
దేశంలోకి ఎవరూ చొరబడలేదన్న నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ స్పందించారు.
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోకి ఎవరూ చొరబడలేదన్న నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ స్పందించారు. చైనాతో సరిహద్దు విషయమై కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదని అన్నారు. సరిహద్దు రక్షణ కోసం సైనికుల త్యాగాలు వృథా కాకూడదని అన్నారు. కల్నల్ సంతోష్ బాబు సహా జవాన్ల త్యాగాలకు న్యాయం జరగాలని మన్మోహన్ అభిప్రాయపడ్డారు. లేకుంటే ప్రజలకు చారిత్రాత్మక మోసం జరిగినట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. దేశ ప్రాదేశిక సమగ్రతలో రాజీ పడొద్దని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
(చదవండి: ఆయన ‘సరెండర్’ మోదీ: రాహుల్)
గల్వాన్ వ్యాలీ, ప్యాగ్యాంగ్ లేక్ వద్ద చైనా చొరబాట్లుకు పాల్పడుతోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రకటనల పట్ల జాగ్రత్త వహించాలని మన్మోహన్ సూచించారు. ప్రధాని మోదీ ప్రకటనలు వ్యూహాత్మక ప్రాదేశిక ప్రయోజనాలతో పాటు దేశ రక్షణపై ప్రభావం చూపుతాయన్నారు. ఈ సంక్షోభం ఎదుర్కొనేందుకు, ఉద్రిక్తలు తగ్గించేందుకు ప్రభుత్వ విభాగాలన్నీ ఏకతాటిపై పని చేయాలని ఆయన సూచించారు. దౌత్య, లేదా నిర్ణయాత్మక నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వడం ప్రత్యామ్నాయం కాదని మన్మోహన్ అన్నారు.
(చదవండి: కరోనాపై యోగాస్త్రం)