
ప్రతీకాత్మక చిత్రం
కరీంనగర్క్రైం: మందు తాగి వాహనం నడిపితే జైలుకే.. మద్యం మత్తులో జరుగుతున్న ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసులు డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. తాగి వాహనం నడిపి దొరికితే జరిమానాలే కాదు.. జైలుకు కూడా పంపుతున్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో 90 శాతం మద్యం మత్తులోనివేనని పోలీసులు పేర్కొంటున్నారు. వీటి నివారణకే పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రత్యేక డ్రైవ్లు..
మందుబాబులపై ప్రత్యేక డ్రైవ్లు మన రాష్ట్రంలో 2011 నవంబర్ 4న హైదరాబాద్లో అప్పటి సెంట్రల్జోన్ డీసీపీగా పనిచేసిన, ప్రస్తుతం కరీంనగర్ కమిషనర్గా పనిచేస్తున్న కమలాసన్రెడ్డి ప్రారంభించారు. తాగి ప్రమాదాల బారిన పడుతున్న వారిలో 21–30ఏళ్ల లోపు యువకులే ఎక్కువగా ఉంటున్నారు. వీరిపై వివిధ రకాల జరిమానాలు, శిక్షలు అమలు చేశారు. ఈ చర్యలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే రోడ్ సేప్టీ ఇన్ టెన్ కంట్రీస్(ఆర్ఎస్–10) ప్రాజెక్టు అధికారులు కితాబునిచ్చారు. హైదరాబాద్లో విజయవంతం కావడంతో జిల్లాలో 2013 ఆగస్టు నుంచి ప్రత్యేక డ్రైవ్ చెపడుతున్నారు.
అందుబాటులో అత్యాధునిక మిషన్లు
అందుబాటులో అత్యాధునిక మిషన్లుప్రస్తుతం మన పోలీసుల వద్ద ఆధునిక బ్రీత్ అనలైజర్లు అందుబాబులో ఉన్నాయి. తక్కువ సమయంలో సమర్థవంతంగా పని చేసే అడ్వాన్స్ యంత్రాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిలో రెండు మోడ్లుంటాయి. మొదట పాసీవ్మోడ్లో పరీక్షించి మద్యం తాగి ఉన్నాడా? లేదా నిర్ధారించి.. డ్రంకెన్ స్టేజీలో ఉంటే అప్పుడు యాక్టివ్ మోడ్లో పరీక్షించి నిర్ధారించి ప్రింట్ తీస్తారు. ఇది కోర్టులో సాక్ష్యంగా చెల్లుబాటవుతోంది.
ఆ మూడు సెక్షన్లు..
కేంద్ర మోటారు వాహనాల చట్టంలోని కొన్ని సెక్షన్ల ప్రకారం కూడా జరిమానాలు వేస్తున్నారు. సెక్షన్ 185 ప్రకారం మద్యం తాగి వాహనం నడిపేవారిని పట్టుకునేందుకు డ్రైవ్ చేపట్టడం.సెక్షన్ 203 ప్రకారం ఐఎస్ఐ ధ్రువీకరించిన బ్రీత్ ఎనలైజర్ను వినియోగించి తనిఖీ చేయడం.సెక్షన్ 130 ప్రకారం వాహనం స్వాధీనం చేసుకొని చార్జ్షీట్ తయారు చేసి కోర్టులకు పంపే అవకాశముంది.
రెండో సారి చిక్కితే జైలు.. లైసెన్స్ రద్దు..
పోలీసులు గతంలో మందుబాబులపై ర్యాష్ డ్రైవింగ్(సెక్షన్ 184)కింద కేసు నమోదు చేసి ఫైన్ వేసేవారు. గతేడాది నవంబర్ నుంచి సెక్షన్ 185 కింద బుక్ చేసి కోర్టుకు పంపుతున్నారు. మద్యం సేవించిన వాహనం నడిపితే రూ. 500 నుంచి రూ. 2 వేల వరకూ జరిమానా విధించే అవకాశముంది. రెండోసారి చిక్కితే రూ.3 వేల జరిమానా లేదా రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం చట్ట ప్రకారం ఉం ది. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు సిఫారసు చేస్తున్నారు. ఇప్పటికే 150 మంది లైసెన్స్లు రద్దుకు ఆర్టీఏ అధికారులకు లేఖలు రాశారు. ఒకసారి రద్దయితే రెండేళ్ల వరకూ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
డౌన్లోడ్తో పరీక్షించుకోండి..
నిత్యం అనేక మంది డ్రంకెన్ డ్రైవ్ సమయంలో పోలీసుల వద్ద పలు సందేహలు లేవనేత్తుతున్నారు. ఎవరికి వారు మద్యం ఎంత తాగాలి? తాగింది ఎలా లెక్కించుకోవాలని అడుగుతున్నారు. దీనికో పరిష్కారముందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటర్నెట్ నుంచి ఆధునిక అండ్రాయిడ్ ఫోన్లలో ‘‘డ్రంక్ కం పేనియర్’’ అనే సాప్ట్వేర్ డౌన్లోడు చేసుకుం టే అందులో మద్యం సేవించిన వివరాలు నమోదు చేస్తే..బీఏసీ కౌంట్ చెప్తుంది. అది 30 కంటే తక్కువ చూపితే వాహనాలు నడపండి.. ఎక్కువ చూపితే నడపొద్దు.
ఐదేళ్లలో 7207 కేసులు..రూ..78.10 లక్షలు జరిమానా
ఒక్క కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో 2014లో 105 కేసులు.. రూ. 2. 10 లక్షల జరిమానా, 2015లో 235 కేసులు రూ.4.70 లక్షల జరిమాన విధించారు. కరీంనగర్ కమిషనరేట్గా మారిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ వేగం పెరి గింది. దీంతో భారీగా కేసులు నమోదయ్యాయి. 2016లో 2519 కేసులు నమో దు కాగా.. 2039 మందికి శిక్షలు పడగా.. 369 మందికి జైలు శిక్ష విధించారు. 89 మందికి శ్రమదానం శిక్షతోపాటు.. రూ.11.29 లక్షల జరిమానా విధించా రు. 2017లో 3897 కేసులు నమోదు కాగా వీటిలో 2505 మందికి శిక్షలు పడగా 572 మందికి జైలు శిక్ష విధించారు. 247 మందికి శ్రమదానం శిక్షతోపా టు రూ.59.77 లక్షలు జరిమానా విధించారు. 2018లో ఇప్పటి వరకూ 451 కేసులు నమోదు కాగా 394 మందికి శిక్షలు పడగా.. 229 మందికి జైలు శిక్ష విధించారు. 11 మందికి శ్రమదానం శిక్షతోపాటు రూ.11.59 లక్షల జరిమానా విధించారు.
బీఏసీ లెక్కింపు ఇలా...
బ్రీత్ ఎనలైజర్లు వాహనచోదకుడి శరీరంలో ఉన్న అల్కహాల్ను బ్లడ్ ఆల్కహాల్ కౌంట్(బీఏసీ) ద్వారా లెక్కిస్తాయి. ప్రతి 100 మీ.లీ. రక్తంలో 30 మి.గ్రా. కంటే ఎక్కువగా ఉంటే అది ఉల్లంఘన కింద లెక్క. అతిగా మద్యం సేవిస్తే బీఏసీ సుమారు 300 దాకా ఉంటుంది.150 బీఏసీ కంటే ఎక్కువగా ఉంటే జైలు శిక్ష విధించే అవకాశముంది.
తగ్గుతున్న ప్రమాదాలు..
రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు రోజు ప్రత్యేక డ్రైవ్లు చేపడుతున్నాం. మూడేళ్లగా చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. ఈ తనిఖీల ప్రభావంతో తమవారు త్వరగా ఇంటికి వస్తున్నారని పలువురు మహిళలు అనందం వ్యక్తం చేస్తున్నారు. మందుబాబులకు ప్రస్తుతం జరిమానా, జైలు శిక్షలు విధిస్తున్నాం. డ్రైవింగ్ లైసెన్స్ల రద్దుకు సిఫారసు చేశాం. మద్యం తాగితే రోడ్డెక్క వద్దు.. ప్రమాదాలు కొని తెచ్చుకొవద్దు.
– కమలాసన్రెడ్డి, కరీంనగర్
పోలీస్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment