Published
Mon, Apr 6 2015 9:20 AM
| Last Updated on Tue, Oct 2 2018 7:43 PM
జైపూర్: జర్మన్వింగ్స్ విమానాన్ని కో-పైలట్ కూల్చేసిన కిరాతక ఘటన కళ్లముందు కదలాడుతుండగానే... ఎయిర్ ఇండియా విమానం పైలట్లు ఘర్షణ పడిన ఘటన జైపూర్ లో ఆదివారం చోటు చేసుకుంది. జైపూర్ నుంచి ఢిల్లీకి విమానం బయలుదేరడానికి ముందు కాక్ పిట్ లో కెప్టెన్, కో- పైలట్ ఘర్షణ పడ్డారు. కెప్టెన్ ను అసభ్య పదజాలంతో దూషించి అతడిపై కో-పైలట్ దాడి చేశాడని ఎయిర్ లైన్స్ వర్గాలు వెల్లడించాయి.
అయితే ఇద్దరి మధ్య వాగ్వాదం మాత్రమే చోటుచేసుకుందని, అంతకుమించి ఏం జరగలేదని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి కవర్ చేశారు. సంస్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ పెదవి విప్పడం లేదని సమాచారం. తమ ప్రాణాలతో చెలగాటమాడిన పైలట్ల వ్యవహారశైలిపై ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు.