2011 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను భారత్‌కు అమ్మేశారు.. | Srilanka sports minister controversial comments on 2011 worldcup | Sakshi
Sakshi News home page

వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ఫైనల్‌ ఫిక్స్ అయింది: మాజీ క్రీడామంత్రి

Jun 18 2020 5:35 PM | Updated on Jun 18 2020 6:15 PM

Srilanka sports minister controversial comments on 2011 worldcup - Sakshi

కొలంబో : 2011లో జ‌రిగిన వ‌న్డే క్రికెట్‌ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ఫైన‌ల్ మ్యాచ్ ఫిక్స్ అయిన‌ట్లు శ్రీలంక మాజీ క్రీడాశాఖ మంత్రి మ‌హిందానంద అలత్‌గ‌మ‌గే సంచలన ఆరోపణలు చేశారు. శ్రీలంకతో జరిగిన తుదిపోరులో ధోని నేతృత్వంలోని టీమిండియా వరల్డ్‌​కప్‌ కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే. ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో మ‌రో ప‌ది బంతులు మిగిలి ఉండగానే  టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని చేజిక్కించుకుంది. ఆ స‌మ‌యంలో శ్రీలంక క్రీడా మంత్రిగా మ‌హిందానంద ఉన్నారు. మ‌హిందానంద 2010 నుంచి 2015 వరకు క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పునరుత్పాదక ఇంధనం-విద్యుత్ శాఖలో రాష్ట్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. (మళ్లీ జట్టులోకి క్రికెటర్‌ శ్రీశాంత్)

‘2011 వరల్డ్‌ కప్‌ మేము గెలవాల్సి ఉంది. కానీ, మ్యాచ్‌ను భారత్‌కు శ్రీలంకకు అమ్మేసింది. ఇన్నాళ్లు దేశం మేలు కోసం ఈ విషయం చెప్పలేదు. కానీ ఇప్పుడు నా బాధ్యతగా ఈ విషయాన్ని బయటపెడుతున్నా. ఆటగాళ్లను ఈ వ్యవహారంతో ముడిపెట్టడంలేదు. కొన్ని వర్గాలు దీని కోసం పని చేశాయి. నేనేం చెబుతాన్నానో దానికి కట్టుబడి ఉంటా’ అని తాజాగా శ్రీలంకకు చెందిన సిరాస టీవీతో మాట్లాడుతూ మ‌హిందానంద సంచలన అరోపణలు చేశారు. (సచిన్‌ కెప్టెన్సీ వైఫల్యంపై మదన్‌లాల్‌ కామెంట్స్‌)

ఇక ఇంతకు ముందే శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కూడా 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ అయిందని ఆరోపించాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఆ ఫైనల్లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడం తనను విస్మయపరిచిందని పేర్కొన్నాడు. ‘అప్పుడు నేను వ్యాఖ్యాతగా భారత్‌లోనే ఉన్నాను. ఆ ఓటమి నన్నెంతో వేదనకు గురిచేసింది. ఆ ఓటమిపై అప్పట్లోనే నాకు అనుమానం వచ్చింది. 2011 ఫైనల్లో శ్రీలంక ఆడిన తీరుపై మనం విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది' అని అప్పట్లో రణతుంగ వ్యాఖ్యానించాడు.

2011 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్‌పై గ‌తంలో మ‌రో శ్రీలంక క్రీడా మంత్రి ద‌యాసిరి జ‌య‌శేఖర కూడా ఇదే త‌ర‌హా ఆరోప‌ణ‌లు చేశారు. 2017లో మాజీ క్రికెట‌ర్ అర్జున ర‌ణ‌తుంగ లేవ‌నెత్తిన అంశాల ఆధారంగా ఆ వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫిక్సింగ్‌పై విచార‌ణ చేప‌ట్టాల‌నుకుంటున్న‌ట్లు ద‌యాసిరి తెలిపారు. రణతుంగ ఆరోపణలు పనికిమాలినవిగా నాటి వరల్డ్‌కప్‌ భారత జట్టు సభ్యులు గౌతమ్‌ గంభీర్‌, ఆశీష్‌ నెహ్రా అప్పట్లోనే కొట్టిపారేశారు. అతడి ఆరోపణలకు ఆధారాలు చూపాలని సవాల్‌ కూడా విసిరారు.(అవన్నీ తప్పుడు వార్తలు: ఆఫ్రిది)

రుజువులు చూపండి: మాజీ కెప్టెన్లు
2011 వరల్డ్‌కప్‌ను భారత్‌కు అమ్మేశారంటూ మ‌హిందానంద చేసిన ఆరోపణలను మాజీ కెప్టెన్లు కుమార సంగక్కర, మహేల జయవర్ధనే తోసిపుచ్చారు. మ‌హిందానంద చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని ట్విటర్‌లో డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement