరిజనులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు, గిరిజనుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకదశలో తోపులాట జరిగింఇ. దీంతో ఫారెస్టు అధికారులు వెనుదిరిగారు. ఏపుగా ఎదిగాక... పెరికికుంట గ్రామానికి చెందిన 25 మంది గిరిజన కుటుంబాలు సుమారు 30 ఎకరాలు పోడు భూమిలో పత్తిని సాగు చేస్తున్నారు. ఏపుగా ఎదిగి కాపుకు వచ్చే సమయంలో ఫారెస్టు అధికారులు మూకుమ్మడిగా పంటపొలాలపై పడి పత్తి పంటను పీకడం పట్ల గిరిజనులు కన్నీరుమున్నీరయ్యారు. సోడె నాగేష్, పద్దం వెంకటప్ప సాగు చేస్తున్న ఆరెకరాల పత్తిపంటను పూర్తిగా ధ్వంసం చేశారు. సంఘటనా స్థలానికి సీపీఎం మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ సందర్శించి అటవీ శాఖ అధికారుల తీరుపై మండిపడ్డారు. పదేళ్లుగా గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూమిలోని పత్తిపంటను తొలగించడం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని విమర్శించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా తాము పోడు భూముల్లో సాగు చేస్తున్న పత్తి పంటను ఫారెస్టు అధికారులు అన్యాయంగా పీకేశారంటూ పెనుబల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని గిరిజనులు సీపీఎం ఆధ్వర్యంలో ముట్టడించారు. ఫారెస్టు అధికారుల వేధింపులు ఆపాలంటూ తహశీల్దార్ తాతారావుకు ఆ పార్టీ మండల కార్యదర్శి శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాజినేని మంగమ్మ, చిమ్మట విశ్వనాధం, పూజల పోతురాజు, ప్రసాద్, నాగేశ్వరరావు, కొర్సా సత్యం తదితరులు పాల్గొన్నారు. -
వరి నారు ముదిరింది..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : వరి నారు ముదిరిపోయింది.. సోయాబీన్ రబీలో వేసుకోవచ్చా.. ఎరువులు అందడం లేదు.. పత్తికి బీమా సౌకర్యం ఉందా.. యంత్రాలు ఎప్పుడు వస్తాయి అంటూ రైతులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు(జేడీఏ) రోజ్లీల, శాస్త్రవేత్తలు సమాధానాలు ఇచ్చారు. గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ నిర్వహించారు. ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి 30 మందికి పైగా ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సాగులో ఎదుర్కొంటున్న సమస్యలు, చీడపీడల నివారణ, గడువు దాటిన వరి నారు నాట్లు వేసుకునే అవకాశం ఉందా.. ఉంటే ఆశించిన దిగుబడి వస్తుందా..? ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలి అని అడిగి తెలుసుకున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలో ఎరువులు వేసుకుంటే లాభం ఉంటుందా అని అడిగిన ప్రశ్నలకు జేడీఏ, శాస్త్రవేత్తలు, ఏరువాక కో ఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రవీణ్కుమార్ సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడీఏలు రమేష్, అలీ అహ్మద్ పాల్గొన్నారు. ప్రశ్న : పసుపు పంటలో ముడత పడుతుంది(కొమ్ముకుంది) ఏ మందులు వేసుకోవాలి. - రైతు భూమేష్ , లక్ష్మణచాంద, నిర్మల్ జవాబు : రెండు గ్రాములు ప్లాంటోమెసిన్ 10 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. ప్ర : వరి నారు అలికి 45 రోజులు అవుతుంది. నాట్లు వేసుకునే అవకాశం ఉందా..? ఉంటే ఆశించిన దిగుబడి వస్తుందా..? ఏ ఎరువులు వేసుకోవాలి. - రైతు లక్ష్మణ్, ఖానాపూర్ జ : వరి నారు కొసలు కత్తిరించి ఒకటి రెండు మొలకలు నాటుకునే బదులు ఐదారు మొలకలు నాటుకోవాలి. అధికంగా ఎరువులు వేసుకోవాలి. ముఖ్యంగా యూరియా, పొటాష్ ఎకరాకు 30 నుంచి 40 కిలోల వరకు వేసుకోవాలి. గడువు దాటినా వరి నారు ఎక్కువ మోతాదులో, ఎరువులు ఎక్కువగా వేసుకుంటేనే దిగుబడి వస్తుంది. ప్ర : పత్తి పంట బీమా చేసుకునే అవకాశం ఉందా..? ఉంటే ఎప్పటి లోగా చెల్లించాలి. యూరియా ఎరువులు అందడం లేదు. వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తే అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నరు. - యం. నరేందర్, గ్రామం : బన్సవల్పల్లి, మం : దిలావర్పూర్ జ : పత్తికి నేరుగా బీమా చెల్లించే గడువు దాటిపోయింది. బ్యాంకులో కొత్త రుణం పొందే సమయంలోనే వారు బీమా ప్రీమియం మినహాయించుకుని మిగితా మొత్తం చెల్లిస్తారు. బ్యాంకు ద్వారా చెల్లించే గడువు సెప్టెంబర్ 30వరకు ఉంది. యూరియా లోడు ఈ రోజు మండలానికి పంపించాం. యూరియా కొరత లేదు. డీలర్ గానీ సొసైటీ వారు అధికంగా డబ్బులు తీసుకుంటనే వెంటనే సమాచారం అందించాలి. వారిపై చర్యలు తీసుకుంటాం. యూరియా బ్యాగుకు రూ.284 కంటే ఎక్కువగా చెల్లించొద్దు. డబ్బులు చెల్లించి రశీదు తీసుకోవాలి. ప్ర : వరి నారు అలికి 60 రోజులు అవుతుంది. నాట్లు వేసుకోవచ్చా. - రైతు గంగయ్య, తాండుర్ జ : వరి నారు 25 రోజుల నుంచి 30 రోజుల వ్యవధిలో నాట్లు వేసుకుంటనే మంచి దిగుబడి వస్తుంది. చీడపీడలు ఎక్కువగా ఆశించవు. 