
సాక్షి, చెన్నై: నటుడు విజమ్ తండ్రి, దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్పై ఆధారాలుంటే కేసు నమోదు చేయాల్సిందిగా చెన్నై హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. దర్శకుడు ఎస్ఏ. చంద్రశేఖర్ గత నవంబరు నెలలో చెన్నైలో జరిగిన ఒక చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అప్పుడాయన భక్తులు తిరుపతి దేవస్థానంలో సమర్పించే కానుకలు ఆ దేవునికి లంచం ఇచ్చినట్లేనని వివాదాష్పద వ్యాఖ్యలు చేశారు. ఆలయ హుండీల్లో కానుకలు వేస్తే పరిక్షల్లో ఉత్తీర్ణత కోసం ఇక పరిక్షలే రాయవలసిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఆయన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేకెత్తించాయి. కాగా ఈ వ్యవహారంపై హిందు మున్నాని సంఘం నిర్వాహకులు దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను గాయపరచేవిగా ఉన్నాయనీ పేర్కొంటూ చెన్నై పోలీస్ కమీషనర్ కార్యలయంలో గత నెల 25వ తేధీన పిర్యాదు చేశారు. అయితే ఆ పిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంతో వారు చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్లో దర్శకుడు ఎస్ఏ. చంద్రశేఖర్పై తగిన చర్యలు తీసుకునేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కేసు శనివారం న్యాయమూర్తి ఎంఎస్.రమేశ్ సమక్షంలో విచారణకు రాగా తగిన ఆధారాలుంటే దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్పై కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment