Red planet
-
అంతరిక్షంలో బ్యాక్టీరియా బెడద
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్)లో కూడా సూక్ష్మజీవుల బెడద తప్పట్లేదు. అక్కడ బ్యాక్టీరియా, శిలీంధ్రం వంటి సూక్ష్మజీవులు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. దీంతో అక్కడి వ్యోమగాముల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎస్ఎస్లో భూమిపై ఉండే జిమ్, ఆస్పత్రుల్లో ఉండే అన్ని సూక్ష్మజీవులు ఉన్నట్లు కనుగొన్నారు. వీటిని కనుగొనడం వల్ల వ్యోమగాముల ఆరోగ్య సంరక్షణ కోసం, అంతరిక్షంలోకి ప్రయాణం చేసేటప్పుడు, అక్కడ నివసించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవచ్చని నాసా పేర్కొంది. ‘ఐఎస్ఎస్ వంటి మూసి ఉన్న ఆవరణలో సూక్ష్మజీవులు ఎంత కాలం జీవించి ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’అని పరిశోధన బృందంలోని భారత సంతితికి చెందిన కస్తూరి వెంకటేశ్వరన్ వివరించారు. అక్కడ కనుగొన్న బ్యాక్టీరియాలో 26 శాతం స్టెఫైలోకోకస్, 23 శాతం పాంటియా, 11 శాతం బాసిల్లస్ ఉన్నట్లు ఆయన తెలిపారు. మానవుడి జీర్ణవ్యవస్థలో ఉండే ఎంటిరోబ్యాక్టర్, స్టెఫైలోకోకస్ ఆరియస్ (10 శాతం)ను గుర్తించినట్లు చెప్పారు. అయితే ఇవి వ్యోమగాములు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా లేదా అన్న విషయం ఇంకా తెలియదని తెలిపారు. అంతరిక్షంలో ఆ వాతావరణంలో బ్యాక్టీరియాలు క్రియాశీలకంగా ఉంటాయా లేదా అనేది కూడా పరిశోధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఐఎస్ఎస్లోని లోపలి ఉపరితలంలో 8 ప్రాంతాల్లో (కిటికీ, టాయిలెట్, డైనింగ్ టేబుల్..) సేకరించిన నమూనాలను పరిశీలించగా ఈ విషయం తెలిసింది. అరుణ గ్రహంపై జీవం అరుణగ్రహంపై జీవం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంగారకుడికి చెందిన ఉల్కపై బ్యాక్టీరియా ఉందని వారు లండన్కు చెందిన పరిశోధకులు గుర్తించారు. దీన్ని బట్టి అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. 1977–78 మధ్య అంటార్కిటికా ప్రాంతంలో జపాన్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలార్ రీసెర్చ్ జరుపుతున్న తవ్వకాల్లో ఏఎల్హెచ్–77005 అనే ఉల్క దొరికినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. దీనిపై హంగేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ, ఎర్త్ సైన్సెస్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఉల్కను అధ్యయనం చేసి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉల్క లోపల సేంద్రియ పదార్థ రూపంలో బ్యాక్టీరియా ఉందని కనుగొన్నట్లు ఇల్డికో గ్యొల్లయ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ‘భౌగోళిక, జీవ, రసాయన, వాతావరణ శాస్త్ర రంగాలకు చెందిన పరిశోధకులకు మా పరిశోధనలు ఎంతో మేలు చేస్తాయి’అని ఇల్డికో చెప్పారు. తమ పరిశోధనతో భవిష్యత్తులో ఉల్కలు, గ్రహ శకలాలను అధ్యయనం చేసే తీరు మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎంతెంత దూరం!
అరుణతారపై అడుగు పడేదెపుడు! ఉందా... లేదా? అన్న సందేహాలకు తావులేదిప్పుడు! అరుణగ్రహం నేలగర్భంలోనే కాదు... పైనా రూఢిగా నీరుంది! అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఇటీవలి ప్రకటనతో... దశాబ్దాల శషభిషలకు తెరపడినట్లే. అయితే ఇంకెందుకు ఆలస్యం..? తట్టాబుట్టా సర్దేసుకుని ఛలో మార్స్ అనేద్దామా? ఊహూ అస్సలు సాధ్యం కాదు. నీరు ఉంటే జీవం ఉన్నట్టేనా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే... ఎప్పటికైనా మనిషి అంగారకుడిపై నివాసం ఏర్పరచుకోగలడా? ఇప్పుడున్న సాంకేతికత ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు పనికొస్తుందా? అన్నీ సవ్యంగా జరిగి ఆ గ్రహాన్ని చేరుకున్నా... అక్కడ మనిషి ఏం తినాలి? నివాసం ఎలా? ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలే... తీరని సందేహాలే! కానీ మానవ మేథస్సు సాధించిన అద్భుతాలతో పోలిస్తే... ఇదికూడా సాధ్యమే అనిపిస్తుంది! ఎంత కాలానికి అన్నది మాత్రం... ఇప్పటికైతే శేష ప్రశ్నే!!! 40 ప్రయోగాలు 1960 నుంచి గత ఏడాది సెప్టెంబర్ నాటికి అంగారకుడిపైకి మొత్తం 40 అంతరిక్ష ప్రయోగాలు జరగ్గా కేవలం 18 మాత్రమే విజయవంతమయ్యాయి. 2012లో క్యూరియాసిటీ, గత ఏడాది భారత్ ప్రయోగించిన మామ్, అమెరికా ప్రయోగించిన మావెన్ తాజాగా అరుణగ్రహం చేరిన అంతరిక్ష నౌకలు. 1. వికింగ్-1, వికింగ్-2: అరుణ గ్రహంపై దిగిన తొలి రెండు వ్యోమనౌకలు. నాసా వీటిని తయారుచేసింది. 1975 ఆగస్ట్ 20న వికింగ్-1, సెప్టెంబర్ 9న వికింగ్-2లను ప్రయోగించారు. 2. సోజర్నర్: నాసా ప్రయోగించిన మార్స్ పాథ్ఫైండర్ రోవర్ ఇది. 1997 జూలై 4న దీనిని ప్రయోగించారు. సురక్షితంగా గ్రహంపై దిగి సమాచారాన్ని భూమిపైకి చేరవేసింది. 3. స్పిరిట్, ఆపర్చునిటీ: నాసా 2003 జూన్ 10న స్పిరిట్ రోవర్ను, జూలై 7న ఆపర్చునిటీ రోవర్ను ప్రయోగించింది. రెండూ గ్రహంపై దిగి పరిశోధనలు చేపట్టాయి. ఆపర్చునిటీ ప్రస్తుతం పనిచేస్తోంది. 4. ఫీనిక్స్: నాసా శాస్త్రవేత్తలు 2007 ఆగస్ట్ 4న దీనిని ప్రయోగించారు. గ్రహంపై దిగాక చిన్నపాటి త్రవ్వకాలు చేపట్టింది. ప్రధానంగా నీటి జాడ తెలుసుకునేందుకు, సూక్ష్మజీవులకు అనువైన వాతావరణం ఉందా లేదా తెలుసుకునేందుకు దీనిని పంపించారు. 5. క్యూరియాసిటీ రోవర్: తాజాగా 2011, నవంబర్ 26న నాసా దీనిని ప్రయోగించింది. మనిషి జీవించేందుకు వీలైన వాతావరణం జాడ కనుక్కునేందుకు దీనిని పంపించారు. గాలా లోయ ప్రాంతంలో ఇది ల్యాండ్ అయింది. ఎన్నెన్నో ప్రయత్నాలు.... నాసాతోపాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా అంగారకుడిని జయించేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. 2030 నాటికి అరుణ గ్రహంపైకి మానవుడిని పంపాలన్న ప్రణాళికతో నాసా పనిచేస్తోంది. ఇప్పటికే అరుణగ్రహంపై ఉన్న క్యూరియాసిటీ రోవర్కు తోడుగా వచ్చే ఏడాది ఇన్సైట్ పేరుతో మరో రోవర్ను పంపనుంది. ఈ రెండు రోవర్లు గ్రహపు జియాలజీపై అధ్యయనం చేయనున్నాయి. దీంట్లో ఉండే ఓ థర్మామీటర్ అక్కడి నేలగర్భం ఉష్ణోగ్రత వివరాలు సేకరించనుంది. అక్కడ భూకంపాలు సంభవిస్తూంటాయా? అరుణగ్రహపు మట్టిలో ఆక్సిజన్ ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం జరుగుతుంది. ఆ తరువాత 2020లో పంపే రోవర్తో అక్కడి వాతావరణం, ఖనిజాల మేళవింపులపై మరిన్ని పరిశోధనలు జరపనుంది. అదే ఏడాది ఓ గ్రహశకలంపైకి మానవుడిని పంపనుంది. ఈ ప్రయోగాల ఫలితాలనుబట్టి 2030 నాటికి అంగారకుడిపైకి తొలి మానవుడిని పంపాలని నాసా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మధ్యకాలంలో అరుణగ్రహంపై కూడు, గూడు వంటి ప్రశ్నలకూ సమాధానం వెతికేందుకు నాసా కొన్ని వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో హవాయిలోని అగ్నిపర్వత ప్రాంతం వద్ద ఇలాంటి ఓ ప్రయోగం మొదలైంది కూడా. నలుగురు అమెరికన్లు, ఫ్రెంచ్, జర్మనీ దేశస్తులు ఇద్దరు ఓ కృత్రిమ నిర్మాణంలో ఏడాదిపాటు ఒంటరిగా గడపనున్నారు. సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాల్లో మనిషి మానసిక పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని అంచనా. అంతేకాకుండా.. నలుగురు వ్యోమగాములను గ్రహాంతరాళాలకు మోసుకెళ్లేందుకు వీలుగా నాసా ఓరియన్ పేరుతో సరికొత్త అంతరిక్ష నౌకను సిద్ధం చేస్తోంది. రష్యన్ అంతరిక్ష నౌక సోయుజ్ తరహాలో ఉండే ఓరియన్ను మళ్లీమళ్లీ వాడుకునే అవకాశముంటుంది. 2021 నాటికి నిర్మాణం పూర్తి చేసి ముందుగా గ్రహశకలంపైకి, ఆ తరువాత అంగారకుడిపైకి మనిషిని పంపేందుకు దీన్ని ఉపయోగించుకోవాలని నాసా యోచిస్తోంది. తొలి అడుగు మాత్రమే... సుదూర భవిష్యత్తులోనైనా అంగారకుడిని చేరుకోవాలన్న మనిషి లక్ష్యం సాకారమయ్యేందుకు నీటిజాడ స్పష్టం తొలి అడుగు మాత్రమే. నాసా ఇటీవలి ప్రకటన కూడా తాము నేరుగా నీరున్నట్లు చెప్పడం లేదు. ఇటీవలి కాలంలో నీటిలో మునిగిన లవణాలను పెద్దమోతాదులో గుర్తించాము అని మాత్రమే చెబుతోంది. రెంటికీ చాలా తేడా ఉంది. మనిషి మనుగడకు అత్యంత కీలకమైన అంశం నీరన్నది మనకు తెలిసిందే. అంగారకుడిపై నీరు ఉంది అని స్పష్టంగా తెలిసినా? ఎంత మోతాదులో ఉంది? మనం ఉపయోగించుకునేందుకు అనువుగానే ఉంటుందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోకుండా అక్కడ అడుగుపెట్టడం వీలుకాదు. మరెన్నో చిక్కుముడులూ వీడిపోవాలి. గతంలో ఎప్పుడైనా అక్కడ జీవం మనగలిగిందా? అన్న ప్రశ్నకు సమాధానం లభించాలి. ప్రస్తుతం అక్కడ ఏ రూపంలోనైనా జీవం ఉందా? అన్నదీ తేలాలి. దీంతోపాటు అక్కడి వాతావరణ పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవడమెలా? అన్నింటికంటే ముఖ్యంగా 14 కోట్ల మైళ్ల దూరాన్ని వీలైనంత వేగంగా అధిగమించేందుకు అవసరమైన అత్యాధునిక అంతరిక్ష నౌకను తయారు చేసుకోవడమూ ముఖ్యమే అవుతుంది. నిజమే... ఇవన్నీ సవాళ్లే మరి మనమేం చేస్తున్నాం? అన్న ప్రశ్న వేసుకుంటే... సరిగ్గా వారం రోజుల క్రితం అమెరికా అంతరిక్షఛ పరిశోధన సంస్థ (నాసా) నీటి ప్రవాహాలు ఉన్నట్లు ప్రకటించింది మొదలు ప్రపంచవ్యాప్తంగా అరుణ గ్రహం మరోసారి చర్చల్లో నిలిచింది. నిజానికి ఈ గ్రహంపై ఆసక్తి కొత్తదేమీ కాదు. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి అటు సోవియట్ యూనియన్, ఇటు అగ్రరాజ్యం అమెరికాలు పోటాపోటీగా ఉపగ్రహాలను పంపుతూనే ఉన్నాయి. కొత్తకొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాయి. ఈ ఆసక్తికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. కొన్ని లక్షల ఏళ్ల క్రితం ఆ గ్రహంపై జీవం ఉండేదన్న ప్రాథమిక అంచనాలు ఒక కారణమైతే... మనుగడకు భూమి తరువాత మానవాళికి ఇదే మరో ప్రత్యామ్నాయమన్న వాదన మరో కారణం. వాతావరణ మార్పులిలా.. ముందుగా చెప్పుకున్నట్లు అంగారకుడిపై మనిషి ఆవాసం అంత సులభమైన విషయమేమీ కాదు. అక్కడికి చేరుకోవడం ఓ మహా ప్రయత్నమైతే... అక్కడి వాతావరణాన్ని జయించి నివాసం ఉండటమూ అంతే కష్టసాధ్యం. ఎందుకంటే అక్కడి భూమి మాదిరిగా అక్కడి గాలిలో ఆక్సిజన్ ఎక్కువ ఉండదు. దాదాపు 95 శాతం బొగ్గుపులుసు వాయువే. పైగా అక్కడి ఉష్ణోగ్రతలూ మనిషి నివసించేందుకు ఏ మాత్రం సహకరించేవి కావు. ఈ నేపథ్యంలో మనిషి అక్కడ నివసించేందుకు దశలవారీగా అక్కడి వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా అక్కడున్న నీటిని వెలికితీయాల్సి ఉంటుంది. ధ్రువప్రాంతాల్లో పొడిమంచు రూపంలో ఉన్న నీటిని ద్రవంగా మార్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడి నేలలో దాదాపు 60 శాతం హెచ్2ఓ అదేనండి... మంచినీరు అని అంచనా. ఈ నీటినీ పిండుకోగలిగితే.... మనిషికి ప్రాణవాయువుతోపాటు హైడ్రోజన్ రూపంలో ఇంధనమూ లభిస్తుంది. ఈ ఆలోచనలేవీ పనిచేయకపోతే వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మరో ఐడియాతో సిద్ధంగా ఉన్నారు. అక్కడి వాతావరణంలో నుంచి నీటిని సిద్ధం చేయగల రియాక్టర్ ఒకదాన్ని వీరు సిద్ధం చేశారు. ఇది బొగ్గుపులుసు వాయువు నుంచి ఆక్సిజన్న్ను వేరు చేస్తుంది. వేడెక్కించడం... అంటార్కిటికా కంటే తక్కువ ఉష్ణోగ్రతలుండే అంగారకుడిపై మనిషి బతకలాంటే గ్రహం మొత్తాన్నిగానీ, మానవ ఆవాసాలు ఏర్పరచుకోవాలనుకుంటున్న ప్రాంతాలను గానీ వెచ్చపెట్టుకోవడం తప్పనిసరి. ఇందుకోసం రకరకాల పద్ధతులను అవలంబించవచ్చు. సూర్యకిరణాలను భారీసైజు అద్దాల ద్వారా నేలపై ప్రతిబింబింపజేయడం వీటిల్లో ఒకటి. హైడ్రోజన్ లాంటి ఇంధనాలను మండించడం మరో పద్ధతి. ఏదోవిధంగా అక్కడి ఉష్ణోగ్రతలు పెరిగేలా చేయగలిగితే అప్పటివరకూ శీతల ఉష్ణోగ్రతలతో గడ్డకట్టిపోయి ఉన్న రసాయన వాయువులు విడుదలవుతాయి. ఫలితంగా భూ వాతవరణం కంటే చాలా పలుచగా ఉండే అక్కడి వాతావరణం మారిపోతుంది. పెరిగిన ఉష్ణోగ్రతలు బయటకు పోకుండా వాతావరణంలోని 95 శాతం బొగ్గుపులుసు వాయువు నిరోధిస్తుంది. త్రీడీ ప్రింటింగ్తో ఇళ్లు.. అంగారకుడిపై మానవ ఆవాసం కోసం శాస్త్రవేత్తలు ఇప్పటికే కొన్ని ఆలోచనలు చేశారు. అక్కడి రేడియో ధార్మికతను దృష్టిలో ఉంచుకుంటే నేలగర్భంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం మేలన్న అంచనాలున్నాయి. మరోవైపు ఇటీవలి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో అక్కడికక్కడే నివాస సముదాయాలను ఏర్పరచుకోవచ్చునని కొందరు భావిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా అక్కడి మట్టి, ఇతర వనరులను వాడుకుంటూ నిర్మాణాలు చేపట్టవచ్చునని, అన్నీ భూమి నుంచి మోసుకెళ్లే అవసరం ఉండదని అంచనా. ఈ నేపథ్యంలో నాసా అంగారకుడిపై త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్లు ఎలా నిర్మించవచ్చో చూపండి అంటూ ఇటీవల ఒక పోటీ పెట్టింది. ఫొటోలో కనిపిస్తున్నది ఈ పోటీలో నెగ్గిన ఓ మోడల్. ప్లాస్టిక్, నీటితోపాటు అత్యంత తేలికైన పదార్థం ఏరోజెల్ల సాయంతో దీన్ని నిర్మిస్తామని దీన్ని తయారుచేసిన ఐస్హౌస్ సంస్థ తెలిపింది. అణుబాంబు వేస్తే సరి... అంగారకుడిని మానవ ఆవాసానికి వీలుగా మార్చేందుకు ఎలన్ మస్క్ ఓ వినూత్నమైన ఆలోచనను ప్రతిపాదించారు. అమెరికాలోని టెస్లా ఎలక్ట్రిక్ మోటర్స్ అధినేత అయిన మస్క్ నాసా కోసం అంతరిక్ష నౌకలను తయారు చేస్తున్నారు కూడా. మనిషి వీలైనంత త్వరగా అంగారకుడిపై ఓ కాలనీ ఏర్పాటు చేసుకోవాలని గట్టిగా ప్రచారం చేస్తున్న మస్క్ అందుకు తగిన ప్రణాళిక కూడా తన వద్ద ఉందని అంటున్నారు. అక్కడి వాతావరణాన్ని మనకు అనుకూలమైందిగా మార్చేందుకు అణుబాంబులను మించిన దగ్గరి మార్గం లేదని ఆయన గత ఏడాది ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే ఈ అణుబాంబులను అక్కడి నేలపై కాకుండా ధ్రువప్రాంతాల వద్ద గాల్లో కేవలం రెండు మూడు సెకన్లపాటు పేలేలా చేస్తే చాలని ఇటీవలే ఓ వివరణ కూడా ఇచ్చారు. సౌరకుటుంబంలో అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ మన సూర్యుడేనన్నది అందరికీ తెలిసిందేనని, దీని మాదిరిగానే అంగారకుడి ధ్రువ ప్రాంతాల్లో రెండు మినీ సూర్యుళ్లను సృష్టించి సెకన్లపాటు పనిచేయించగలిగితే ఆ గ్రహం క్రమేపీ వెచ్చబడుతుందని ఆయన అంటున్నారు. భూమితో దగ్గరి పోలికలు.. ►భూమిపై ఒక రోజులో 23 గంటల 56 నిమిషాలు ఉంటే అరుణగ్రహంపై ఇది మరో 43 నిమిషాల 35 సెకన్లు ఎక్కువ. ►భూమి ఆక్సియల్ టిల్ట్ 23.44 డిగ్రీలు కాగా... అంగారకుడిది 25.19 డిగ్రీలు మాత్రమే. ఈ ఒంపు భూమిపై రుతువులు ఏర్పడేందుకు కారణమన్నది తెలిసిందే. ►సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగేందుకు భూమికి 365 రోజులు పడితే అంగారకుడికి దాదాపు రెట్టింపు సమయం పడుతుంది. కచ్చితంగా చెప్పాలంటే ఆ గ్రహంపై ఒక ఏడాది 1.88 భూమి సంవత్సరాలకు సమానం. ►అంగారక గ్రహ వ్యాసార్థం భూమి కంటే సగం తక్కువ. తేడాలూ ఉన్నాయి... ►అరుణగ్రహపు గురుత్వాకర్షణ శక్తి భూమిలో మూడో వంతు కంటే కొంచెం ఎక్కువ మాత్రమే. ►భూమి కంటే మార్స్పై ఉష్ణోగ్రతలు చాలా తక్కువ. అక్కడి సగటు ఉష్ణోగ్రత - 87 డిగ్రీ సెల్సియస్ల నుంచి - 5 డిగ్రీ సెల్సియస్ల మధ్య ఉంటుంది. ఇంకోలా చెప్పాలంటే అంటార్కిటికాలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత (- 93 డిగ్రీ సెల్సియస్) ఉంటుందన్నమాట. ►అరుణ గ్రహ ఉపరితలంపై కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే నీరు ఏర్పడుతుంది. నదులు, చెరువులు, సముద్రాల వంటివి లేవన్నమాట! ►సూర్యుడి నుంచి మనకంటే ఎక్కువ దూరంలో ఉండటం వల్ల అక్కడికి అందే సౌరశక్తి మోతాదు కూడా 43 శాతం వరకూ తక్కువ. ►ఏడాది పొడవునా చెలరేగే ధూళి తుపానుల కారణంగా అంగారకుడిపై కొన్ని వారాలపాటు సూర్యుడు సైతం కనిపించని పరిస్థితులు ఉంటాయి. ►భూమి మాదిరిగా అయస్కాంతక్షేత్రం ఏదీ లేకపోవడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకర అతినీలలోహిత, పరారుణ కిరణాలు నేరుగా అరుణగ్రహాన్ని తాకుతాయి. ►వాతావరణ పీడనం ఆర్మ్స్ట్రాంగ్ లిమిట్ కంటే చాలా తక్కువ. అందువల్ల అక్కడ కట్టే నివాస సముదాయాలు కృత్రిమ పీడనంతో కూడి ఉండాలి. ►అంగారకుడి గాలిలో ఉండే ఆక్సిజన్ మోతాదు 0.4 శాతం కంటే తక్కువ. దాదాపు 95 శాతం కార్బన్ డై ఆకై ్సడ్, 3 శాతం నైట్రోజెన్, 1.6 శాతం ఆర్గన్లు ఉంటాయి. అతిపెద్ద పర్వతం... మౌంట్ ఎవరెస్ట్ దాదాపు 8000 మీటర్ల ఎత్తుంటుందని అంటే... మనం అబ్బో ఎంత ఎత్తో అనుకుంటాం. మరి అంగారకుడిపై ఉండే ఓలింపస్ మూన్ గురించి వింటే ముక్కన వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే దాదాపు 21 కిలోమీటర్ల ఎత్తు, 600 కిలోమీటర్ల వ్యాసముండే ఈ పర్వతం సౌరకుటుంబం మొత్తమ్మీద అతిపెద్ద పర్వతం మరి! నీరున్నా ముట్టుకోలేరు... అంగారకుడిపై నీరు ఉన్నట్లు స్పష్టంగా తెలి సినా... నాసా గానీ మరే ఇతర సంస్థ గానీ ఆ నీరున్న ప్రాంతం దగ్గరకు కూడా వెళ్లలేదు తెలుసా? ఎందుకంటా రా? 1957లో ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం దీనికి కారణం. ఔటర్ స్పేస్ ట్రీటీ అని పిలిచే ఈ ఒప్పందానికి ప్రపంచదేశాలన్నీ ఆమోదిం చాయి. దీని ప్రకారం.. ఏ దేశం, సంస్థ కూడా చంద్రుడితోపాటు ఇతర గ్రహాలపై నీటి వనరులన్న ప్రాంతంలో ఎలాంటి పరిశోధనలు చేపట్టకూడదు. భూమి నుంచి ఆయా గ్రహాలకు చేరిన సూక్ష్మజీ వులు నీటిని కలుషితం చేయకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు. అంగారకుడి విషయాన్నే తీసుకుంటే అమెరికా కొన్నేళ్ల క్రితమే అక్కడికి క్యూరియాసిటీ రోవర్ను పంపింది. నీరున్న ప్రాంతానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ శోధక నౌక అక్కడికి మా త్రం వెళ్లదు. కోటానుకోట్ల మైళ్ల ప్రయాణంలో ఏదైనా తెలియని సూక్ష్మజీవి క్యూరియాసిటీకి అంటుకుని ఉంటే అది నీటిని కలుషితం చేస్తుందన్న అనుమానంతో ఈ జాగ్రత్త తీసుకున్నారు. - గిళియార్ గోపాలకృష్ణమయ్యా -
మార్స్ ఉపరితలం కింద సముద్రం!
వాషింగ్టన్: భూమికి దగ్గరగా మానవ నివాసానికి యోగ్యమయ్యే అవకాశమున్న గ్రహంగా అంగారకుడు ఉన్నా.. అక్కడ నీళ్లు లేకపోవడమే ఇప్పటివరకు పెద్ద సమస్య. కానీ ఆ గ్రహ ఉపరితలం కింద భారీ స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంగారకుడి మీద ఒకప్పుడు నీరు ప్రవహించిన జాడలు కనిపిస్తున్నా... గ్రహం ఉపరితలంపై ఎక్కడా నీరు కనిపించలేదు. మరి ఆ నీళ్లన్నీ ఎక్కడికి వెళ్లినట్లు అనే సందేహాలు శాస్త్రవేత్తలను చాలా రోజులుగా పట్టి పీడిస్తున్నాయి. అయితే తాజాగా నాసా ఆధ్వర్యంలోని అంతర్జాతీయ అంతరిక్ష శాస్త్రవేత్తల బృందం.. భూమిపై పడిన పలు అంగారక ఉల్కాశకలాలను పరిశీలించి, ఆ గ్రహంపై నీరు ఉందనేందుకు ఆధారాలను వాటిలో గుర్తించింది. ఈ నీరంతా అంగారకుడి ఉపరితలం కింద ద్రవ రూపంలోనో, మంచు రూపంలోనో ఉండవచ్చని భావిస్తోంది. ఇది అంగారకుడి వాతావరణంలో మార్పులు, అక్కడ జీవం ఉండే అవకాశం వంటి అంశాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన జపాన్ టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్త తొమహిరొ ఉసయ్ తెలిపారు. శకలాల్లో తాము గుర్తించిన నీటిలోని హైడ్రోజన్ ఐసోటోప్ అణువులు.. మార్స్ ఉపరితలంపై, వాతావరణంలో గుర్తించిన నీటిలోని హైడ్రోజన్ అణువులకన్నా భిన్నంగా ఉన్నాయని ఆయన చెప్పారు. నీటి పరిమాణాన్ని బట్టి అందులోని హైడ్రోజన్ ఐసోటోప్లుగా మారే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తాము ఉల్కా శకలాల్లో గుర్తించిన ఐసోటోపిక్ సిగ్నేచర్ ప్రకారం అంగారకుడి ఉపరితలం కింద భారీ స్థాయిలో నీళ్లు మంచు రూపంలో ఉండే అవకాశముందని తొమహిరొ వెల్లడించారు. -
సైడింగ్ స్ప్రింగ్పై నాసా కన్ను!
వాషింగ్టన్: అంగారకుడిపై పరిశోధనలు చేస్తున్న ఉపగ్రహాలకు మరో పనిపడింది. అరుణ గ్రహానికి సమీపం నుంచి దూసుకెళ్లనున్న ‘సైడింగ్ స్ప్రింగ్ (సీ/2013 ఏ1)’ తోకచుక్కను అవి పరిశీలించనున్నాయి. మన జీవితకాలంలో ఒక్కసారే వచ్చే ఈ తోకచుక్క.. ఈ నెల 19న అంగారకుడికి కేవలం 1,39,500 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించనుంది. ఇది భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరంలో దాదాపు సగం మాత్రమే కావడం గమనార్హం. ఇంత సమీపంలోంచి వెళుతున్నందున.. అంగారకుడి వాతావరణంపై ‘సైడింగ్ స్ప్రింగ్’ చూపే ప్రభావంతో పాటు ఆ తోకచుక్క పరిస్థితిని, నిర్మాణాన్ని పరిశీలించేందుకు అవకాశం కలుగనుంది. -
అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశం
-
అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశించిందిలా...
బెంగళూరు: తొలి ప్రయత్నంలో అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించింది. అంగారక గ్రహం ఉపరితలానికి 515 కిలో మీటర్ల దూరం, భూమికి 215 కిలోమీటర్ల దూరంలో మామ్ ను విజయవంతంగా ప్రవేశపెట్టడంలో భారత శాస్త్రవేత్తలు విజయం సాధించారు. మంగళవారం ఉదయం 4.17 నిమిషాలకు అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశించడం జరిగింది. దాంతో రెడియో సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి ఓ ప్రత్యేకమైన యాంటెనాను ఏర్పాటు చేశారు. అంగారక గ్రహం వైపు 6.57 నిమిషాలకు మామ్ దూసుకెళ్లడం ప్రారంభించింది. ఆ తర్వాత అంగారక కక్ష్యలోకి వెళ్లడానికి 7.17 నిమిషాలకు ప్రధాన ఇంజన్ పనిచేయడం ప్రారంభించింది. ఈ కీలక ఘట్టంలో 7.12 నిమిషాలకు అంగారక గ్రహంలో గ్రహణం ఏర్పడింది. 7.30 నిమిషాలకు ప్రధాన ఇంజన్ లోని 440 న్యూటన్ లిక్విడ్ అపోజి మోటర్ నిప్పులు గక్కుతూ పనిచేయడం ప్రారంభించింది. ఆతర్వాత 24 నిమిషాలకు అంటే 7.54 గంటలకు అంగారక గ్రహంలోకి మామ్ విజయవంతంగా ప్రవేశించింది. మామ్ ప్రయోగం విజయవంతమమైనట్టు యూఎస్, యూరప్, భారత్, ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసిన ఎర్త్ స్టేషన్లలోని రాడార్స్ కు సిగ్నల్ అందాయి. -
మామ్ ప్రయోగం ఒక చరిత్రాత్మక ఘట్టం
-
మామ్ ప్రయోగం ఒక చారిత్రాత్మక ఘట్టం: మోడీ
బెంగళూరు: అసాధ్యమనుకున్న ప్రయోగాన్ని సుసాధ్యం చేసి చూపించారని భారత ప్రధాని నరేంద్రమోడీ శాస్త్రజ్క్షులపై ప్రశంసల వర్షం కురిపించారు. అంగారక గ్రహంలోకి మామ్ విజయవంతంగా ప్రవేశించిన తర్వాత ప్రసంగిస్తూ 'ప్రపంచ సాంకేతిక రంగంలో భారత్ చరిత్ర సృష్టించింది' మోడీ అన్నారు. ఇతరులు అసాధ్యమని, ఊహించడానికి కూడా ధైర్యం చేయలేకపోయిన కార్యాన్ని మనం సుసాధ్యం చేసి చూపించామని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు. మామ్ ఎప్పుడూ నిరాశపరచదనే గట్టి నమ్మకం అని అన్నారు. ఇస్రోను చూసి దేశ ప్రజలు గర్విస్తున్నారని ప్రధాని అన్నారు. మొదటి ప్రయత్నంలోనే విజయం భారత శాస్త్రవేత్తలకే దక్కడం గర్వంగా ఉందన్నారు. ఈ ప్రయోగం ఒక చారిత్రత్మక ఘటం అని ఉద్వేగభరిత ప్రసంగంలో మోడీ వెల్లడించారు. -
రేపే.. మార్స్ చెంతకు మామ్!
-
రేపే.. మార్స్ చెంతకు మామ్!
ఉదయం 7:17 గంటలకు అంగారకయాత్రలో తుది ఘట్టం ఉపగ్రహంలోని ప్రధాన ఇంజన్ పరీక్ష విజయవంతం మార్స్ ప్రభావ క్షేత్రంలోకి మామ్ బెంగళూరు: భారత అంగారక యాత్రలో తుది ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మరో 24 గంటల్లోపే అంతరిక్ష రంగంలో భారత్కు చరిత్రాత్మక విజయం సొంతం కానుంది. సరిగ్గా రేపు(బుధవారం) ఉదయం 7:17:32 గంటలకు మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్; మంగళ్యాన్) ఉపగ్రహం అరుణగ్రహం చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించేందుకు సర్వం సిద్ధమైంది. పదినెలలుగా నిద్రాణస్థితిలో ఉన్న ఉపగ్రహంలోని ప్రధాన ద్రవ అపోజీ మోటారు(లామ్) ఇంజన్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సోమవారం తిరిగి మండించి విజయవంతంగా పరీక్షించింది. దీంతో అంగారక యాత్ర విజయంపై ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. మామ్లోని 440 న్యూటన్ లామ్ ఇంజన్ను సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు 4 సెకన్ల పాటు విజయవంతంగా మండించినట్లు ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ వెల్లడించారు. ఈ పరీక్షలో ఉపగ్రహ వేగాన్ని సెకనుకు 2.18 మీటర్ల చొప్పున తగ్గించామన్నారు. అంగారకుడి కక్ష్య దిశగా వెళ్లేలా ఉపగ్రహ మార్గాన్ని కూడా సవరించినట్లు తెలిపారు. అంగారకుడి చుట్టూ 5.4 లక్షల కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న గురుత్వాకర్షణ ప్రభావ క్షేత్రంలోకి మామ్ సోమవారం ప్రవేశించిందని, ప్రస్తుతం ఉపగ్రహం పూర్తి ఆరోగ్యంగా ఉందన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. 24న ఉదయం అంగారకుడి చుట్టూ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు అంతా సిద్ధమైందన్నారు. కాగా, లామ్ ఇంజన్ను చివరిసారిగా గతేడాది డిసెంబరు 1న మండించారు. తర్వాత 300 రోజుల పాటు రోదసిలో నిద్రాణస్థితిలోనే ఉండటంతో దీనిని తిరిగి పనిచేయించడం అనేది అత్యంత కీలకంగా మారింది. ప్రధాన లామ్ ఇంజన్ను బుధవారం ఉదయం 24 నిమిషాల పాటు మండించడం ద్వారానే ఉపగ్రహ వేగాన్ని సెకనుకు 22.1 కి.మీ. నుంచి సెకనుకు 4.4 కి.మీ.లకు తగ్గించి అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. అందుకే ఇది తిరిగి పనిచేయడం అత్యవసరంగా మారింది. ప్రత్యామ్నాయంగా.. ప్లాన్ బీ! ఒకవేళ అంగారకుడిని సమీపించే సమయంలో ప్రధాన లామ్ ఇంజన్ పనిచేయకపోతే..? అలాంటి పరిస్థితి ఎదురైతే గనక ప్రత్యామ్నాయంగా ప్లాన్ బీని కూడా ఇస్రో సిద్ధం చేసుకుంది. లామ్ ఇంజన్ పనిచేయకపోతే.. ఉపగ్రహంలో ఉన్న ఎనిమిది థ్రస్టర్లను ఎక్కువ సేపు మండించి అయినా మామ్ను అరుణుడి కక్ష్యలోకి చేర్చేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. అయితే అంగారకుడి కక్ష్యను చేరే సమయంలో మామ్ భూమికి 66.6 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పైగా.. మార్స్కు ఆవలివైపు వెళుతుంది. ఫలితంగా 20 నిమిషాల పాటు దానికి భూమితో సంబంధాలు తెగిపోతాయి. మామూలుగా అయినా.. భూమి నుంచి మామ్కు ఆదేశాలు అందేందుకు 12 నిమిషాలు పడుతుంది. అందుకే.. మార్స్ను సమీపించగానే లామ్ ఇంజన్ మండటం మొదలయ్యేలా, అది పనిచేయని పక్షంలో థ్రస్టర్లు మండేలా శాస్త్రవేత్తలు ముందుగానే ఆదేశాలు ఇస్తున్నారు. మొత్తం మీద ప్లాన్ ఏ ప్రకారం వీలు కాకపోతే ప్లాన్ బీ ప్రకారం అయినా.. ఉపగ్రహం అంగారకుడి చుట్టూ దగ్గరగా 423 కి.మీ.(పెరిజీ), దూరంగా 80 వేల కి.మీ.(అపోజీ) ఉండే దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి చేర్చనున్నారు. మామ్ ప్రవేశాన్ని వీక్షించేందుకు మోదీ.. అరుణగ్రహం కక్ష్యలోకి మామ్ ప్రవేశించే కీలక ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం బెంగళూరులోని ఇస్రో ఉపగ్రహ నియంత్రణ కేంద్రం ‘ఇస్ట్రాక్’కు రానున్నారని సంస్థ వర్గాలు వెల్లడించాయి. మార్స్ను చేరిన మావెన్.. అమెరికాకు 18వ విజయం! మార్స్ వాతావరణం పైపొరలో నీరు, సీవోటూ ఎలా నాశనమయ్యాయన్న కోణంలో పరిశోధనలకు అమెరికా ప్రయోగించిన ‘మార్స్ అట్మాస్పియర్ అండ్ వోలెటైల్ ఎవాల్యుయేషన్(మావెన్)’ ఉపగ్రహం సోమవారం ఉదయం అంగారకుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. ఇప్పటిదాకా అంగారకుడిపైకి నాసా 24 ఉపగ్రహాలను, రోవర్లను ప్రయోగించగా.. 7 విఫలమయ్యాయి. మావెన్ ప్రయోగంతో నాసాకు ఇది 18వ అంగారక విజయం. -
అంగారకుడి దిశగా మార్స్ అర్బిటర్: ఇస్రో
బెంగళూరు: అంతరిక్ష ప్రయోగంలో కీలక ఘట్టానికి ఇస్రో తెర తీయడానికి సిద్దమవుతోంది. అంతరిక్షంలో ప్రవేశపెట్టిన మార్స్ ఆర్బిటర్ అంగారకుడి దిశగా ప్రయాణిస్తోందని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. మార్స్ ఆర్బిటర్ 98శాతం యాత్ర పూర్తి చేసుకుందని, 300 రోజుల పాటు ప్రయాణం సాగించిందని, ఈ ప్రయోగంలో లిక్విడ్ ఇంజన్10నెలల తర్వాత పనిచేయనున్నదని ఇస్రో వెల్లడించింది. అంగారక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించేందుకు ఇస్రో కమాండ్స్ ఇవ్వనుందన్నారు. సెప్టెంబర్ 24 ఉదయం 7.30 ని.లకు మార్స్ఆర్బిటర్ అంగారక కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. భూమికి 22.4 కోట్ల కిలోమీటర్ల దూరంలో మార్స్ ఆర్బిటర్ ఉందని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. ఆర్బిటర్లోని అన్ని పరికరాలు సజావుగా పనిచేస్తున్నాయని, బెంగళూరు, అమెరికాలోని గోల్డ్స్టోన్, స్పెయిన్లోని మాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా నుంచి ఆర్బినేటర్కు సంకేతాలు అందయాని ఇస్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. -
రోవర్లలో మేటి... ఆపర్చునిటీ!
అరుణగ్రహంపై పదేళ్లుగా అలుపెరగకుండా తిరుగుతున్న నాసా ఆపర్చునిటీ శోధక నౌక(రోవర్) అరుదైన రికార్డు సృష్టించింది. 2004లో అంగారకుడిపై వాలిన ఈ శోధక నౌక ఆదివారం 40 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించిందట. దీంతో భూమి కాకుండా ఇతర గ్రహాలపై అత్యధిక దూరం ప్రయాణించిన రోవర్గా ఇది చరిత్రకెక్కింది. అయితే మూడు నెలల కాలంలో ఒక కిలోమీటరు దూరం మాత్రమే తిరిగి భూమికి సమాచారాన్ని పంపేందుకే దీనిని తయారు చేశారు. కానీ.. పదేళ్లు పూర్తయినా ఇంకా ఇది చకచకా పరుగులు పెడుతోంది. మార్స్పై ఈగల్ క్రేటర్ ప్రాంతంలో దిగి ఇప్పటిదాకా 40.25 కిలోమీటర్లు ప్రయాణించిన ఆపర్చునిటీ మరో రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే కీలకమైన ఎండీవర్ క్రేటర్ ప్రాంతానికి చేరుకోనుందట. అంగారకుడిపై మట్టి, శిలల గురించిన సమాచారాన్ని, గతంలో నీటి ప్రవాహపు ఆనవాళ్లను, ఖగోళం, వాతావరణ వివరాలను కూడా ఈ రోవర్ అందించింది. అన్నట్టూ.. ఇతర గ్రహాలపై అత్యధిక దూరం ప్రయాణించిన రికార్డు ఇంతకుముందు సోవియెట్ యూనియన్ పంపిన లూనోఖోడ్-2 రోవర్ మీద ఉంది. లూనోఖోడ్-2 రోవర్ చంద్రుడిపై 1973, జనవరిలో దిగి.. ఐదు నెలల్లోనే 39 కిలోమీటర్లు ప్రయాణించింది. తర్వాత అదే ఏడాది మే నెలలో చివరిసారిగా సమాచారం పంపి.. శాశ్వతంగా మూగబోయింది. -
మార్స్పై 350 కోట్ల ఏళ్ల క్రితం హిమానీనదాలు!
అరుణగ్రహంపై ప్రస్తుతం నాసా క్యూరియాసిటీ రోవర్ తిరుగుతున్న గేల్ క్రేటర్ ప్రాంతంలో ఒకప్పుడు హిమానీనదాలు, సరస్సులు ఉండేవట. గేల్ క్రేటర్ ప్రాంతంలో సుమారు 350 కోట్ల ఏళ్ల క్రితం చాలా చల్లని నీరు నదులుగా ప్రవహించడమే కాకుండా లోతట్టుప్రాంతాల్లో సరస్సులూ ఉండేవట. నీటి ప్రవాహాల కారణంగా భూమిపై అలాస్కా, ఐల్యాండ్ వంటి చోట్ల ఏర్పడిన తరహాలో మైదానాలు కూడా మార్స్పై ఏర్పడ్డాయట. అంగారకుడిపై ఇటీవలే ఒక సంవత్సరం(మనకు 687 రోజులు) పూర్తిచేసుకున్న క్యూరియాసిటీ తీసిన చిత్రాలను, మార్స్ చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాల నుంచి అందిన సమాచారాన్ని అధ్యయనం చేయగా ఈ వివరాలు తెలిశాయని అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. చిత్రంలో ఎడమవైపున మార్స్పై ఒకప్పుడు హిమానీనదాల వల్ల ఏర్పడిన ఉపరితల మార్పులు కాగా.. కుడివైపున ప్రస్తుతం భూమిపై ఐల్యాండ్ ప్రాంతంలోని ఓ గ్లేసియర్ వద్ద జరిగిన ఉపరితల మార్పులు. -
నేడు భూకక్ష్యను వీడనున్న ‘మామ్’
బెంగళూరు: అరుణగ్రహంపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 5న పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత మలిదశ యాత్రను ప్రారంభించనుంది. ఆదివారం తెల్లవారుజామున 12:49 గంటలకు మామ్ను భూమి కక్ష్య నుంచి అరుణగ్రహ మార్గంలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కీలకమైన ట్రాన్స్-మార్స్ ఇంజెక్షన్(టీఎంఐ) ప్రక్రియను చేపట్టనున్నారు. మామ్లోని ద్రవ అపోజీ మోటార్(ఎల్ఏఎం)ను 23 నిమిషాల పాటు మండించి ఉపగ్ర హ వేగాన్ని సెకనుకు 648 మీటర్లకు పెంచనున్నారు. దీనివల్ల భూ ప్రభావ క్షేత్రాన్ని తప్పించుకుని మామ్ అంగారక మార్గంలోకి వెళ్లనుంది. అనంతరం రోదసీలో 10 నెలలపాటు 68 కోట్ల కి.మీ. ప్రయాణించి వచ్చే సెప్టెంబరులో అంగారకుడి సమీపానికి, 24న ఆ గ్రహ కక్ష్యలోకి చేరనుంది.