
వాళ్లే 'సుప్రీం'లా... అదెలా?
హైదరాబాద్ : న్యాయమూర్తుల నియామకాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును... లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంటు, ప్రజల భాగస్వామ్యం లేకుండా న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. దశాబ్దకాలంగా జాతీయ న్యాయ నియామక వ్యవస్థను సమర్ధించిన వారిలో తానూ ఒకడినని జేపీ శుక్రవారమిక్కడ అన్నారు.
కాగా జడ్జీల నియామకంపై సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ జ్యూడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని కొట్టిపారేసింది. పాత పద్ధతిలోని కొలీజియం ద్వారానే న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని స్పష్టం చేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కొలీజియం వ్యవస్థను పక్కకు పెట్టి నేషనల్ జ్యూడిషియల్ కమిషన్ తీసుకొచ్చింది.
అయితే, ఇందులో రాజకీయ జోక్యం ఎక్కువవుతోందని కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కీలక తీర్పును వెల్లడించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ వ్యవస్థను కొట్టి పారేస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది.