భారత సరిహద్దులో కాల్పులకు తెగబడుతూ కయ్యానికి కాలుదువ్వుతున్న పొరుగు దేశం పాకిస్తాన్ సమరానికి సై అన్న సంకేతాలను పంపుతోంది. మా దగ్గర అణ్వాయుధాలు జాగ్రత్త అని భారతదేశాన్ని బెదిరిస్తోంది.
ఇస్లామాబాద్: భారత సరిహద్దులో కాల్పులకు తెగబడుతూ కయ్యానికి కాలుదువ్వుతున్న పొరుగు దేశం పాకిస్తాన్ సమరానికి సై అన్న సంకేతాలను పంపుతోంది. మా దగ్గర అణ్వాయుధాలున్నాయి.. జాగ్రత్త అని భారతదేశాన్ని బెదిరిస్తోంది. ఇరుదేశాల మధ్య యుద్ధం వస్తే న్లూక్లియర్ ఆయుధాలతో దాడికి సిద్ధంగా ఉన్నామని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. . ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం లేనప్పటికీ ఆ భయం ఎప్పటికీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఆయుధాలున్నది షో కేస్లో ఉంచి ప్రదర్శించడానికి కాదంటూ సవాల్ విసురుతున్నారు. పొరుగుదేశంతో యుద్ధం రాకూడదనే తాము కూడా కోరుకుంటున్నామని , అణ్వాయుధాల వాడే అవసరం రాకూడదనే గట్టిగా విశ్వసిస్తున్నామన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే దేశ భద్రతకోసం అణ్వాయుధాలను ప్రయోగించే శక్తి సామర్ధ్యాలు తమకున్నాయని పేర్కొన్నారు. తెహ్రిక్-ఇ-తాలిబన్, బలూచి ఉగ్రవాదులకు భారతదేశం సహకరిస్తుందన్న సాక్ష్యాధారాలను ప్రపంచ సంస్థలకు అందజేశామని ఆయన తెలిపారు. త్వరలో జరగబోతున్న ఇరుదేశాల ప్రధానుల భేటి సందర్భంగా పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆరుదేశాల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను జూలై 10 న రష్యాలో కలవనున్నారు.