60 రోజుల నారు చాలా వరకు ముదిరిపోయింది. నాట్లు వేసుకోకపోవడం మేలు. ప్ర : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి పంటకు యూరియా వేసుకున్న. రాత్రి వర్షం కురిసింది. పంటకు మేలు అవుతుందా.. ఎరువు వృథాగా పోతుందా..? మళ్లీ ఎరువు వేసుకోవాలా..? - రైతు హన్మండ్ల వేణు, క్రిష్ణాపూర్ జ : వర్షం కురిసిన వెంటనే ఎరువులు వేసుకోరాదు. వేసుకున్న కొద్ది గంటలకు వర్షం పడింది కాబట్టి ఎక్కువగా వృథా కాదు. పది శాతం నుంచి 20 శాతం మాత్రం పోతుంది. వర్షం పడి నీరు పారుతున్న సమయంలో ఎరువులు వేసుకోరాదు. కొద్దిగా బురద, భూమిలో తేమ ఉంటే సరిపోతుంది. ప్ర : సోయాబీన్, పత్తి పంటలకు బీమా చేసుకునే అవకాశం ఉందా.. గడువు ఎప్పటి వరకు ఉంది ? - రైతు శ్రీనివాస్, గ్రామం : రాయిపూర్, మం : లోకేశ్వరం జ : సోయాబీన్ పంటకు నేరుగా బీమా ప్రీమియం చెల్లింపు మూడు రోజులు మాత్రమే ఉంది. పత్తికి బ్యాంకు రుణం పొందే వారికి మాత్రమే అవకాశం ఉంది. రుణం పొందే సమయంలోనే వచ్చే నెల 30వరకు ప్రీమియం చెల్లింపునకు అవకాశం ఉంది. ప్ర : సోయా పంటలో ఆకులకు రంధ్రాలు పడుతున్నాయి. చిన్న పురుగు కనిపిస్తుంది. - మారుతి, కుభీర్ జ : క్లోరికొపాస్ 2ఎంఎల్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయండి. ప్ర : సోయా పంట 35 రోజుల్లోనే పూతకు వచ్చింది. పూత రాలిపొతుంది. - సంతోష్కూమార్, కుంటాల జ : క్లొరికల్ లేదా రిమాన్ 1 మిల్లీలీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్ర : మందు పిచికారీ డబ్బ పక్క రైతుది. అతను కలుపు నివారణ మందు పిచికారీ చేసి నాకు ఇచ్చిండు. అదే డబ్బాలో పత్తికి పురుగుల నివారణ మందు పిచికారీ చేశాను. ఆకులు ముడుత పడుతున్నాయి. - రవి, బజార్హత్నూర్ జ : మల్టీకే స్ప్రే చేయండి. పిచికారీ చేసిన రెండు రోజుల్లోపు అయితే చక్కెర, యూరియా కలిపి కరిగించి పిచికారీ చేయాలి. ప్ర : పత్తికి పిండి నల్లి ఉంది. - దీపక్, కుచ్లాపూర్ జ : కొమ్మలు చుంచి దూరంగా పడేయండి. లేదా ప్రొఫెనోపాస్ 3మిల్లీలీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేసుకోండి. ప్ర : వ్యవసాయ యంత్రాలు ఎప్పుడు వస్తాయి. రాయితీ ఎంత వరకు ఉంటుంది. - శ్రీకాంత్రెడ్డి, మామడ జ : వ్యవసాయ యంత్రాల కంపెనీలతో ధర నిర్ణయం కాలేదు. యంత్రాలకు సంబంధించిన రాయితీ, దరఖాస్తు విధానంపై ఎలాంటి ఆదేశాలు రాలేదు. రెండు రోజుల్లో కమిషనర్ సమావేశం అనంతరం విషయాలు తెలుస్తాయి. వివరాలు రాగానే ఏవోల ద్వారా తెలుపుతాం. -
మందు కొడితే.... పంట పాడైంది!
- లబోదిబోమంటున్న రైతు - ఆదుకోవాలని విజ్ఞప్తి సంగారెడ్డి రూరల్ : చీడ పీడల నివారణ కోసం పత్తి పంటకు క్రిమిసంహారక మందు పిచికారి చేశాడు. తెల్లవారి వచ్చి చూసే సరికి పొలంలో ఉన్న పత్తిపంట ఆకులు ముడతపడి వాలిపోయింది. దీంతో ఎంతో ఆశపడి అప్పుచేసి సాగుచేస్తున్న పంట పాడవడంతో రైతు లబోదిబోమంటున్నాడు. రైతు కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉ న్నాయి. కలబ్గూర్కు చెందిన కంది సహకార సొసైటీ చైర్మన్ రవీందర్ తన పొలంలో పత్తిపంటను సాగుచేస్తున్నాడు. ఈ క్రమంలో చీడపీడల నివారణ కోసం సంగారెడ్డిలోని రైతుమిత్ర దుకాణంలో ఈ నెల 14న కార్బన్డిజం, ఇమిడాక్లోఫ్రైడ్ను కొనుగోలు చేసి ఆ మిశ్రమాన్ని రెండున్నర ఎకరాల పత్తిపంటకు పిచికారి చేశాడు. 15న వచ్చి పంటను పరిశీలించిన రవీందర్కు పొలంలో సగభాగం పత్తి మొక్కల ఆకులు ముడతపడి వాలిపోయాయి. దీంతో క్రిమిసంహారక మందు ఖాళీ డబ్బాలను తీసుకుని సంగారెడ్డిలోని డాట్ సెంటర్ శాస్త్రవేత్త శ్రీనివాస్ను కలిసి పరిస్థితిని వివరించాడు. డబ్బాలను పరిశీలించిన శ్రీనివాస్ ఈ మందుకు బ దులు ఇతర మందులను పత్తిపై పిచికారి చేయాల్సిందని, యూరియాను నీటిలో కలిపి పిచికారి చేస్తే కొంతమేర మెరుగుపడే అవకాశం ఉందని సలహా ఇ చ్చారు. దీంతో తన పంట పాడై పోయిందని గ్రహిం చిన రవీందర్ తనను ఆదుకోవాలని వ్యవసాయ అధికారులకు మొరపెట్టుకున్నాడు. -
పత్తిపంట ‘పిండి’పిండి
ఖమ్మం వ్యవసాయం: ఇప్పుడిప్పుడే పూత దశకు చేరుతున్న పత్తి పంటలో పిండినల్లి తెగులు వ్యాప్తిచెందుతోంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఈ తెగులు వ్యాప్తి అధికంగా ఉందని డాట్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్కుమార్ తెలిపారు. చెను చుట్టూ ఉండే పిచ్చి మొక్కల నుంచి పిండినల్లి పురుగులు పత్తిలోకి చేరుతుండటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తెగులు లక్షణాలు పెద్ద, చిన్న పురుగులు పత్తి చెట్టు కాడలు, ఆకులు, గూడ, కాయలు, కాండం నుంచి రసం పీలుస్తాయి. ఫలితంగా ఈ భాగాలు వాడి రాలిపోతాయి. చెట్టు పెరుగుదల నిలిచిపోతుంది. కాయలు సరిగా విచ్చుకోవు. విచ్చుకున్న కాయల్లోనూ గింజ నాణ్యత తగ్గుతుంది. పిండినల్లి పురుగు విసర్జించే తేనెవంటి పదార్థం వల్ల నల్లని బూజు ఏర్పడుతుంది. ఈ పురుగు ఆశించిన ప్రదేశాల్లో గండు చీమలు తేనె కోసం తిరగడం గమనించవచ్చు. తీవ్రత ఎక్కువగా ఉంటే పత్తి మొక్క పూర్తిగా ఎండిపోతుంది. ఇది అన్ని దశల్లోనూ సంభవించవచ్చు. పిండినల్లి నివారణ-పంట యాజమాన్య పద్ధతులు గతంలో వేసిన పంట తాలూకు అవశేషాలు పొలం నుంచి తొలగించి కాల్చివేయాలి. అలా చేయని పక్షంలో పిండినల్లి పురుగు ఈ అవశేషాల్లోనే ఉండి వేయబోయే పంటకూ వ్యాపిస్తుంది. పొలం దున్నే సమయంలో చీమల పుట్టలు ఏమైనా ఉంటే వాటిని నాశనం చేయాలి. పొలం గట్లపై పిండినల్లి తెగులు ఆశించిన కలుపు ఉంటే పీకి నాశనం చేయాలి. గట్లపై సాధమైనంతవరకు కలుపులేకుండా చూసుకోవాలి. పిండి పురుగు ఆశించిన కొమ్మలు, మొక్కలు తొలగించి నాశనం చేయడం ద్వారా చాలా వరకు వ్యాప్తిని అరికట్టవచ్చు. {పారంభంలో ఈ తెగులు కొన్ని మొక్కలకే వ్యాపిస్తుంది. అప్పుడు ఈ పురుగు సముదాయాన్ని గుర్తించి గోనె పట్టాతో రుద్ది నాశనం చేయాలి. జీవ సంబంధ పద్ధతులు పిండినల్లి పురుగు జీవితచక్రంలో చాలా దశలు ఉన్నాయి. ఈ పురుగును ఆశించే సహజ శత్రువులు చాలానే ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి బదనికలు. సహజసిద్ధంగా పిండినల్లి పురుగును ఆశించే ట్రిప్టోలిమస్ మాంట్రోజరి, సిర్ఫిడ్ ఈగలను రైతులు విధిగా రక్షించుకోవాలి. పిండినల్లి నివారణకు పురుగుమందులు వాడేటప్పుడు మేలు చేసే ఈగలకు హాని