
మెట్రో కోటిన్నర మందికి ఉపయోగం: ఎన్వీఎస్ రెడ్డి
నగరంలో 72 కి.మీ మార్గంలో ఏర్పాటవుతున్న మెట్రో రైలు ప్రాజెక్టును సమీప భవిష్యత్లో మహానగర పరిధిలోని కోటిన్నర మంది ప్రజల ప్రయాణ అవసరాలను...
కూకట్పల్లి: నగరంలో 72 కి.మీ మార్గంలో ఏర్పాటవుతున్న మెట్రో రైలు ప్రాజెక్టును సమీప భవిష్యత్లో మహానగర పరిధిలోని కోటిన్నర మంది ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చే విధంగా తీర్చిదిద్దుతున్నామని హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు స్టేషన్లు, సమీప కాలనీలను అనుసంధానించేందుకు ప్రత్యేక బస్సులను కూడా నడపనున్నట్లు వెల్లడించారు.
నగరంలో అన్ని వర్గాల ప్రజలకు మైట్రోరైళ్లు అందుబాటులో ఉండే విధంగా పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ఆదివారం కూకట్పల్లిలోని ఆకార్ ఆశ ఆస్పత్రిలో మెట్రో ట్రావెలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అంతకుముందు ఆకార్ ఆశ ఆస్పత్రి ఆవరణలో చెట్లు నాటారు. కార్యక్రమంలో మెట్రో ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు లింగారెడ్డి, గోపాల్రావు, డి.ఎస్.శాస్త్రి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మెట్రో ప్రాజెక్టు విశిష్టతలు ఎన్వీఎస్ రెడ్డి మాటల్లో..
ప్రయాణికులు ప్రతిరోజూ టిక్కెట్ తీసుకునే అవసరం లేకుండా మెట్రో స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టడం.
హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు మెట్రో రైలు ఎంతో దోహదం చేస్తుంది.
ప్రతి ట్రిప్పులో ఒకేసారి వేయి మంది ప్రయాణికులను తీసుకెళ్లే అవకాశం.
గంటన్నర ప్రయాణ కాలాన్ని అరగంటకే కుదింపు.
హైదరాబాద్లోని మూడు కారిడార్ల పరిధిలో దశలవారీగా 57 రైళ్లు (171 కోచ్లు) తిరిగేలా చర్యలు.
ప్రతి స్టేషన్ వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేయడమే కాకుండా పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు.
కోచ్లో వికలాంగులు, సీనియర్ సిటిజన్స్తో పాటు పిల్లలకు ప్రత్యేక సీట్లు కేటాయింపు.
మెట్రో పిల్లర్ల కింద గార్డెన్ల ఏర్పాటు.
వీకెండ్లో పిల్లలతో సహా మెట్రో స్టేషన్ల సమీపంలో ఏర్పాటు చేయనున్న గేమ్జోన్లు, షాపింగ్ ఏరియాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు. మెట్రో మెంబర్షిప్ కార్డు తీసుకుంటే వారికి ఉచిత ప్రవేశం.