దేవరాపల్లి : టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసల పరంపర కొనసాగుతుంది. కేంద్రం సహా రాష్ట్రంలో పలు సంస్థలు నిర్వహించిన అన్ని సర్వేల్లో వైఎస్సార్సీపీ మరలా విజయదుందుభి మోగిస్తుందని స్పష్టం చేయడంతో మాడుగుల నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్సీపీలోకి వలసలు మరింత జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దేవరాపల్లి మండలం ఎన్.గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి చెందిన 20 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ మేరకు తారువలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు వారందరికీ పార్టీ కండువాలను వేసి సాదరంగా ఆహ్వానించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తూ, తమ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన బూడి ముత్యాలనాయుడు నాయకత్వంపై ఆకర్షితులమై వైఎస్సార్సీపీలో చేరామని వారంతా స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారిలో కొర్లి త్రినాఽథ్, మంకు రవి, జి. గోవింద, జి.రమణ, పైడితల్లి, కొటాన రాజు, కొటాన కరణం, దువ్వాగ గంగబాబు, ఆర్. రాజేష్ తదితరులు ఉన్నారు. అర్హులందరికీ రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్ను మరోమారు ముఖ్యమంత్రిని చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తామన్నారు. ఎంపీగా ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేగా ఈర్లె అనురాధను గెలిపించేందుకు అహర్నిశలు శ్రమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
20 టీడీపీ కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక
ఆహ్వానించిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు