‘పేట’లో భద్రత డొల్ల..!
హైటెక్ బస్టాండ్లో కానరాని పోలీస్ ఔట్పోస్టు..
నేతల హామీలు ప్రకటనలకే పరిమితం
పనిచేయని సీసీ కెమెరాలు..
అత్యాధునిక ఆయుధాలు కరువు..
సరిగ్గా ఏడాది క్రితం.. ఏప్రిల్ 1వ తేదీన అర్ధరాత్రి సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో సీఐ మొగిలయ్య ఆధ్వర్యంలో పోలీసులు తని ఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ముగ్గురు వ్యక్తులు పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని కిందికి దించి విచారిస్తుండగా ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. పోలీసులు తేరుకునే లోపే కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేష్ నేలకొరగగా.. సీఐ వై.మొగలయ్య, మరో హోంగార్డు కిషోర్ తీవ్రంగా గాయపడ్డారు. ముష్కర మూక దాడికి ఏడాది పూర్తయిన సూర్యాపేటలో భద్రత డొల్లగానే మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
- సూర్యాపేట
రెండు రాష్ట్రాలను కలుపుతూ.. అత్యంత రద్దీగా ఉండే 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న ప్రముఖ పట్టణాల్లో సూర్యాపేట హైటెక్ బస్టాండ్ పేరుగాంచింది.ఈ బస్టాండ్కు నిత్యం వేలాది బస్సులు వచ్చిపోతుంటాయి.. లక్షలాది మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ముష్కరులు దాడి చేసి పరారైన వెంటనే పోలీసులు ఉన్నతాధికారులు, హోంశాఖామంత్రి, మంత్రులు బస్టాండ్ను సందర్శించారు.
అదే సమయంలో పేటలో, హైటెక్బస్టాండ్ ఆవరణలో పకడ్బందీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటుచేయడంతో పాటు పోలీసులకు అత్యాధునిక ఆయుధాలను కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నేటికీ ప్రకటనలకే పరిమితమైంది. సూర్యాపేట పట్టణంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జాతీయస్థాయిలో చర్చించుకునే విధంగా ఈ ఘటన సూర్యాపేటలో చోటుచేసుకున్నప్పటికీ హైటెక్ బస్టాండ్లో నిఘా కరువైంది.
వామ్మో.. హైటెక్ బస్టాండా..
సూర్యాపేట హైటెక్ బస్టాండ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం. అలాంటి బస్టాండ్కు ప్రతిరోజు వేలాది బస్సులతో పాటు లక్షల్లో ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. బస్టాండ్ బయటి నుంచి మొదలుకుని ఆవరణలో సైతం పోలీసులు నిరంతరం ప్రయాణికులకు భద్రత కల్పించాల్సి ఉంది. కానీ బస్టాండ్లో కేవలం ఒక్కరిద్దరు హోంగార్డులు కూడా అడపాదడపా కనిపిస్తుంటారు. బస్టాండ్లో పోలీసు నిఘా లేకపోవడంతో రాత్రివేళ సూర్యాపేట హైటెక్బస్టాండ్ నుంచి ప్రయాణం చేసే ప్రయాణికులు, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్కు వెళ్లే ప్రజలు, అడపాదడపా వెళ్లే పెట్రోలింగ్ చేసే పోలీసులు సైతం వణుకుతున్నారు. రాత్రి 12 గంటలు దాటితే ఆ వైపు కన్నెత్తి చూడాలంటేనే పోలీసులు జంకుతున్నారు. పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు , సరిపడా పోలీసు సిబ్బంది లేకపోవడంతో బస్టాండ్లో నిఘా కరువైంది.
కొన్ని రోజులకే..
ఉగ్రవాదుల దాడి జరిగిన కొన్ని రోజులకే ఓ గుర్తు తెలి యని కారును హైటెక్ బస్టాండ్ ఆవరణలో వదిలేసి వెళ్లినప్పటికీ దానిని గమనించడంలో పోలీసులు విఫలమయ్యారనే చెప్పవచ్చు. ఆ గుర్తు తెలియని కారులో నుంచి * కోటిన్నర బయటపడ్డ విషయం తెలిసిందే. ఇలాంటి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ పట్టణ ప్రజల, ప్ర యాణికుల భద్రతకు అటు ఆర్టీసీ.. ఇటు పోలీసు యం త్రాంగం తీసుకున్న చర్యలు నామమాత్రం. అయినా బస్టాండ్లో పోలీస్ ఔట్పోస్టు ఏర్పాటుచేసి 24 గంటలు ప్రయాణికుల భద్రత కల్పించాల్సిన చర్యలు ఏవి తీసుకున్న దాఖలాల్లేవు. బస్టాండ్లో ఒక ఏఎస్ఐతో పాటు ము గ్గురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు విధులు నిర్వహించాల్సి ఉండగా..
వారు ఏనాడు బస్టాండ్లో కన్పించిన దాఖలాలు లేవు. విధుల్లో భాగంగా బస్టాండ్ ఆవరణలో విధులు నిర్వహించాలి.. కానీ విధులకు వెళ్లిన సిబ్బంది ఎక్కువగా బస్టాండ్ బయట ప్రైవేటు వాహనాలను నిలిపి మామూళ్లు వసూళ్లు చేసేందుకే మక్కువ చూపుతున్నారనే ఆరోపణలు వెల్లివెత్తుతున్నాయి. సంఘటన జరిగినప్పుడు మాత్రమే కంటితుడుపు చర్యగా కొద్దిరోజులు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి.. కొద్దిరోజులు కాగానే యథావి థిగా వదిలేశారు.
ఇక ఇంత పెద్ద బస్టాండ్లో ఎనిమిది సీసీ కెమెరాలు అమర్చినప్పటికీ అవి సరైన ప్రదేశంలో అమర్చకపోవడంతో ఎవరు వచ్చి వెళ్తున్నారో.. ఏం చేస్తున్నారో.. అందులో నిక్షిప్తం కావడం లేదు. దీంతో అవి నిరుపయోగంగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి ప్రస్తుతం పనిచేయడం లేదనే విమర్శలు లేకపోలేదు. సంబంధిత అధికార యంత్రాంగం చొ రవ చూపి పేటలో పటిష్టభద్రత ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.