
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు నామినేషన్ పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరి శంకర్రావు, ఉండవల్లి శ్రీదేవి, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
కాగా ఈ ఏడాది ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ‘‘2014, 2015లోనే వైఎస్సార్సీపీలో చేరాల్సి ఉన్నా, రాయపాటితో కలిసి అప్పట్లో టీడీపీలో చేరాను. వైఎస్ జగన్ నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగస్వామిని కావాలని వైఎస్సార్సీపీలో చేరాను. జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నన్ను ఆకర్షించాయి’’ అని పార్టీలో చేరిన సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.