
గీసుకొండ/కాటారం: పని చేయని సర్పంచ్లకు చెత్తబుట్ట ఇచ్చి సన్మానిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అయినా వారిలో మార్పు రాకపోతే ఇంటికి సాగనంపుతామని చెప్పారు. గ్రామ సీమలు బాగు పడాలంటే కఠిన నిర్ణయాలు కచ్చితంగా అమలు చేసినప్పుడే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం మరియపురం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంల్లో 30 రోజుల ప్రణాళికపై గురువారం జరిగిన అవగాహన సదస్సుల్లో మంత్రి మాట్లాడారు. క్రమశిక్షణతో గ్రామస్తులు మెలిగేలా కచి్చతంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే మార్పు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సర్పంచ్లు సేవాభావంతో పని చేయాలే తప్ప ఖర్చు పెట్టి గెలిచాం కదా అని సొంత లాభానికి పోతే వారికే చెడ్డ పేరు వస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో పాలన కఠినతరంగా ఉండబోతోందని, గ్రామ సభలో పాల్గొన్న వారికే గ్రామం గురించి మాట్లాడే అర్హత ఉంటుందని, ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా శ్రమదానం చేయాలన్నారు. ప్రతీ మండలంలో గ్రామాలను ఆదర్శంగా తీర్చి దిద్దే ఇద్దరు సర్పంచ్లను సన్మానిస్తామని చెప్పారు.