
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్తో చర్చలు జరిపే ధైర్యం ప్రధాని నరేంద్ర మోదీకి ఉందని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. ‘పాక్తో చర్చలు జరిపే వరకూ ఉగ్రవాదం సమసిపోదని గుర్తించినందుకు జమ్మూ కాశ్మీర్ సీఎంను అభినందిస్తున్నా..సంప్రదింపులను చేపట్టి వాటిని అర్ధవంతంగా ముగించే సత్తా మోదీకి ఉందని నమ్ముతున్నా’ నని ఆయన వ్యాఖ్యానించారు.
కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి బాటలో బీజేపీ ప్రభుత్వం పయనించాలని గతంలో ఫరూక్ అబ్దుల్లా పేర్కొనడం గమనార్హం. వాజ్పేయి పేరుతో ఓట్లడిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ కాశ్మీర్పై వాజ్పేయి వైఖరికి దూరం జరిగిందన్నారు. పాకిస్తాన్తో పాటు హురియత్ నేతలతోనూ వాజ్పేయి చర్చలు చేపట్టిన విషయాన్ని మోదీ ప్రభుత్వం గుర్తెరగాలన్నారు. కేంద్రం ఇప్పుడు కూడా ఈ దిశగా చర్యలు ప్రారంభించాలని కోరారు.