జరగకుండా తక్కువ డోసు ఉండే రసాయనిక మందునే ఉపయోగించాలి. శిలీంద్రాలు: బవేరియా బాసియానా, వర్టిసిల్లియం లకాని ఫార్మలేషన్స్ వాడి పురుగు ఉధృతిని కొంతమేరకు తగ్గించుకోవచ్చు. రసాయనిక పద్ధతులు మొదటిదశ పురుగులపై తెల్లని మైనం వంటి పదార్థం ఉండదు. ఈ దశలో కీటక నాశనులను పిచికారీ చేస్తే సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ పిండి నల్లి పురుగు మొదట్లో కొన్ని మొక్కలనే ఆశిస్తుంది. ఆశించిన చెట్లు, చుట్టుపక్కల పిచికారీ చేస్తే సరిపోతుంది. ఈ విధానం వల్ల పురుగు పక్క మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు. పురుగు ఉధృతి పెరిగినప్పుడు ప్రొఫెనోపాస్ మూడు మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ రెండు గ్రాములు లీటరు నీటిలో కలిపి మొక్క పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి రెండు,మూడు పర్యాయాలూ స్ప్రే చేయాలి. పై మందులతో పాటు సర్ఫ్పౌడర్ 0.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితం పొందవచ్చు. -
వర్షం..హర్షం..
ఖమ్మం వ్యవసాయం: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనతో జిల్లా వ్యాప్తం గా వర్షాలు పడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున మొదలైన వర్షం అర్ధరాత్రి వరకూ ఎడతెరిపి లేకుండా కురిసింది. ఈ వర్షం ద్రోణిగా మారి విస్తారంగా కురిసే అ వకాశం ఉందని వాతావరణ శాఖ చెపుతోం ది. ఈ వర్షం పలు ప్రాంతాల్లో మొలకెత్తిన పత్తి పైరుకు ఎంతో ఉపయోగం కాగా, కొద్ది రోజుల క్రితం నాటిన పత్తి మొలకెత్తే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో పత్తి సాధారణ విస్తీర్ణం 1,62,402 హెక్టార్లు కాగా 1,33,337 హెక్టార్లలో విత్తనాలు వేశారు. ఇందులో సగానికి పైగా మొదట వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో రెండోసారి కూడా వేశారు. జూలై చి వరి వరకు పత్తి వేసే అవకాశం ఉండటంతో సాలు పత్తి వేసుకోవాలని జిల్లా ఏరువాక కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్ కుమార్ చెపుతున్నారు. ఈ వర్షాలతో మొలకెత్తిన పత్తి చేలలో పాటు చేసుకునే అవకాశం ఉంది. భూమి పదునెక్కి ఉంటుంది గనుక నత్రజని, పొటాష్ ఎరువులు వేసుకోవచ్చునని శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. జూలై చివరి వారంలో వర్షాలు కురుస్తుండటంతో స్వల్పకాలిక వరి రకాల నార్లను పోయటానికి అనుకూలమని వ్యవసాయాధికారులు అంటున్నారు. నార్లు పోసేందుకు రైతులు సన్నద్ధం.. జిల్లాలో గోదావరి నదిలో నీటి ప్రవాహం ఆశాజనకంగా ఉండటంతో ఆ నది పరీవాహక ప్రాంతంలో వివిధ రకాలు పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంది. అంతేగాక ఆ ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగే అవకాశం కూడా ఉంది. తాలిపేరు ప్రాజెక్టులో నీరు నిండటంతో ఆ ప్రాజెక్టు ఆయకట్టులో వరినాట్లు వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. కాగా, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మొక్కజొన్న పైర్లకు మేలు చేకూరుస్తుందని రైతులు అంటున్నారు. వచ్చేనెలలో వరుణుడిపై ఆశలు.. జూన్లో సాధారణ వర్షపాతం 132 మి.మీలు కాగా కేవలం 30 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదయింది. జూలైలో సాధారణ వర్షపాతం 314 మి.మీలు కాగా గత వారం వరకు 119 మి.మీ వర్షపాతం నమోదయింది. అయితే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో మరో 30 మి.మీ వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెపుతున్నారు. ఈ వర్షాలకు తోడు వచ్చేనెలలో మరింతగా వర్షాలు పడతాయిని వాతావరణ శాఖ కూడా ప్రకటించడంతో రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. జిల్లాలో వర్షపాతం వివరాలిలా .. జిల్లాలో ఆదివారం సగటున 17.5 మి.మీ. వర్షపాతం నమోదయింది. అత్యధికంగా టేకులపల్లి మండలంలో 38.2, కల్లూరు మండలంలో 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, సత్తుపల్లి మండలాల్లో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. 20 మండలాల్లో 20 మిల్లీమీటర్లకు పైగా, 10 మండలాల్లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. బోనకల్లు, చింతకాని, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల్లో 5 మిల్లీ మీటర్ల కన్నా తక్కువగా నమోదయింది. -
కన్నీటి కష్టం
ఖరీఫ్ ఆరంభంలోనే కర్షకుడికి కన్నీటి కష్టమొచ్చింది. వరుణ దేవుణ్ని నమ్ముకుని మూడెకరాల్లో సాగు చేసిన పత్తి పంట ఎండిపోతుంటే, దాన్ని కాపాడుకునేందుకు గుమ్మఘట్ట మండలం కలుగోడుకు చెందిన రైతు కంబరి హనుమంతు అష్టకష్టాలుపడుతున్నాడు. భార్య నగలు తాకట్టు పెట్టి పంట పెట్టుబడులు సమకూర్చుకున్నాడు. 12 ప్యాకెట్ల విత్తనాలను నాటగా.. మొలకెత్తగానే వరుణుడు ముఖం చాటేశాడు. పంట ఎండుముఖం పడుతోందనే ఆందోళనతో ఐదు రోజులుగా కుటుంబ సభ్యులతో కలిసి భగీరథ యత్నం చేస్తున్నాడు. సమీపంలోని రంగచేడు కాలువలో నిలిచిన వర్షపు నీటిని కావడితో మోస్తూ మొలకలపై చల్లుతున్నారు. ‘రూ.30 వేల వరకు పంట పెట్టుబడి పెట్టా. మూడు నాలుగు రోజుల్లో వర్షం కురవకపోతే తీరని నష్టం తప్పదు. గతంలో ఐదు బోర్లు తవ్వించినా నీరు పడలేదు. దీంతో అప్పుల పాలయ్యా. ఈ కష్టం ఏ రైతుకూ వద్ద’ని కంబరి హనుమంతు అన్నారు. - ఫొటోలు : ఈ. రాధాకృష్ణ, గుమ్మఘట్ట -
పత్తి బస్తాల కింద నలిగి.. ముగ్గురు చిన్నారులు మృతి
-
పత్తి బస్తాల కింద నలిగి.. ముగ్గురు చిన్నారులు మృతి
