malaysian airline
-
27 గంటలు ఆన్ లైన్ సేవలు బంద్!
బెంగళూరు: ఎయిర్ ఏషియా తన ఆన్ లైన్ సర్వీసులను జూన్ 21న నిలిపివేయనుంది. ఈ విషయాన్ని ఎయిర్ లైన్స్ అధికారులు ఆదివారం వెల్లడించారు. మెయింటనెన్స్ కారణాల వల్ల జూన్ 20 న అర్ధరాత్రి 12 గంటల(జూన్ 21న) నుంచి జూన్ 22 ఉదయం 3 గంటల వరకు ఆన్ లైన్ సేవలు నిలిపివేస్తున్నారు. సెల్ఫ్ చెక్ ఇన్, మేనేజ్ మై బుకింగ్ సర్వీసులు కూడా అందుబాటులో ఉండవు. మలేషియాకు చెందిన ఎయిర్ లైన్స్ ఎయిర్ ఏషియా టాటా సన్స్ సంస్థతో కలిసి నిర్వహిస్తోంది. సౌత్ ఈస్ట్ ఏషియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ తో పాటు భారత్ లోని 7 నగరాలకు విమాన సేవల్ని అందిస్తుంది. ఆన్ లైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్న సమయంలో జర్నీ చేసే ప్రయాణికులు అంతకంటే ముందుగానే చెక్ ఇన్ ఆన్లైన్, మేనేజ్ మై బుకింగ్స్ చేసుకుని.. ఆ వివరాలతో బోర్డింగ్ పాసెస్ ను ప్రింట్ అవుట్ తీసుకోవాలని సంస్థ సూచించింది. ఎయిర్ లైన్స్ సేవలకు మాత్రం ఎలాంటి ఆటంకం కలగదని, కేవలం ఆన్ లైన్ సేవలు మాత్రమే 27 గంటలు నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. -
విమానం గాల్లో ఉండగానే పైలెట్ మృతి
బ్యాంకాక్: విమానం గాలిలో ప్రయాణిస్తుండగానే కో పైలెట్ కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన మలేషియా బడ్జెట్ ఎయిర్ లైన్స్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగినపుడు ఈ విమానంలో 152 మంది ప్యాసింజర్లు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. థాయ్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కో పైలెట్ కుప్పకూలారని తెలుసుకుని.. లయన్ ఎయిర్ ఫ్లైట్ ఎస్ఎల్ 8537 ను వెనక్కి రప్పించి హత్ యాయ్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాడింగ్ చేశారు. ల్యాండిగ్ కాగానే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో 152 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
'నా కూతురిని చంపిన వారికి ధన్యవాదాలు'
ద హేగ్: ఉక్రెయిన్ లో విమానం పేల్చివేసిన దారుణోదంతం ఎన్నో కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసింది. ఈ దుర్ఘటనలో తన ఒక్కగానొక్క కూతురిని కోల్పోయి పుట్టు దుఃఖంలో మునిపోయిన ఓ నెదర్లాండ్ దేశస్థుడు నేరుగా రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ కు బహిరంగ లేఖ రాశాడు. 'నా కూతురిని చంపిన వారికి ధన్యవాదాలు' అంటూ లేఖలో పేర్కొని ఎవరూ చేయని విధంగా నిరసన వ్యక్తం చేశాడు. తన హృదయ వేదనను లేఖ రూపంలో అక్షరీకరించాడు. 'నా ఒక్కగానొక్క కూతుర్ని చంపినందుకు పుతిన్ కు, రష్యా తిరుగుబాటుదారులకు లేదా ఉక్రెయిన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు' అంటూ నెదర్లాండ్ కు చెందిన హాన్స్ డీ బోర్ట్స్ రాసిన బహిరంగ లేఖను డచ్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. 17 ఏళ్ల ఆయన కుమార్తె ఎల్స్మీక్- విమాన ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయింది. ఆకాశయానం చేస్తూ విదేశీ యుద్ధ రంగంలో తగిలిన దెబ్బతో తన కుమార్తె కానరాని లోకాలకు వెళ్లిపోయిందని హాన్స్ డీ బోర్ట్స్ వాపోయాడు. వచ్చే ఏడాదితో పాఠశాల విద్య పూర్తి చేసుకోబోతున్న తన కూతురు డెలఫ్ట్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదవాలని ఆశ పడిందని తెలిపాడు. ఒక యువతి జీవితాన్ని అర్థాంతరంగా అంతం చేసినందుకు అద్దంలో చూసుకుని మీరు గర్వపడతారనని తాను అనుకుంటున్నానని పుతిన్ కు రాసిన లేఖలో హాన్స్ డీ బోర్ట్స్ రాశారు. తన లేఖను ఇంగ్లీషులోని అనువదించుకుని వెంటనే చదువుతారని ఆకాంక్షించాడు. విమానం కూల్చివేత ఘటనలో తమ దేశానికి పౌరులు అత్యధిక మంది మృతి చెందడంతో నెదర్లాండ్స్ లో ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. -
ప్రయాణికులకు మలేషియన్ ఎయిర్ లైన్స్ ఆఫర్
కౌలాలంపూర్:ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న రెండు వరుస దుర్ఘటనలు మలేషియన్ ఎయిర్ లైన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఎంహెచ్17 కుప్పకూలడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న మలేషియన్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కసరత్తులు ఆరంభించింది. ఇక నుంచి ప్రయాణికులు తమ ప్రయాణాల్లో మార్పు చేసుకున్నా.. రద్దు చేసుకున్నా టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు నడుంబిగించింది. దీనికి సంబంధించి మలేషియన్ ఎయిర్ లైన్స్ ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కేవలం ఇది సాధారణ టికెట్లకే కాదు.. నాన్ రిఫెండబుల్ టికెట్లు కూడా వర్తింపచేస్తున్నట్లు తెలిపింది. ఈ విధానాన్ని గురువారం నుంచి బుక్ చేసుకున్న ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది. ఈ అవకాశం జూలై 18 మొదలుకొని డిసెంబర్ 31 వరకూ అమల్లో ఉంటుందని ఎయిర్స్ లైన్స్ అధికారి ఒకరు తెలిపారు. గత మూడు రోజుల క్రితం నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ సమీపంలో తిరుబాటుదారులు క్షిపణులతో పేల్చివేశారు. ఆ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 280, సిబ్బంది 15 మంది మొత్తం 295 మంది మరణించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఈ ఏడాది మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్కు బయలుదేరుతూ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 237 మంది గల్లంతయ్యారు. -
విధి ఆడిన వింత నాటకం!
విధి చాలా విచిత్రమైంది. మనుషుల జీవితాలతో అది చిత్రమైన విన్యాసాలాడుతుంది. ఊహించని పరిణామాలతో మనిషిని ఉక్కిరిబక్కిరి చేస్తుంది. సాఫీగా సాగిపోతున్న జీవితాలను ఎప్పుడు ఏ మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. విధిలీలా విన్యాసంలో స్టివార్డు సంజిద్ సింగ్ సంధు ఆయన భార్యకు శాశ్వతంగా దూరమయ్యాడు. ఉక్రెయిన్ లో మలేసియా విమానం కుప్పకూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారిలో భారత సంతతికి సంధు ఉన్నాడు. సెలవు రోజున ఇంటిలో ఉండ్సాలిన అతడిని విధి వెంటాడించింది. గురువారం వారంతపు సెలవుకావడంతో ఇంట్లో ఉన్న సందు... తోటి ఉద్యోగి అభ్యర్థన మేరకు ఎంహెచ్-17 విమానంలో విధులకు వెళ్లి విగతజీవిగా మారిపోయాడు. విధి విచిత్రం ఏంటంటే షిఫ్టు మార్చుకోవడం వల్లే అతడి భార్య నాలుగు నెలల క్రితం మృత్యువు నుంచి తప్పించుకుంది. సంధు భార్య కూడా మలేషియా ఎయిర్లైన్స్లో స్టివార్డెస్గా పనిచేస్తోంది. ఈ ఏడాది మార్చి 8న అదృశ్యమైన ఎంహెచ్-370 విమానంలో సంధు విధి నిర్వహణకు వెళ్లాల్సివుండగా చివరి నిమిషంలో ఆమె షిప్ట్ మార్చుకుంది. తన బదులు వేరే ఉద్యోగిని సర్దుబాటు చేసి సెలవు తీసుకుంది. ఈ విమానం ఏమైందో ఇప్పటివరకు తెలియలేదు. ఇక రెండు విమాన ప్రమాదాల్లోనూ ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్కు చెందిన ఓ కుటుంబం నలుగురు సభ్యులను కోల్పోయింది. మొన్న కొడుకు, కోడలు.. నిన్న మనవరాలు, ఆమె భర్త మృత్యువాత పడ్డారు. విధి ఆడిన వింత నాటకం అంటే ఇదేనేమో! -
ఎంహెచ్ 17 : తప్పు మీదంటే మీదంటూ..
-
విమానం కూల్చివేత వాళ్ల పనేనా?!
-
ఎవరిదీ పాపం.. ఎవరికీ శాపం?
-
'ఎంత ఘోరం... మాటలు కూడా రావడం లేదు'
వాషింగ్టన్: మలేసియా ఎయిర్ లైన్స్ విమానాన్ని కూల్చివేత ఘటనపై దర్యాప్తులో సహాయం అందించేందుకు అమెరికా ముందుకు వచ్చింది. విమానం పేల్చివేతపై అంతర్జాతీయ దర్యాప్తులో సహాయం చేసేందుకు సిద్దమని అమెరికా అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించారు. ఎంహెచ్ 17 విమాన పేల్చివేతను అత్యంత ఘోరమైన ఘటనగా ఆయన వర్ణించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపేందుకు కూడా మాటలు రావడం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో మలేసియా, నెదర్లాండ్స్ ప్రభుత్వాలకు సానుభూతితో కూడిన సహాయం చేస్తామని జాన్ కెర్రీ తెలిపారు. మృతుల కుటుంబాలకు కూడా సహాయం అందించేందుకు సిద్దమని ప్రకటించారు. -
'కూల్చిన వారిని చట్టం ముందు నిలబెట్టాలి'
కౌలాలంపూర్/కీవ్: ఉక్రెయిన్ గగనతలంపై ఎయిర్ లైన్స్ విమానం పేల్చివేతపై అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రయాణీకుల విమానాన్ని కూల్చివేయడంపై తీవ్ర ఆందోళన తెలిపింది. విమానం కూల్చివేతపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరిపించాలని, ఈ నరమేధానికి కారణమైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేసింది. కాగా సంఘటనా స్థలంలో సహాయక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు సాగిస్తున్నారు. పొద్దుతిరుగుడు తోటల్లో ఛిద్రమైన స్థితిలో చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఇప్పటివరకు 181 మృతదేహాలు బయటకు తీశారు. మృతి చెందిన వారిలో 173 మంది నెదర్లాండ్స్ చెందిన వారున్నారు. మృతుల్లో దాదాపు 100 మంది ఎయిడ్స్ పరిశోధకులున్నారు. -
చైనా విమానాల దారి మళ్లింపు
బీజింగ్: మలేసియా ఎయిర్ లైన్స్ విమానాన్ని కూల్చివేత ఘటనతో ఉక్రెయిన్ మీదుగా వెళ్లే విమానాలు రద్దవుతున్నాయి. ఇప్పటికే భారత్- ఉక్రెయిన్ కు విమాన సర్వీసులు రద్దు చేసింది. చైనా కూడా ఉక్రెయిన్ మీదుగా వెళ్లే తమ విమానాలను మళ్లించింది. ఉక్రెయిన్ మీదుగా వెళ్లే అన్ని విమాన సర్వీసులను వేరే మార్గాల్లో నడపాలని నిర్వహించినట్టు చైనా పౌర విమానయాన శాఖ తెలిపింది. తూర్పు ఉక్రెయిన్ మీదుగా చైనా విమానాలు వారానికి 28 రౌండ్ల ట్రిప్పులు వేస్తాయని చైనా పౌర విమానయాన పరిపాలన విభాగం(సీఏఏసీ) వెల్లడించింది. అయితే చైనా, ఉక్రెయిన్ మధ్య రెగ్యులర్ విమాన సర్వీసులు లేవని తెలిపింది. ఉక్రెయిన్ లో తలెత్తిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నేటి నుంచి తమ విమానాలను మళ్లిస్తున్నట్టు చైనా ప్రకటించింది. -
ఎంహెచ్ 17 ప్రమాదం జరిగిందిలా..
-
విమానాన్ని కూల్చివేసింది వారే: ఎస్బీయూ
కీవ్: మలేసియా ఎయిర్ లైన్స్ విమానాన్ని కూల్చివేసింది తామేనని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు ఒప్పుకున్నారని ఎక్రెయిన్ భద్రతా విభాగం(ఎస్బీయూ) తెలిపింది. రష్యా సైనిక నిఘా విభాగం అధికారులకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణల ద్వారా తమకీ విషయం తెలిసిందని ఎస్బీయూ వెల్లడించింది. విమానం కూలిపోయిన 20 నిమిషాల తర్వాత రష్యా సైనిక నిఘా అధికారి ఇగోర్ బెజ్లర్.. రష్యా భద్రతాధికారి వాసిలి జెరానిన్ కు ఫోన్ చేశారని పేర్కొంది. 'దొనెస్క్ ప్రాంతంలో విమానాన్ని ఇప్పుడే కూల్చివేశాం' అని జెరానిన్ కు బ్లెజర్ ఫోన్ తెలిపాడని వెల్లడించింది. స్వయం ప్రకటిత దొనెస్క్ పీపుల్స్ రిపబ్లిక్ సంస్థకు బ్లెజర్ కమాండర్ గా ఉన్నాడు. మేజర్, గ్రీక్ పేరుతో ఇద్దరు తీవ్రవాదులు జరిపిన సంభాషణను కూడా ఎస్బీయూ విడుదల చేసింది. -
370... 130... 17
అదేంటో గాని మలేషియా ఎయిర్ లైన్స్ విమానాలని ప్రమాదాలు నిడలా వెంటాడుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం మన జ్ఞాపకాల దొంతర నుంచి చెరిగిపోక మునుపే గురువారం సాయంత్రం ఎమ్హెచ్ 17 విమానం కుప్పకూలింది. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం గురువారం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ సమీపంలో తిరుబాటుదారులు క్షిపణులతో పేల్చివేశారు. ఆ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 280, సిబ్బంది 15 మంది మొత్తం 295 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విమానంలోని మృతుల్లో అత్యధికులు అంటే సగానికి సగం మంది డచ్ దేశానికి చెందిన వారే ఉన్నారు. ఈ ఏడాది మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్కు బయలుదేరింది. బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన ఇంత వరకు ఆ విమానం జాడ దొరకలేదు. దాంతో తమ బంధువుల ఆచూకీ తెలుసుకోవడంతో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమాన ప్రయాణికుల బంధువులు స్నేహితులు మలేషియా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. మలేషియా ప్రభుత్వానికి ఎమ్హెచ్ 370 విమానం ఆచూకీ కనుగోవడం పెద్ద తల నొప్పిగా తయారైంది. అంతలో నిన్న సాయంత్రం మరో విమానం ప్రమాదం జరగడంతో మలేషియా ప్రభుత్వం తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ రెండు విమాన ప్రమాదాలు కేవలం 130 రోజులు తేడాలో జరిగాయి. -
ఎన్నో కూల్చివేతలు.. మరెన్నో మరణాలు
క్షిపణి దాడిలోనో, మరో రకంగానో కూలిపోయిన సంఘటనలలో మలేషియా విమానానిది మొదటిది కాదు, చివరిదీ కాదని చెప్పలేం. దాదాపు నాలుగు దశాబ్దాలకు ముందు నుంచే ఈ తరహా కాల్పులు, విమానాల కూల్చివేతలు ఉన్నాయి. వాటి వివరాలేంటో ఓసారి చూద్దామా.. 1973 ఫిబ్రవరి 21: ట్రిపోలి నుంచి కైరో వెళ్తున్న లిబియన్ ఎయిర్లైన్స్ విమానం 114 సూయెజ్ కాలువ దాటి ఇజ్రాయెల్ ఆధీనంలోని సినై ఎడారి ప్రాంతంలోకి ప్రవేశిస్తుండగా ఇజ్రాయెల్కు చెందిన రెండు ఫాంటమ్ జెట్ విమానాలు దాన్ని బలవంతంగా దింపేందుకు కాల్పులు జరిపాయి. విమానం అదుపుతప్పి కూలిపోవడంతో 108 మంది మరణించారు. ఐదుగురు బయటపడ్డారు. 1978 ఏప్రిల్ 20: 110 మంది ప్రయాణికులతో వెళ్తున్న దక్షిణ కొరియా విమానంపై సోవియట్ మిగ్ ఫైటర్ దాడిచేసింది. ముర్మాంస్క్ సమీపంలోని ఓ గడ్డకట్టిన చెరువులో బలవంతంగా దిగాల్సి రావడంతో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. 