
సాక్షి, బెంగళూరు: ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎకనామిక్స్ టైమ్స్కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్యూలో ఆయన పలు అంశాలపై స్పందించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన మరోసారి అధికార పగ్గాలు చేపట్టడం మంచిదని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి పట్ల ఆసక్తి ఉన్న జాతీయ నాయకుడిగా మోదీకి మనం కృతజ్ఞులై ఉండాలి. గత అయిదేఏళ్ళలో ఆయన దేశంలో అవినీతి నిర్మూలనకు, క్రమశిక్షణ, పరిశుభ్రతపై దృష్టి కేంద్రీకరించారని తాను భావిస్తున్నానన్నారు. ఆర్థికవ్యవస్థ పురోగమించింది. ఇది మంచి విషయం. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా దృఢంగా పోరాడుతున్న మోదీ సర్కార్ మళ్లీ అధికారంలోకి రావడం దేశానికి మంచిదని వ్యాఖ్యానించారు. సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఇన్ఫీ నారాయణ మూర్తి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
మరోవైపు దేశాన్ని పట్టి కుదిపేస్తున్న రఫేల్ డీల్పై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. సరైన సమాచారం లేని కారణంగా నిజం ఏమిటో తనకు తెలియదని పేర్కొన్నారు. అలాగే ఆర్బీఐ వివాదంపై స్పందిస్తూ.. ఆయా సంస్థలు దృఢంగా ఉండాలన్నారు.
అభివృద్ధిని పక్కన పెట్టి ప్రభుత్వం గుళ్లూ, విగ్రహాల వైపు చూస్తోందన్న ఆరోపణలపై మాట్లాడుతూ ఇవన్నీ తాను దృష్టిపెట్టాల్సిన అంశాలు కావన్నారు. 1.3 బిలియన్ల భారతీయుల్లో ప్రతి ఒక్కరు దేశానికి ఎంతో ముఖ్యం. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, విశ్వాసం, నిర్భయంగా వ్యవహరించే స్వేచ్ఛ ప్రతి పౌరుడికి లభించడమే నిజమైన ప్రజాస్వామ్యంగా పేర్కొన్నారు.
అలాగే ప్రపంచంలో అతి కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ నిలవడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గ్రామ గ్రామానికి వెళ్లి అక్కడి కాలుష్యం, పరిశుభ్ర పరిస్థితులను ప్రధాని గమనించ లేరు కదా , అది ఆయన బాధ్యత కాదు అని నారాయణ పేర్కొన్నారు. మనం చాలా బాధ్యతారాహిత్యంగా, క్రమశిక్షణా రహితంగా ఉన్నాం. ఈ సమస్య భారతీయల మనస్తత్వంతో, వ్యక్తిత్వాలతో ముడిపడి వుందన్నారు. అంతేకాదు దేశంలో ఆర్థిక పరివర్తన సాధించాలంటే తక్షణమే సాంస్కృతిక పరివర్తన చాలా అవసమని మూర్తి అభిప్రాయపడ్డారు.
జీఎస్టీ, ఐబీసీ వంటి కీలక సంస్కరణల్లో అమలుపై ప్రశ్నకు ప్రధాని ఆధ్వర్యంలో ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధించిందంటూ మరోసారి స్పష్టం చేశారు. వీటి వైఫల్యానికి మోదీని తప్పు బట్టలేం. ఇది ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనంటూ చెప్పుకొచ్చారు.