
అక్షరాన్ని అపార్థం చేసుకోవద్దు!
ప్రశ్నించే వారిని ఎట్లా కట్టడి చెయ్యాలి? వాళ్ల మీద ఎదురు దాడి చెయ్యడమే అందుకు మందు అనుకున్నారాయన.
డేట్లైన్ హైదరాబాద్
ప్రశ్నించే వారిని ఎట్లా కట్టడి చెయ్యాలి? వాళ్ల మీద ఎదురు దాడి చెయ్యడమే అందుకు మందు అనుకున్నారాయన. ప్రశ్నలు అడిగే విలేకరులను ఎద్దేవా చెయ్యడం, ‘నీకేం తెలుసు?’ అనడం, ‘నేను దేశంలో, ప్రపంచంలో చాలామంది జర్నలిస్టులను చూశాను, నువ్వెంత?’ అంటూ వారిని అవమానించడం నేర్చుకున్నారు. తనను ఇరుకున పెట్టే ప్రశ్న అడిగిన జర్నలిస్ట్ను ‘నువ్వే పత్రిక నుంచి?’ అని అడగడం, పేరు చెప్పగానే, ‘నీకు నేను జవాబు చెప్పను’ అనడం, అనుకూల ప్రశ్న వేసే వారికి జవాబు ఇవ్వడం పరిపాటైంది.
మహాత్ముడిని హత్య చేయడాన్ని సమర్థించుకుంటూ నాథూరాం వినాయక్ గాడ్సే న్యాయస్థానంలో చేసిన సుదీర్ఘ ప్రకటనలో తాను ఆ పని చెయ్యడానికి గాంధీ దేశాన్ని ఇష్టానుసారం విభజించిన తీరే కారణమని చెబుతూ ఆనాటి పత్రికల మీద కూడా విరుచుకుపడ్డాడు. పత్రికలు నిష్పక్షపాతంగా వ్యవహరిం చలేదనీ, సత్యం గొంతు నొక్కేశాయనీ విరుచుకుపడ్డాడాయన. ఆనాడు పత్రి కలు సత్యం వైపు నిలబడి ఉంటే దేశ విభజన జరిగి ఉండేది కాదంటాడు 1948 నవంబర్ నాటి తన ప్రసంగంలో గాడ్సే. పత్రికలు దిగజారి తనను విమర్శించాయని ఆయన దూషించాడు. గాంధేయవాదులను వెనకేసుకొచ్చి పత్రికలు తప్పు చేశాయని విమర్శించాడు. దేశానికి స్వాతంత్య్రం ఎట్లా వచ్చిందో, విభజన ఎందుకు అవసరమైందో, ఆ రోజుల్లో ఇరువైపులా నెల కొన్న ఉద్రిక్త పరిస్థితి, జరిగిన హింసల గురించి మనం చాలాసార్లు చదువు కున్నాం. అటువంటి స్థితిలో పత్రికలు ఇంకా ఏ రీతిలో వ్యవహరించి ఉండా ల్సిందో గాడ్సేకే తెలియాలి. దేశానికి స్వాతంత్య్రం సాధించడంలో పత్రికలు నిర్వహించిన పాత్రను గాడ్సే విస్మరించి, తాను కోరుకున్న విధంగా పత్రికలు రాయలేదు కాబట్టి విమర్శించాడు.
అస్మదీయులు, తస్మదీయులు
గాడ్సే నుంచి అరవింద్ కేజ్రివాల్ దాకా, ట్రంప్ నుంచి చంద్రబాబునాయుడి దాకా తమకు అనుకూల ప్రచారం రాకపోతే మీడియాను విమర్శించడం, దుర్భాషలాడటం, బెదిరించటం వీలైన చోట్ల కట్టడి చెయ్యడం సర్వసాధారణ మైపోయింది. మీడియా తమ చెప్పుచేతల్లో ఉండాలన్న కోరిక మెజారిటీ రాజకీయ నాయకులకు ఉంటుంది. కొంతమంది అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. మీడియాను తమ దారిలోకి తెచ్చుకోలేకపోతే ఇలాగే విరుచుకు పడుతుంటారు. మీడియా లొంగకపోతే దాని విశ్వసనీయతను దెబ్బ తీసే కుట్రలు పన్నుతుంటారు. అందులో పైన పేర్కొన్న నలుగురిలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు. ఆయన హయాంలో నవ్యాంధ్రప్రదేశ్లో ఒక విలేకరి హత్యకు గురైతే, ఆ హత్య వెనక ఒక మంత్రి పరోక్ష ప్రమేయం ఉందని తెలిసీ కనీసం చలించని, ఒక ఓదార్పు ప్రకటన అయినా చెయ్యని రాజకీయవేత్త చంద్రబాబు. ఇవాళ మీడియా స్వతంత్రంగా లేదు. నిజమే, దానికి కారణాలు ఏమిటి, కారకులు ఎవరు? చంద్రబాబునాయుడితో సహా రాజకీయ నాయ కులకు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవారికి బాధ్యత లేదా?
ప్రశ్న అంటే కంపరం
అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల సమయంలోనే మీడియా పట్ల తన అసహనాన్ని పలుమార్లు బహిరంగంగానే ప్రదర్శించాడు. ఎన్నికై, పదవీ స్వీకారం చేసిన తరువాత మరోసారి విరుచుకుపడ్డాడు. కారణం ఏమిటంటే ఆయనకు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలను మీడియా ప్రచారం చెయ్యడం. ట్రంప్ గొప్పవాడు, ఆయన చేసే పనులన్నీ మంచిపనులు, దేశంలో ఎక్కడా ఎవరూ ఆయనను వ్యతిరేకించడం లేదు అని అసత్యాలు రాస్తే అది మంచి మీడియా. లేకపోతే మీడియా వాళ్లంతా అబద్ధాలకోరులు. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చెయ్యక ముందే మీడియాతో ఆయన వ్యవహారం ఎట్లా ఉండబోతుందో ప్రపంచమంతటికీ తెలిసింది. ఆయన తొలి పత్రికా గోష్టిలో ప్రశ్నలు అడగొద్దని ఒక ప్రఖ్యాత టీవీ ఛానల్ ప్రతినిధిని ట్రంప్ ప్రెస్ సెక్రటరీ ఆజ్ఞాపించాడు. అమెరికన్ మీడియా దానికి స్పందించి మీడియా ఏ ప్రశ్నలు వెయ్యాలో, ఏం రాయాలో, ఏం ప్రసారం చెయ్యాలో తాను నిర్ణయించుకుంటుంది, మీరు కాదు అంటూ ఒక బహిరంగ లేఖ రాసింది. చంద్రబాబునాయుడికి కూడా ప్రశ్నలడిగే జర్న లిస్టులంటే ఇష్టం ఉండదు.
అసలు ప్రశ్నలు అడిగే వాళ్లు తన పత్రికా సమా వేశాలకే రాకుండా చేస్తే సరిపోతుంది కదా అని, మొదట్లో ఆయన తన పార్టీ కార్యాలయానికీ, సచివాలయానికీ కొన్ని పత్రికలూ, టీవీ చానెళ్ల ప్రతినిధులు రాకుండా నిషేధం విధించారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమం, ప్రెస్ కౌన్సిల్ వంటి సంస్థలు ప్రజాస్వామ్యంలో అది కుదరదని తేల్చాక విధి లేక ఆ నిషేధాన్ని ఎత్తేశారు. మరి ప్రశ్నించే వారిని ఎట్లా కట్టడి చెయ్యాలి? వాళ్ల మీద ఎదురు దాడి చెయ్యడమే అందుకు మందు అనుకున్నారాయన. ప్రశ్నలు అడిగే విలేకరులను ఎద్దేవా చెయ్యడం, ‘నీకేం తెలుసు?’ అనడం, ‘నేను దేశంలో, మళ్లీ మాట్లాడితే ప్రపంచంలో చాలామంది జర్నలిస్టులను చూశాను, నువ్వెంత?’ అంటూ వారిని అవమానించడం నేర్చుకున్నారు. తనను ఇరు కున పెట్టే ప్రశ్న అడిగిన జర్నలిస్ట్ను ‘నువ్వే పత్రిక నుంచి?’ అని అడగడం, పేరు చెప్పగానే, ‘నీకు నేను జవాబు చెప్పను’ అనడం, తనకు అనుకూల ప్రశ్న వేసే జర్నలిస్ట్ల వైపు ఆప్యాయంగా చూసి, ముసిముసి నవ్వులు నవ్వుతూ జవాబులు ఇవ్వడం పరిపాటి అయింది.
ట్రంప్ లాగానే చంద్రబాబునాయుడు కూడా మీడియా ఏ ప్రశ్నలు వెయ్యాలో, ఏం రాయాలో, ఏం ప్రసారం చెయ్యాలో తానే చెప్పాలనుకుంటారు. అధికారంలో లేనప్పుడు ‘ఒక పత్రిక, టీవీ కార్యాలయాల మీద దాడులు చెయ్యండి!’ అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక భిన్నంగా వ్యవహరిస్తా రని ఎవరైనా ఎలా అనుకుంటారు? ఆయన అప్రజాస్వామిక, మీడియా వ్యతి రేక చర్యలను వ్యతిరేకించిన కారణంగా జాతీయ స్థాయిలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన, అరవై ఏళ్ల చరిత్ర కలిగిన ఒక జర్నలిస్ట్ సంఘాన్ని నిర్వీర్యం చెయ్యడానికీ, తమ అడుగులకు మడుగులొత్తే ఒక జేబు సంఘాన్ని ఏర్పాటు చెయ్యడానికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే నేరుగా విఫల ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలియనిదెవరికి? బహి రంగ వేదికల మీద వినతిపత్రం ఇవ్వడం కోసం వచ్చే ప్రతినిధి బృందంలోని జర్నలిస్ట్లు మనకు అనుకూలురా, వ్యతిరేకులా అని అడిగి మరీ ఆ సమ స్యలు వింటున్న ముఖ్యమంత్రి ఇక ప్రజలను కూడా విభజించి చూడరని ఎవరనుకుంటారు?
చంద్రబాబునాయుడు జర్నలిస్ట్లకు రాజకీయాలు కూడా ఆపాదిస్తారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం జరుగుతున్నది. అది కేవలం రాజ కీయ పార్టీల సొంత వ్యవహారమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటు న్నారు. అయిదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ఈ సమ స్యతో సమాజంలోని ఏ ఇతర వర్గానికీ సంబంధం లేదన్నది ఆయన అభిప్రాయం. అందుకే ఎవరు ప్రత్యేక హోదా విషయంలో ప్రశ్నించినా వాళ్లను ఆయన ప్రతిపక్షాల ప్రతినిధులుగా లెక్క వేస్తారు. తాజాగా ప్రత్యేక హోదా విషయంలో ఒక ప్రశ్న అడిగిన ‘ప్రజాశక్తి’ విలేకరితో ఆయన మాట్లాడిన తీరు సామాజిక మాధ్యమాలలో విస్తృత ప్రచారంలోకి వచ్చింది. ‘నువ్వొక రాజకీయ పార్టీకి చెందిన వాడివి, నీతో నేను మాట్లాడను, నీ ప్రశ్నకు జవాబు చెప్పను’ అంటూ విపరీత ధోరణి ప్రదర్శించారు చంద్రబాబు. ‘ప్రజాశక్తి’ మార్క్సిస్ట్ పార్టీ భావజాలానికి అనుకూలమైన పత్రిక అన్న విష యంలో దాపరికం లేదు. అట్లాగే ‘విశాలాంధ్ర’ దినపత్రిక కూడా కమ్యూ నిస్ట్ భావజాలానికి అనుకూలంగా ఉండే పత్రిక. అయినంతమాత్రాన ఆ రెండు పత్రికల్లో పనిచేసే జర్నలిస్ట్లు అదే రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండా లనిలేదు. ఒకవేళ ఉన్నా, ఒక విషయంలో ముఖ్యమంత్రి నుంచి సమాధానం రాబట్టేందుకు ప్రశ్నించే హక్కు వారికి సంపూర్ణంగా ఉందనే విషయం చంద్ర బాబు మరచిపోతున్నారు.
వామపక్షాలు ఇవాళ ఆయన రాజకీయాలతో విభే దిస్తున్నాయి కాబట్టి వాటి ఆధ్వర్యంలో నడిచే పత్రికలకూ, ఇతర మీడియా సంస్థలకూ చెందిన జర్నలిస్ట్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ముఖ్య మంత్రి నిరాకరిస్తారు! తమకు రుచించని వార్తలు రాసే ఏ మీడియా సంస్థతో నైనా మాట్లాడటానికీ, సమాధానాలు చెప్పడానికీ ఆయన ఇష్టపడరు. ఆ రెండు వామపక్షాలతో స్నేహం నెరపిననాడు ఏమయ్యింది ఈ వ్యతిరేకత, ద్వేషభావం చంద్రబాబుగారూ? 1995లో ముఖ్యమంత్రి పదవిని పదిలం చేసుకోడం కోసం వాళ్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసిన విషయం మరిచి పోయారా? తమకు వ్యక్తిగతంగా, రాజకీయంగా అనుకూలంగా ఉండే మీడియా సంస్థలకు మాత్రమే సమాచారం ఇస్తానంటే కుద రదు. అటువంటి మీడియా యాజమాన్యాలకు వేరే రకాలైన లాభాలు చేకూర్చవచ్చు, ఆ పని చంద్రబాబునాయుడు ఎలాగూ చేస్తున్నారు. కానీ సమాచార సేకరణ విష యంలో మాత్రం తరతమ భేదాలు ఉండటానికి వీల్లేదు. రాజకీయ పక్షా లకూ, మీడియా యాజమాన్యాలకూ ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి కానీ, తోటి జర్నలిస్ట్ను ముఖ్యమంత్రి అవమానిస్తుంటే కనీస నిరసన తెల పని మిత్రులను ఎలా అర్ధం చేసుకోవాలి? అధికారం శాశ్వతం కాదు. ప్రభుత్వం మారితే ‘ప్రజాశక్తి’ ప్రతినిధి స్థానంలో మనం ఉండాల్సి వస్తుందే మోనన్న ఆలోచన ఆ మిత్రులకు రాకపోవడం అన్యాయం.
పోరాడితే పోయేది పోలవరమట!
‘ప్రజాశక్తి’ జర్నలిస్ట్ మీద ఆగ్రహం ప్రదర్శించి, ఆయన ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి నిరాకరించిన సందర్భంలో చంద్రబాబు ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు–ప్రత్యేక హోదా గురించి తాను కేంద్రంతో పోరా టం చేస్తే పోలవరం ప్రాజెక్ట్కు నిధులు ఆగిపోతాయట. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అన్నారు కదా, కేంద్రమే ఆ ప్రాజెక్ట్ పూర్తి చెయ్యడానికి బాధ్యత తీసుకుందని కదా చెప్పారు. విభజన సమయంలో అంగీకరించిన విషయం కదా! మరి చంద్రబాబునాయుడు కేంద్రంతో పోరాడితే పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోతుందని ఎందుకు భయపడుతున్నట్టు? కేంద్ర ప్రభుత్వంతో పోరాటం అంటేనే చంద్రబాబునాయుడు ఎందుకు బెంబేలు ఎత్తుతున్నట్టు? దీనికి వెంకయ్యనాయుడుగారు వివరణ ఇస్తే బాగుంటుందేమో! ఈ లెక్కన ప్రత్యేక హోదా మాదిరిగానే, పోలవరం ప్రాజెక్ట్ కూడా అటకెక్కుతుందేమోనన్న సందేహం కలగక మానదు.
దేవులపల్లి అమర్,
(datelinehyderabad@gmail.com)