
ముంబై :మహారాష్ట్రలో వానలు దంచి కొడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముంబై నగరంలో రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి, రెడ్ అలర్ట్ను ప్రకటించింది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలో జనజీవనం స్తంభించింది. రోడ్లపై పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే స్కూళ్లకి సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలతో ట్రైన్లు, విమానాల రాకపోకలు స్థంభించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలతో ముంబైలోని సియోన్ ఏరియాలో ప్రధాన మార్గాలు నీటితో నిండిపోయాయి. దీంతో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవైపు సియోన్ రైల్వే స్టేషన్లోకి భారీగా వరద నీరు చేరింది. ఐఎండీ ఇప్పటికే ముంబై, థానే, పల్ఘర్, రాయ్గఢ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయే అవకాశాలున్నాయిని ఐఎండీ డిప్యూటీ డైరెక్టర్ కేఎస్ హోసలికర తెలిపారు. భారీ వర్షాలతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముంబైను సురక్షితంగా ఉంచేందుకు ఏదైనా సహాయం కావాలంటే 1916కు కాల్ చేయాలని అధికారులు సూచనలు జారీ చేశారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment