
భవనం కూలిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు
చెన్నై: నగరంలో 11 అంతస్తుల భవనం కూలి భారీ ప్రాణ నష్టం సంభవించిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తుకు రంగం సిద్ధమైంది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదివారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ పార్టీల డిమాండ్ అధికంగా కావడంతో జయలలిత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భవనం ఆకస్మికంగా కూలి 61 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. భవన నిర్మాణాన్ని చేపట్టే క్రమంలో ప్రణాళిక లోపం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుపడటంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. ఈ బృందానికి నగర జాయింట్ పోలీస్ కమీషనర్ నేతృత్వం వహించనున్నారు. ఇందుకు గాను సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్ ఇంజనీర్లు సహకారం కూడా తీసుకోనున్నారు.
గత శనివారం చెన్నై మొగలివాక్కంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కుప్ప కూలింది. ఆ భవన నిర్మాణంలో కార్మికులుగా పని చేస్తున్న ఉత్తరాంధ్రకు చెందిన అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయారు.