న్యూఢిల్లీ:దాదాపు 16 ఏళ్ల తరువాత తొలిసారి రైళ్లో ప్రయాణం చేసిన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి చేదు అనుభవం ఎదురైంది. శనివారం తన కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా రైల్లో బయల్దేరిన గంగూలీతో ఓ ప్రయాణికుడు గొడవపడ్డాడు. దాదాకు కేటాయించిన ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ లో ముందుగానే ఒక ప్రయాణికుడు కూర్చొని ఉన్నాడు. ఈ విషయాన్ని అతనితో చెప్పి అక్కడ కూర్చొనే యత్నం చేశాడు గంగూలీ. అయితే అది తన సీటని, ఎట్టిపరిస్థితుల్లోనూ కూర్చొన్న చోటు నుంచి లేచేది లేదంటూ ప్రయాణికుడు తెగేసి చెప్పాడు.
దాంతో రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ సిబ్బంది గంగూలీ బెర్తును మరొకచోటకి మార్చారు. ఏసీ టూ టైర్లో గంగూలీకి బెర్తును ఏర్పాటు చేశారు. ఆ తరువాత బలూర్ ఘాట్ లో ఏర్పాటు చేసిన తన ఎనిమిది అడుగుల కాంస్య విగ్రహాన్ని గంగూలీ ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. 2001లో రైల్లో ప్రయాణించిన తరువాత మళ్లీ ఇంతకాలానికి రైల్లో జర్నీ చేసినట్లు తెలిపాడు. అయితే అతనికి ఎదురైన చేదు అనుభవం గురించి దాదా ప్రత్యేకించి ఏమీ మాట్లాడలేదు.