1983 సెప్టెంబర్ 1: న్యూయార్క్ నుంచి సియోల్ వెళ్తున్న కొరియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని సోవియట్ ఫైటర్ జెట్ కాల్చింది. అది నిఘా విమానం అనుకుని పొరబడి కాల్పులు జరపడంతో మొత్తం విమానంలో ఉన్న 269 మందీ మరణించారు. 1988 ఏప్రిల్ 10: సోవియట్ తయారీ విమానాన్ని అఫ్ఘాన్ గెరిల్లాలు కాల్చడంతో అందులో ఉన్న 29 మంది మరణించారు. 1988 జూలై 3: పర్షియన్ గల్ఫ్ మీదుగా వెళ్తున్న ఇరానీ ప్రయాణికుల విమానాన్ని యుద్ధవిమానం అనుకుని అమెరికా యుద్ధనౌక మీదనుంచి కాల్పులు జరిపారు. దాంతో అందులో ఉన్న 290 మంది మరణించారు. 1993 సెప్టెంబర్ 22: జార్జియాలో అబ్ఖాజియాన్ తిరుగుబాటుదారులు కాల్పులు జరపడంతో విమానంలో ఉన్న 80 మంది మరణించారు. సరిగ్గా దానికి ఒక్కరోజు ముందు రష్యన్ విమానాన్ని అబ్ఖాజియాన్ ఫైర్ ఢీకొనడంతో నల్లసముద్రంలో పడిపోయింది. 1998 అక్టోబర్ 20: తూర్పు కాంగోలో వేర్పాటువాదులు కాంగో ఎయిర్లైన్స్ విమానంపై కాల్పులు జరిపారు. దాంతో ఆ విమానం దట్టమైన అటవీ ప్రాంతంలో పడి కూలిపోయింది. -
ఎంహెచ్-17: షిఫ్టు మార్చుకున్నాడు.. ప్రాణం పోయింది
అమ్మ కమ్మగా వండిపెడుతుంది.. వెళ్లి తినాలంటూ షిఫ్టు మార్చుకున్నాడు. అదే అతడి ప్రాణాలు తీసింది. అతడెవరో కాదు.. భారత సంతతికి చెందిన సంజిద్ సింగ్ సంధు. ఆయన విమానంలో స్టివార్డుగా పనిచేస్తున్నారు. స్వతహాగా పంజాబీ అయిన సంధు నిజానికి ఎంహెచ్-17 విమానంలో వెళ్లాల్సిన వాడు కాదు. కానీ, వేరే సహచరుడితో షిఫ్టు మార్చుకుని మరీ ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్లే విమానం ఎక్కాడు. సంధు మలేషియాలోని పెనాంగ్ నగరంలో ఉన్న తమ ఇంటికి రాగానే అతడికి ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టాలని ఆయన తల్లి భావించినట్లు తండ్రి జిజర్ సింగ్ తెలిపారు. విమానం ఎక్కడానికి కొద్ది సేపటి ముందే తనతో ఫోన్లో మాట్లాడాడని, అదే తమ అబ్బాయితో చిట్టచివరి సంభాషణ అని అన్నారు. ఎందుకిలా జరిగిందంటూ ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. సంధు భార్య కూడా మలేషియా ఎయిర్లైన్స్లో స్టివార్డెస్గా పనిచేస్తున్నారు. ఆమె ద్వారానే అత్తమామలకు ఈ విషయం తెలిసింది. జిజర్ సింగ్ దంపతులకు సంజిద్ ఒక్కడే కుమారుడు. -
ఎంహెచ్-17: మృతుల్లో ఇద్దరు భారత సంతతివాళ్లు!
మలేషియా విమాన ప్రమాదంలో మొత్తం 295 మంది మరణించారు. వారిలో ఇద్దరు భారత సంతతికి చెందిన విమాన సిబ్బంది అని తెలుస్తోంది. జన్మతః భారతీయులైన వీళ్లు మలేషియా ఎయిర్లైన్స్ సంస్థలో ఉద్యోగానికి వెళ్లి ఆ ప్రయాణంలోనే అసువులు బాశారు. ఇక మృతులలో చాలామంది ఎవరన్న విషయం తెలియడంతో వాళ్ల బంధువులకు సమాచారం అందించినట్లు మలేషియా ఎయిర్లైన్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే.. 47 మంది మాత్రం ఎవరన్నది ఇంకా గుర్తించలేకపోయారు. వాళ్లు ఏ దేశానికి చెందినవాళ్లో, వాళ్ల ఊరు-పేరు ఏమిటో అనే విషయం ఖరారు కాలేదు. విమానంలో ఉన్నవారిలో మొత్తం 154 మంది డచ్ దేశస్థులు కాగా, 43 మంది మలేషియన్లు. వాళ్లలో 15 మంది విమాన సిబ్బంది. వీళ్లు కాకుండా ఇంకా 27 మంది ఆస్ట్రేలియన్లు, 12 మంది ఇండోనేషియన్లు, ఆరుగురు బ్రిటిష్ వాళ్లు, నలుగురు జర్మన్లు, నలుగురు బెల్జియన్లు, ముగ్గురు ఫిలిప్పీన్స్ వాసులు, ఒక కెనడియన్ ఉన్నారు. మిగిలిన 47 మంది గురించి మాత్రం ఇంకా తెలియలేదు. మొత్తం ప్రయాణికుల్లో 100 మంది ఎయిడ్స్ పరిశోధకులు ఉన్నారు. ఓ సదస్సులో పాల్గొనడానికి వీళ్లంతా వెళ్తున్నట్లు తెలిసింది.