
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఢిల్లీలోని జేఎన్యూలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్ ప్రతినిధి, సామాజికవేత్త మేధా పాట్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో ఇప్పుడుస్వేచ్ఛ కోసం అన్ని వర్గాలు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘కమ్యూనిటీ టు రెసిస్ట్ కమ్యూనలిజం అండ్ ఫాసిజం’ఆధ్వర్యంలో ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా సదస్సు జరిగింది.
ఈ సదస్సులో మేధా పాట్కర్ మాట్లాడుతూ.. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై నేడు అన్ని వర్గాలు ఏకం అవుతున్నాయని చెప్పారు. జనవరి 30న మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని అహింసా దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ మాట్లాడుతూ.. జేఎన్యూలో దాడి జరిగి 4 రోజులు కావస్తున్నా ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవటం దారుణమన్నారు.