కేసముద్రం, న్యూస్లైన్: గిట్టుబాటు ధర వస్తుందనే ఆశతో ఇంట్లో దాచుకున్న పత్తి ఆ ఇంటి దీపాలను ఆర్పేసింది. ముగ్గురు చిన్నారుల మృతికి కారణమైంది. వివరాలు.. వరంగల్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామానికి చెందిన బేతు వెంకటయ్య, యాదమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు వీరన్న, శ్రీను, కుమార్తె సుజాత ఉన్నారు. వీరన్నకు కుమారుడు విక్కి(3)తో పాటు పది రోజుల క్రితం మరో కుమారుడు జన్మించాడు. కుమార్తె సుజాతకు.. కుమారుడు వేణు(12), కుమార్తె భద్రకాళి(6) ఉన్నారు. కాగా, సుజాత తన పిల్లలతో ఆదివారం తల్లిగారింటికి వచ్చింది. సోమవారం యూదమ్మ, సుజాత, వీరన్న కలిసి మహబూబాబాద్ వెళ్లారు. వెంకటయ్య గ్రామంలోకి వెళ్లాడు. సుజాత, వీరన్న పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. తాము ఇంట్లో టీవీ చూసి పడుకుంటామని సుజాత కుమారుడు వేణు తలుపుపెట్టుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత వెంకటయ్య తిరిగి ఇంటికి వచ్చి తలుపులు కొట్టగా లోపలి నుంచి సమాధానం రాలేదు. దీంతో తలుపులను పగులగొట్టి లోపలికి వెళ్లి పత్తిని తొలగించి చూడగా ముగ్గురు పిల్లలు శవాలై కనిపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పత్తిరైతుకు పుట్టెడు కష్టాలు
పర్చూరు, ఒంగోలు టౌన్, న్యూస్లైన్: భారీ వర్షాలు, వరుస తుపాన్లు రైతుల వెన్ను విరిచాయి. జిల్లాలోని పత్తి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లాలో సుమారు 57 వేల హెక్టార్లలో పత్తిపైరు సాగైంది. ప్రస్తుతం వర్షాలకు దెబ్బతిన్న పైర్లు పీకేయగా..మిగిలినవి ఓ మోస్తరు దిగుబడి ఇస్తున్నాయి. పత్తితీత పనులు కూడా ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. రైతుల ఇళ్లకు పత్తి వచ్చి చేరుతోంది. బయట మార్కెట్లో నాణ్యమైన పత్తికి * 4,400 ధర ఉన్నా..దళారులు, వ్యాపారులు నాణ్యత పేరుతో * 2,500 నుంచి * 3 వేలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అసలే దిగుబడులు తగ్గి ఆందోళనలో ఉన్న రైతులను ఈ పరిణామం మరింత కలవరానికి గురిచేస్తోంది. ఇంత కష్టపడి సాగుచేస్తే హెక్టారుకు 15 క్వింటాళ్లు రావడం గగనమైపోతోంది. వర్షాలకు దెబ్బతిని ఇప్పుడిప్పుడే ఇగురుకాపు వస్తున్న పైర్లు దిగుబడులు ఇస్తాయా లేదా అన్న అనుమానం రైతుల్లో ఉంది. ఈ నేపథ్యంలో పత్తిని అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం పత్తికి ప్రభుత్వ ధర క్వింటా *4 వేలుగా ప్రకటించింది. నాణ్యమైన పత్తిని ఎలాగూ ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తారు. ఇదే వర్షాలకు దెబ్బతిన్న పైర్లనైతే కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపరు. ఒకవేళ కొనుగోలు చేసినా వారికి తోచిన ధరే ఇస్తారు. దీంతో రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం సీసీఐని రంగంలోకి దించి ఆదుకుంటుందని రైతాంగం ఆశిస్తోంది. అయితే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. సీసీఐ నిబంధనలు పక్కనపెట్టి తడిసి కొద్దిగా నాణ్యత దెబ్బతిన్న పత్తిని కూడా ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తే రైతులకు కొంత ఊరట కలుగుతుంది. పత్తిరైతులపై ప్రభుత్వాల చిన్నచూపు... పత్తి దిగుబడిలో గుజరాత్, మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అయినా పత్తి ఆధారిత పరిశ్రమలు 40 శాతం తమిళనాడులో ఉన్నాయి. పత్తి రైతులను ఆదుకునే విషయంలో మన ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. రాష్ర్టంలో ఉన్న పరిశ్రమలకు సరిపోను మిగతా పత్తిని తమిళనాడుకు తరలించాలంటే రవాణా ఖర్చులు అధికమవుతున్నాయి. దీంతో వ్యాపారులు రవాణా ఖర్చులు, మిగతా ఖర్చులు సరిచూసుకొని గిట్టుబాటయ్యే ధరకు మాత్రమే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. దీని కారణంగా మన రాష్ట్ర పత్తిరైతులకు న్యాయమైన ధర లభించడం లేదని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. వ్యాపారులకే జై కొడుతున్న సీసీఐ అధికారులు ఏటా రైతాంగాన్ని ఆదుకునే పేరుతో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్న అధికారులు రైతుల వద్ద నుంచి మొక్కుబడిగా కొనుగోళ్లు చేస్తూ వ్యాపారులకు దోచిపెడుతున్నారు. రైతాంగాన్ని దగా చేసి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్న దళారులు, వ్యాపారులు సీసీఐ కేంద్రాల్లో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. రైతుల వద్ద కొనుగోలు చేస్తే సీసీఐ బయ్యర్లకు మిగిలేది తక్కువ.. అదే వ్యాపారులైతే కొద్దొగొప్పో ముట్టచెప్తారు. వ్యాపారుల దగ్గర కొనుగోలు చేసిన పత్తి సీసీఐ కొనుగోలు కేంద్రాలతో పనిలేకుండా నేరుగా సీసీఐ లీజుకు తీసుకున్న మిల్లుల వద్దకు చేరుతుంది. అయినప్పటికీ సీసీఐ కేంద్రాలకు వచ్చినట్లుగానే మార్కెటింగ్ శాఖకు సెస్సు, హమాలీల కూలీ ఇవ్వడం కొసమెరుపు. ఈ వ్యవహారంలో మార్కెటింగ్ శాఖ సిబ్బంది కూడా పాలుపంచుకోవడం గమనార్హం.. ఎక్కువ సంఖ్యలో సీసీఐ కేంద్రాలు పెడితేనే రైతులకు మేలు: పత్తి రైతాంగాన్ని ఆదుకోవాలంటే కనీసం పత్తి కొనుగోలు కేంద్రాలను ముందుగానే ఏర్పాటు చేయాలి. పశ్చిమప్రాంతంతో పాటు పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో 10కిపైగా ఏర్పాటు చేస్తే తప్ప ఈ ఏడాది రైతులు కోలుకోరు. గత ఏడాది పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో సీసీఐ కేంద్రాలు 5 మాత్రమే తెరిచారు. అయితే పశ్చిమ ప్రాంతంలో ముందుగా ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఆ ప్రాంత రైతాంగం దళారుల చేతిలో చిక్కి తీవ్రంగా నష్టపోయారు. రైతులు, రైతు సంఘాల ఆందోళనల పుణ్యమా అని చివరిలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినా అప్పటికే 80 శాతానికిపైగా పత్తి దళారుల చేతిలోకి వెళ్లింది. -
‘చితికి’ పోతున్న... పత్తి రైతు
ఊరించిన పత్తి .. ఉసురు తీస్తోంది. తెల్లబంగారం విలువైన ప్రాణాలు హరిస్తోంది. కేవలం రెండు వారాల వ్యవధి.. పదకొండుమంది రైతుల బలవన్మరణం.. మహిళా.. మైనారిటీ.. గిరిజన.. కౌలు .. ఇలా అన్ని విభాగాల రైతులు పురుగుల మందును ఆశ్రయించారు.. పంట నష్ట పరిహారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాక ఆందోళన చెందారు.. ప్రభుత్వ అధికారులు.. ప్రజాప్రతినిధులు.. వ్యవసాయ సంఘాలు.. ఏవీ అన్నదాతకు భరోసా కల్పించే ప్రయత్నాలు చేయ లేదు... ఫలితంగా పదకొండు కుంటుంబాల్లో దీపాలు ఆరిపోయాయి..!! సాక్షి ప్రతినిధి, నల్లగొండ ముందు మురిపించిన వానలు పత్తి పంట సాగు చేసేలా రైతులను ఊరించాయి. అధికారుల అంచనాలకు మించి ఈ సారి జిల్లాలో పత్తి సాగైంది. సాధారణ సాగు విస్తీర్ణం కన్నా ఇది రెట్టింపు కావడం విశేషం. తీరా పంట చేతికి వస్తుందనగా అయిదు రోజుల పాటు అతలాకుతలం చేసిన తుపాను అన్నదాతను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టింది. తెంపడానికి సిద్ధంగా ఉన్న పత్తిపంట పూర్తిగా తడిచి, నల్లగా మారి పనికి రాకుండా అయ్యింది. పంటల సాగు కోసం చేసిన అప్పులు భయపెట్టగా, ఆదుకునే వారు లేక అన్నదాతలు క్రిమిసంహారక మందును ఆశ్రయించారు. ఇలా, జిల్లాలో గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 7వ తేదీ వరకు, కేవలం పదమూడు రోజుల వ్యవధిలోనే దేవరకొండ, చండూరు, మునుగోడు, చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూరు, వలిగొండ, భువనగిరి, మఠంపల్లి మండలాల్లో ఎనిమిది మంది పత్తి రైతులు, తిప్పర్తి మండలంలో ఒక వరి రైతు బలవన్మరణాలకు పాల్పడ్డారు. జిల్లాలో ఈ సారి 6,87,823 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. అయితే, ఇటీవల కురిసిన తుపాను వల్ల 3,80,283 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ అంచనా మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. కేవలం ఇంతవరకే పరిగణనలోకి తీసుకున్నా 23.93లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి పోయినట్టే. తద్వారా రైతులు సుమారు రూ.1037కోట్ల ఆదాయం కోల్పోతున్నారు. పంటల సాగు కోసం చేసిన పెట్టుబడులు అప్పులుగా మిగిలాయి. దీంతో ధైర్యం కోల్పోయిన పత్తి రైతులు ఆత్మహత్యలను ఆశ్రయించారు. ఇక, వరి పంట విషయానికి వస్తే 3,61,156ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయగా, భారీ వర్షాల కారణంగా 92వేల ఎకరాల విస్తీర్ణంలో పంట దెబ్బతిన్నది. ఫలితంగా 20.25లక్షల క్వింటాళ్ల దిగుబడిని పూర్తిగా నష్టపోయినట్టే. దీనివల్ల రమారమి రూ.300కోట్ల మేర రైతులు ఆదాయం కోల్పోతున్నారు. తిప్పర్తి మండలంలో వరి సాగుచేసిన ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా, ప్రభుత్వం ఇంకా అంచనాలు వేసే దశలోనే ఉంది. అధికార వర్గాల సమాచారం మేరకు శుక్రవారం పంట నష్టం అంచనాల కోసం పది కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. అయితే, ఈ బృందాలు ఏఏ ప్రాంతాల్లో పర్యటిస్తాయో మాత్రం ప్రకటించలేదు. పంట నష్టపోయిన రైతాంగానికి భరోసా కల్పించేందుకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు విస్తృతంగా పర్యటించాల్సింది పోయి ఎవరి బిజీలో వారున్నారు. -
పత్తి అమ్ముకోవడానికి రైతుల అవస్థలు
భైంసా/భైంసా రూరల్, న్యూస్లైన్ : ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నా రు. భైంసా మార్కెట్కు ఉదయం తీసుకొచ్చిన పత్తిని రాత్రి వరకు కూడా వ్యాపారులు, అధికారులు కొనుగోలు చేయకపోవడంతో ఆందోళన చేశారు. అయినా కొనుగోళ్లు జరగలేదు. బహిరంగ వేలం పాటలో.. భైంసా పట్టణంలో బుధవారం నుంచి అధికారికంగా బహిరంగ వేలం పాట ద్వారా పత్తి కొ నుగోళ్లు జరుగుతాయని అధికారులు ప్రకటిం చారు. ఇప్పటికే కలెక్టర్ అహ్మద్ బాబు వేలం పాటలు నిర్వహించే యార్డుల్లోనే పత్తి తూకం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకేంద్రంలో అదే విధంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటలకే కాటన్ యార్డుకు వచ్చిన జిన్నింగ్ ఫ్యాక్టరీ యజమానులు బహిరంగ వేలం పాటల్లో పాల్గొనక ముందే యార్డుల్లో తూకం వేస్తే అందరికీ ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొనడంతో రైతులకు, వ్యాపారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొనుగోళ్లు చేయమని వ్యాపారులు ఉదయం 11.13 గంటలకు యార్డు నుంచి నిష్ర్కమించారు. 11.23 గంటలకు అధికారులు కూడా వెనక్కి వెళ్లారు. దీంతో యార్డుకు వచ్చిన రైతులు ఏఎంసీ చైర్మన్ విఠల్రెడ్డిని కలిసి కార్యాలయానికి వెళ్లారు. రోడ్డుపై బైఠాయింపు కార్యాలయంలో చర్చించినా ఫలితం కనిపించక పోవడంతో అందరూ భైంసా బస్టాండ్ వద్దకు చేరుకుని మధ్యాహ్నం 12.32 గంటలకు ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. రైతులతోపాటే విఠల్రెడ్డి, రైతు నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మధ్యాహ్నం 1.03 గంటలకు పట్టణ సీఐ పురుషోత్తం విఠల్రెడ్డితోపాటు రాస్తారోకోలో బైఠాయించిన వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఆర్డీవో రాకతో.. ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ ఆర్డీవో అరుణశ్రీ మధ్యాహ్నం 3.26 గంటలకు ఏఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. మార్కెటింగ్ ఏడీఎం అజ్మీరరాజు, ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్రెడ్డి సమస్యకు మార్గం చూపేందుకు పత్తి వ్యాపారులను, రైతులను, రైతు నాయకులను పిలిపించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 7.30 గంటల వరకు పలు దఫాలుగా చర్చలు జరిగినా సఫలం కాలేదు. సాయంత్రం 5.10 గంటలకు కలెక్టర్తో మాట్లాడేందుకు ఫోన్ చేసినా వీడియో కాన్ఫరెన్స్లో ఉండడంతో ఆయన మాట్లాడలేక పోయారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అనంతరం కలెక్టర్తో రాత్రి 7 గంటలకు మరో మారు ఫోన్లో సంభాషించారు. పరిస్థితి వివరించడంతో ఆదిలాబాద్కు రావాలని కలెక్టర్ సూచించారు. దీంతో పత్తి వ్యాపారులు, అధికారులు, ఎమ్మెల్యే చారి, చైర్మన్ విఠల్రెడ్డిలు 7.30 గంటలకు ఆదిలాబాద్ బయలుదేరి వెళ్లారు. తప్పని నిరీక్షణ మొదటి రోజు పత్తి బండ్లతో వచ్చిన రైతులకు నిరీక్షణ తప్పలేదు. దశలవారీగా చర్చలు జరిగినా సఫలీకృతం కాకపోవడంతో బండ్లను రోడ్డుపైనే పెట్టారు. పత్తి బండ్లతో వచ్చిన 400లకుపైగా రైతులు ఆకలితో అలమటించాల్సి వచ్చింది. ఆటోవాలాలు రైతులతో వాగ్వాదానికి దిగి తాము చేసుకున్న అద్దె ఒప్పందాన్ని రెండు రోజులకు పొడిగించుకున్నారు. దీంతో రైతులు కొనుగోళ్లు త్వరితగతిన చేపట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానంతో రైతులే నష్టపోవాల్సి వస్తుందని వ్యాపారులతో చర్చించకుండానే కొనుగోళ్లు ప్రారంభమవుతాయని యార్డుకు పిలిపించడం ఎంత వరకు సమంజసం అంటూ అధికారులను నిలదీశారు. చేసేదేమి లేక రైతులు బండ్లపైనే నిద్రించారు. రాత్రి వరకు వాగ్వాదాలే... రైతులకు, అధికారులకు, రైతు నాయకులకు, కమీషన్ ఏజెంట్లకు, పత్తి వ్యాపారులకు, అధికారులకు మధ్య ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు వాగ్వాదాలు కొనసాగుతూనే కనిపించాయి. యార్డుల్లో కొనుగోలు చేసినా తూకం ఫ్యాక్టరీల్లోనే వేస్తామని వ్యాపారులు తేల్చి చెప్పారు. యార్డుల్లో తూకం వేస్తే ఫ్యాక్టరీకి వచ్చే వరకు ఎవరు బాధ్యులుగా ఉంటారని సీజన్ పెరిగితే బండ్లు ఎక్కువగా వస్తే తూకం వేయడం సాధ్యం కాదని పత్తి వ్యాపారులు తమ వాదన వినిపించారు. అధికారులు ఇచ్చిన ఆదేశాలు ఆదిలాబాద్లో పాటిస్తున్న వ్యాపారులకు భైంసాలో పాటించడం ఎందుకు సాధ్యం కాదని రైతులు ప్రశ్నించారు. రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా అవి అమలు కావడం లేదంటూ రైతు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు చెప్పినా ఎన్ని చర్చలు జరిపినా చివరకు కొనుగోళ్లు మాత్రం జరగలేదు. ఎంతో ఆశతో పంట అమ్మకానికి వచ్చిన పత్తి రైతులకు రెండు రోజుల నిరీక్షణ తప్పలేదు. -
పత్తి అమ్ముకోవడానికి రైతుల అవస్థలు
ఉదయం నుంచి రాత్రి వరకు అదేతీరు.. భైంసా మార్కెట్లో ప్రారంభంకాని కొనుగోళ్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కలెక్టర్ వద్దకు వెళ్లిన వ్యాపారులు, ప్రజాప్రతినిధులు భైంసా/భైంసా రూరల్, న్యూస్లైన్ : ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నా రు. భైంసా మార్కెట్కు ఉదయం తీసుకొచ్చిన పత్తిని రాత్రి వరకు కూడా వ్యాపారులు, అధికారులు కొనుగోలు చేయకపోవడంతో ఆందోళన చేశారు. అయినా కొనుగోళ్లు జరగలేదు. బహిరంగ వేలం పాటలో.. భైంసా పట్టణంలో బుధవారం నుంచి అధికారికంగా బహిరంగ వేలం పాట ద్వారా పత్తి కొ నుగోళ్లు జరుగుతాయని అధికారులు ప్రకటిం చారు. ఇప్పటికే కలెక్టర్ అహ్మద్ బాబు వేలం పాటలు నిర్వహించే యార్డుల్లోనే పత్తి తూకం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకేంద్రంలో అదే విధంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటలకే కాటన్ యార్డుకు వచ్చిన జిన్నింగ్ ఫ్యాక్టరీ యజమానులు బహిరంగ వేలం పాటల్లో పాల్గొనక ముందే యార్డుల్లో తూకం వేస్తే అందరికీ ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొనడంతో రైతులకు, వ్యాపారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొనుగోళ్లు చేయమని వ్యాపారులు ఉదయం 11.13 గంటలకు యార్డు నుంచి నిష్ర్కమించారు. 11.23 గంటలకు అధికారులు కూడా వెనక్కి వెళ్లారు. దీంతో యార్డుకు వచ్చిన రైతులు ఏఎంసీ చైర్మన్ విఠల్రెడ్డిని కలిసి కార్యాలయానికి వెళ్లారు. రోడ్డుపై బైఠాయింపు కార్యాలయంలో చర్చించినా ఫలితం కనిపించక పోవడంతో అందరూ భైంసా బస్టాండ్ వద్దకు చేరుకుని మధ్యాహ్నం 12.32 గంటలకు ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. రైతులతోపాటే విఠల్రెడ్డి, రైతు నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మధ్యాహ్నం 1.03 గంటలకు పట్టణ సీఐ పురుషోత్తం విఠల్రెడ్డితోపాటు రాస్తారోకోలో బైఠాయించిన వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఆర్డీవో రాకతో.. ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ ఆర్డీవో అరుణశ్రీ మధ్యాహ్నం 3.26 గంటలకు ఏఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. మార్కెటింగ్ ఏడీఎం అజ్మీరరాజు, ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్రెడ్డి సమస్యకు మార్గం చూపేందుకు పత్తి వ్యాపారులను, రైతులను, రైతు నాయకులను పిలిపించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 7.30 గంటల వరకు పలు దఫాలుగా చర్చలు జరిగినా సఫలం కాలేదు. సాయంత్రం 5.10 గంటలకు కలెక్టర్తో మాట్లాడేందుకు ఫోన్ చేసినా వీడియో కాన్ఫరెన్స్లో ఉండడంతో ఆయన మాట్లాడలేక పోయారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అనంతరం కలెక్టర్తో రాత్రి 7 గంటలకు మరో మారు ఫోన్లో సంభాషించారు. పరిస్థితి వివరించడంతో ఆదిలాబాద్కు రావాలని కలెక్టర్ సూచించారు. దీంతో పత్తి వ్యాపారులు, అధికారులు, ఎమ్మెల్యే చారి, చైర్మన్ విఠల్రెడ్డిలు 7.30 గంటలకు ఆదిలాబాద్ బయలుదేరి వెళ్లారు. తప్పని నిరీక్షణ మొదటి రోజు పత్తి బండ్లతో వచ్చిన రైతులకు నిరీక్షణ తప్పలేదు. దశలవారీగా చర్చలు జరిగినా సఫలీకృతం కాకపోవడంతో బండ్లను రోడ్డుపైనే పెట్టారు. పత్తి బండ్లతో వచ్చిన 400లకుపైగా రైతులు ఆకలితో అలమటించాల్సి వచ్చింది. ఆటోవాలాలు రైతులతో వాగ్వాదానికి దిగి తాము చేసుకున్న అద్దె ఒప్పందాన్ని రెండు రోజులకు పొడిగించుకున్నారు. దీంతో రైతులు కొనుగోళ్లు త్వరితగతిన చేపట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానంతో రైతులే నష్టపోవాల్సి వస్తుందని వ్యాపారులతో చర్చించకుండానే కొనుగోళ్లు ప్రారంభమవుతాయని యార్డుకు పిలిపించడం ఎంత వరకు సమంజసం అంటూ అధికారులను నిలదీశారు. చేసేదేమి లేక రైతులు బండ్లపైనే నిద్రించారు. రాత్రి వరకు వాగ్వాదాలే... రైతులకు, అధికారులకు, రైతు నాయకులకు, కమీషన్ ఏజెంట్లకు, పత్తి వ్యాపారులకు, అధికారులకు మధ్య ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు వాగ్వాదాలు కొనసాగుతూనే కనిపించాయి. యార్డుల్లో కొనుగోలు చేసినా తూకం ఫ్యాక్టరీల్లోనే వేస్తామని వ్యాపారులు తేల్చి చెప్పారు. యార్డుల్లో తూకం వేస్తే ఫ్యాక్టరీకి వచ్చే వరకు ఎవరు బాధ్యులుగా ఉంటారని సీజన్ పెరిగితే బండ్లు ఎక్కువగా వస్తే తూకం వేయడం సాధ్యం కాదని పత్తి వ్యాపారులు తమ వాదన వినిపించారు. అధికారులు ఇచ్చిన ఆదేశాలు ఆదిలాబాద్లో పాటిస్తున్న వ్యాపారులకు భైంసాలో పాటించడం ఎందుకు సాధ్యం కాదని రైతులు ప్రశ్నించారు. రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా అవి అమలు కావడం లేదంటూ రైతు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు చెప్పినా ఎన్ని చర్చలు జరిపినా చివరకు కొనుగోళ్లు మాత్రం జరగలేదు. ఎంతో ఆశతో పంట అమ్మకానికి వచ్చిన పత్తి రైతులకు రెండు రోజుల నిరీక్షణ తప్పలేదు. -
కొను‘గోల్మాల్’
మధిర, న్యూస్లైన్ : తుపానుతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తడిసిన పత్తి కొనే నాథుడు లేక ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 1.60 లక్షల హెక్టార్లలో పత్తి సాగుచేశారు. ఇటీవల కురిసిన వర్షానికి సుమారు 2.55 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. అయితే వర్షానికి ముందు తీసిన పత్తిని కూడా సీసీఐ వారు కొనుగోలు చేయలేదు. ప్రభుత్వం నేటికీ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో దళారుల ‘పంట’ పండుతోంది. కాస్తోకూస్తో చేతికొచ్చిన పత్తిని గత్యంతరం లేక రైతులు దళారులు నిర్ణయించిన ధరకే విక్రయిస్తున్నారు. తేమ ఎక్కువగా ఉందని, పత్తి నల్లగా ఉందనే సాకు చూపి చాలా తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ.. రైతులను దోచుకుంటున్నారు. జిల్లాలో 13 వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉండగా 10 యార్డుల్లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు జరిగేవి. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క యార్డులోకూడా సీసీఐ కొనుగోళ్లను ప్రారంభించలేదు. నష్టాల ఊబిలో రైతులు... ఈ ఏడాది పత్తి ఎర్రబారిపోవడంతో ఎకరానికి నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. సీసీఐ కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు క్వింటాకు రూ. 3000 నుంచి 3200 వరకు విక్రయించాల్సి వస్తోందని, ఇది తమకు గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేపడితే రూ.4 వేల వరకు ధర లభించేందని అంటున్నారు. దీనికి తోడు ఈ ఏడాది విత్తనాలు, ఎరువుల ధరలు రెట్టింపయ్యాయని, తమ పరిస్థితి మూలిగేనక్కపై తాటిపండు పడిన చందంగా మారిందని వాపోతున్నారు. ఇప్పటివరకూ ఏ పంటా చేతికి రాకపోవడం, వచ్చిన పత్తిని సీసీఐ వారు కొనుగోలు చేయకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బంది పడుతున్నామని చెపుతున్నారు. ప్రభుత్వానికీ తగ్గుతున్న ఆదాయం... సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయడంతో గత ఏడాది మార్కెటింగ్ శాఖకు రూ.35 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఇంకా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు తప్పని స్థితిలో ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలోనూ గండి పడుతోంది. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న వారు ఇంకా సీసీఐ కొనుగోళ్లు ఎందుకు ప్రారంభించలేదని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. తమ చేతుల్లోంచి పంటలు వ్యాపారుల వద్దకు వెళ్లాక ధర పెంచుతారా అని అధికారులను నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సీసీఐ కేంద్రాలను ప్రారంభించడంతోపాటు మద్దతు ధర కల్పించాలని, తడిసిన పత్తిని సైతం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. త్వరలో ప్రారంభం కావచ్చు జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బహుశా వారం రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభం కావచ్చు. జిల్లాలో 13 మార్కెట్ యార్డులు ఉండగా 10 యార్డుల్లో పత్తి కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంటుంది. కొనుగోళ్లపై మాకు స్పష్టమైన సమాచారం లేదు. - పంతంగి లక్ష్మణ్, ఏడీఎం -
పంట పోయిందని..ప్రాణం తీసుకున్నాడు!
తాండూరు రూరల్/బంట్వారం, న్యూస్లైన్: అయ్యో.. ఎంత దా‘రుణం’..? దీపావళి శోభ సంతరించుకోవాల్సిన ఆ ఇల్లు శోకసంద్రంలో మునిగింది. ఇటీవ లి తుపానుకు కోలుకోని విధంగా పంటనష్టం జరిగింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో కలత చెందిన ఆ అన్నదాత పురుగుమందు తాగి ఉసురు తీసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన బంట్వారం మండలం ఎన్నారం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి(38) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ ఏడాది తనకున్న రెండు ఎకరాల్లో పత్తి పంట వేశాడు. మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. పంటల పెట్టుబడి, కుటుంబ అవసరాల నిమిత్తం బుచ్చిరెడ్డి దాదాపు రూ. 4 లక్షల వరకు అప్పులు చేశాడు. ఇటీవలి తుపానుకు పత్తిపంట పూర్తిగా దెబ్బతిన్నది. మొక్కజొన్న పాడైపోయింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో రైతు తీవ్ర కలత చెందాడు. తరచూ కుటుంబీకులు, స్థానికులతో వాపోతూ దుఃఖాన్ని గుండెల్లో దిగమింగుకునేవాడు. ఆదివారం మధ్యాహ్నం ఆయన ఇంట్లో పురుగుమందు తాగాడు. గమనించిన కూతుళ్లు స్థానికులకు చెప్పారు. వెంటనే 108 వాహనంలో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి కొద్దిసేపటికే బుచ్చిరెడ్డి ప్రాణం పోయింది. ‘అప్పులే నా మొగుడి ప్రాణాలు తీసుకున్నాయి.. తుపాను రాకుంటే పంట బాగా పండేది.. అప్పులు తీరేవి.., నా భర్త పురుగుమందు తాగకుంటుండే..’ అని మృతుడి భార్య రుక్మిణి రోదించిన తీరు హృదయ విదారకం. బుచ్చిరెడ్డికి కూతుళ్లు కీర్తన(8), దీప (7) స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. రైతు మృతితో కుటుంబం వీధిన పడిందని గ్రామస్తులు తెలిపారు. మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. బుచ్చిరెడ్డి మృతితో భార్యాపిల్లల రోదనలు మిన్నంటాయి. -
పత్తి రైతు చిత్తు
సాక్షి, కొత్తగూడెం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పత్తిరైతు చిత్తయ్యాడు. జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాలకు పైగా పత్తి పంటపై తుపాను ప్రభావం చూపింది. దాదాపు అన్ని మండలాల్లో ఈపంటకు నష్టం కలగగా అశ్వారావుపేట, మధిర నియోజకవర్గాల్లో తీవ్రంగా ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఈ మూడు నాలుగు రోజుల్లో ప్రతిరోజు 3 నుంచి 4 సెంటీమీటర్ల వరకు వర్షం పడుతుండటమే ఈ పరిస్థితికి కారణం. ప్రస్తుత వర్షాలకు తొలివిడత తీస్తున్న పత్తి ముద్దవుతుండగా, మలివిడతపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. రోజూ వర్షం పడుతుండటంతో రైతులు కూలీలతో పత్తి తీయించడానికి ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది కూడా పత్తి చేతికందే సమయంలో నీలం తుపాను సృష్టించిన బీభత్సాన్ని ప్రస్తుతం రైతులు గుర్తుచేసుకుంటున్నారు. నీలం తుపాను దెబ్బకు అప్పట్లో సాగుచేసిన పత్తి పూర్తిగా చేతికందకుండా పోయింది. అంత నష్టం జరిగినా... ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి పరిశీలించినా ఇప్పటికీ బాధిత రైతులకు నష్టపరిహారం అందలేదు. మళ్లీ ఈ ఏడాది ప్రకృతి పగపట్టిందని రైతులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా వ్యవసాయ శాఖాధికారులు మాత్రం ఈ వర్షం వల్ల పంటలకు ఎలాంటి నష్టం లేదని, లాభమేనని పేర్కొనడం గమనార్హం. తొలిదశ పత్తి ముద్దయి కారుతున్నా వ్యవసాయ శాఖ అధికారులకు నష్టం కన్పించకపోవడం విచిత్రం. గురువారం జిల్లా మొత్తం 44.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా అన్ని మండలాల్లో సగటున 9.8 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ప్రధానంగా వెంకటాపురం, పినపాక మండలాల్లో 3సెంటీ మీటర్లకు పైగా, ఎర్రుపాలెం, బోనకల్లు, ముదిగొండ, చర్ల మండలాల్లో 2సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు, వేలేరుపాడుల్లో అత్యల్పంగా వర్షం కురిసింది. జిల్లాలో వర్షం కారణంగా నష్టాన్ని పరిశీలిస్తే... గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షంతో పాలేరు నియోజకవర్గంలో ప్రధానంగా పత్తి, మిర్చి పంటలకు అపార నష్టం కలిగింది. నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో 37,500 ఎకరాలు, ఖమ్మం రూరల్ మండలంలో 25 వేల ఎకరాలలో, తిరుమలాయపాలెం మండలంలో 50 వేల ఎకరాలలో, నేలకొండపల్లి మండలంలో 12,500 ఎకరాలలో వేసిన పత్తి పంట దాదా పు ఈ వర్షానికి 80 శాతం పైగా దెబ్బతింది. ప్రస్తుతం మొదటి దశ పత్తి తీసే సమయం లో వచ్చిన వర్షం రైతులను నట్టేట ముంచిం ది. వరుస వానలతో పత్తి చేలల్లో నీరు చేరడంతో చేలన్నీ ఎర్రగా మారాయి. ఒక్కసారి కూడా పత్తి తీయకపోవడంతో ఈ వర్షానికి చేలల్లోనే పత్తి మొలకెత్తే పరిస్థితి నెలకొంది. అశ్వారావుపేట మండలంలో 5 వేల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. వర్షాల కారణంగా పూత రాలిపోయి, కాయలు నల్లబడిన కారణంగా రెండు తీతలు (కోతలు) పూర్తిగా రైతులు నష్టపోయారు. చంద్రుగొండ మండలంలో పత్తి 13 వేల ఎకరాల్లో సాగవుతుండగా మొత్తం తొలిదశ పత్తి తీస్తుండగా వర్షంతో నష్టం వాటిల్లింది. ములకలపల్లి మండలంలో 2500 ఎకరాల్లో పత్తి సాగవుతుండగా అధిక శాతం పత్తిపంట నష్టం వాటిల్లే అవకాశముంది. ఖమ్మం అర్బన్ మండలంలోని పంగిడి, ఈర్లపూడి, రాంక్యాతండా, మల్లేపల్లి, చింతగుర్తి, గణేశ్వరం, వేపకుంట్ల, చాపరాలపల్లి, శివాయిగూడెంలలో సుమారు 20 వేల ఎకరాల్లో పత్తిసాగు చేస్తున్నారు. తొలిదశ పత్తి తీసే సమ యంలో వర్షం రావడంతో పత్తి తడిసిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.