
'మనసున్న మారాజు కేసీఆర్'
సూర్యాపేట(నల్లగొండ): మనసున్న మారాజు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విద్యాసదస్సులో ఆయన మాట్లాడారు. వసతి గృహాలలో విద్యార్థులు దొడ్డు బియ్యం తినలేక పోవడాన్ని గుర్తించిన కేసీఆర్.. సన్నబియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిచడమే ధ్యేయంగా కేజీ టు పీజీ విద్య అమలులోకి తేచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, అందులో 30 లక్షల మంది ప్రభుత్వం, మరో 30 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారని వివరించారు. 60 లక్షల మంది విద్యార్థులకు ఒకేసారి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించడం సాధ్యం కాదన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యస్తున్న 30 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే కతనిశ్చయంతో ఉందన్నారు. ఈ సదస్సులో ట్రస్మా వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఆయన వెంట మంత్రి జి.జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, పల్లా రాజేశ్వర్రెడ్డితో పాటు పలువురు ట్రస్మా ప్రతినిధులు ఉన్నారు.