సేనలో సర్దుకున్న విభేదాలు | Disagreements clear between shiv sena and mns | Sakshi
Sakshi News home page

సేనలో సర్దుకున్న విభేదాలు

Published Mon, Jul 7 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

Disagreements clear between shiv sena and mns

 సాక్షి ముంబైః మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)లో నెలకొన్న విభేదాలకు ఎట్టకేలకు సోమవారం తెరపడింది. ఎమ్మెన్నెస్‌లో తనకు ప్రాధాన్యం దక్కడం లేదంటూ కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న వసంత్ గీతే ఎట్టకేలకు మనసు మార్చుకున్నారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ప్రకటించడంతోపాటు రాజ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. తన సూచనల ప్రకారం నాసిక్ కార్పొరేషన్‌లో పదవులు కేటాయించకపోవడంపై ఆయన ఆగ్రహంతో ఉనా, ఠాక్రేతో భేటీ అయ్యాక చల్లబడ్డారు.

దీంతో నాసిక్ లో గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం అంతమయింది. మరికొన్ని నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజ్ ఠాక్రేకు ఈ పరిణామం సంతోషం కలిగిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెన్నెస్ సీనియర్ నాయకుడైన నాసిక్ ఎమ్మెల్యే గీతే గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న విషయం విధితమే. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ పదవుల కేటాయింపుపై ఆయన నిరసన వ్యక్తంచేశారు. ఇది జరిగిన అనంతరం ఇటీవలే జరిగిన లోకసభ ఎన్నికల్లో ఎంతో పట్టుందని భావించిన నాసిక్‌లో ఎమ్మెన్నెస్ ఘోరపరాజయం చవిచూడాల్సి వచ్చింది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్ ఠాక్రే వసంత్ గీతేను కొంత దూరంగా ఉంచడం ప్రారంభించారు. పార్టీ నిర్ణయాలు తీసుకోవడంపై అవినాశ్ అభ్యంకర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇలా పరోక్షంగా ఎమ్మెల్యే ఉత్తమరావ్ ఢికలేను ప్రోత్సహించడంతో ఆయన ప్రత్యర్థి అయిన గీతేలో అసంతృప్తి అధికమయింది. ఈ నేపథ్యంలో నాసిక్‌కు చెందిన కొందరు పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలతోపాటు ఆయన పార్టీని వీడనున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. రాజ్ ఠాక్రే అధ్యక్షతన  ఆదివారం జరిగిన సమావేశంలో గీతేతోపాటు ఆయన సన్నిహితులు హాజరుకాలేదు.

 అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నందునే గీతే సమావేశానికి రాలేదని పలువురు నాయకులు అనుకున్నారు. దీంతో గీతేతోపాటు ఆయన మద్దతుదారులు తిరుగుబాటు చేయడం ఖాయమని భావించారు. అదేవిధంగా ఆయన బీజేపీలో చేరనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రాజ్ ఠాక్రే నాసిక్‌లో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకే గీతే వివాదం తీవ్రరూపం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకొని స్వయంగా రంగంలోకి దిగారు. వసంత్ గీతేను బుజ్జగించేందుకుగా నితిన్ సర్దేశాయ్, ప్రవీణ్ దరేకర్, దీపక్ పాయిగడేను గీతే నివాసానికి పంపించారు.

వీరి భేటీ అనంతరం ఒక్కసారిగా ఆయనలో మార్పు కన్పించింది. ‘పార్టీపై నిరసన వ్యక్తం చేయడానికే సమావేశానికి రాలేదన్న పుకార్లుఅబద్ధం. నా కాలికి గాయంకారణంగా ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పడంతో సమావేశానికి వెళ్లలేదు’ అని వివరణ ఇచ్చారు. పార్టీ వీడనున్నట్టు మీడియాలో వస్తున్న కథనాలను అవాస్తమని స్పష్టం చేశారు. ఎమ్మెన్నెస్‌లో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న తనకు పార్టీపై ఎందుకు అసంతృప్తి ఉంటుందని మీడియాను ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement