
సాక్షి, సంగారెడ్డి: మాజీ మంత్రి హరీష్రావు తనను రాజకీయంగా అణగతొక్కే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. హరీష్ తీరును ప్రజలకు వివరిస్తానని, ఆయన చేసిన తప్పుల్ని సీఎం కేసీఆర్ సరిదిద్దాలని అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో జగారెడ్డి మాట్లాడారు. బడ్జెట్పై ప్రజల అభిప్రాయం తెలుసుకుని మాట్లాడతానని, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు గెలుచుకుంటుందన్న నమ్మకం తనకుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పటికీ బలంగా ఉందని, చాణక్య నీతితో ముందుకెళితే భవిష్యత్ తమ పార్టీదే అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరికి అమ్ముడుపోయే వ్యక్తి కాదని, ఆయన వ్యక్తిత్వంపై తమకు నమ్మకముందని పేర్కొన్నారు. కేవలం ప్రజల సమస్యపై చర్చించేందుకు మాత్రమే కేటీఆర్కు ఆయన ఫోన్ చేయారని స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఉత్తమ్ ఒక్కడే బాధ్యడు కాదని, తమ పార్టీ నుంచి ఎవ్వరూ బయటకు వెళ్లరని ధీమా వ్యక్తం చేశారు.